Thursday, December 13, 2012

కబుర్లు - 100




అవీ, ఇవీ, అన్నీ

ప్ర తె మ ల సందర్భంగా, అన్ని జిల్లాల్లోనూ, మండలాల్లోనూ, "సభలు" చేసి, "దశదిశలా తెలుగు కీర్తి చాటాలి" అని యెలుగెత్తుతున్నారందరూ. 

నిన్న మావూళ్లో సభలో ఒకాయన మీడియా చేస్తున్న కృషిని అందరూ గుర్తించాలనీ, తెలుగు వెలుగు కొని చదవాలనీ, వారు చేస్తున్న కృషి అమోఘమనీ--ఇలా చెప్పారు.

తీరా చూస్తే, ఆ సభకి సంబంధించిన వార్తలో, "శతావధాని తనదైన శైలిలో..........'హాస్యాస్పదంగా' వివరించారు అని వ్రాశారు! 

తెలుగుని వుధ్ధరించకపోతే పోయె--అపభ్రంశాలతో దాన్ని ఖూనీ చెయ్యకుండా వుంటే చాలు మన ఘనతవహించిన మీడియా వాళ్లు.

హమ్మయ్య! కార్తీకం ముగిసింది. క్రితం సంవత్సరం వరకూ 'సహస్ర' తో సరిపెట్టిన భత్తులు, ఈ సారి 'లక్ష' సంఖ్యలో దీపాలు వెలిగించేశారు అనేక చోట్ల. (అయినా, పౌర్ణమి నాడు దీపాలెందుకో--అమావాస్యనాడు గానీ!) 

మళ్లీ యేడు "పది లక్షల" దీపాలూ, ఇక ముందు "కోటి" కి చేరినా ఆశ్చర్యం లేదేమో!

ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి కొద్దిగా తక్కువగా మాత్రమే చేరిందట--అక్టోబరు నెలాఖరికి. ఆహార ద్రవ్యోల్బణం కూడా అలాగే వుందట. ఇంక కార్తీకాంతానికి యెంతకి పెరుగుతుందో? మళ్లీ యేడాదికి మూడంకెలకి కూడా చేరుతుందేమో--దువ్వూరి వారు ఆలస్యం చేస్తే!

"భేష్ దువ్వూరీ!" అన్నాడట ఆర్థిక వేత్త జగదీష్ భగవతి. ఆయన ప్రభుత్వ వొత్తిళ్లకి తలవొగ్గలేదు అనీ, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశారు అనీ, ఇంక వృధ్ధి గురించి కూడా పట్టించుకోవాలనీ అన్నారట. చివర అన్నదాన్నిబట్టి, ప్రభుత్వానికి వత్తాసు పలికినట్టు లేదూ?

ఆర్ బీ ఐ డిప్యూటీ గవర్నరు చక్రబర్తి, బ్యాంకుల్లో మొండి బాకీలు పెరగడానికి "కార్పొరేట్లదే బాధ్యత" అన్నారట. అసలు అన్నేసి వందల కోట్లు ఆ కార్పొరేట్లకి యెవరు యెలా ఇప్పించారో?

గుజరాత్ యెన్నికలు రేపనగా, వీరప్ప మొయిలీ, ఇకనుంచీ యేడాదికి 9 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించాం అని చెప్పి, ఎలక్షన్ కమీషన్ మొట్టగానే, "అబ్బే! నిర్ణయం ఇంకా తీసుకోలేదు" అని తప్పించుకుంటున్నాడు. మరి గుజరాత్ లో అందరూ వెర్రి వోటర్లే అనుకున్నాడేమో!

ఎఫ్ డీ ఐ ల విషయంలో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటుండగా, వాల్ మార్ట్ బాంబు పేల్చింది--మనదేశంలో వాళ్ల ప్రవేశం కోసం కొన్ని వందల కోట్లు లాబీయింగ్ కి (లంచాలకి) ఖర్చు చేశాము అని! ప్రభుత్వంవారు యెట్టకేలకి ఓ విశ్రాంత న్యాయ మూర్తి తో విచారణ చేయించడానికి ఒప్పుకున్నారట. నిజాలు బయటికి వచ్చేనా?   

   

Wednesday, December 12, 2012

కబుర్లు - 99



అవీ, ఇవీ, అన్నీ

అంగదుడి రాజ్యం స్థాపించడానికి మార్గం సుగమం చేస్తున్నారు. 

ఇంక తనేమో, నలుడూ, నీలుడూ, గవయుడూ, గవాక్షుడూ మొదలైన తన తోటి వానరులని దేశం మీదకి తోలాడు--2014 లోగానీ, అంతకు ముందేగానీ యెన్నికలొస్తే, యే నియోజక వర్గంలో యెవరికి టిక్కెట్ ఇస్తే మంచిది? యెవరికి యెక్కువ గెలిచే అవకాశాలున్నాయి? వగైరాలు సర్వే చేసి, తనకి నివేదిక ఇమ్మని.

ఇంక మన రాష్ట్రంలోని వాళ్ల సామంతులు, ఈ సారి నెగ్గాలంటే మాత్రం, "గజన్" మీద కేసులన్నీ యెత్తేసి, ముఖ్యమంత్రి పదవి ఇస్తే వాడి పార్టీని విలీనం చేస్తాడు అనీ, అదొక్కటే బ్రతుకు తెరువు అనీ మొత్తుకుంటున్నారట! మర్కటాలకీ, గోలాంగూలులకీ అయినా సిగ్గూ యెగ్గూ వుంటుందేమోగానీ వీళ్లకి........?!

మొన్న రామోజీరావు ఆయనెవరో "బొక్లీసు" అనే ఆయన్ని తీసుకొచ్చి, "అర్థ క్రాంతి" పేరుతో హడావిడి చేశాడు. తీరా ఆయన ప్రతిపాదనలన్నీ కొత్త సీసాలో పాత సారాయే! పైగా ఒక్కటీ ఆచరణ సాధ్యం కాదు. మరి అందరూ ఆయన్ని ఆకాశానికి యెత్తేశారు. నేనైతే అసలు ఆయన ఆలోచనలతో యేకీభవించను.

ఆయన చెప్పింది--డీ మోనెటైజేషన్--50 రూపాయలపైన ఉన్న నోట్లన్నీ రద్దు చేసేయ్యాలిట. కారణం--పేదవాళ్లకి ఆ నోట్లతో పని లేదట--బలిసినవాళ్లకి తప్ప!

మీరు బజారులో దుకాణాలదగ్గర గమనించండి--యెంతపేదవాడైనా, 500 నోటే మారుస్తున్నాడు. మరి ఇలా పెద్దవిలువ వున్న నోట్లని ఒక్కసారిగా రద్దు చేస్తే, ఆర్థిక వ్యవస్త అల్లకల్లోలమైపోదూ? ఇప్పటి బ్యాంకులు రద్దీని తట్టుకో గలవా?

ఈ విషయంలో, క్రమపధ్ధతిలో నోట్లని యెలా రద్దుచెయ్యాలో నేనిదివరకే వ్రాసిన టపాలు చదవండి.

ఇంక, లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా జరిగేలా చెయ్యాలట! ఇదీ ఆచరణసాధ్యం కాదు. యెందుకంటే, ఇప్పుడు నగదు లావాదేవీలు జరుగుతున్నది ముఖ్యంగా "ఆదాయ పన్ను" నుంచి తప్పించుకోడానికే. 

బీ జే పీ వారు అప్పట్లో ఆదాయ పన్ను పూర్తిగా రద్దు చేస్తామన్నారు. (తరవాత సంకీర్ణం పేరు చెప్పి, దాన్ని పట్టించుకోలేదు). నిజంగా ఆ పన్ను శాఖవారు చిరుద్యోగుల మీద తడాఖా చూపిస్తారుగానీ, తిమింగలాల్ని వదిలేస్తారు. ఆ పన్ను రద్దు చేస్తే, ప్రభుత్వానికి తగ్గే ఆదాయం చాలా స్వల్పం. వుద్యోగులు, చిన్న వ్యాపారులూ వగైరాలు చాలా సంతోషిస్తారు. 

విదేశాల్లో దొంగడబ్బు దాచుకున్నవాళ్లని, దానిమీద కొంత ఆదాయపు పన్ను కట్టేస్తే, మిగిలినది తెల్లధనం అయిపోతుందంటున్నారు సర్కారువారు. ఆ పన్ను రద్దు చేసి, అక్కడి నిధులని జప్తు చెయ్యగలిగితే, దేశం బాగుపడుతుoది.

ఇంక, బ్యాంకు లావాదేవీల మీద బి టీ టీ వసూలు చేస్తే చాలట--మిగిలిన పన్నులని రద్దుచేసి!

ఇప్పటికే, సేవల పన్ను పేర బోళ్లు గుంజుతున్నారు. దానిమీద విద్యా సెస్సూ, ఇంకాదానిమీద వున్నతవిద్యా సెస్సూ లాగించి, అనేక సేవలకి దాన్ని విస్తరించి, అనాయసంగా కోట్లు దండుకుంటున్నారు. ఆ సెస్సులు ఇప్పటివరకూ యెంత వసూలు అయ్యాయో, విద్యావ్యస్థకి యెంత ఖర్చుపెట్టారో--బ్రహ్మదేవుడిక్కూడా తెలీదు. ఇక బీ టీ టీ కూడా విధిస్తే? మరిన్ని వందలకోట్లు. 

నగదు లావాదేవీలని రూ.2,000/- కి పరిమితం చెయ్యాలట! ఓ మధ్యతరగతి కుటుంబానికి నెలవారీ కిరాణా సరుకులు, బియ్యం కొనుక్కుంటే, కనీసం రూ.3,000/- దాటుతోంది. దానికి చెక్కు ఇస్తామంటే యే వ్యాపారస్థుడు ఇస్తాడు? "మీ దగ్గర వున్నప్పుడే ఇవ్వండి" అంటారు గానీ!

సరే! వాళ్లంతా  మేథావులు! మనలాంటి "మేతావులు" కాదు. 

కేంద్రం నవరత్న కంపెనీలని ప్రైవేటుకి అమ్మేసి, డబ్బు చేసుకోవాలని చూస్తూంటే, మార్కెట్లో ఆ వాటాలు కొనడానికి యెవరూ ముందుకు రావడం లేడట. అందుకని, పాపాల భైరవుళ్లాంటి ఎల్ ఐ సీ వాళ్లకి అంటకడుతున్నారట. దానికోసం, ఆ సంస్థ యే కంపెనీలోనైనా, 30 శాతం వరకూ వాటాలు కొనుగోలు చెయ్యడానికి అవకాశం కల్పించారట!

ఆ సంస్థకూడా నాశనం అయిపోతే, విదేశీ బీమా సంస్థలకి పండగే పండగ!

కొందరికి పళ్లు సరిగా లేవు. మరి కొందరికి పాదాలు సరిగ్గా లేవు. ఇంకొందరికి యెత్తు తక్కువ, ఛాతీ కొలతలు సరిపోవు!

యెవరికనుకుంటున్నారు? రెండేళ్ల క్రితం, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా, వైద్య పరీక్షలూ వగైరాలు చేయించి, 162 మందిని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు గా నియమించేశారట. ఇప్పుడెవరో, నిబంధనలకి విరుధ్ధంగా వాళ్లకి వుద్యోగాలిచ్చారని దర్యాప్తు చేయించాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ని కోరారట--ఆ వుద్యోగాలు రానివాళ్లు. ఇంకేముందీ? తాజాగా 162 మందికీ వైద్య పరీక్షలు చేయిస్తే, అందులో 62 మంది పైన చెప్పిన కారణాలవల్ల అనర్హులు అని తేలిందట! ఇప్పుడు వాళ్లని తొలగించడం యెలా? అంటూ మొత్తుకుంటున్నారట సంబంధిత అధికారులు.

అసలు ఆ ఇన్స్పెక్టర్లు, పళ్లతోనూ, పాదాలతోనూ, ఛాతీ తోనూ యేమైనా పని చేస్తారా? యేమిటో యెందుకో ఆ నిబంధనలు! 

యెక్సైజు కానిస్టేబుళ్ల నియామకంకోసం పరుగు పోటీలో, మొన్న 10వ తారీకున ఓ అభ్యర్థి "నాలుగు కిలోమీటర్లని, 20 నిమిషాల్లో" పరుగెత్తడానికి సిధ్ధపడి, రెండు కిలోమీటర్లు పరిగెత్తి, కుప్పకూలి మరణించాడట--కడప లో! 

అసలు అలాంటి పరీక్షలు అవసరమా? ఆ నిబంధన పెట్టినవాడు రౌరవాది నరకాల్లో దేంట్లోకి పోతాడో కదా!

   

Friday, December 7, 2012

కబుర్లు - 98



అవీ, ఇవీ, అన్నీ

ఇంకో "అనుసంధానం"--ప గో జి లో 16 పోలీసు సర్కిళ్లూ, 63 స్టేషన్లూ వున్నాయట. వందలాది ఫిర్యాదుదారులున్నా కేసులు నమోదు అవుతున్నవి చాలా తక్కువట. అందుకని, జిల్లాలోని పోలీసు స్టేషన్ల వివరాలను కంప్యూటర్లో "క్రోడీకరించి", ఆన్ లైన్ కి అనుసంధానం చేసి, దాన్ని "జీ పీ ఆర్ ఎస్" కి అనుసంధానం చేస్తారట. ఇంక 100 కి డయల్ చేస్తే చాలు అక్కడే ఫిర్యాదు నమోదు చేసేస్తారట. 

ఇప్పుడు సాధారణ ఫిర్యాదులు ఓ కంట్రోల్ రూము లోనూ, మరో కంట్రోల్ రూము సీ సీ ఎస్ లోనూ, పట్టణాల్లో సబ్ కంట్రోల్ రూములూ--వేర్వేరు నెంబర్లతో పనిచేస్తూండడంతో బాధితులకి చాలా ఇబ్బంది కలుగుతోందట.

100 కి డయల్ చేస్తే అది నేరుగా ఎస్పీ కార్యాలయంలోని ఒక గదిలో కంట్రోల్ రూముకి వెళ్లి, అక్కడే కేసు నమోదుచేసి, నెంబరు కూడా ఇచ్చేస్తారట. ఆ నెంబరు తీసుకొని, దగ్గరలోని స్టేషనుకి వెళితే, రసీదుతో పాటు ఎఫ్ ఐ ఆర్ కాపీ కూడా ఇచ్చేస్తారట. (దీంతో, "కేసురాయడానికి అవసరమైన స్టేషనరీ అనధికారంగా కొనుగోలు చేసే బాధ" తప్పడం, దళారులపై ఆథారపడకుండా వుండడం జరుగుతాయట.)

ఇంకా అధికారులకి మొత్తం 85 వాహనాలు వున్నాయిగానీ, యేదెక్కడుందో యెవరికీ తెలియదట. ఇప్పుడు వాటికి ప్రత్యేక పరికరాలని అమర్చి, యే వాహనంలో యెవరు యెక్కడున్నారో యెప్పటికప్పుడు తెలుసుకోవచ్చట.

(శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయంటారు కదా.)

ముందు ప్రయోగాత్మకంగా ఒక మండలం లో ప్రవేశపెట్టి, త్వరలో జిల్లా అంతా విస్తరిస్తారట.   ఇంకేం మరి! "అనుసంధానాల" పేరుచెప్పి, అరచేతిలో స్వర్గాలు చూపిస్తున్నారు. కొన్నాళ్లలో మనదేశం పూర్తిగా "ఉటోపియా" గా మారిపోతుందేమో! యేమో--గుర్రమెగరావచ్చు.....అన్నట్టు.

మావూరు (నరసాపురం) లో వీధి విద్యుత్ దీపాలని "అనుసంధానం" చేస్తారట--ఆటోమేషన్ ట్రాకింగ్ పధ్ధతి ద్వారా, ఆన్ లైన్ విధానం లో. మొన్నీమధ్య తెనాలి లో అలా చేశారట. ఈ విధానంతో ఆఫీసులో కూర్చొనే, యెక్కడైనా వీధి దీపాలు వెలిగించడం, ఆర్పడం, వెలగనివాటిని కనిపెట్టి బాగు చేయించడం వగైరాలు చెయ్యచ్చట. మరి అదికాస్తా పడుక్కుంటే యెలాగో వాళ్లు వివరించడం లేదు.

రేపు జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా 51 జిల్లాల్లోనూ, రాష్ట్రంలో 5 జిల్లాల్లోనూ "నగదు బదిలీ" ప్రారంభించేస్తారట.

దీనిలో భాగంగా ప్రస్తుతానికి ఉపకారవేతనాలూ, పించన్లూ మాత్రం బదిలీ చేస్తారట. త్వరలో రేషను సరుకుల దగ్గరనించి యెరువులూ వగైరాలన్నిటికీ నగదు బదిలీ (సబ్సిడీ మొత్తం యెంతైతే అంత) బదిలీ చేసేస్తారట. 

అధికారులేమో ఇంకా అథార్ సంఖ్య జారీనే పూర్తికాలేదు, అందరికీ బ్యాంకు ఖాతాలే లేవు, పైగా ఇప్పటివరకూ అధికారికంగా సమాచారమేలేదు అంటూ వాపోతున్నారట

యేదైతేనేం, ఇది ప్రవేశపెడుతున్నది వోట్లకోసమేకదా? అంటున్నారు ప్రతిపక్షాలు. పీ డీ ఎస్ ని నాశనం చెయ్యడానికీ, ఆ వంకని సబ్సిడీలు తగ్గించి డబ్బులు మిగిల్చుకోడానికే అని కమ్యూనిస్టులంటున్నారు.

అసలు ఈ నగదు బదిలీ యే ప్రాతిపదిక మీద చేస్తారు? ఉదాహరణకి ఒక్కో తెల్లకార్డు మీదా 20 కిలోలు బియ్యం ఇస్తున్నారనుకుందాం. లబ్ధిదారులు చెల్లించవలసినది రూ.20/- మాత్రమే కదా? బియ్యం సరఫరా రేటు కిలోకి రూ.15/- అనుకుందాం. అప్పుడు 'సబ్సిడీ' 20 X 14 = రూ.280/- అవుతుంది. తీరా ఆ సొమ్ముని వాళ్ల ఖాతాలకి బదిలీ చేసేశాక, వాళ్లు అసలు బియ్యమే కొనకపోతే? ఆ 280 వేరే ఖర్చు పెట్టేసుకుంటే?

బ్యాంకులెక్కడో వుంటాయి. పింఛనుదారుడు యెక్కడో వుంటాడు. అందుకని, బ్యాంకునుంచి పింఛనుమొత్తం తీసుకొని లబ్ధిదారుడికి అందించడానికి యెవర్నో నియమిస్తారట! నీ యెడం చెయ్యి తియ్యి, నా పురచెయ్యి పెడతానన్నట్టులేదూ!

అయినా ఇలాంటి సందేహాలు మనలాంటి సామాన్యుల చిన్ని బుర్రలకి వస్తాయిగానీ, ఆ మేధావులకి రాకపోవడం సహజమే కదా!

రాష్ట్ర పోలీసులకి తీవ్రవాదులని యెదుర్కోడానికి వీలుగా, వీపుకి తగిలించుకునే "జెట్ ప్యాక్" లు కొంటారట. ఒక్కోదాని ఖరీదూ రూ.58 లక్షలు మాత్రమేనట. అందుకని ప్రస్తుతానికో నాలుగు మాత్రమే కొంటారట. వాటిని యెవరైనా వీపుకి తగిలించుకొని, ఓ మీట నొక్కితే, దాంతో పాటు గాలిలో యెగిరి పోతారట. 

మరి వాటి "నిర్వహణకి" యెంతవుతుందో? ఆఫీసుల్లో వుండే నిప్పు ఆర్పే యంత్రాలకి, గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదన్నట్టు, అవెప్పుడూ అవసరం రాకపోయినా, నిర్ణీత సమయానికల్లా వాటిలోని ఇంధనాన్ని మారుస్తూ వుంటారు. ఇంకా వాటిని ఉపయోగించడానికి శిక్షణా వగైరాలూ--ఇలాంటివి నిర్వహణ ఖర్చులంటే.     

యెవరైనా తీవ్రవాదులు ఒక ఇంట్లో వుంటే, ఇప్పుడైతే లోపలికి వెళ్లడానికి ప్రయత్నించే పోలీసులని వాళ్లు కాల్చేస్తున్నారట. పోనీ హెలికాప్టరు లో మిద్దెమీద దింపుదామనుకొంటే, చుట్టుప్రక్కల భవనాలవల్ల కుదరడం లేదట. కుదిరినా, వాళ్లనీ దుండగులు కాల్చేస్తున్నారట. 

ఇప్పుడు ఈ జెట్ ప్యాక్ తగిలించుకొని గాల్లో యెగురుకుంటూ వెళితే పాపం వాళ్లని కాల్చరేమో ఆ తీవ్రవాదులు!

ఇలాంటి అవిడియాలు ఇచ్చిన "ఐడియాల్రావు" కి కనీసం ఓ పద్మశ్రీ అయినా పారేస్తారేమో చూడాలి.


   

Sunday, December 2, 2012

కబుర్లు-97


అవీ, ఇవీ, అన్నీ  

ప్ర తె మ ల్లో “మేమూ పాల్గొన్నాం” అని అందరూ భావించేందుకు ఊరూ వాడా మీటింగులూ, వూరేగింపులూ పెట్టడానికి కొన్ని లక్షలో కోట్లో కేటాయించారనుకున్నాం కదా. ఇప్పుడు ఆ సభల నిర్వాహకులు వాళ్లకి వస్తున్న ప్రశ్నలు చూస్తూంటే, “మేం సరిగ్గా చెప్పలేకపోతున్నామా? మా తెలుగు సరిపోవడం లేదా?” వగైరా సందేహాలతో సతమతమౌతున్నారట. “ప్రతినిధులు” మాత్రమే తలా రూ.500/- చెల్లించాలనీ, కానివాళ్లు అఖ్ఖర్లేదు అనీ, (వాళ్లకీ వీళ్లకీ తేడా యేమిటో మాత్రం చెప్పడం లేదు!) ప్రతినిధులకి “మూడు పూటలా” భోజనాలు పెడతాము అనీ, స్థానిక హోటేళ్లలోనూ, తి తి దే వారి వసతి గృహాల్లోనూ వసతి సౌకర్యం—ఇద్దరూ, నలుగురూ, ఆరుగురూ, యెనిమిదిమందీ ఇలా పంచుకొనేలా—కల్పిస్తాము అనీ, వాటికి వేరే రూ.500/- నుంచి రూ.2,000/- వరకూ అద్దె చెల్లిస్తే చాలు అనీ ప్రకటించారు.

మన దువ్వూరివారికి పదవీ గండం పొంచి వున్నట్లనిపిస్తోంది. గౌరవ పిచ్చిదంబరం మాటలని యేమాత్రం చెవిని పెట్టడం లేదు. మొన్న కీలక రేట్లు తగ్గిస్తారని ఆశించారు. ఆ పని చెయ్యకపోవడంతో, “మేమే ఒంటరిగా చర్యలు తీసుకోగలం” అని మేకపోతు గాంభీర్యం ఒలకబోశారు. తరవాత “కొత్త ప్రైవేటు బ్యాంకులకి” లైసెన్సులు ఇవ్వాల్సిందే అన్నారు. ఈయనేమో అదేదో చట్టం చేస్తేగానీ కుదరదు అన్నాడు. మళ్లీ ఈయన ముందు లైసెన్సులు ఇచ్చేస్తే, యేడాదిలోగా తీరిగ్గా చట్టం చేసుకోవచ్చు కదా అన్నాడు. (ఈ లోపల యెన్ని చార్మినార్ బ్యాంకులూ, కృషి బ్యాంకులూ జనాలని ముంచాలో? అలాంటివాళ్లు యెందరు ఆయనమీద వత్తిడి  తెస్తున్నారో?)

అన్నట్టు ఫేస్ బుక్ లో వ్యాఖ్యల విషయమై ఇద్దరు అమ్మాయిలని అరెస్టు చేసిన ఇద్దరు పోలీసు “ఉన్నతాధికారులని” సస్పెండు చేశారట! వాళ్లని కస్టడీకి తరలించాలని ఆదేశించిన “మేజిస్ట్రేట్” మీద కూడా బదిలీ వేటుపడిందట. వాళ్లమీద “తప్పుడు సెక్షన్ల” క్రింద కేసులు పెట్టారని పోలీసులపై శాఖాపరమైన విచారణ కూడా మొదలెట్టారట. మరి ఆ సైనికుల మీద యెవరు చర్యలు తీసుకుంటారో?

రానురానూ వ్యవస్థలో ఒక నిబధ్ధత అనేది లేకుండా పోతోంది. ఇదివరకు న్యాయమూర్తులు వాళ్ల దగ్గర బంధువుల ఇళ్లలో శుభకార్యాలకి కూడా వెళ్లడానికి జంకేవారు. ఇప్పుడలా కాదు. అనేక సంస్థలచేత సన్మానాలూ, గుళ్లలో పూర్ణకుంభ స్వాగతాలూ, శేషవస్త్ర ప్రసాదస్వీకరణలూ వగైరాలతో పేపర్లలో ఫోటోలూ! ఇంక వున్నతాధికారులని చూడ్డానికి వెళ్లినప్పుడు ఒక్క నిమ్మకాయ మాత్రం సమర్పించేవారు. (బహుమతిగా ఫలం ఇచ్చినట్టూ, లంచం ఇచ్చినట్టు వుండకుండానూ). ఇప్పుడు పెద్ద పెద్ద బొకేలతో వెళ్లడం, వాళ్ల పదవీ స్వీకరణలకీ, పుట్టినరోజులకీ, బదిలీలకీ పేపర్లలో శుభాకాంక్షల ప్రకటనలూ! అదేదో పెద్ద తప్పని కాదుగానీ, యెంతో కొంత ప్రభావం వుంటుంది కదా?
   



Wednesday, November 28, 2012

కబుర్లు - 96




అవీ, ఇవీ, అన్నీ

రాష్ట్రంలో కంప్యూటర్ల కొనుగోళ్లు వగైరాలమీద యే హైకోర్టు న్యాయమూర్తో, జేడీ లక్ష్మీ నారాయణో "సువో మోటో" గా విచారణ మొదలు పెడితే బాగుండును. 

అన్నిచోట్లా కంప్యూటర్లే, అన్నిటికీ "అనుసంధానాలే"!

ఎక్సైజు కంపు : రాష్ట్రం లో అన్ని ఎక్సైజు ఠాణాలూ, దుకాణాలూ కంప్యూటరీకరించి, అనుసంధిస్తారట

మొత్తం 346 ఎక్సైజు స్టేషన్లూ, డిపూటీ, సహాయ కమీషనర్ల కార్యాలయాలూ, 32 డిస్టిలరీలూ, 9 బ్రూవరీలూ, 6,596 మద్యం దుకాణాలూ--అన్నింటినీ "ఒకే సాఫ్ట్ వేర్" క్రింద అనుసంధానించి, "వినియోగదారులు" మోసపోకుండా చూస్తారట. 

వీళ్లు "వినియోగదారుల"నుంచే కాకుండా, ఉద్యోగార్థుల నుంచి కూడా ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు. మొన్న కానిస్టేబుళ్ల ఉద్యోగాలకి మొత్తం 2,606 ఉద్యోగాలకీ 4,36,488 మంది దరఖాస్తు చేశారట. దరఖాస్తుల ద్వారానే రూ. 2 కోట్ల "ఆదాయం" వచ్చిందట వాళ్లకి!

"మీ సేవ" : జిల్లాలో 274 కేంద్రాల్లో ఇప్పటివరకూ "అందిస్తున్న" 27 సేవలకి అదనంగా మరో 8 సేవలని కూడా అందించాలని నిర్ణయించారట! పురపాలక సంఘాల్లో ఇచ్చే జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీని కూడా "త్వరలో" నూ, తరవాత గ్రామ పంచాయతీల్లో ఇచ్చే వాటినికూడానూ అనుసంధిస్తారట. 

యేడిచేదాని మొగుడొస్తే నా మొగుడూ వస్తాడు అన్నట్టు, కొన్ని సేవలు వస్తే మిగిలినవి రాకపోతాయా అని యెదురు చూస్తున్నారు జనాలు.

ఇక దేశవ్యాప్తంగా, 9 వేల "గ్రంధాలయాల"ని మూడేళ్లలో "డిజిటల్" పరిజ్ఞానంతో అనుసంధించడానికి వెయ్యికోట్లతో "ప్రక్రియ" చేపట్టడానికి ప్రణాళికని ప్రణాళికా సంఘానికి నివేదించారట. 

మా నరసాపురం అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయ మూర్తి భరతలక్ష్మి, ఓ అద్భుతమైన తీర్పు ఇచ్చారు. 14 యేళ్ల బాలికని మోసగించి, ముంబాయి ప్రాంతానికి తీసుకెళ్లి, వ్యభిచార వృత్తిలో దించడానికి ప్రయత్నించినందుకూ, ఆమెని చిత్ర హింసలకి గురి చేసినందుకూ--ఇద్దరు స్త్రీలకి 17 యేళ్ల చొప్పునా, ఇంకో స్త్రీకి 14 యేళ్లూ జైలు శిక్ష విధించారట! (ఆఁ! పైకోర్టులు లేవా? అంటున్నారేమో వాళ్ళు!)

మా జిల్లా కలెక్టరుగారు, ఆవిడ సంతకం కోసం, ఓ బాధితుడికి అందించవలసిన ఓ రూ.21.24 ల చెక్కుని "క్రాస్" చెయ్యకుండా జారీకి ప్రయత్నించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారట! ఇలా గతంలో యెన్ని చెక్కులు క్రాస్ చెయ్యకుండా ఆవిడ చేత సంతకాలు చేయించారో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఆర్వో ని ఆదేశించారట కూడా! 

హమ్మయ్య! కలెక్టరుగారికైనా "క్రాస్" అంటే యేమిటో తెలుసన్నమాట!





Friday, November 16, 2012

కబుర్లు-95



అవీ, ఇవీ, అన్నీ
 
మొన్న వేలూరు దగ్గర అరియూరు లోని స్వర్ణ దేవాలయంలో భక్తులు 10,008 “నెయ్యి  దీపాలు” వెలిగించి, మొక్కులు తీర్చుకున్నారట. ఆందునిమిత్తం 5 టన్నుల నెయ్యి మాత్రమే వినియోగించారట.

మీసేవ” కేంద్రాల ద్వారా పలు రకాల సర్టిఫికెట్లు జారీ చెయ్యడానికి ఇప్పటికి 12 జిల్లాలను మాత్రం యెంపిక చేశారట. స్థిరాస్తి మీద ఈసీ లలో అమ్మకం, కొనుగోలు వగైరా వివరాలు ఈ యేడాది జూలై వరకే నమోదయ్యాయట. ఆ ఈసీ లుపట్టుకొని బ్యాంకులకి వెళితే, ఈ ఐదారు నెలల్లో యేమి లావాదేవీలు జరిగాయో అనే అనుమానం తో ఋణాలు మంజూరు చెయ్యడం లేదట. పోనీ సంబంధిత సబ్ రిజిస్ట్రారు కార్యాలయం లో తీసుకొందాం అంటే, దానికి ఫీజు మీసేవలోనే కట్టాలట. తీరా చేస్తే, ఈసీలకి బదులు తెల్లకాయితాలు వస్తున్నాయట. లేదా, ఆ సర్వే నెంబరు మొత్తానికి సంబంధించి కొన్ని వందల పేజీల వివరాలు వచ్చేస్తున్నాయట! భలే వెలుగుతున్నాయి కదూ మన కంప్యూటర్లు!

సైన్యానికీ, పోలీసులకీ యెంపిక కోసం కొన్ని కిలోమీటర్ల పరుగు పందాలు నిర్వహించడం, వాటిలో కొంతమంది చనిపోవడం గురించి ఇదివరకోసారి వ్రాశాను. ఒకాయన, “మరి దొంగలని పట్టుకోవాలంటే, ఆమాత్రం పరుగెత్తద్దా వాళ్లు?” అన్నాడు. అక్కడకి మన పోలీసులు అదేదో సినిమాలో తాడి మత్తయ్యలా “చేజ్” అంటూ దొంగల వెనకాల పరిగెత్తేస్తున్నట్టు

మరి రైల్వేలో గ్రూప్ డి యెంపికలకోసం పరుగు పోటీలెందుకో? దానికోసం పురుషులు 4 నిమిషాల 15 సెకన్లలో 1000 మీటర్లూ, స్త్రీలు 3 నిమిషాల 10 సెకెన్లలో 400 మీటర్లూ పరిగెడితేనే యెంపిక చేస్తారట! ఇంక రేపు బ్యాంకులు వగైరా వుద్యోగాలకి కూడా ఇలా పరుగు పోటీలు పెట్టేస్తారేమో!

ఈనాడువారు తెలుగుభాషతో ఇంకా గమ్మత్తులు చేస్తున్నారు. మనుషుల పేర్లూ వగైరాలముందు శ్రీ/శ్రీమతి/శ్రీయుతులు వగైరా గౌరవ వాచకాలు పెట్టడం యెప్పుడో మానేసి, కొన్ని లక్షలు ఖర్చు తగ్గించుకుంటున్నారు. సరే.

మొన్న ఒకాయన వ్రాసిన “మద్భవద్గీతామృత” గ్రంధాన్ని ఆవిష్కరించారట! (నిజంగా ఆ వ్రాసినాయనే శ్రీ పెట్టలేదేమో అనుకున్నాను.) ఆ వార్తలోనే, “……..మత్తిరుమల వెంకట…….ఆచార్యులను….ఘనంగా సన్మానించారు” అని వ్రాశారు! “మత్తిరుమల” అనే ఇంటిపేరు లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. మన జర్నలిస్టులు తెలుగు ని యెంతబాగా వెలిగించేస్తున్నారో!

ఈ మధ్య కొన్ని సభలూ సమావేశాలు నిర్వహిస్తూ, వాటి ముందో తరవాతో “సాంస్కృతిక కార్యక్రమాలు” జరిపించేస్తున్నారు. వాటిలో మొన్నటివరకూ “సారొత్తారొత్తారా….” అనో, “కెవ్వ్ కేక…..” అనో, “మున్నీ బద్ నామ్…..” అనో, ఇప్పుడు “చాయ్…..గరం చాయ్…..” అనో డ్యాన్సులు చేయించేస్తున్నారు. వీటిని "సాంస్కృతిక కార్యక్రమాలు" అనాలంటే………??!!! 

ఇంకొంతమందైతే, చిన్నపిల్లలచేత కూచిపూడి—కుండమీదా, ఇత్తడి పళ్లెం మీదా, నెత్తిమీద చెంబులు ఒకదాని మీదొకటి పెట్టుకొనీ, చేతుల్లో జ్యోతులో, కొవ్వొత్తులో పెట్టుకొనీ—నృత్యాలు చేయిస్తున్నారు. 

నన్నడిగితే, తల్లిదండ్రులూ, టీచర్లూ ఇలాంటి వాటిని ప్రోత్సహించి వాళ్ల టేలంట్ వృధా కాకుండా చూస్తే మంచిది!

యేమంటారు?      

Monday, November 12, 2012

కబుర్లు-94



అవీ, ఇవీ, అన్నీ

మౌలానా అబుల్ కలాం అజాద్ అని ఓ గొప్ప దేశ భక్తుడు వుండేవాడు. స్వతంత్ర పోరాట సేనానీ…..వగైరా. (ఆయన తనను తాను మైనారిటీని అని యెప్పుడూ చెప్పుకోలేదు). 

ఈయనొకడుండేవాడని క్రితం సంవత్సరం ఈ రోజుకి కూడా యెవరికీ జ్ఙాపకం లేదు. హఠాత్తుగా మొన్న గుర్తొచ్చి, ఇప్పుడు ఆయన 124వ జయంతి జరిపించారు. పనిలో పనిగా దాన్నే ‘మైనారిటీ దినోత్సవం’ అనో యేదో అన్నారు.

గత కొన్ని వారాలుగానో, నెలలు గానో భాగ్యనగరంలో హిందూ దేవాలయాలమీద—కనీసం 12 నుంచి 18 మీద—దాడులు జరిగాయట. కొన్నింటిమీద రాళ్లు రువ్వడం, కొన్నింటిని ధ్వంసం చెయ్యడం, కొన్నింట్లో విగ్రహాల ఆభరణాలనీ విలువైన వస్తువులని దొంగిలించడం వగైరా. 

అయినా మతసామరస్యం వెల్లివిరుస్తోంది. కలహాలు రాలేదు.

మరి ఎ ఐ ఎం ఐ ఎం (మజ్లిస్) పార్టీ ప్రభుత్వానికి మద్దతు వుపసం హరించుకోవాలని ఆలోచిస్తోందని తెలియగానే, ఆజాద్ గారు గుర్తొచ్చాడు!

యేమిటో ఈ రాజకీయాలు!

ఆకాశ్ టేబ్లెట్లని రాష్ట్రపతి ఆవిష్కరించారు. (ఇవి జ్వరం వస్తే వేసుకొనే టేబ్లెట్లు కాదు. ప్రభుత్వాల అవినీతి జ్వరాలని పెంచేవి). వీటిని ప్రభుత్వం ఒక్కోటీ రూ.2,263/- లకి ‘డాటావిండ్’ సంస్థ నుంచి కొనుగోలు చేస్తోందట. విద్యార్థులకి ఒక్కోటీ రూ.1,130/- లకే అందిస్తోందట. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాయితీ ఇస్తే, (అంటే మిగతా రూ.1,133/- లనీ అవి భరిస్తే) పూర్తిగా ‘వుచితంగా’ వాటిని అందిస్తారట. 

దేశంలోని “22 కోట్లమంది” విద్యార్థులకి వచ్చే ఐదేళ్లలో అందరికీ ‘అందిస్తారు ’ట. (22 కోట్లూ X 2,263 = ?) 

సోమవారం ఒక్కరోజే 20 వేల టేబ్లెట్లని విద్యార్థులకి అందించనున్నారట. (20,000 X 2,263 = ?)

అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వ్యవహారం నడుస్తూందట. 

కృషి బాగుంది కదూ?

మనలో చాలామంది ఈ మెయిల్ మెస్సేజ్ వ్రాశాక, క్రింద “అత్యవసరం అయితేనే దీని ప్రింట్ తీసుకోండి. దానిద్వారా (కాగితాల అవసరాన్నీ, వాటికి అవసరమయ్యే చెట్లని నరకడాన్నీ, నివారించి) పర్యావరణాన్ని కాపాడడానికి తోడ్పడండి” అని వ్రాస్తూ వుంటారు. అంత చక్కటి అవగాహన వుందని నిరూపించుకుంటున్నందుకు అందరూ సంతోషిస్తున్నారు. 

ప్రభుత్వాలు కూడా, ఓ ముఫ్ఫై నలభై యేళ్ల క్రితమే, వంటచెరకు కోసం కట్టెలు కొట్టడం మానెయ్యమనీ, వాటి బదులు పొగలేని పొయ్యిలూ వగైరా వాడండి అనీ ప్రచారం చేసుకొంటూ, ఇప్పటికి దాదాపు అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, బోళ్లు చెట్లని కాపాడేశారు!

ఇప్పుడు మళ్లీ మొదటి గడిలోకే పంపిస్తున్నారు! 

ప గో జి లోనే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలే మొత్తం 9 వుంటే, వాటిలోని సుమారు 5,400 మంది విద్యార్థినీ విద్యార్థులకి వుదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం వండించాలంటే, ఒక్కో పాఠశాలకీ నెలకి ఓ 70 గ్యాస్ సిలిండర్లు ఖర్చు అవుతాయట. (మొత్తం 9 X 70 = ?).  

వండి వడ్డించేవాళ్లకి ఒకో విద్యార్థికీ రూ.2.55 పైసలు ఇస్తున్నారట. దాంట్లోనే గ్యాస్ ఖర్చులు కూడా భరించాలట. 

ఇప్పుడు రెండు నెలలకి ఒకటే సిలిండరు సబ్సిడీ పై ఇస్తాము అంటే, మిగిలిన వాటిని యెక్కువధరకి కొనలేక, ఇప్పుడు మళ్లీ కట్టెల పొయ్యిలూ, గాడి పొయ్యిలూ మీద వంటలు మొదలు పెట్టేరుట. 

హౌరా! యెంతటి ప్రగతి! యెంతటి పర్యావరణ ప్రేమ!

రేపు దీపావళికి షిరిడీలో 30 సెకన్లలో లక్ష నూనెదీపాలు వెలిగించడానికి సుమారు “2,500 లీటర్ల” నూనెని వినియోగిస్తారట! (ఇదంతా గిన్నిస్ రికార్డుకోసమట).  

మరి దీపావళికి మిగిలిన గుళ్లలోనూ, కార్తీక మాసం పూర్తయ్యేసరికి మొత్తం—యెన్ని వేల లీటర్ల నూనె వినియోగమవుతుందో, యెన్ని “రికార్డులు” బ్రద్దలవుతాయో, నూనెల ధరలు యెంత పెరుగుతాయో

యెంతమందికి యెన్ని (పర్సులు) “బ్రద్దలవుతాయో!” వాటికేమయినా “రికార్డు” వుందో లేదో మరి!

మన పత్రికలవాళ్లు భలే గమ్మత్తులు చేస్తూంటారొకోసారి. మొన్న మా జిల్లా ఈనాడు పేపర్లో రెండువార్తలకి సమాన ప్రాముఖ్యం ఇస్తూ, ప్రక్క ప్రక్కనే దాదాపు ఒకే సైజు శీర్షికలతో ఇలా వ్రాశారు—“పరామర్శలతో ఒరిగేదేమీ లేదు” అనీ; “మూర్తి రాజుకు ఎస్పీ పరామర్శ”—అనీ. 

అదేమిటీ? పాపం స్వాతంత్ర్య సమరయోధుడూ, ప్రముఖ గాంధేయవాదీ, మూర్తిరాజుగారిని పరామర్శిస్తే, యెవరికి కష్టం కలిగిందీ? అనుకుంటూ ఇంకో వార్త చదివితే, ఓ భాజపా నాయకుడు “వరదల వల్ల నష్టపోయిన వాళ్లకి, ప్రభుత్వ పరామర్శలతో ఒరిగేదేమీ లేదు” అన్నారు—అని!

అదీ సంగతి.

అన్నట్టు రాబోయే ప్ర తె మ లో “ఉరుదూ ముషాయిరా” జరిపిస్తారట. ఇంకా ఇతరభాషలవాళ్లనీ పిలిచి వాళ్ల భాషల అభివృధ్ధి గురించి కూడా మాట్లాడతారట.

ఇంకా, గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్, జిల్లా—ఇలా అన్ని స్థాయుల్లోనూ వూరేగింపులూ గట్రా జరపడానికీ, “మేముకూడా ప్ర తె మ ల్లో పాల్గుంటున్నాం!” అనే భావన ప్రజల్లో కలిగేలా కార్యక్రమాలని నిర్వహించడానికి జిల్లాకో 20 లక్షలు మాత్రమే కేటాయిస్తున్నారట! (బలై పోయేది పాపం స్కూళ్ల పిల్లలే కదా?!) 

యెంత చక్కని భాషాభివృధ్ధి కృషో కదా?
    
నిన్న ఆదివారం హైదరాబాద్ జవహర్ బాల భవన్ లో ‘జాతీయ విద్యా దినోత్సవం ’ జరపడానికి మంత్రిగారొస్తున్నారంటే, స్కూలు పిల్లలెవరూ రాలేదట! అప్పటికప్పుడు అధికారులు స్కూళ్లకి ఫోన్లు చేసి, విద్యార్థులని వున్నవాళ్లని వున్నట్టు అక్కడికి తరలించమని ఆర్డర్లు వేశారట. 

తీరా అక్కడికి వచ్చిన పిల్లల్లో ఓ రెండువందలమందిని యూనిఫారాలో, పాదరక్షలో లేవని గెంటేశారట

(అప్పటికే హాలు నిండిపోయినందున కొంతమందిని గెంటెయ్యడం నిజమే గానీ, యూనిఫారాల గురించి కాదు అన్నారట అధికారులు!) 

యే రాయైతేనేం? వూడింది విద్యార్థుల పళ్లే కదా? 

పోనిద్దురూ!   
 

Sunday, November 4, 2012

కబుర్లు-93




అవీ, ఇవీ, అన్నీ 



తెలుగు వెలుగు స్థాపించి, ఈనాడు చేస్తున్న తెలుగుభాషాభివృధ్ధి అభినందనీయం. 

కానీ, ఈనాడు పేపర్లో భాషాదోషాలు చూస్తే పంటి క్రింద రాయిలా బాధపడతాం. ఒక టైమ్స్ లోనో, హిందూలోనో యెక్కడోగానీ అప్పుతచ్చులు కనబడవు. మరి ఈనాడు జర్నలిజం స్కూల్లో భాషా దోషాల గురించి చెప్పరో యేమిటో.

చెప్పగా చెప్పగా, పదో వివాహాలూ, ముఫ్ఫై రెండో వివాహాలూ మానేసి, ఇప్పుడు చక్కగా ‘వివాహ 10వ…’ ఇలా వ్రాస్తూ, నమూనా ప్రకటన కూడా సవరించారు. సంతోషం.

మొన్న అదేదో స్కూల్లో పిల్లలని “సమైఖ్యాంధ్ర” అనే అక్షరాల ఆకారంలో నిలబెట్టి పేపర్లో ఫొటొ వేయించుకున్నారు. క్రింద వార్తలో కూడా అలాగే వ్రాశారు పేపరు వాళ్లు.  “సమైక్య” అనాలని ఆ స్కూలువాళ్లకీ తెలీదు, పేపరు వాళ్లకీ తెలీదనుకోవాలేమో. 

అలాగే, “అహర్నిసలు” (అహర్నిశలు); “అగ్రికీల” (అగ్ని కీల); “వర్ధాలు” (వ్యర్ధాలు) లాంటి మాటలతో వార్తలు రాస్తున్నారు. పైగా ఆ ప్రక్కనే “మాతృ భాషని కాపాడుకోవాలి” లాంటి ప్రబోధాలు.

ఇంక, గుళ్లలో వేదపండితులు లాంటి మాటలకితోడు, “అభిషేక పండితులు” లాంటి మాటలు పుట్టించారు. రేపు “అష్టోత్తర పండితులు”, “సహస్రనామ పండితులు”, “అర్చన పండితులు” కూడా పుట్టుకొస్తారేమో!

“టు మార్కెట్, టు మార్కెట్, టు బై ఎ ఫాట్ పిగ్” లాంటి రైమ్స్ కన్నా, “చేత వెన్నముద్ద” లాంటివి పిల్లలకి నేర్పించచ్చుకదా అని అమోఘమైన సలహా ఇచ్చాడొకాయన. 

నిజమేకదా. నన్నడిగితే, “పంచతంత్రం” చదివితేనే అసలు తెలుగంటే యేమిటో తెలుస్తుంది అంటాను నేను. 

“భలేవారే మీరు—బ్రహ్మ గురించి చెప్పాలంటే ‘నీళ్లలోంచి పుట్టిందాన్ని కుర్చీపీటగా కలవాడు ‘ (జలజాతాసనుడు) అని తెలుగులో అనాలంటారా మీరు?” అంటూ నవ్వుతాడు మా “పురాణపండితుడు” ఐన స్నేహితుడు!

ఈ మధ్య ఎందుకో “హేట్ ట్రిక్” మీద చర్చ వచ్చింది. యేదైనా ఓ కష్టమైన పనిని వరసగా మూడుసార్లు చెయ్యడం అనే అర్థంలో వాడుతూంటారు. 

ఈ మాట యెలా పుట్టింది అంటే, ఇంగ్లీషువాళ్లు తమ హేట్ ని గాల్లో యెగరేసి, అది మళ్లీ సరిగ్గా తమ తలమీద పడేలాగ చెయ్యడాన్ని ఓ ఆటగా చేసేవారు. మామూలుగా థీరీ ఆఫ్ ప్రాబబులిటీ ప్రకారం అలా మూడుసార్లు యెగరేస్తే ఓ రెండుసార్లు మాత్రమే సరిగ్గా పడడం గానీ, పడకపోవడం గానీ జరగాలి. 

అలా వరుసగా మూడుసార్లూ చెయ్యగలిగితే గొప్పే కదా? అదే హేట్ ట్రిక్! 
    

Saturday, October 27, 2012

కబుర్లు - 92



అవీ, ఇవీ, అన్నీ

"రావణాసురుడు ప్రజలకు న్యాయబధ్ధమైన పాలన అందించాడు. దోపిడీదారు కానే కాదు. రావణుడితోపాటు బలి చక్రవర్తి, నరకాసురుడు, శూర్పణఖ, తాటకి ల చరిత్రను తిరగరాసి, పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాల్లో చేర్చాలి" ప్రముఖుడైన ఓ ప్రొఫెసర్ గారు "మూలవాసీ రారాజు రావణ చక్రవర్తి" వర్ధంతి సభలో ఇలా చెప్పి, ఇంకా రాముడికంటే రావణుడు నీతిమంతమైన పాలన అందించాడు అనీ, ఆయన ఇతర రాజ్యాలపై దండయాత్రలు చెయ్యలేదు అనీ, మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు అనీ, రావణున్ని బ్రాహ్మణులూ, క్షత్రియులూ కలిసి హతమార్చారు అనీ కూడా చెప్పారట. ఇతిహాసాల్లో వున్నవన్నీ మక్కికి మక్కీ నిజాలుగా నమ్మేసి, అవన్నీ తిరగరాయాలనే ప్రొఫెసర్లు కూడా వుంటారా? అయినా క్షత్రియులూ, వానరులూ, భల్లూకులూ వగైరాలు రావణుణ్ణి చంపితే, మధ్యలో బ్రాహ్మణులెక్కడనించి వచ్చారో!

విశ్వనాథవారిని "భూస్వామ్య వ్యవస్థ అంతరిస్తున్నందుకు" బాధపడ్డారనీ, ఆ దశదాటి మరింత మెరుగైన దశకు సమాజ పయనం ఆయనకు నచ్చలేదు అనీ, మళ్లీ వెనక్కు వెళ్లాలన్నది ఆయన ఆలోచన అనీ, ఆయన 'మాస్టర్ రియలిస్ట్, బట్ ఎ రియాక్షనరీ ఫిలాసఫర్ ' అనీ, మంచైనా, చెడైనా సమాజం ముందుకే వెళుతుంది అన్న సత్యాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు అనీ, అదీ ఆయన తాత్విక దృక్పథం అనీ--వేయిపడగలు గురించి ప్రస్తావించి విమర్శించారింకో పెద్దాయన ఇంకో పత్రికలో.

నిజానికి విశ్వనాథ బాధపడింది రాచరికం అంతరిస్తోందనికాదు--దాంతోపాటు మన ప్రాచీన నాగరికతకీ, సంస్కృతికీ గ్రహణం పడుతోందనీ, అది అరాచకానికి దారితీస్తోందనీ చక్కగా వివరించడానికి ప్రయత్నించారు ఆ నవల్లో.

మరి ఆరోజుల్లోనే ఆయన మెట్టభూములన్నీ మాగాణాలుగా మారుస్తుంటే, పసిరిక లాంటి వాళ్లకి ఆవాసాలు కరువవుతున్నాయి అనీ, అనేక కీటకాదులు నశిస్తున్నాయనీ వ్రాశాడంటే, అప్పట్లోనే ఆయన, ఇప్పుడు మనం డప్పుకొట్టుకొంటున్న బయో డైవర్సిటీ, ఇకో బేలన్స్ ల గురించి యెంత బాధపడ్డాడో తెలియడంలేదూ?

ఇంకా కల్పవృక్షంలో గ్రాంధికం వ్రాసి వుండొచ్చు--అది అలాగే వ్రాయాలికాబట్టి. వేయిపడగల్లోది శిష్ట వ్యావహారికమంటారనుకొంటా. మాబాబు లాంటి ఇతర రచనల్లో పూర్తిగా వ్యావహారికభాషలోనే వ్రాశాడే?

ఆయన్ని రియాక్షనరీ అనొచ్చా?

"సింగినాదం......జీలకర్ర" గురించి ఇదివరకోసారి వ్రాశాను. మొన్న తెలుగు వెలుగులో సామెతలు కొన్ని యెగుమతి వ్యాపారం నుంచి పుట్టాయని వ్రాస్తూ ఈ ప్రసక్తి తెచ్చారు ఆ రచయిత. 

జీలకర్రతో పడవలు జీలకర్రగూడెం, బుట్టాయగూడెం వగైరా చోట్లనుంచి నింపుకుని, గోదావరిలో ప్రయాణించి, డచ్చివారి యెగుమతి రేవైన మా నరసాపురం వచ్చేవి అనీ, వాటి రాక తెలియడానికి "శృంగనాదం" (కొమ్ము బూరా వూదడం) చేసేవారు అన్నంతవరకూ నిజమే. తరవాత్తరవాత, ఇంకే అటవీ వుత్పత్తితో పడవలు వచ్చినా, శృంగనాదం చెయ్యడం, జనాలు "అవిగో! జీలకర్ర పడవలు వచ్చేశాయి" అంటూండడం, కొందరు పెద్దలు "శృంగనాదానికీ, జీలకర్రకీ సంబంధం యేమిట్రా?" అంటూ నవ్వడంతో, ఈ సామెత పుట్టింది. అందుకే సంబందంలేని విషయాలు చెపుతుంటే, "ఆ! సింగినాదం జీలకర్రాను!" అని చప్పరించేస్తారు. 

అదీ సంగతి.

Friday, October 26, 2012

కబుర్లు - 91



అవీ, ఇవీ, అన్నీ

ఈ మధ్య దేవీ విగ్రహాలకి అలంకారాలకోసం వాడుతున్న కరెన్సీ నోట్ల విలువ ఒక్కోచోటా కోట్లలోకి చేరింది. అదేదో కరెన్సీ కోడ్ అనేది ఒకటి యెక్కడో మూలుగుతున్నట్టుంది. యెవరూ పట్టించుకోవట్లేదనుకుంటా. 

ఇదివరకోసారి వ్రాసినట్టు, ఆ సొమ్ము యెక్కడనించి వస్తోందో ఆరా తీస్తే బోళ్లు బ్లాక్ మనీ దొరికే ఛాన్సుంది ఐ టీ వాళ్లకి. 

ముందు ప్ర తె మ తేదీలు ప్రకటించేసి, ఇప్పుడు మండలి బుధ్ధ ప్రసాద్ ని అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా నియమించేశారు. పాపం ఈయన లాబీయింగ్ కొంచెం లేటుగా ఫలించినట్టుంది. ముందు ప్ర తె మ ప్రకటన వెలువడకపోతే, ఈ నియామకానికి కూడా అర్జెంటేమిటని అధినేత్రి ప్రక్కన పడేసేది. 

అన్నట్టు వీళ్ల నాన్న వెంకట కృష్ణా రావు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకుల్లో ప్రముఖుడు!

ఈనాడువాడేమో "తెలుగు వెలుగు"అనే మాసపత్రిక పెట్టి మరీ తెలుగు భాషాభివృధ్ధి విషయంలో స్వకుచమర్దనం చేసుకుంటున్నాడు. దానికి మూడు ప్రాంతాల తెలుగు పండితమ్మన్యులూ సహకరిస్తున్నారు. బాగుంది.

ఓ పెద్దాయన ఈనాడువాడు తెలుగుని ఖూనీ చేస్తున్నాడు అనీ, "శీతల బస్సులు" అంటున్నాడు అనీ, "వాతానుకూల" అనొచ్చుకదా అనీ అన్నారు. "వాయు నియంత్రిత బస్సులు" అనొచ్చుకదా--వాతానుకూల అంటే హిందీ మాట అన్నారొకరు. అది మక్కికి మక్కీ అనువాదం అంటాడింకొకడు. శుభ్భరంగా చల్లటి బస్సు అనో, ఫ్రిజ్ ని చద్ది పెట్టి అన్నట్టు, చద్ది బస్సు అనో అనొచ్చుకదా అంటాడొక చల్దివణ్ణాల ప్రియుడు.

ఒకాయన "మెదడు" వాడకపోతే తుప్పు పడుతుంది, వాడినకొద్దీ "రాటుదేలిపోతుంది" అన్నాడు. రాటుదేలడం అంటే మొద్దుబారడం, ఇంకో దెబ్బ తగిలినా తెలియని స్థితికి రావడం అనుకుంటా. "పదునెక్కుతుంది" అనాలనుకుంటా. 

అన్నట్టు, మన పాత జానపద సాహిత్యం వగైరాలని కాపాడుకోవాలంటున్నారందరూ. ఇదివరకు ఆడవాళ్ల పాటలు ప్రతీ సందర్భానికి తగ్గట్టు--సమర్తపాటలూ, సీమంతం పాటలూ, మంగళహారతి పాటలూ--ఇలా చాలా వుండేవి. మన బ్లాగర్లు వండిందే వండరా అన్నట్టు వంటల గురించే కాకుండా, ఇలాంటి పాటలని కూడా సేకరించి ప్రచురిస్తే బాగుంటుంది. టీవీల్లో "స్త్రీల షోలు" వాళ్లుకూడా విజృంభిస్తారు!

థాయ్ లేండులో కాఫీ కి మంచి రుచి వచ్చే మార్గం కనిపెట్టారట. యేనుగుకి అది తినే పదార్థాలలో కాఫీ గింజలు కలిపి పెట్టేస్తే, అది వేసే పేడలో మళ్లీ ఆ గింజలు యథాతథంగా వచ్చేస్తాయట. కానీ వాటిల్లో సహజంగా చేదుని కలిగించె ప్రొటీన్ బాగా తగ్గిపోతుందట. అప్పుడు ఆ గింజలని పొడిచేసి, కాఫీ చేసుకొంటే భలే రుచిగా వుంటుందట! ఆ కాఫీ గింజల ధర కిలో 58 వేల రూపాయలట! మనం కూడా ఓ యేనుగునీ, ఓ పాతిక బస్తాల కాఫీ గింజలనీ కొనేసుకొంటే, కాఫీపొడి అమ్ముకొని కోటీశ్వరులం అయిపోవచ్చేమో!

    

Wednesday, May 16, 2012

కబుర్లు - 90



అవీ, ఇవీ, అన్నీ

విజయవాడలో కనకదుర్గమ్మ కొండమీద నీళ్ల టాంకులో శవం--నాలుగురోజులకిపైగా కుళ్లి, కొండమీద సరఫరా అవుతున్న నీళ్లన్నీ కంపుకొడుతున్నాయని భక్తులు వాపోతున్నా యెవరూ పట్టించుకోక, ఆఖరికి సరఫరా ఆగిపోతే, చచ్చినట్టు టాంకు తెరిస్తే-- బయటపడిందట

ఆ టాంకు కడిగి యెన్ని సంవత్సరాలయిందో, దాని మెయింటెనెన్స్ యెంతబాగుందో వగైరా ప్రశ్నలు అడగాలా? బాధ్యులెవరో తేల్చండి అని డిమాండు చెయ్యాలా? యెవరు చేస్తారు?

యేమో!

ఇన్నాళ్లకి యెవరి మెదడులోనో ట్యూబులైటు వెలిగింది. డిపోల్లోంచి మద్యం విడుదల చేసే సమయంలో సరైన చిరునామా లేని యజమానుల దుకాణాలకి సరఫరా రద్దు చేస్తున్నారట! ఈ దెబ్బతోనయినా మద్యనాయకుల బలుపు తగ్గుతుందేమో చూద్దాం.

మన చదువులూ, పాఠ్య పుస్తకాలూ యేమీ అభివృధ్ధి చెందలేదు అని విలపించేవాళ్లకో షాక్ లాగ, ఆ పుస్తకాల్లో కొన్ని "కార్టూన్"లు ప్రచురించబడ్డాయట! మరి అదేమి చదువో? అందులో అంబేడ్కర్ లాంటివాళ్లని కించపరిచారని గొడవచేస్తే, క'పిల్సి'బల్ క్షమాపణ చెప్పి, ఇంక అలా జరక్కుండా చూస్తాం అన్నాడట! (వీళ్లమీద పత్రికల్లో కార్టూన్లు వస్తెనే విరుచుకు పడతారు--మరి పిల్లలకి వాటితో యేం పాఠాలు చెప్పదలుచుకున్నారో, బాధ్యులని తొలగించాం అంటే సరిపోతుందా?)

ఏప్రిల్ నెలాఖరుకి మళ్లీ ఆహార ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరిందట. కూరగాయల ధరలు 61% పెరిగాయట! సందట్లో సడేమియా అంటూ "హనుమజ్జయంతి" వచ్చింది. ఈ సోకాల్డ్ భత్తులూ, పూజారులూ చేసే అలంకరణలకీ, ప్రసాదాలకీ పెట్టిన ఖర్చు చూస్తే, ఈపాటికి యే 72 శాతానికో పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు.

ఓ ప్రక్క వృధ్ధిరేటు అంటూ కీలకరేట్లు తగ్గించి, ద్రవ్యోల్బణానికి దారిచూపింది ఆర్ బీ ఐ. వృధ్ధి రేటు పెరగడం అంటే--గృహ, వాహన, విద్యా ఋణ రేట్లు తగ్గడమేనా? మరి పారిశ్రామిక వృధ్ధి రేటు 'నెగెటివ్' కి మారిందే? యేమో మరి!

అన్నట్టు, మన ఎన్ డీ తివారీగారిని "మర్యాదగా రక్తం ఇస్తారా? బలవంతంగా తీసుకోమంటారా?" అని అడగవలసొచ్చిందట కోర్టువారు! ఆయనకి కోర్టులమీదా, పార్టీవారికి వారిమీదా యెంత గౌరవమో కదా?

ఏప్రిల్ ఒకటినుంచి పెరిగిన జీతాల ప్రకారం ముఖ్యమంత్రికి రూ.2.44 లక్షలు, ఉప ముఖ్యమంత్రికీ, మిగతా మంత్రులకూ రూ.2.42 లక్షలూ జీతాలు వస్తాయట "నెలకి". అలాగే స్పీకర్, డెప్యుటీ స్పీకర్, మండలి చైర్మన్, విప్ వగైరాలకి కూడా బాగా పెరిగాయట

2000 సంవత్సరం నుంచీ పాపం రూ.41,500/- "నెలకి" తో సరిపెట్టుకొంటున్నాడట ముఖ్యమంత్రి. మరి పన్నెండేళ్ల తరవాత అది కనీసం 6 రెట్లైనా పెరగొద్దూ? 

మరి సామాన్య వుద్యోగుల జీతాలు 6 రెట్లూ పెరిగాయా? యెవరైనా అడిగితే, నా దిష్టిబొమ్మ దహనం చేసి, నన్నే జీతాలు పెంచమని అడుగుతారా? అంటూ విరుచుకు పడతారు!

పులినిచూసి నక్క వాతలు పెట్టుకుందట. పార్లమెంటులో ఆంటొనీ కళ్లనీళ్లు పెట్టుకొంటే, నిలువెత్తు నిజాయితీ కన్నీరుపెట్టుకొంది అని మీడియావాళ్లు చేసిన ప్రచారం చూసి (పాపం వాళ్లకి జార్జ్ ఫెర్నాండెజ్ గుర్తు రాలేదు ఆ సమయం లో), "నా గుండెల్లో పిడిబాకు దించండి--అంతేగానీ నా నిజాయితీని శంకించొద్దో" అని మొసలి కన్నీళ్లు పెట్టాడట మన పిచ్చి'దంబరం'! ఇదేదో బాగుంది కదూ? ఇక నుంచీ మంత్రులందరూ గ్లిసరిన్ బాటిళ్లు పట్టుకెళతారేమో పార్లమెంటుకి!

నాకు తెలిసీ, గత యాభై యేళ్లుగా, పాతసీసాలో కొత్త సారాలా, "అగ్రికల్చర్ క్రెడిట్ కార్డులు"; "కిసాన్ కార్డులు" ఇలా యెన్ని పేర్లు మార్చినా బ్యాంకులు ఇస్తున్నవి మాత్రం అప్పటి "క్రాప్ లోన్" అనబడే పంట ఋణాలే. ఖరీఫ్ కి ఇంత, రబీ కి ఇంత అంటూ ఒక్కో పంటకీ యెకరానికి అయ్యే ఖర్చు అంచనావేసి, అంతే ఇస్తారు.

ఇప్పుడు ఇంకో వెర్రితల వేసి, ఐదు సంవత్సరాలకి సరిపోయేలా ఒకేసారి ఋణపరిమితిని "మంజూరు" చేసేసి, ప్రతీ యేడూ ఓ 10% పెంచుకుంటూ పోతారట! రైతులందరికీ "ఏ టీ ఎం" కార్డులిచ్చి, వాళ్లకి కావలసినప్పుడు నగదు తీసుకొనేలా సౌకర్యం కల్పిస్తారట. దానికి తగ్గ "సాఫ్ట్ వేర్" తయారవ్వాలట! తలకి రోకలి చుట్టమన్నట్టులేదూ?

Sunday, May 13, 2012

కబుర్లు - 89



అవీ, ఇవీ, అన్నీ

అద్భుతమైన తెల్ల కుందేలుని తన టోపీలోంచి తీశారు "భన్వర్ లాల్" (మన యెన్నికల ప్రథానాధికారి).

వోటుకోసం డబ్బులు "తీసుకున్న"వాళ్లపై కూడా కేసులు పెడతారట.

ప్రతీ వూరులోనూ, వార్డుకి ఓ నలుగురైదుగురిని ఇలా కేసులు పెట్టి బుక్ చేసేస్తే, నియోజకవర్గానికి కొన్ని వేలమంది అవుతారు. 

సేంపుల్ చూసినవాళ్లు ఇంక అభ్యర్థులు ఇంటింటికీ ప్రచారానికి వచ్చినా, వాళ్ల మొహాలమీదే తలుపులు వేసెయ్యరూ మన వోటర్లు? 

నిజంగా అమలు మొదలెట్టండి మరి!

మన తెలుగుని కాపాడండి అని చెవినిల్లుకట్టుకొని పోరుతున్నారు. జరిగేవిమాత్రం మామూలుగానే జరుగుతున్నాయి. యేమైనా అంటే, అదేదో (ఇంగ్లీష్ మీడియం) స్కూల్లో తెలుగులో మాట్లాడినందుకు వుపాధ్యాయుడు దండించేశాడు అంటూ గోల!

మన తెలుగు కి ముప్పు యెక్కడనుంచి? ఇతర భారతీయ భాషలనుంచి కాదు కదా? ఒక్క ఇంగ్లీషు నుంచే కదా? 

మరి, కొంతమంది బయలుదేరారు--"యేదీ, అసలైన తెలుగు మాట్లాడి చూపించండి! ఇతర భాషాపదాలుగానీ, సంస్కృత పదాలు--తత్సమాలూ, తద్భవాలూ లేకుండా!" అని వాదిస్తున్నారు. 

కేంద్రప్రభుత్వం 'సాక్షర భారత్' కార్యక్రమం క్రింద 2011లో ఓ 10 లక్షలమందికి అక్షరాలు నేర్పించి, ప్రాథమిక గణితం కూడా నేర్పించి, తరవాత పరీక్ష పెట్టి, 'ఉత్తీర్ణతా' ధృవపత్రాలు ఇచ్చారట.

ఆ పత్రాలు మాత్రం, అవి పొందినవాళ్లకి యేమాత్రమూరాని ఇంగ్లీషు/హిందీ భాషల్లో వున్నాయట!

మరి యెవరు వుధ్ధరిస్తారో తెలుగుని!

మామూలుగానే ఏపీ పీ ఎస్ సీ వారు మొన్న నిర్వహించిన పరీక్షల్లో కొన్ని "తప్పుడు ప్రశ్నలు" దొర్లడంతో, వాటిని తొలగించి, ఆ ప్రశ్నలకి కేటాయించిన మార్కులు వుచితంగా కలిపేస్తామన్నారట.

యెన్ని సార్లయినా ఈ పరీక్ష పేపర్లు "సెట్" చేసేవాళ్లకి బుధ్ధి రాదెందుకో? తమ పాండిత్య ప్రదర్శనలెందుకు మానరో? 

మద్యం కేసుల్లో ఏసీబీ అధికారులు ఎక్సైజ్ సిబ్బందిని వేధించి బలవంతంగా సమాచారం సేకరిస్తున్నారని, కొండొకచో చేయికూడా చేసుకొంటున్నారు అనీ, ఇలాంటివి నిరోధించాలనీ వాళ్ల 'ఐకాస' వారు కోరారట. 

వీళ్ల ముఖ్య వాదనలు--మద్యం దుకాణాలకి నిర్వహించే పాటల్లో 'తెల్ల రేషన్ కార్డుదారులు' పాల్గొనకూడదు అని నిషేధం యేమీ లేదుట! (అందుకని వాళ్లు యెన్ని కోట్లు ఇచ్చినా తీసేసుకోవచ్చన్నమాట!). వాళ్లు అక్రమాలకి పాల్పడి వుంటే, ప్రభుత్వానికి రూ.7 వేల కోట్లు ఆదాయం వచ్చేది కాదుట. (పాల్పడకుండా వుంటే 15 వేల కోట్లు వచ్చేదేమో!). ఎఫ్ ఐ ఆర్ ప్రకారం 700 మంది జైళ్లకి వెళ్లవలసి వస్తుందట. వేధింపులు ఆపకుండా వుంటే, అందరూ సెలవుపై వెళతారట! (పంపించేస్తే పోలా?)

మొన్న ఓ హెలికాప్టర్ 25 అడుగుల యెత్తునుంచి హఠాత్తుగా కూలిపోయి, జార్ఖండ్ ముఖ్యమంత్రీ, మరి కొందరూ గాయ పడ్డారు. పాపం రాజశేఖర రెడ్డి లా కాకుండా, విమానాశ్రయం లోనే కూలింది కాబట్టి సరిపోయింది. పాపం వాళ్లు అదృష్టవంతులు. మరి మన విమాన భద్రత వారు యేమైనా చేస్తున్నారో లేదో!


Saturday, March 24, 2012

కబుర్లు - 88



అవీ, ఇవీ, అన్నీ

బుధ్ధిలేని పోలీసు డిపార్ట్ మెంట్ లో భాగం చేసేశారనుకుంటా హోం గార్డులని. మొన్న జిల్లాలో మొత్తం వున్న 32 పోస్టులకి, 3500 మంది అభ్యర్థులు, అర్థరాత్రివరకూ క్యూలలో నిలబడి దరఖాస్తు చేసుకున్నారట! వీళ్లకి గురువారం నుంచీ "అర్హత" పరుగులూ, పరీక్షలూ మమూలే! ఇదేమి నియామక ప్రక్రియో? యెవరూ కలగజేసుకోవడం లేదు--పాపం!

రాష్ట్ర హైకోర్టు ప్రథాన న్యాయమూర్తి, సుప్రీం కోర్ట్ న్యాయ మూర్తి (వీళ్లు కోర్టులకి యెప్పుడు వెళుతున్నారో అని ఇదివరకే వ్రాశాను), ఇంకా పరిశ్రమలశాఖ సహాయ మంత్రీ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని తరించారట మొన్న 18 వ తేదీన. మామూలుగానే దర్శనం, తీర్థ ప్రసాదాలు యేర్పాటు చేశారట అధికార్లు. ఈ గవర్నరొకడు--అస్తమానూ పట్టుపంచ కట్టుకొని తయారైపోతున్నాడు. అదేరోజు ఓ గంటపాటు ఆయన ఆలయంలో వుండిపోతే, క్యూ లైన్లు అపేసినందుకు "భక్తులు" అందోళన చేసి, నినాదాలు చేశారట! వీళ్లకి వేరేపనులు లేనట్లు యెందుకో షటిలింగ్ హైదరాబాదు నుంచి! (ఈయన్ని చూస్తే శంకర్ దయాళ్ శర్మ గుర్తొస్తున్నాడు--ఖాళీ కల్పించుకొని మరీ పొర్లు దండాలు పెట్టేసేవాడు!)

అప్పటి కలెక్టరుగారు "సంపూర్ణ పారిశుధ్యం" గురించి గ్రామీణ విద్యార్థులు, ప్రజలకు అవగాహన పరిచేందుకు 4 లక్షల నిధులతో, ఓ జడ్పీ పార్కుని "శానిటరీ" పార్కుగా మార్పించేశారట. 30-09-2010 న అప్పటి మంత్రి రఘువీరారెడ్డి దాన్ని "ఘనంగా" ప్రారంభించారట. కానీ, ఇప్పటివరకూ ఒక్క విద్యార్థి కూడా ఆ పార్కుని సందర్శించిన పాపాన పోలేదట. మహిళా సంఘాలు అసలే రాలేదట. ఇంతకీ ఆ పార్కులో యేమి పెట్టారు? మూడడుగుల దిమ్మలపై, రకరకాల లెట్రిన్ బేసిన్లూ, సింకులూ వగైరాలు. నాటిన మొక్కల సంగతి యెవరూ పట్టించుకోకపోగా, చెత్తనంతా గోడల ప్రక్కగా పోసేస్తున్నారట! యెంతబాగుందో చూశారా--"శానిటేషన్?"

యర్రంశెట్టి శాయి లాంటివాళ్లు రైల్వే నేపధ్యంతో వ్రాసిన నవలలవల్ల కొన్ని విషయాలు తెలిశాయి మనకి--జనరల్ మేనేజర్ కోసం ఓ ప్రత్యేక రైలు వుంటుందనీ, అందులో ఆయన ఆఫీసూ, బెడ్ రూమూ, కిచెనూ, సిబ్బంది కోసం--ఇలా ఓ నాలుగైదు కంపార్ట్ మెంట్లు వుంటాయనీ వగైరా. ఇప్పుడు ఆ రేంజి పెరిగిపోయినట్టుంది. మొన్న జనరల్ మేనేజరుగారు "తనిఖీల" కోసం యేకంగా ఓ 17 బోగీల రైలుతో, ఔరంగాబాద్ స్టేషన్ మొదటి ప్లాట్ ఫామ్ ఆక్రమించి, ముఖ్యమైన రైళ్లని యెక్కడో దూరంగా వున్న ప్లాట్ ఫారాలమీద ఆపి, ప్రయాణీకులని నానా హింసా పెట్టారట. దీని విషయంలో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలై, కోర్టు నోటీసులు కూడా ఇచ్చిందట! అసలే బోగీల కొరత వల్ల రైళ్లు నడపడమే ఇబ్బంది, కొత్తరైళ్లు అసలే లేవు, మరి ఆ పటాటోపం తో రైల్వేలకి నష్టాలు వస్తున్నాయంటే రావూ? అయినా "ఇన్స్ పెక్షన్" కి వెళ్లే వాళ్లు హటాత్తుగా వెళ్లి, యేమూలో పొంచి వుండి తనిఖీ చేస్తారంటారు. మరి ఇలాంటి తనిఖీల మర్మమేమిటో?

పటాటోపం విషయానికొస్తే, మన విజయనగరం మహారాజావారు గుర్రప్పందాలకో, గోల్ఫ్ కో లండన్ వెళితే, అక్కడి స్టార్ హోటెళ్లవాళ్లు తలలుపట్టుకు కూర్చునేవారట! వారి మర్యాదల గురించి కాదు--బెల్ బాయ్స్ దగ్గరనుంచీ వజ్రాల రూపంలో బాగానే ముట్టచెప్పేవారట. మరి తలనెప్పి యెందుకంటే, ఆయన వెంట కనీసం ఓ పాతిక యేనుగులని తీసుకెళ్ళేవాడట--వాటికి "ప్రత్యేక పార్కింగ్" సదుపాయం యెక్కడ యేర్పాటుచెయ్యలా అని! (అవి తమ పేడతో అద్దంలాంటి రోడ్లని పాడు చేస్తాయని భయం!)

కొత్తగా బొగ్గు కుంభకోణం--2జీ కన్నా చాలా పెద్దది అంటున్నారు. వాటిలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాభపడినందువల్ల, ప్రభుత్వానికేమీ ఢోకా వుండదంటున్నారు. కానీ అన్ని పార్టీలూ దేశంలోనూ, మనరాష్ట్రంలోనూ "మధ్యంతర" యెన్నికలకి సిధ్ధపడితే మంచిదని నా పంచాంగం చెపుతోంది. (నేను ఇదివరకు నించీ వ్రాస్తూనే వున్నాను--ఈ ప్రభుత్వాలు 2014 వరకూ వుంటే గింటే అని.)

Sunday, March 18, 2012

కబుర్లు - 87



అవీ, ఇవీ, అన్నీ

గోరోజనం అంటే--మామూలుగా "పొగరు" లేదా "గర్వం" అనే అర్థంలో వాడతారు. మరి అసలు ఆ పొగరు యెక్కడ వుంటుంది? కోడె గిత్తల మూపురాల్లో యేర్పడుతుందది. దానివల్లే వాటికంత పొగరు. 

ఆ పదార్థానికి వైద్యంతో సహా అనేక వుపయోగాలున్నాయట. ఓ కేజీ కొన్ని లక్షల ఖరీదుట.

దానికోసం ఓ 24 గిత్తలనీ, 100 మేలుజాతి యెడ్లనీ పెద్ద సీల్డ్ కంటెయినర్లలో రాష్ట్ర బోర్డరు దాటిస్తుంటే విశాఖ దగ్గర నక్కపల్లి వద్ద పోలీసుల సాయంతో పట్టుకొని, పెదతాడేపల్లి తరలిస్తే, గోసేవా సమితివారు సం రక్షిస్తున్నారు. చుట్టుప్రక్కల రైతులు వాటి మేత, పోషణ విషయం చూసుకొంటున్నారు.

ఆ తరవాత ఇంకో 160 పశువులనికూడా అక్కడికి తరలించారుట.

మొన్న, కొంతమంది యెలమంచిలి కోర్టులో 124 పశువుల యజమానులు మేమే అనీ, వాటిని అప్పగించాలి అనీ కేసు నెగ్గి, వాటిని తరలించుకుపోయారట. అదేమి లోపాయకారీ వ్యవహారమో!

యేలూరు ప్రభుత్వాసుపత్రిలో "ఆత్మలు" ఘోషిస్తున్నాయట. అక్కడ శవాలు భద్రపరచే గదిలో యేర్పాటు చేసిన 8 ఫ్రీజర్లలో 6 పనిచెయ్యడం మానేసి, మృతదేహాలు కుళ్లిపోతున్నాయట. 6 ఫ్రీజర్లలో దాదాపు 8 లక్షల విలువచేసే శీతల యంత్రాలని పట్టుకుపోయి, ఇళ్లలో వాడుకుంటున్నారట--సిబ్బంది! పైగా వాటి మరమ్మతులకి ఒక్కోసారీ 30 వేలవరకూ బిల్లులు చేసుకొంటున్నారట! ఇంకో విషయం యేమిటంటే, ఆ ఆసుపత్రికి కలెక్టరే ఛైర్మన్ ట.
ఆవిడ మాతృ హృదయం యేమంటుందో?

నిర్మాణకార్యక్రమలు జోరుగా సాగుతూండడంతో, వాగులూ, వంకలూ, కాలవల్లోనేకాకుండా, పోరంబోకుల్లో కూడా మట్టిని తవ్వేసి బంగారం సంపాదించేస్తున్నారు!

కానీ నిబంధనలే గాలికి యెగిరిపోతున్నాయి.

జిరాయితీ భూముల్లో భూమి స్వరూపాన్ని మార్చాలంటే తహసీల్దారునుంచి తప్పక అనుమతి తీసుకోవాలట. దరఖాస్తులో వివరాలన్నీ ఖచ్చితంగా నమోదు చెయ్యాలట. తహసీల్దారు ఆ భూమిని పరిశీలించి, కట్టిన ఫీజూ, యెన్ని ట్రాక్టరుల్లో తరలిస్తారు వగైరాలమీద ఆథారపడి అనుమతి ఇవ్వాలట. చూట్టూ ప్రభుత్వ భూములుంటే ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణలోనే జరగాలట. లోతుగా తవ్వితే, మైనింగ్ శాఖ అనుమతి వుండాలట. అనుమతుల్లేకుండా ఏదశలోనూ మట్టి తవ్వకాలు జరగకూడదట.

మరి అందరూ లక్షల్లో యెలా సంపాదించేస్తున్నారో?

నందననామ సంవత్సర ఉగాది వేడుకలు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించాలని డీ ఆర్వో అధికారులను ఆదేశించారట. వేదపాఠశాల విద్యార్థులచే వేదపాఠనం, అనంతరం ఉగాది స్వాగత నృత్యం, పంచాంగ శ్రవణం యేర్పాటు చేశారట. ఈ లోపల అధికారులందరితో "సమీక్షలు" నిర్వహిస్తున్నారట--యేర్పాట్ల విషయమై!

మహిళా దినోత్సవం సందర్భంగా మొన్న మొగల్తూరు లో "ఘనం"గా నిర్వహించి, అంగన్ వాడీ సిబ్బందికి పరుగు; లెమన్-స్పూన్; మ్యూజికల్ ఛెయిర్స్; ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకి బహుమతులిచ్చారట. ఆ సందర్భంగా ఎంపీడీవో మహిళలను అన్నిరంగాలలో (మరిన్ని ముగ్గులూ అవీ వేసేలా) చైతన్యవంతులని చేసేందుకు తగిన కృషి చెయ్యాలని పిలుపిచ్చారట (యెవరికో?)!  


    

Monday, March 12, 2012

కబుర్లు - 86





అవీ, ఇవీ, అన్నీ

మరో విషాదం--కాకతాళీయంగా, మన ఆంధ్రా బిర్లా ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ విగ్రహాన్ని, ఆంధ్రా షుగర్స్, తాడిపర్రు వద్ద ఆవిష్కరించారు 10-03-2012న. ఆయన భార్య చంద్రమతీదేవి అదేరోజు రాత్రి తమ స్వగృహంలో మరణించారు. ఆమె ఆత్మకు శాంతి కలుగు గాక!

మొన్న మనం అనుకున్న వైద్య నిధి ట్రస్ట్ (పేరు అభిలాష ట) కి గౌరవ ఎంపీ దాసరి నారాయణరావు ఓ రెండు అంబులెన్స్ లని తన లాడ్స్ నుంచి అనుగ్రహించారట. ఒకటి పోలవరం, ఇంకోటి బుట్టాయగూడెం క్లస్టర్లకి కేటాయించామని కలెక్టరుగారు (ట్రస్ట్ నిర్మాత) సెలవిచ్చారట. బాగుంది. దానికి సిబ్బందీ, డిజెల్ ఖర్చులకి యేర్పాటు యెలా చేశారో?

పంచాయతీల్లో పన్నులూ, ఖర్చులూ వగైరాలు "యెవరైనా" ఇంట్లో కూర్చొని కూడా తెలుసుకొనే విధంగా, "ప్రియ" అనే సాఫ్ట్ వేర్ ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారట. (ఇది పూర్తిగా 'అక్రమాలకి' చెక్ పెట్టడానికేనట!) చకచకా కంప్యూటరీకరణ జరిగి, నెలాఖరు లోగా ఈ సౌకర్యం అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుందట. అలాగని మీ కంప్యూటర్లముందు కూర్చోకండి.....కరెంటు వుండదు. మీకు యూపీఎస్ లూ, బ్యాటరీలూ వున్నాయి ఫరవాలేదంటారా? హ్హహ్హహ్హ! ఆ సర్వర్లకి కరెంటు వుండొద్దూ? వుట్టికెక్కలేని ప్రతీ అమ్మనీ స్వర్గానికెక్కించెయ్యాలని ప్రయత్నాలు ప్రారంబించారు కొందరు. పనిలోపనిగా తమ బ్రతుకులని స్వర్గధామాలు గా మార్చుకొంటున్నారు! యేం చేస్తాం???!!!

పంచముఖ ఆంజనేయస్వామి "గంధమానస" పర్వతాల్లో నివాసమున్నట్టు పురాణాలు ఘోషిస్తున్నాయట. (గంధమాదన పర్వతం గురించి చదువుకున్నాముగానీ, ఈ పర్వతం యెక్కడుందో మరి). "మానవునికి సహజస్థితి" కలిగించేందుకు భూమిపైకి "చివరిగా" వచ్చిన అవతారం పంచముఖ ఆంజనేయస్వామిట. "నీటిను పట్టుకొని" అధ్యాత్మిక జపం చేస్తే, ఆ నీటిలో మనస్సులోని రూపం ప్రతిబింబిస్తుందట. హోలీ పండుగ, తెలుగు సంవత్సరం ఆఖరి పౌర్ణమి రోజున రావడం ముదావహమట. ఉత్తరభారతం లో ఎక్కువగా జరిగే పండుగ, ప్రస్తుతం దక్షిణ భారతం లో కూడా "సంప్రదాయంగా" వస్తూందట. ఈ వువాచలు ఫలనా శ్రీదత్తపీఠ ఉత్తరాధికారి శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ గారివట. ఇంకా హోలీ ఆడుకోవడానికి పసుపు వాడతారనీ, దానికి ఔషధగుణాలు వున్నాయనీ, రాత్రిపూట పాలల్లో పసుపుకలుపుకొని తాగాలనీ....ఇలా చాలా చెప్పారట. (ఈయన యే స్కూల్లో చదువుకున్నారో తెలిస్తే బాగుండును!)

థాయ్ లాండ్ రాజధాని బ్యాంగ్ కాక్ పూర్తి పేరు : ఖ్రుంగ్థెప్మహనఖొన్ ఆమొర్న్రత్తనకొసిన్ అహింథరయుత్థయ ంఅహదిలొక్ఫొప్ ణొప్ఫరత్ ఋఅత్చథనిబురిరొం ఊదొమ్రత్చనివె త్మహసథన్ ఆమొరంఫిమన్ ఆవ తర్న్సత్థిత్ శక్కథత్త్ ఇయవిత్సనుకంప్రసిత్ (ట!). (Krungthepmahanakhon Amornrattanakosin ahintharayutthaya Mahadilokphop Noppharat Ratchathaniburirom Udomratchaniwe tmahasathan Amornphiman Awa tarnsatthit Sakkathatt iyawitsanukamprasit) అంటే యేమిటో?   

"గోరోజనం" అంటే యేమిటో మీకు తెలుసా? అదెక్కడ వుంటుందో, యెలా లభిస్తుందో తెలుసా?

మరోసారి!      
   


   

Saturday, March 10, 2012

కబుర్లు - 85



అవీ, ఇవీ, అన్నీ

ఒబామా మళ్లీ పేలాడు--విన్నారా?

ఇంతకు ముందు ఇండియా లాంటి చోట్ల జనాలు యెక్కువ తినేస్తున్నారు--అందుకే ద్రవ్యోల్బణం, ప్రపంచ వ్యాప్త ఆహార కొరత, ఆర్థిక సంక్షోభాలు వగైరా అంటూ పేలాడు.

ఇప్పుడు, భారత్, చైనా, బ్రెజిల్ దేశాల్లో అందరూ కార్లు కొనేస్తున్నారు కాబట్టే చమురు ధరలు పెరుగుతున్నాయి అని పేలుతున్నాడు! చైనాలో 2010లో కొత్తగా కోటి కార్లు రోడ్లపైకి వచ్చాయి అనీ, అలాగే భారత్, బ్రెజిల్ లలో కూడా ఇంధన అవసరాలు బాగా పెరిగిపోయాయి అనీ అన్నాడు.

అంటే వాడి వుద్దేశ్యం, అమెరికావాళ్లు మాత్రమే తినాలి, వాళ్లే కారుల్లో తిరగాలి, వాళ్లే వున్నత జీవన ప్రమాణాలతో వుండాలి అనా? 

వాళ్ల పెద్ద పెద్ద లిమోసిన్లూ అవీ అంతవేగంగా ప్రయాణించడానికి, వాళ్ల పోలీసులు వుపయోగించే వాహనాలకీ, యెంత "గ్యాసోలిన్" (మన పెట్రోలు కూడా కాదు) తాగేస్తున్నారో వూహించండి! మన లీటర్లు కాక వాళ్లు గేలన్లలో కొలుస్తారు పైగా! ఇంక విమానాలు చెప్పనే అఖ్ఖర్లేదు.

వాళ్లు మనని వెక్కిరిస్తూ బాధపడిపోవడం యేమిటో?

మన వందరూపాయలనోట్ల వెనుకవైపు, సరిగ్గా మధ్య, క్రిందుగా ఆనోటు చెలామణీలోకి విడుదలైన సంవత్సరం ముద్రించి వుంటుంది. 

ఇప్పుడు అలా సంవత్సరం అసలు ముద్రించకుండా వున్న నోట్లు 1996 లో విడుదల అయ్యాయనీ, ఆ నోట్లు ఇక చెల్లవు అనీ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించి, వాటిని బ్యాంకులలో మార్చేసుకోమని అదేశాలు ఇచ్చిందట. 

2005 లోని ఎం జి సిరీస్ నోట్లు కూడా చెల్లవు ట.

ఓ సారి జాగ్రత్తగా చూసుకోండి. యేరోజు వరకూ మార్చుకోవచ్చో స్పష్టం కాలేదు.

రావి కొండలరావు అమెరికా వెళ్లలేకపోవడంతో, ఆయన స్థానంలో అక్కిరాజు రమాపతిరావుగారికి జీవితకాల సాఫల్య పురస్కారం అందిస్తారట. ఆయనకి అభినందనలు.

మన గవర్నరుగారు వుదయం 9 గంటలకే అన్నీ యేర్పాటు చేసుకొని, న్యాయమూర్తి లోకూర్, ఇంకా ఆయన్ని దర్శించుకోడానికి వచ్చిన చాలామంది తో "హోలీ" ఆడేసుకున్నారట. అలాగే ముఖ్యమంత్రి కూడా. బాగుంది. వాటి కోసం, సహజ రంగులూ, పర్యావరణ హితమైనవీ అంటూ ఇంకో గోల. ఇంకెక్కడో కొన్ని వందలమంది చిన్నారులు హానికారక రంగుల కారణంగా ఆసుపత్రుల పాలు!

అంత అవసరమా?

అన్నట్టు, లోకూర్ గారూ, జాస్తి చెలమేశ్వర్ గారూ రోజూ పేపర్లో వస్తున్నారు--అక్కడ మీటింగ్, ఇక్కడ సెమినార్, ఇంకోచోట సన్మానం వగైరాలతో. మరి కోర్టులకి యెప్పుడు వెళుతున్నారో?

ఇంక మన తెలుగు వీరాభిమానులు, తెలుగు భాషకోసం అంటూ మొసలి కన్నీళ్లు ఇంగ్లీషులో కార్చేవాళ్లు, మనమీడియావాళ్లూ--ఇలా, "ఫలనా స్కూల్లో ఫలానా మేష్టారు ఓ విద్యార్థిని 'తెలుగులో మాట్లాడినందుకు' తీవ్రంగా శిక్షించిన వైనం" అంటూ తెగ వాపోతున్నారు!

ఇక్కడ విషయం, తెలుగు మాట్లాడినందుకు కాదు--పాఠశాలలో ఇంగ్లీషులోనే మాట్లాడాలి అనే నిబంధన వుల్లంఘించినందుకు--అని కన్వీనియెంట్ గా మరచిపోతారు.

ఆంగ్లం మాతృభాష కానివాళ్లెవరైనా ఇంగ్లీషు మాట్లాడినా, వ్రాసినా తప్పులు దొర్లుతాయి. కానీ, మనదేశంలో అనేకమంది మహామహులు, వాళ్లకన్నా చక్కగా ఇంగ్లీషులో కథలూ, కావ్యాలూ, నాటకాలూ, కవితలూ వగైరాలు వ్రాసేవారు! (ఇప్పుడూ చిన్నపిల్లలు సైతం వ్రాస్తున్నారు!)

ఇప్పుడు కొందరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లూ, ఇతర వున్నతోద్యోగులూ, బుర్రోవాదులూ, ఆఖరికి జర్నలిస్టులూ కూడా వ్రాస్తున్న ఇంగ్లీషు చూస్తుంటే, వికారం వస్తూంటుంది!

అలాంటి పరిస్థితుల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో ఇంగ్లీషులోనే మాట్లాడాలనే నిబంధన విధించి, అమలు చేస్తున్నవాళ్లని తప్పు పట్టగలమా?

ఇంటర్ వరకూ యెలాగో నెట్టుకొచ్చి, (ఇప్పుడు ఎంసెట్ రాంకు బాధ కూడా లేదు), ఇంజనీరింగు కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులనీ, వాళ్లకిపాఠాలు చెప్పే వుపాధ్యాయులనీ, వాళ్లకు తెలియకుండా సూపర్వైజర్లచే నిఘా వేయించి, తెలుగు వినబడితే జరిమానాలూ, జీతాల్లో కోతలూ విధిస్తున్న విషయం యెవరికి తెలియదు? పాపం వాళ్లెవరికి చెప్పుకోవాలి?

మేష్టర్లని శిక్షిస్తే, తెలుగు వృధ్ధిలోకి వస్తుందా?

ఆలోచించండి.

Friday, March 2, 2012

కబుర్లు - 84



అవీ, ఇవీ, అన్నీ

ఏలూరు దగ్గర పోణంగి గ్రామంలోని ప్రాచీన వైనతేయేశ్వర లింగం పగుళ్లుతీస్తూండడంతో, సహజసిధ్ధంగా వున్న "నాగేటి చాలు" అలాగే వుంచి, విడిపోతున్న మిగతాభాగాలని సం రక్షిస్తామన్నారట ఆలయ ఛైర్మన్ వగైరాలు. ఈవోగారు, సత్వర చర్యలు తీసుకొంటామనీ, ప్రస్తుతానికి నేరుగా అభిషేకాలు చేయకుండా, స్వచ్చమైన ఆవుపాలతో పానవట్టం వద్ద అభిషేకాలు చెయ్యమని సూచించారట. యెవరైనా దాతలు ముందుకు వస్తే, లింగానికి "వెండి తొడుగు" వేయిస్తామన్నారట! ఈ లోపల ఆ రుద్రుడి తల మాటేమిటో?

ఓ వారం క్రితం, ఏలూరు డీఎస్పీ "యెవరైనా అర్థరాత్రి మద్యం తాగి కనిపిస్తే, వారితోపాటు ఆ మద్యం అమ్మినవాళ్లని కూడా అదుపులోకి తీసుకోవాల"నీ, "రాత్రి 11 గంటల తరవాత బార్లు తెరిచి వుంటే, విక్రయదారులతోపాటు, మద్యం సేవించేవాళ్లని కూడా అదుపులోకి తీసుకోవాల"నీ  ఆదేశించారట. ఈ తాటాకు చప్పుళ్లకా తోడేళ్లు బెదిరేవి? (ఇంతవరకూ అలాంటి "అదుపు" ఒక్కటీ పేపర్లకి యెక్కలేదు మరి!)

మొన్నోరోజు కంచికామకోటి పీఠాధిపతి శిష్యులు పరమహంస శ్రీనారాయణేంద్ర సరస్వతి స్వామీజీ, "వెయ్యి కాళ్లమండపాన్ని కూలగొట్టి, తితిదే ఘోర తప్పిదం చేసిందనీ, దాని పునర్నిర్మాణం ఆగమ సమ్మతం" అనీ సెలవిచ్చారట. యేగూటి చిలక ఆ పలుకే పలుకుతుంది కదా? అసలు వెయ్యి కాళ్లే లేవనీ, అది కేవలం 35 కుటుంబాలు వంటలు చేసుకొని, భుజించి, నిద్రించడానికి వసతి కోసం యేర్పరచిన భవనమేననీ (అప్పట్లో వంటచెరకూ, పాత్రలూ వగైరాలు వుచితంగా వారే ఇచ్చేవారు), మరోసారి అందరికీ మనవి చేస్తున్నా.

ఓ పదిరోజులక్రితం, "అద్భుతం, సస్పెన్స్, థ్రిల్లు" అయిన ఓ వార్త వచ్చింది. ఓ ప్రముఖ సినీనటి ఇటీవల పలుదఫాలు భీమవరం వచ్చి వెళుతున్నారు అనీ, అత్యంత గోప్యంగా, మధ్యవర్తుల ద్వారా ఈ రాకపోకలు సాగుతున్నాయనీ, ఓ సంచలన కేసుకి సంబంధించిన నిందితునికి ఆమె దగ్గరగా వుండేవారనీ. తరవాత కూడా ఈ గుట్టు రట్టైనట్టు లేదు!

బహుళ అంతస్థుల భవనాల్లో లిఫ్టుల యేర్పాటుకి "జిల్లా అగ్నిమాపక అధికారి"కి దరఖాస్తు చేసుకోవాలని యెరరికైనా తెలుసా? పది మీటర్ల యెత్తు దాటిన భవనాలకి లిఫ్టు కంపల్సరీ అని తెలుసా? లిఫ్ట్ లో అవసరమైతే సైరన్ మోగే యేర్పాట్లూ, "చార్జింగ్ ఏ ఆర్ డీ" సిస్టం--అకస్మాత్తుగా లిఫ్ట్ ఆగిపోతే, సమీప అంతస్తుకి వచ్చి మరీ ఆగిపోయే విధానం, జనరేటర్, సహాయకులూ, సంబంధిత శాఖల ఫోను నెంబర్లూ, ఛార్జింగ్ బేటరీలూ, సర్వీస్ సంస్థల ఫోను నెంబర్లూ--ఇవన్నీ యేర్పాటు చెయ్యాలని తెలుసా? మనకీ లిఫ్టుల గోల లేదు. సంతోషం. మరి వున్నవాళ్ల మాటేమిటి?

మా జిల్లా కలెక్టరు గారి మాతృమూర్తి, ఇటీవల నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా నిర్వహించిన "పరుగు, నడక" పోటీల్లో, ఆవిడా, ఆవిడ "తనయుడూ" "కోడలూ" పాల్గొని, "మూడు బంగారు, మూడు రజత, మూడు కాంస్య" పతకాలు "సాధించార"ట! 60 సంవత్సరాలు పైబడ్డా, 5 కీ మీ నడకా, 200 మీ, 100 మీ పరుగు పందెంలో కూడా బంగారు పతకాలు సాధించడం పట్ల అందరూ ఆవిడని అభినందించారట. 

వీటన్నింటికీ సందర్భం? కలెక్టరుగారి జన్మదినోత్సవం! దానికి అనేకమంది ఐ యే ఎస్ లూ, ఐ పీ ఎస్ లూ, ఇతర వుద్యోగులూ--హాజరు! (ఆ వుత్సవ ఖర్చులు యెవరు పెట్టుకొన్నారో?)

ఆవిడకి "అన్ని పొగడ్తల" అవసరం వుందా? యేమో మరి!

Wednesday, February 29, 2012

కబుర్లు - 83



అవీ, ఇవీ, అన్నీ

(అలవాటైన 'సణుక్కోవడం ' మానలేదుగానీ, అందరికీ వినపడేలా సణగడం ఈ మధ్య వీలుకావడంలేదు. క్షంతవ్యుణ్ని!)

"ఈనగాచి నక్కలపాలు"; రాజులసొమ్ము రాళ్లపాలు; పీనాసి సొమ్ము దొంగలపాలు; ప్రభుత్వం సొమ్ము గుత్తేదాదులపాలు; దాతలసొమ్ము దోపిడీదారులపాలు--ఇలా యెన్నైనా చెప్పుకోవచ్చు!

మా జిల్లా కలెక్టరు (వాణీ ప్రసాద్), పాపం తన మాతృహృదయంతో, సామాన్యులకీ, ముఖ్యంగా గిరిజనులకీ "వైద్య సహాయం" పెంచడానికి, ఓ వైద్య నిధి యేర్పాటు చేశారు.  అక్కణ్నించీ ప్రభుత్వోద్యోగులు--ముఖ్యంగా రెవెన్యూ వాళ్లు యెగబడి, ఒకరోజు వేతనలూ, కొంతమందైతే భూరి విరాళాలూ ఇస్తూ పేపర్లలో ఫోటోలు కూడా వేయించుకొన్నారు. 

ఇంకా, మొన్న 11-11-11 న 11-11 కి ఈ విద్యనిధిని ట్రస్టుగా రిజిస్టరు కూడా చేసి, పేపర్లలో వేయించారు. (ప్రభుత్వాధికారులు ఇలాంటి పనులు చెయ్యొచ్చా? వీటివల్ల వుపయోగం వుంటుందా? వాళ్లు బదిలీపై వెళ్లిపోయాక ఆ సంస్థల, వాటిలో నిల్వల గతి యేమిటి? ఇలాంటివాటి గురించి ఇదివరకో టపాలో వ్రాసినట్టున్నాను.)

నీకేం బాధ? అంటారా.....అక్కడికే వస్తున్నా. కొన్ని లక్షల నిధులతో, మా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో, బుట్టాయగూడెం, పులిరామన్నగూడెం, పోలవరం ల లోని ఆరోగ్య కేంద్రాలకీ, ఆసుపత్రులకీ--అత్యాధునిక వైద్య పరికరాలూ, ఇంకా భీమడోలు, ద్వారకా తిరుమల, చింతలపూడి, కొయ్యలగూడెం, ఆకివీడు వైద్యాలయాలని అభివృధ్ధి చేసి, ఒక్కోదానికీ రూ.16 లక్షల విలువైన పరికరాలని అందించారట. భవనాల ఆధునికీకరణకి ఒక్కోదానికీ ఓ 6 లక్షలు ఖర్చు చేశారట. 

"మన్యంలో కార్పొరేట్ వైద్యం" అంటూ, ఈ సీ జీ, సెమీ అనలైజర్, హైడ్రాలిక్ ఆపరేషన్ థియేటర్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ లాంటి 18 రకాలైన ఉపకరణాలూ, మంచినీటి శుధ్ధి యంత్రాలూ, సౌర విద్యుత్ ఉపకరణాలూ సరఫరా చేశారట. (ఇవన్నీ ఇప్పటికే మూలన పడ్డాయట!). ఇంకెందుకని, కొన్ని ఉపకరణాలని జంగారెడ్డిగూడెం లాంటి పట్టణ ప్రాంతాలకి తరలించేశారట. 

మూల కారణం? ఆ ఉపకరణాలకి తగ్గ సిబ్బందిని నియమించలేకపోవడమేనట! 

సంబంధిత శాఖాధికారులనడిగితే, షరా మామూలేగా, చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దాం, వ్రాసి పంపించాము కదా? ఇంక పైవాళ్ల చేతుల్లో వుంది--లాంటి సమాధానాలిస్తున్నారట! 

పథకాలు నీరైపోయినట్టు, మన గుండెలుకూడా నీరయి పోవడంలేదు?

ఇంక, ఘనతవహించిన సేవా సంస్థలు యేమి చేస్తున్నాయి?

మొన్ననే మా హేలాపురి--అదేనండీ--ఏలూరు లో "లయనెస్సెస్" క్లబ్బువారు వార్షిక మహోత్సవాలో యేవో, కొన్ని రోజుల పాటు ఘనంగా నిర్వహించి, సభ్యులకి "కూరగాయలతో కళాకృతులు తయారుచెయ్యడంలో" పోటీలూ, "స్త్రీల సుందర కేశాలంకరణ" పోటీలూ వగైరాలు నిర్వహించి, ఘనంగా బహుమతులు ప్రకటించుకున్నారట.

యేసొమ్ము యెవరి పాలు అంటే యేమంటాము?

ఘనత వహించిన "రాజీవ్ విద్యా మిషన్" విద్యార్థులకి "వినూత్న" బోధన లో భాగంగా, "విందాం, నేర్చుకుందాం" అనే "రేడియో" పాఠాల కార్యక్రమం మా జిల్లాలోని 2650 ప్రాథమిక పాఠశాలలు, 260 ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండేళ్లక్రితమే ప్రారంభించారట.  ఫలానా రోజు, ఫలానా క్లాసులవారికి, ఫలానా పాఠమో, ఆటో, ఇంకోటో ప్రసారం చేస్తామని, సంబంధిత శాఖ నుంచి పాఠశాలలకి "కరదీపిక"లు (హేండ్ ఔట్ కో, హేండ్ బుక్ కో మన ఈనాడువారి తెనుగుసేత అనుకుంటా) ముందే సరఫరా చేస్తారట. ఆ సమయాల్లో రేడియోలు పెట్టుకొని, వినేసి, నేర్చేసుకోవడమే! 

కానీ, "కర్రుంటే పాముండదు, పాముంటే కర్రుండదు" అన్నట్టు, కరదీపికలో ప్రకటించినవాటికీ, ప్రసారమౌతున్నవాటికీ పొంతనే వుండడం లేదట. ప్రసారమౌతున్నవాటికి కరదీపికలే ముందుగా అందడం లేదట! (అసలు కరెంటు వుంటోందా?) పాపం ఉపాధ్యాయులూ, విద్యార్థులూ తెల్లమొహాలు వేసుకొని....ఆ పైన, ఇంకేం చేస్తారు? ఆడుకోమంటారు! 

మరి యెప్పుడో మూలపడ్డ రేడియోల (వాటికెంత ఖర్చయ్యిందో?) ద్వారా విద్యా బోధనలాంటి అద్భుతమైన అవిడియాలతో క్రిక్కిరిసిపోయిన వాళ్ల బుర్రలు పగులకొట్టి, వాటిలో విలువైన వజ్రాలు ఇప్పటికే యేర్పడిపోయాయేమో పరిశోధించవద్దూ?

మా వూళ్లోనే వున్న "స్వర్ణాంధ్ర" ఇంజనీరింగు కళాశాలల విద్యార్థులు "న్యూ కలర్స్" అనే సంస్థని యేడాది క్రితమే స్థాపించి, నెలకి ఇంత అని పోగుచేసి, యెక్కువ మొత్తం అయ్యాక, చుట్టు ప్రక్కల పల్లెల్లోని వృధ్ధులకీ, పేదలకీ, బియ్యం, బట్టలు, దుప్పట్లూ వగైరాలు పంపిణీ చేస్తున్నారట. మొన్ననే ఓ 25 మంది వృధ్ధులకి, 25 కేజీలచొప్పున, 25 బస్తాలలో బియ్యం పంపిణీ చేశారట. 

యేమిటో! మన అన్నపూర్ణ, పేదలమీద బియ్యం వర్షం కురిపిస్తోంది! ప్రభుత్వం కేజీ రూపాయికే ఇచ్చేస్తోంది--నెలనెలా కోటా పెంచుతూ! రాష్ట్ర సరిహద్దులుదాటి బియ్యం అమ్మకపోతే, రైతులు దివాళా తీస్తారంటున్నాడు జేపీ! మిల్లర్లేమో ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ బియ్యాన్నీ, లెవీ బియ్యాన్నీ, తరలించేసి బాగుపడుతున్నారు. మనం మాత్రం బజార్లో కేజీ 30 కి తక్కువకాకుండా కొనుక్కొని సుఖపడుతున్నాము. 

(సర్కారుకూడా నిన్ననే--మేము యెగుమతులపై నిషేధం విధించలేదు, తరలింపుకి వున్న ఆంక్షలని కూడా తొలగించేస్తాము--మరి రేపణ్నించీ సభలో యెవరూ బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగాయి అని ఫిర్యాదు చెయ్యకూడదు--అలా అయితే మేము సిధ్ధమే! అంటోంది. వీటి భావమేమో మేధావులే చెప్పాలి మరి!)

బియ్యం మాత్రం సదా వర్షించుగాక!    
 

Saturday, February 11, 2012

సిండి 'కేట్లూ'.......



............రాజకీయాలూ

ఈ మధ్య మీడియావాళ్లు పండగ చేసుకొంటున్నారు--మద్యం మాఫియాలూ, సిండికేట్లూ, మంత్రే కేటు లాంటి వార్తలూ, చర్చలతో.

తగుదునమ్మా అని ఇప్పుడు ఏ సీ బీ "చర్యలు" చేపట్టిందట--పైవాడి "కనుసైగ" అందుకుని. అందులో కూడా అస్మదీయులని తప్పించేస్తోంది అంటున్నారు కొందరు మంత్రులే!

అయినా ఇవన్నీ యెవరికి తెలియని రహస్యాలు? 

12-04-2010 న వ్రాసిన 'మద్యం' దిన మార్తాండులు అనే నా టపా లింకు క్రింద ఇస్తున్నాను. మళ్లీ చదవండి.


ఓ ఐదారునెలల క్రితమనుకుంటా, వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది అనీ, హైకోర్టు సమర్ధించింది అనీ, "ఒకరోజు"పాటు, మద్యాన్ని--బిల్లులు వ్రాసిచ్చి మరీ--ఎం ఆర్ పీ కి అమ్మారట. ఆ రాత్రికే, "మిమ్మల్నెవడు భయపడమన్నాడు? అంతా మీ యిష్టమేనా? మేమున్నది యెందుకు?" అంటూ "పైవాళ్లు" కళ్లెర్రజేసి మరీ యెక్కువరేట్లకి అమ్మించడం మొదలెట్టారట.

యెవరి చెవుల్లో పువ్వులు పెడతారు--ఏసీబీ లూ, కి కు రె లూ, కాంగీ  లూ!?