Thursday, December 13, 2012

కబుర్లు - 100




అవీ, ఇవీ, అన్నీ

ప్ర తె మ ల సందర్భంగా, అన్ని జిల్లాల్లోనూ, మండలాల్లోనూ, "సభలు" చేసి, "దశదిశలా తెలుగు కీర్తి చాటాలి" అని యెలుగెత్తుతున్నారందరూ. 

నిన్న మావూళ్లో సభలో ఒకాయన మీడియా చేస్తున్న కృషిని అందరూ గుర్తించాలనీ, తెలుగు వెలుగు కొని చదవాలనీ, వారు చేస్తున్న కృషి అమోఘమనీ--ఇలా చెప్పారు.

తీరా చూస్తే, ఆ సభకి సంబంధించిన వార్తలో, "శతావధాని తనదైన శైలిలో..........'హాస్యాస్పదంగా' వివరించారు అని వ్రాశారు! 

తెలుగుని వుధ్ధరించకపోతే పోయె--అపభ్రంశాలతో దాన్ని ఖూనీ చెయ్యకుండా వుంటే చాలు మన ఘనతవహించిన మీడియా వాళ్లు.

హమ్మయ్య! కార్తీకం ముగిసింది. క్రితం సంవత్సరం వరకూ 'సహస్ర' తో సరిపెట్టిన భత్తులు, ఈ సారి 'లక్ష' సంఖ్యలో దీపాలు వెలిగించేశారు అనేక చోట్ల. (అయినా, పౌర్ణమి నాడు దీపాలెందుకో--అమావాస్యనాడు గానీ!) 

మళ్లీ యేడు "పది లక్షల" దీపాలూ, ఇక ముందు "కోటి" కి చేరినా ఆశ్చర్యం లేదేమో!

ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి కొద్దిగా తక్కువగా మాత్రమే చేరిందట--అక్టోబరు నెలాఖరికి. ఆహార ద్రవ్యోల్బణం కూడా అలాగే వుందట. ఇంక కార్తీకాంతానికి యెంతకి పెరుగుతుందో? మళ్లీ యేడాదికి మూడంకెలకి కూడా చేరుతుందేమో--దువ్వూరి వారు ఆలస్యం చేస్తే!

"భేష్ దువ్వూరీ!" అన్నాడట ఆర్థిక వేత్త జగదీష్ భగవతి. ఆయన ప్రభుత్వ వొత్తిళ్లకి తలవొగ్గలేదు అనీ, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశారు అనీ, ఇంక వృధ్ధి గురించి కూడా పట్టించుకోవాలనీ అన్నారట. చివర అన్నదాన్నిబట్టి, ప్రభుత్వానికి వత్తాసు పలికినట్టు లేదూ?

ఆర్ బీ ఐ డిప్యూటీ గవర్నరు చక్రబర్తి, బ్యాంకుల్లో మొండి బాకీలు పెరగడానికి "కార్పొరేట్లదే బాధ్యత" అన్నారట. అసలు అన్నేసి వందల కోట్లు ఆ కార్పొరేట్లకి యెవరు యెలా ఇప్పించారో?

గుజరాత్ యెన్నికలు రేపనగా, వీరప్ప మొయిలీ, ఇకనుంచీ యేడాదికి 9 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించాం అని చెప్పి, ఎలక్షన్ కమీషన్ మొట్టగానే, "అబ్బే! నిర్ణయం ఇంకా తీసుకోలేదు" అని తప్పించుకుంటున్నాడు. మరి గుజరాత్ లో అందరూ వెర్రి వోటర్లే అనుకున్నాడేమో!

ఎఫ్ డీ ఐ ల విషయంలో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటుండగా, వాల్ మార్ట్ బాంబు పేల్చింది--మనదేశంలో వాళ్ల ప్రవేశం కోసం కొన్ని వందల కోట్లు లాబీయింగ్ కి (లంచాలకి) ఖర్చు చేశాము అని! ప్రభుత్వంవారు యెట్టకేలకి ఓ విశ్రాంత న్యాయ మూర్తి తో విచారణ చేయించడానికి ఒప్పుకున్నారట. నిజాలు బయటికి వచ్చేనా?   

   

Wednesday, December 12, 2012

కబుర్లు - 99



అవీ, ఇవీ, అన్నీ

అంగదుడి రాజ్యం స్థాపించడానికి మార్గం సుగమం చేస్తున్నారు. 

ఇంక తనేమో, నలుడూ, నీలుడూ, గవయుడూ, గవాక్షుడూ మొదలైన తన తోటి వానరులని దేశం మీదకి తోలాడు--2014 లోగానీ, అంతకు ముందేగానీ యెన్నికలొస్తే, యే నియోజక వర్గంలో యెవరికి టిక్కెట్ ఇస్తే మంచిది? యెవరికి యెక్కువ గెలిచే అవకాశాలున్నాయి? వగైరాలు సర్వే చేసి, తనకి నివేదిక ఇమ్మని.

ఇంక మన రాష్ట్రంలోని వాళ్ల సామంతులు, ఈ సారి నెగ్గాలంటే మాత్రం, "గజన్" మీద కేసులన్నీ యెత్తేసి, ముఖ్యమంత్రి పదవి ఇస్తే వాడి పార్టీని విలీనం చేస్తాడు అనీ, అదొక్కటే బ్రతుకు తెరువు అనీ మొత్తుకుంటున్నారట! మర్కటాలకీ, గోలాంగూలులకీ అయినా సిగ్గూ యెగ్గూ వుంటుందేమోగానీ వీళ్లకి........?!

మొన్న రామోజీరావు ఆయనెవరో "బొక్లీసు" అనే ఆయన్ని తీసుకొచ్చి, "అర్థ క్రాంతి" పేరుతో హడావిడి చేశాడు. తీరా ఆయన ప్రతిపాదనలన్నీ కొత్త సీసాలో పాత సారాయే! పైగా ఒక్కటీ ఆచరణ సాధ్యం కాదు. మరి అందరూ ఆయన్ని ఆకాశానికి యెత్తేశారు. నేనైతే అసలు ఆయన ఆలోచనలతో యేకీభవించను.

ఆయన చెప్పింది--డీ మోనెటైజేషన్--50 రూపాయలపైన ఉన్న నోట్లన్నీ రద్దు చేసేయ్యాలిట. కారణం--పేదవాళ్లకి ఆ నోట్లతో పని లేదట--బలిసినవాళ్లకి తప్ప!

మీరు బజారులో దుకాణాలదగ్గర గమనించండి--యెంతపేదవాడైనా, 500 నోటే మారుస్తున్నాడు. మరి ఇలా పెద్దవిలువ వున్న నోట్లని ఒక్కసారిగా రద్దు చేస్తే, ఆర్థిక వ్యవస్త అల్లకల్లోలమైపోదూ? ఇప్పటి బ్యాంకులు రద్దీని తట్టుకో గలవా?

ఈ విషయంలో, క్రమపధ్ధతిలో నోట్లని యెలా రద్దుచెయ్యాలో నేనిదివరకే వ్రాసిన టపాలు చదవండి.

ఇంక, లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా జరిగేలా చెయ్యాలట! ఇదీ ఆచరణసాధ్యం కాదు. యెందుకంటే, ఇప్పుడు నగదు లావాదేవీలు జరుగుతున్నది ముఖ్యంగా "ఆదాయ పన్ను" నుంచి తప్పించుకోడానికే. 

బీ జే పీ వారు అప్పట్లో ఆదాయ పన్ను పూర్తిగా రద్దు చేస్తామన్నారు. (తరవాత సంకీర్ణం పేరు చెప్పి, దాన్ని పట్టించుకోలేదు). నిజంగా ఆ పన్ను శాఖవారు చిరుద్యోగుల మీద తడాఖా చూపిస్తారుగానీ, తిమింగలాల్ని వదిలేస్తారు. ఆ పన్ను రద్దు చేస్తే, ప్రభుత్వానికి తగ్గే ఆదాయం చాలా స్వల్పం. వుద్యోగులు, చిన్న వ్యాపారులూ వగైరాలు చాలా సంతోషిస్తారు. 

విదేశాల్లో దొంగడబ్బు దాచుకున్నవాళ్లని, దానిమీద కొంత ఆదాయపు పన్ను కట్టేస్తే, మిగిలినది తెల్లధనం అయిపోతుందంటున్నారు సర్కారువారు. ఆ పన్ను రద్దు చేసి, అక్కడి నిధులని జప్తు చెయ్యగలిగితే, దేశం బాగుపడుతుoది.

ఇంక, బ్యాంకు లావాదేవీల మీద బి టీ టీ వసూలు చేస్తే చాలట--మిగిలిన పన్నులని రద్దుచేసి!

ఇప్పటికే, సేవల పన్ను పేర బోళ్లు గుంజుతున్నారు. దానిమీద విద్యా సెస్సూ, ఇంకాదానిమీద వున్నతవిద్యా సెస్సూ లాగించి, అనేక సేవలకి దాన్ని విస్తరించి, అనాయసంగా కోట్లు దండుకుంటున్నారు. ఆ సెస్సులు ఇప్పటివరకూ యెంత వసూలు అయ్యాయో, విద్యావ్యస్థకి యెంత ఖర్చుపెట్టారో--బ్రహ్మదేవుడిక్కూడా తెలీదు. ఇక బీ టీ టీ కూడా విధిస్తే? మరిన్ని వందలకోట్లు. 

నగదు లావాదేవీలని రూ.2,000/- కి పరిమితం చెయ్యాలట! ఓ మధ్యతరగతి కుటుంబానికి నెలవారీ కిరాణా సరుకులు, బియ్యం కొనుక్కుంటే, కనీసం రూ.3,000/- దాటుతోంది. దానికి చెక్కు ఇస్తామంటే యే వ్యాపారస్థుడు ఇస్తాడు? "మీ దగ్గర వున్నప్పుడే ఇవ్వండి" అంటారు గానీ!

సరే! వాళ్లంతా  మేథావులు! మనలాంటి "మేతావులు" కాదు. 

కేంద్రం నవరత్న కంపెనీలని ప్రైవేటుకి అమ్మేసి, డబ్బు చేసుకోవాలని చూస్తూంటే, మార్కెట్లో ఆ వాటాలు కొనడానికి యెవరూ ముందుకు రావడం లేడట. అందుకని, పాపాల భైరవుళ్లాంటి ఎల్ ఐ సీ వాళ్లకి అంటకడుతున్నారట. దానికోసం, ఆ సంస్థ యే కంపెనీలోనైనా, 30 శాతం వరకూ వాటాలు కొనుగోలు చెయ్యడానికి అవకాశం కల్పించారట!

ఆ సంస్థకూడా నాశనం అయిపోతే, విదేశీ బీమా సంస్థలకి పండగే పండగ!

కొందరికి పళ్లు సరిగా లేవు. మరి కొందరికి పాదాలు సరిగ్గా లేవు. ఇంకొందరికి యెత్తు తక్కువ, ఛాతీ కొలతలు సరిపోవు!

యెవరికనుకుంటున్నారు? రెండేళ్ల క్రితం, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా, వైద్య పరీక్షలూ వగైరాలు చేయించి, 162 మందిని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు గా నియమించేశారట. ఇప్పుడెవరో, నిబంధనలకి విరుధ్ధంగా వాళ్లకి వుద్యోగాలిచ్చారని దర్యాప్తు చేయించాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ని కోరారట--ఆ వుద్యోగాలు రానివాళ్లు. ఇంకేముందీ? తాజాగా 162 మందికీ వైద్య పరీక్షలు చేయిస్తే, అందులో 62 మంది పైన చెప్పిన కారణాలవల్ల అనర్హులు అని తేలిందట! ఇప్పుడు వాళ్లని తొలగించడం యెలా? అంటూ మొత్తుకుంటున్నారట సంబంధిత అధికారులు.

అసలు ఆ ఇన్స్పెక్టర్లు, పళ్లతోనూ, పాదాలతోనూ, ఛాతీ తోనూ యేమైనా పని చేస్తారా? యేమిటో యెందుకో ఆ నిబంధనలు! 

యెక్సైజు కానిస్టేబుళ్ల నియామకంకోసం పరుగు పోటీలో, మొన్న 10వ తారీకున ఓ అభ్యర్థి "నాలుగు కిలోమీటర్లని, 20 నిమిషాల్లో" పరుగెత్తడానికి సిధ్ధపడి, రెండు కిలోమీటర్లు పరిగెత్తి, కుప్పకూలి మరణించాడట--కడప లో! 

అసలు అలాంటి పరీక్షలు అవసరమా? ఆ నిబంధన పెట్టినవాడు రౌరవాది నరకాల్లో దేంట్లోకి పోతాడో కదా!

   

Friday, December 7, 2012

కబుర్లు - 98



అవీ, ఇవీ, అన్నీ

ఇంకో "అనుసంధానం"--ప గో జి లో 16 పోలీసు సర్కిళ్లూ, 63 స్టేషన్లూ వున్నాయట. వందలాది ఫిర్యాదుదారులున్నా కేసులు నమోదు అవుతున్నవి చాలా తక్కువట. అందుకని, జిల్లాలోని పోలీసు స్టేషన్ల వివరాలను కంప్యూటర్లో "క్రోడీకరించి", ఆన్ లైన్ కి అనుసంధానం చేసి, దాన్ని "జీ పీ ఆర్ ఎస్" కి అనుసంధానం చేస్తారట. ఇంక 100 కి డయల్ చేస్తే చాలు అక్కడే ఫిర్యాదు నమోదు చేసేస్తారట. 

ఇప్పుడు సాధారణ ఫిర్యాదులు ఓ కంట్రోల్ రూము లోనూ, మరో కంట్రోల్ రూము సీ సీ ఎస్ లోనూ, పట్టణాల్లో సబ్ కంట్రోల్ రూములూ--వేర్వేరు నెంబర్లతో పనిచేస్తూండడంతో బాధితులకి చాలా ఇబ్బంది కలుగుతోందట.

100 కి డయల్ చేస్తే అది నేరుగా ఎస్పీ కార్యాలయంలోని ఒక గదిలో కంట్రోల్ రూముకి వెళ్లి, అక్కడే కేసు నమోదుచేసి, నెంబరు కూడా ఇచ్చేస్తారట. ఆ నెంబరు తీసుకొని, దగ్గరలోని స్టేషనుకి వెళితే, రసీదుతో పాటు ఎఫ్ ఐ ఆర్ కాపీ కూడా ఇచ్చేస్తారట. (దీంతో, "కేసురాయడానికి అవసరమైన స్టేషనరీ అనధికారంగా కొనుగోలు చేసే బాధ" తప్పడం, దళారులపై ఆథారపడకుండా వుండడం జరుగుతాయట.)

ఇంకా అధికారులకి మొత్తం 85 వాహనాలు వున్నాయిగానీ, యేదెక్కడుందో యెవరికీ తెలియదట. ఇప్పుడు వాటికి ప్రత్యేక పరికరాలని అమర్చి, యే వాహనంలో యెవరు యెక్కడున్నారో యెప్పటికప్పుడు తెలుసుకోవచ్చట.

(శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయంటారు కదా.)

ముందు ప్రయోగాత్మకంగా ఒక మండలం లో ప్రవేశపెట్టి, త్వరలో జిల్లా అంతా విస్తరిస్తారట.   ఇంకేం మరి! "అనుసంధానాల" పేరుచెప్పి, అరచేతిలో స్వర్గాలు చూపిస్తున్నారు. కొన్నాళ్లలో మనదేశం పూర్తిగా "ఉటోపియా" గా మారిపోతుందేమో! యేమో--గుర్రమెగరావచ్చు.....అన్నట్టు.

మావూరు (నరసాపురం) లో వీధి విద్యుత్ దీపాలని "అనుసంధానం" చేస్తారట--ఆటోమేషన్ ట్రాకింగ్ పధ్ధతి ద్వారా, ఆన్ లైన్ విధానం లో. మొన్నీమధ్య తెనాలి లో అలా చేశారట. ఈ విధానంతో ఆఫీసులో కూర్చొనే, యెక్కడైనా వీధి దీపాలు వెలిగించడం, ఆర్పడం, వెలగనివాటిని కనిపెట్టి బాగు చేయించడం వగైరాలు చెయ్యచ్చట. మరి అదికాస్తా పడుక్కుంటే యెలాగో వాళ్లు వివరించడం లేదు.

రేపు జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా 51 జిల్లాల్లోనూ, రాష్ట్రంలో 5 జిల్లాల్లోనూ "నగదు బదిలీ" ప్రారంభించేస్తారట.

దీనిలో భాగంగా ప్రస్తుతానికి ఉపకారవేతనాలూ, పించన్లూ మాత్రం బదిలీ చేస్తారట. త్వరలో రేషను సరుకుల దగ్గరనించి యెరువులూ వగైరాలన్నిటికీ నగదు బదిలీ (సబ్సిడీ మొత్తం యెంతైతే అంత) బదిలీ చేసేస్తారట. 

అధికారులేమో ఇంకా అథార్ సంఖ్య జారీనే పూర్తికాలేదు, అందరికీ బ్యాంకు ఖాతాలే లేవు, పైగా ఇప్పటివరకూ అధికారికంగా సమాచారమేలేదు అంటూ వాపోతున్నారట

యేదైతేనేం, ఇది ప్రవేశపెడుతున్నది వోట్లకోసమేకదా? అంటున్నారు ప్రతిపక్షాలు. పీ డీ ఎస్ ని నాశనం చెయ్యడానికీ, ఆ వంకని సబ్సిడీలు తగ్గించి డబ్బులు మిగిల్చుకోడానికే అని కమ్యూనిస్టులంటున్నారు.

అసలు ఈ నగదు బదిలీ యే ప్రాతిపదిక మీద చేస్తారు? ఉదాహరణకి ఒక్కో తెల్లకార్డు మీదా 20 కిలోలు బియ్యం ఇస్తున్నారనుకుందాం. లబ్ధిదారులు చెల్లించవలసినది రూ.20/- మాత్రమే కదా? బియ్యం సరఫరా రేటు కిలోకి రూ.15/- అనుకుందాం. అప్పుడు 'సబ్సిడీ' 20 X 14 = రూ.280/- అవుతుంది. తీరా ఆ సొమ్ముని వాళ్ల ఖాతాలకి బదిలీ చేసేశాక, వాళ్లు అసలు బియ్యమే కొనకపోతే? ఆ 280 వేరే ఖర్చు పెట్టేసుకుంటే?

బ్యాంకులెక్కడో వుంటాయి. పింఛనుదారుడు యెక్కడో వుంటాడు. అందుకని, బ్యాంకునుంచి పింఛనుమొత్తం తీసుకొని లబ్ధిదారుడికి అందించడానికి యెవర్నో నియమిస్తారట! నీ యెడం చెయ్యి తియ్యి, నా పురచెయ్యి పెడతానన్నట్టులేదూ!

అయినా ఇలాంటి సందేహాలు మనలాంటి సామాన్యుల చిన్ని బుర్రలకి వస్తాయిగానీ, ఆ మేధావులకి రాకపోవడం సహజమే కదా!

రాష్ట్ర పోలీసులకి తీవ్రవాదులని యెదుర్కోడానికి వీలుగా, వీపుకి తగిలించుకునే "జెట్ ప్యాక్" లు కొంటారట. ఒక్కోదాని ఖరీదూ రూ.58 లక్షలు మాత్రమేనట. అందుకని ప్రస్తుతానికో నాలుగు మాత్రమే కొంటారట. వాటిని యెవరైనా వీపుకి తగిలించుకొని, ఓ మీట నొక్కితే, దాంతో పాటు గాలిలో యెగిరి పోతారట. 

మరి వాటి "నిర్వహణకి" యెంతవుతుందో? ఆఫీసుల్లో వుండే నిప్పు ఆర్పే యంత్రాలకి, గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదన్నట్టు, అవెప్పుడూ అవసరం రాకపోయినా, నిర్ణీత సమయానికల్లా వాటిలోని ఇంధనాన్ని మారుస్తూ వుంటారు. ఇంకా వాటిని ఉపయోగించడానికి శిక్షణా వగైరాలూ--ఇలాంటివి నిర్వహణ ఖర్చులంటే.     

యెవరైనా తీవ్రవాదులు ఒక ఇంట్లో వుంటే, ఇప్పుడైతే లోపలికి వెళ్లడానికి ప్రయత్నించే పోలీసులని వాళ్లు కాల్చేస్తున్నారట. పోనీ హెలికాప్టరు లో మిద్దెమీద దింపుదామనుకొంటే, చుట్టుప్రక్కల భవనాలవల్ల కుదరడం లేదట. కుదిరినా, వాళ్లనీ దుండగులు కాల్చేస్తున్నారట. 

ఇప్పుడు ఈ జెట్ ప్యాక్ తగిలించుకొని గాల్లో యెగురుకుంటూ వెళితే పాపం వాళ్లని కాల్చరేమో ఆ తీవ్రవాదులు!

ఇలాంటి అవిడియాలు ఇచ్చిన "ఐడియాల్రావు" కి కనీసం ఓ పద్మశ్రీ అయినా పారేస్తారేమో చూడాలి.


   

Sunday, December 2, 2012

కబుర్లు-97


అవీ, ఇవీ, అన్నీ  

ప్ర తె మ ల్లో “మేమూ పాల్గొన్నాం” అని అందరూ భావించేందుకు ఊరూ వాడా మీటింగులూ, వూరేగింపులూ పెట్టడానికి కొన్ని లక్షలో కోట్లో కేటాయించారనుకున్నాం కదా. ఇప్పుడు ఆ సభల నిర్వాహకులు వాళ్లకి వస్తున్న ప్రశ్నలు చూస్తూంటే, “మేం సరిగ్గా చెప్పలేకపోతున్నామా? మా తెలుగు సరిపోవడం లేదా?” వగైరా సందేహాలతో సతమతమౌతున్నారట. “ప్రతినిధులు” మాత్రమే తలా రూ.500/- చెల్లించాలనీ, కానివాళ్లు అఖ్ఖర్లేదు అనీ, (వాళ్లకీ వీళ్లకీ తేడా యేమిటో మాత్రం చెప్పడం లేదు!) ప్రతినిధులకి “మూడు పూటలా” భోజనాలు పెడతాము అనీ, స్థానిక హోటేళ్లలోనూ, తి తి దే వారి వసతి గృహాల్లోనూ వసతి సౌకర్యం—ఇద్దరూ, నలుగురూ, ఆరుగురూ, యెనిమిదిమందీ ఇలా పంచుకొనేలా—కల్పిస్తాము అనీ, వాటికి వేరే రూ.500/- నుంచి రూ.2,000/- వరకూ అద్దె చెల్లిస్తే చాలు అనీ ప్రకటించారు.

మన దువ్వూరివారికి పదవీ గండం పొంచి వున్నట్లనిపిస్తోంది. గౌరవ పిచ్చిదంబరం మాటలని యేమాత్రం చెవిని పెట్టడం లేదు. మొన్న కీలక రేట్లు తగ్గిస్తారని ఆశించారు. ఆ పని చెయ్యకపోవడంతో, “మేమే ఒంటరిగా చర్యలు తీసుకోగలం” అని మేకపోతు గాంభీర్యం ఒలకబోశారు. తరవాత “కొత్త ప్రైవేటు బ్యాంకులకి” లైసెన్సులు ఇవ్వాల్సిందే అన్నారు. ఈయనేమో అదేదో చట్టం చేస్తేగానీ కుదరదు అన్నాడు. మళ్లీ ఈయన ముందు లైసెన్సులు ఇచ్చేస్తే, యేడాదిలోగా తీరిగ్గా చట్టం చేసుకోవచ్చు కదా అన్నాడు. (ఈ లోపల యెన్ని చార్మినార్ బ్యాంకులూ, కృషి బ్యాంకులూ జనాలని ముంచాలో? అలాంటివాళ్లు యెందరు ఆయనమీద వత్తిడి  తెస్తున్నారో?)

అన్నట్టు ఫేస్ బుక్ లో వ్యాఖ్యల విషయమై ఇద్దరు అమ్మాయిలని అరెస్టు చేసిన ఇద్దరు పోలీసు “ఉన్నతాధికారులని” సస్పెండు చేశారట! వాళ్లని కస్టడీకి తరలించాలని ఆదేశించిన “మేజిస్ట్రేట్” మీద కూడా బదిలీ వేటుపడిందట. వాళ్లమీద “తప్పుడు సెక్షన్ల” క్రింద కేసులు పెట్టారని పోలీసులపై శాఖాపరమైన విచారణ కూడా మొదలెట్టారట. మరి ఆ సైనికుల మీద యెవరు చర్యలు తీసుకుంటారో?

రానురానూ వ్యవస్థలో ఒక నిబధ్ధత అనేది లేకుండా పోతోంది. ఇదివరకు న్యాయమూర్తులు వాళ్ల దగ్గర బంధువుల ఇళ్లలో శుభకార్యాలకి కూడా వెళ్లడానికి జంకేవారు. ఇప్పుడలా కాదు. అనేక సంస్థలచేత సన్మానాలూ, గుళ్లలో పూర్ణకుంభ స్వాగతాలూ, శేషవస్త్ర ప్రసాదస్వీకరణలూ వగైరాలతో పేపర్లలో ఫోటోలూ! ఇంక వున్నతాధికారులని చూడ్డానికి వెళ్లినప్పుడు ఒక్క నిమ్మకాయ మాత్రం సమర్పించేవారు. (బహుమతిగా ఫలం ఇచ్చినట్టూ, లంచం ఇచ్చినట్టు వుండకుండానూ). ఇప్పుడు పెద్ద పెద్ద బొకేలతో వెళ్లడం, వాళ్ల పదవీ స్వీకరణలకీ, పుట్టినరోజులకీ, బదిలీలకీ పేపర్లలో శుభాకాంక్షల ప్రకటనలూ! అదేదో పెద్ద తప్పని కాదుగానీ, యెంతో కొంత ప్రభావం వుంటుంది కదా?