Monday, September 27, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

వోక్స్ వేగన్ కుంభకోణంలో మంత్రుల, అధికారుల ప్రమేయం యేమీ లేదట--అలా అని సీబీఐ కేసు దాఖలు చేసిందట.

మన బొచ్చె చేపలోడు 11.87 కోట్లని పట్టుకెళ్లి వశిష్టవాహన్ ఖాతాకి చెల్లించి, తరవాత "సొమ్ములు పోనాయి....యేటి సేత్తాం!" అన్నాడు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వానికి వోక్స్ వేగన్ తో గానీ, వశిష్టవాహన్ తో గానీ వొప్పందమేమీ లేదు.

దీనికి ముందే మరో పన్నెండు మంది తో జర్మనీ వెళ్లి వచ్చాడు. అప్పటికే కంపెనీ నించి తొలగించబడిన షూష్టర్ గురించి వీళ్లకి తెలీదుట!

ప్రత్యేకాధికారి రాఘవేందర్, ఏపీఐఐసీ ఎండీ ఎల్వీ సుబ్రహమణ్యం లని ప్రాసిక్యూట్ చెయ్యడానికి సిబీఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరితే, ఇవ్వకపోగా కనీసం జరిమానా విధించడానిక్కూడా నిరాకరించింది--వై ఎస్ సర్కారు! కానీసం శాఖాపరమైన విచారణకి కూడా అంగీకరించలేదు మరి!

ఇంకెందుకీ దర్యాప్తులూ, కేసులూ?

బ్యాంకింగు సంస్థలు వెర్రితలలు యెలావేస్తున్నాయి అనడానికి ఓ వుదాహరణ, హైదరాబాదులో ఎస్ బీ ఐ స్థాపించిన "కుబేరుల శాఖ"!

అంటే యేమీ లేదు--కనీసం కోటి రూపాయలతోనే అక్కడ ఖాతా మొదలు పెట్టాలట యెవరైనా. అది కూడా మనం వెళితే చెయ్యరు.....బ్యాంకువాళ్లే మనదగ్గరకి రావాలట.

ఖాతాదారులు వేచి వుండేందుకు రాచరిక హోదా వుట్టిపడేలా సోఫాలూ, ఫ్రిజ్, కూల్ డ్రింకులు, పళ్ల రసాలు, నీటి సీసాలు, టీ, కాఫీ, అన్నీ వుంటాయట. ప్రముఖ వాణిజ్య పత్రికలూ వుంటాయట. ఇంకా సెమినార్ హాలూ, ఇంటర్నెట్, ఫాక్స్, ఫోను, విడియో కాన్‌ఫరెన్స్ హాలూ, వున్నాయట.

ఇంకా, పదిహేను కాబిన్లలో లాకర్లు వుంటాయట--యేదైనా ఫంక్షన్ కి వెళ్లాలంటే, లాకర్లలోని ఆభరణాలు తీసుకొని, ముస్తాబవ్వడానికి డ్రెస్సింగ్ రూములు కూడా వుంటాయట!

........ఇంకా చాలా చాలా వున్నాయట.

బుధ్ధున్న కోటీశ్వరుడెవరైనా ఆ శాఖకి స్వయం గా వెళ్లి ఈ సౌకర్యాలన్నీ అనుభవిస్తాడా?

మామూలుగా యే బ్యాంకు శాఖలోనైనా, యెంత పెద్ద కంపెనీ ఖాతా వున్నా, లావాదేవీలకోసం తమ సంస్థ లోని అతి చిన్న గుమాస్తానే పంపిస్తాయి. వాడినే ఈ బ్యాంకులు ఆ సంస్థ జనరల్ మేనేజరో, సీ ఈ వో నో అన్న లెవల్లో ట్రీట్ చేస్తాయి. మరి ఈ భేషజాలెందుకు?

అమెరికాలో బ్యాంకు శాఖలకి వెళ్లేవాళ్లే తక్కువ. వెళ్లేవాళ్ల కోసం అక్కడ చక్కని యేర్పాట్లు వుంటాయి. పిల్లలకి ఫ్రీ గా చాక్లెట్లూ, వేఫర్లూ వగైరా వుంచుతారు!

మన బ్యాంకులు కూడా, తమ శాఖలనన్నింటినీ కనీసం ఏసీ చేయించి, పెన్షనర్ల/గంటలతరబడి వేచి వుండే వాళ్ల  కోసం కాస్త టీ నీళ్లు పొయ్యగలిగితే, యెంతబాగుంటుంది? 

బోగస్ సంస్థలు వెర్రి జనాలని మోసాలు చేస్తూనే వున్నాయి.

యేలూరు, నరసిం హారావుపేటలో, యేడాది క్రితం "తేజ మార్కెటింగ్ అండ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్" పేరుతో సంస్థ స్థాపించి, ప్రతీ వ్యక్తి దగ్గరా రూ.549/- వసూలు చేసి, సంవత్సరం తరవాత మీకు యేకం గా "లక్ష" రూపాయలు ఇస్తాము అనీ, ఒకవేళ ఆ వ్యక్తి మరణిస్తే తక్షణం లక్ష చెల్లిస్తామనీ చెపితే, జనం యెగబడ్డారట.

దాదాపు 3 వేల మంది నించి వసూళ్లు చేసి, 20 నించి 30 లక్షలదాకా అందరినీ ముంచి, బోర్డు తిప్పేశాడట నిర్వాహకుడు!

అసలు ఈ సంస్థ యే నిబంధనల క్రింద, యే లైసెన్సులతో వ్యాపారం ప్రారంభించింది అని పట్టించుకోని అధికారులూ, పోలీసులూ, ఇప్పుడు తీరిగ్గా, ఛీటింగ్ కేసు తో పాటు డిపాజిటర్స్ ఆక్ట్, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారట!

సామాన్య వ్యక్తి యెవరైనా బంగారం తాకట్టు పెట్టుకొని, తెలుసున్నవాళ్లకి అప్పిస్తే, "పాన్ బ్రోకర్ లైసెన్స్" లేదు అని కేసులు పెట్టిన వుదంతాలు నాకు తెలుసు.

అలాంటిది, ముథూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ సంస్థలు గత రెండేళ్లుగా తమ వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా యెలా పెంచుకోగలుగుతున్నాయి? వాటి నిర్వహణ మాటేమిటి? అవి బోర్డు తిప్పేస్తే జరిగే పరిణామాలేమిటి? అని యెవరైనా ఆలోచిస్తున్నారా?

Saturday, September 25, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ


MGF.....EMAAR.....APIIC.....కొన్ని వేల యెకరాలు.....కొన్నివేల కోట్ల కుంభకోణం.....ఇవన్నీ అందరూ రోజూ చదువుతున్న, వింటున్న మాటలే.

తాజాగా, భారత సొలిసిటర్ జనరల్ నుంచి, ఏపీఐఐసీ నియమించిన నిపుణుల కమిటీ వరకూ--ఇది నిజం గా దోపిడీయే అని ముక్తకంఠం తో చెపుతున్నారట. అయినా మన ప్రభుత్వం మీనమేషాలు యెందుకు లెక్కిస్తోందో--అంటున్నారు.

మన రాజకీయులు, "సభా సంఘాన్ని వేయాలి", "సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి", "సిటింగ్ జడ్జ్ చేత విచారణ" వగైరా అంటారు.

ఇంకా విచారణలెందుకో! ప్రభుత్వం ఇప్పుడు కేసులు పెట్టకుండా, ఆనక తీరిగ్గా 'విచారిస్తూ' కూచుంటుందేమో! అదేకావాలి దోపిడి దొంగలకీ, వాళ్ల తైనాతీలకీ!

వై ఎస్ ఆర్, చంద్రబాబు, ఐశ్వర్యరాయ్, ఎన్ టీ ఆర్--వీళ్లంతా రెండేళ్ల క్రితం గ్రూప్-4 వుద్యోగాలకోసం ఆన్ లైన్ లో మన ఏపీపీఎస్సీకి దరఖాస్తు చేశారట!

ఇంకా అనేకమంది సినీతారలూ, రాజకీయ నాయకులూ, కొన్ని పువ్వులూ, ప్రకృతి దృశ్యాలూ కూడా దరఖాస్తు చేశారట. ఫీజు యెంత కట్టారు? అని అడిగిన చోట, "నీకూ బే....బే, నీ ఫీజుకీ బే....బే...." అని వ్రాశారట!

మొత్తం వచ్చిన 12 లక్షల దరఖాస్తుల్లో, 1,60,000 ఇలాంటి దరఖాస్తులేనట!

ఇంతకీ, యెవడో సాఫ్ట్ వేర్ అమ్మితే, మన పిచ్చి పుల్లయ్య-వేమవరం అధికారులు, దాన్ని పరిశీలించకుండానే కొనేసి, వాడేశారట! (అంతేనో--వాళ్లకి ముట్టాల్సింది ముట్టి, మనం పిచ్చి పుల్లయ్యలమో!)

దరఖాస్తులన్నీ సరిగ్గా క్రోడీకరించడానికి పాపం సిబ్బంది నిజంగా చమటోడ్చారట.

ఇప్పుడు, ఫీజుకి సంబంధించిన చలానా నెంబరు వుంటేనేగానీ, దరఖాస్తు సమర్పణ అవకుండా మార్చారుటలెండి. ఇక చూద్దాం.

మొన్న బిల్ గేట్స్ యేమన్నాడో విన్నారా?

ఇప్పటికే తమ ఫౌండేషన్ కి ఇచ్చిన 1,26,000 కోట్లు పోగా, మిగిలిన 2,38,000 కోట్ల ఆస్థిని కూడా నా పిల్లలకి ఇవ్వను--అన్నాట్ట. కొంచెం మొత్తం మాత్రమే ఇస్తాను--నా ఆస్థి అంతా ప్రజాసేవకే అనికూడా అన్నాట్ట.

అన్నట్టు, ఖైరతాబాద్ వినాయకుడి వెరయిటీ చూశారా? అసలు తలకి చెవుల వెనుక ఓ రెండుతలలూ, కిరీటం లోంచి చెరోప్రక్కా రెండుతలలూ మొలిచి, పంచ ముఖుడు అయ్యాడు!

నిడదవోలు, సమిశ్రగూడెం కాలువలో నిమజ్జనం సమయంలో గల్లంతయిన ఓ కుర్రాడి మృతదేహం 21-09-2010 న లభించిందట. స్కోరు ఒకటి పెరిగింది.

మన జిల్లాల్లో ఆథార్, రాజధాని లో ఆథార్--యేమయ్యాయో గానీ, తొలి ఆథార్ సంఖ్యని 29 న మహారాష్ట్రలోని నందూర్ బార్ జిల్లా, షహడా గ్రామ గిరిజనులకి కేటాయిస్తారట మన్మోహన్ సింగ్. సోనియా కూడా ఈ కార్యక్రమం లో పాల్గొంటారట. ఆ గ్రామ ప్రజలందరికీ ఆ రోజున 12 అంకెల గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులు అందజేస్తారట.
....................................................................................................................................................................
23-09-2010 న హైదరాబాదు ఎక్స్ ప్రెస్ కి తప్పిన ముప్పు--చెన్నై హైదరాబాదు ఎక్స్ ప్రెస్ నాయుడుపేట చేరేసరికి, ఇంజన్ వెనుక రెండో బోగీ చక్రం బ్రేకు పట్టేసి మంటలు లేచాయట. చైన్ లాగి ఆపేస్తే, తరవాత గూడూరులో మరమ్మత్తులు చేసి పంపించారట. (ఆ మధ్యలో యేమిచేశారో పేపర్లో వ్రాయలేదు)
....................................................................................................................................................................
23-09-2010 నే, రాష్ట్రపతి కోల్కత్తా నించి ఐజ్వాల్ ప్రయాణిస్తున్న విమానం మూడు నిమిషాలపాటు యే రాడార్ లోనూ కనిపించలేదట. ప్రత్యామ్నాయ యేర్పాట్లు చేస్తూండగా తిరిగి కనిపించి, అధికారులు ఊపిరి పీల్చుకున్నారట!

Thursday, September 23, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

సంగతి విన్నారా?

అరవ్వాళ్లెంతకైనా తగుదురు. 

మనం సినిమాల్లో, పిల్లల్ని యెత్తుకుపోయి, వాళ్ల కాళ్లనీ, చేతుల్నీ విరగ్గొట్టి, కళ్లు పొడిచేసి, వాళ్లని అడుక్కొనేవాళ్లలా తయారుచేసి, ఆ డబ్బులతో బాగుపడే విలన్లని చూశాం.

హాస్య సన్నివేశాల్లో, రక రకాల దొంగతనాలు చెయ్యడం లో శిక్షణ ఇచ్చే "దొంగల బడి" లని కూడా చూశాం.

సాక్షాత్తూ అలాంటి దొంగల బడే, తమిళనాడు లోని తిరుచ్చి సమీపం లో, రాంజీనగర్ ప్రాంతం లో నడపబడుతూందట! అందులో సీనియర్లు, కొత్తవాళ్లకి దొంగతనాలు చెయ్యడం లో మెళుకువలు నేర్పిస్తున్నారట! దాని ఫలితమే, మొన్న వైజాగ్ ఏక్సిస్ బ్యాంకు వద్ద 13.10 లక్షల చోరీ జరిగిందట!

వాళ్లు ఇతర రాష్ట్రాల్లో మాత్రమే దొంగతనాలు చేసి, రాంజీనగర్ ప్రాంతంలో మాత్రం, పెద్దమనుషులుగా చెలామణీ అవుతున్నారట.

సాక్షాత్తూ, విశాఖ పోలీసు కమీషనర్ పూర్ణ చందర్రావు దర్యాప్తులో ఈ విషయం బయటపడి, విస్మయం చెందారట!

అందానికి నేనూ, రాగానికి మాయప్పా అన్నట్టు, మళయాళ సోదరులేమీ తక్కువ తినలేదు.

ముథూట్ ఫైనాన్స్, మణుప్పురం గోల్డ్ పేర్లతో, గత సంవత్సరమున్నరగా, మన రాష్ట్రం లోని బంగారాన్ని దోచుకొంటున్నారు. ఈ కుంభకోణం యెప్పుడు "భడేల్" మంటుందో.....రిజర్వ్ బ్యాంకూ, ప్రభుత్వాలేమంటాయో......పైవాడికే యెరుక!

"తెలంగాణా వుద్యమంలో నేనూ, మా ముసల్దీ (భార్య) మాత్రమే పాల్గొంటామని, తనకేమీ రాజకీయ వాంఛలు లేవని, కే సీ ఆర్ పదేళ్ల క్రితం చెప్పాడు. ఇప్పుడు యెక్కడ చూసినా, వాళ్ల కుటుంబ సభ్యులే కనిపిస్తున్నారు--అని విమర్శించిందట--తెలుగుదేశం!

మొన్న, కర్ణాటక సంగీత విద్వాంసుడు అమ్మనమంచి బలరామ శాస్త్రి ని కంచి పీఠం ఆస్థాన విద్వాంసుడిగా నియమించిందట. ఈయన ఇంతవరకూ 1045 గాత్ర కచేరీలు చేశారట. తాడేపల్లి గూడెం లో అమ్మనమంచి సోదరులు నలుగురూ ప్రఖ్యాత విద్వాంసులే.

గొప్పగా చెప్పుకోవడమే గానీ, నాకు ఆయన తో యే చుట్టరికం వుందో ఆయనకీ తెలీదు, నాకూ తెలీదు. యెప్పుడో తీరిక దొరికినప్పుడు పరిశోధన ప్రారంభించాలి.

పీనాసైనా రోశయ్య గట్టోడని వొప్పుకుంటారా?

ఇప్పుడు మార్కెట్లో బియ్యం ధరలు బాగా తగ్గుతున్నాయట. ఇన్నాళ్లూ మిల్లర్లు, తమదగ్గర ధాన్యం, బియ్యం నిలవలు వుండిపోయాయనీ, వాటిని ఇతర రాష్ట్రాలకీ, దేశాలకీ, యెగుమతి చెయ్యడానికి అనుమతి ఇవ్వకపోతే, వచ్చే ఖరీఫ్ లో ధాన్యం యెలాగ కొంటాము అనీ బెదిరించీ, మొత్తుకొనీ, చివరికి కాళ్లా వేళ్లా పడ్డా, రోశయ్య "మీరు అరిచి గీపెట్టినా....ససేమిరా" అన్న లెవెల్లో, నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయాడు.

ఇప్పుడు చచ్చినట్టు ఈ మిల్లర్లు ఆ బియ్యాన్ని, ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు--అందుకే ధరలు తగ్గుతున్నాయట!

కూడోస్ టూ రోశయ్య!

Monday, September 20, 2010

కబుర్లు



అవీ, ఇవీ, అన్నీ

మన దేశ అత్యున్నత న్యాయ స్థానం, బోధన ఫీజుల చెల్లింపుల వ్యవహారం లో వెసులుబాటు బాగానే ఇచ్చిందిట. బోధనఫీజుల పథకం వర్తించే విద్యార్థులు ఫీజులు చెల్లించనక్కరలేదని విద్యార్థులకీ వూరట కలిగించిందట. ప్రభుత్వం ఈ ఫీజులని మూడు విడతల్లో కళాశాలలకి చెల్లించవచ్చట. బాగానే వుంది.

గొడవేమిటంటే--బీ సీ సంక్షేమ శాఖలో తగిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులూ లేవట. ఒక్కో క్షేత్ర స్థాయి అధికారీ 300 నించి 1000 కళాశాలల దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారట. అందిన 15 రోజుల్లో దరఖాస్తుని పరిష్కరించాలని నిబంధనట.

మరోవైపు, జిల్లా, మండల స్థాయిలో కంప్యూటర్లూ, ఇంటర్నెట్ లేకపోవడం తో, కాలేజీలు దరఖాస్తులన్నీ స్కాన్ చేయించి, ఆన్ లైన్ లో పంపించాల్సి వస్తోందట. ప్రభుత్వ కళాశాలలైతే యెప్పుడూ కంప్యూటర్ మొహమైనా చూడలేదట!

అదండీ సంగతి. వచ్చే ఒలింపిక్స్ లో "కంప్యూటర్ బాల్ గేము" (కంప్యూటర్లని సరఫరా చెయ్యడం, మూల పారెయ్యడం, మళ్లీ సరఫరా చెయ్యడం ఇలా) అని ఒకటి పెడితే, మనదేశానికి బంగారమేం ఖర్మ, యేకం గా ప్లాటినం పతకమే వచ్చేస్తుంది.

అన్నట్టు, ఈ మధ్య మా జిల్లాలో ఓ వూళ్లో ఓ రాజుగారు, "గో మూత్రం" తో నడిచే గడియారాన్ని కనిపెట్టి, ప్రదర్శించారు. చాలా బాగుంది. కానీ, ఈ గడియారాల్ని టేబులుమీదో, గోడమీదో తగిలించుకోడం చాలా కష్టం. పైగా ఈ రోజుల్లో ఆభరణం గా కూడా చాలామంది గడియారాలని ధరించడం లేదు.

ఇంకొంచెం పరిశోధన చేసి, ఓ యాభైవేల లీటర్లో యెంతో మూత్రం తో వాళ్ల ఇంటికీ, వీధికీ కరెంటు వుత్పత్తి చెయ్యగలిగితే చాలా బాగుంటుంది. పరిశోధనలకి కావాలంటే, ప్రభుత్వ సహాయాన్ని అర్థించవచ్చు.

మన తెలుగు బ్లాగర్లు తమ బ్లాగుల ద్వారా "అందరికీ" వినాయకచవితి, రంజాన్ శుభాకాంక్షలు అందించే స్థాయికి యెదిగారు కానీ, మొన్న మన స్వాతంత్ర్య దినోత్సవాల్లో, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన--రోశయ్యగారు తిలకించిన, వేడుకల్లో, పిల్లల చేత "శుక్లాంబరధరం", "శాంతాకారం, గగన సదృశం", "మహా గణపితిం మనసా స్మరామి" అంటూ నృత్యాలు చేయించారు! (జాతీయ పండుగలకీ, ఇతర మతాలవారికీ సంబంధం లేదు అని సందేశమా?)

మన రా నా లు గానీ, బ్లాగర్లు గానీ పట్టించుకోలేదు! నేనైతే, ఆ నిర్వాహకుల్ని శంకరగిరి మాన్యాలు పట్టించేవాణ్ని.

ఓ స్కూల్లో, మన అబ్దుల్ కలాం లాంటి పెద్దాయన, విద్యార్థులందర్నీ మీరు పెద్దయ్యాక యేమి అవదలుచుకున్నారో చెప్పమంటే, ఒక్కొక్కళ్లూ--నేను ఇంజనీర్ని కావాలనుకుంటున్నాను, అవగలను; నేను డాక్టరుని కావాలనుకుంటున్నాను, అవగలను; నేను దేశానికి అధ్యక్షుణ్ని కావాలనుకుంటున్నాను, అవగలను--ఇలా చెపుతున్నారట.

ఓ అమ్మయి నేను పెళ్లిచేసుకొని, ఓ నలుగురు పిల్లలకి తల్లయి, మంచి గృహిణి అవగలను అందట.

తరవాత అబ్బాయి, నా ప్రక్క అమ్మాయికి నా సాధ్యమైనంత సహాయం చేస్తాను, చెయ్యగలను--అన్నాడట.

ఇలా వుంటాయి కాబోయే యువతరం వూహలు!


Sunday, September 19, 2010

కబుర్లు


అవీ, ఇవీ, అన్నీ

శ్రావణ భాద్రపద మాసములు వర్షర్తువు--వర్షములు (వానలు) బాగుగా కురియును..........

యెక్కాలపుస్తకం లో యే ఋతువులో యేమిజరుగుతుందో వివరించే భాగంలోది ఇది.

ఈ కాలం లో బుధ్ధున్నవాడెవడూ ఇల్లు కట్టడం మొదలు పెట్టడు.

ఓ ప్రక్కన సిమెంటు కంపనీలు వారం క్రితం బస్తాకి ఓ ముఫ్ఫై రూపాయలూ, ఇప్పుడు మళ్లీ ఓ నలభై రూపాయలూ పెంచి, 200 దాటించాయి.

మన సోకాల్డ్ బ్యాంకింగ్ నిపుణులు మాత్రం, మొన్న రిజర్వ్ బ్యాంక్ రెపో/రివర్స్ రేట్లు ఓ పావలా, అర్థ పెంచగానే, "నెలాఖరు దాకా ఋణాలమీద వడ్డీలు పెరిగే ఛాన్స్ లేదు--ఇప్పుడే ఇళ్లు కట్టేసుకోండి!" అని సలహా ఇస్తున్నారు.

అసలు ఇళ్లు కట్టాలనుకొనేవాళ్లు (కొనుక్కునేవాళ్ళు) యెన్ని చూసుకోవాలి?

వీళ్ల దృష్టిలో వాళ్లందరూ అన్నీ సిధ్ధం చేసేసుకొని, బ్యాంకులు వడ్డీ రేట్లు ఓ పావలా యెప్పుడు తగ్గిస్తాయా అని గోతికాడ నక్కల్లా యెదురుచూస్తూ వుంటరన్నమాట. (ఈ లోపల పుణ్యకాలం కాస్తా కుక్కెత్తుకుపోదూ!)

దటీజ్ అవర్ ఎక్స్ పర్ టైజ్!

ఇక బ్యాంకులు, ఈ పండగల సీజన్ పూర్తయ్యేవరకూ, గృహ వగైరా ఋణాలమీద "టీజర్" రేట్లు కొనసాగుతాయంటున్నారు. (అంటే సామాన్యులందరూ పండగలు మానేసుకొని బ్యాంకుల చుట్టూ, కడుతున్న ఇళ్ల చుట్టూ తిరగాలనా?)

నిజానికి ఈ విధానాలవల్ల బాగుపడుతున్నది రియల్ ఎస్టేట్ వాళ్లు మాత్రమే!

ఇక ప్రణబ్ ముఖర్జీగారు, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి 'యెలాంటి చర్యలైనా సరే' తీసుకోవాలని సలహా ఇస్తే, మన దువ్వూరివారు, పెంచింది ఓ పావలా, అర్థా!

అయినా ద్రవ్యోల్బణం దిగొస్తున్న దాఖలాల్లేవు. అహార ద్రవ్యోల్బణం 11-12 నించి దిగడం లేదు. ఇక ఇప్పుడు ఈ పండుగల రూపం లో కాయగూరలూ, పప్పులూ, నూనెలూ, బియ్యం మొదలైనవాటిలో జరిగే వృధా వల్లా, ఈ వర్షాల వల్లా, ఇప్పుడప్పుడే పెరగడం మానుతుందనుకోవఖ్ఖర్లేదు.

వృధ్ధి రేటు మాత్రం, 9 వరకూ, 8.5 వరకూ, కనీసం 7.50 వరకూ వుంటుందని అంచనాలు!

పండగరోజుల్లో, రైళ్లలో, బస్సుల్లో రద్దీ గురించి చెప్పఖ్ఖర్లేదు. 295/- రూపాయల స్లీపర్ టిక్కెట్టుని 900/- కీ, 499/- రూపాయల థర్డ్ ఏ సీ టిక్కెట్ కి 1800/- నించి 2000/- రూపాయలూ పెట్టి తీసుకొన్నారట--మొన్న పండగకి.

వోల్వో బస్సుల్లో 800/- నించి 850/- టిక్కెట్టుకి 1200/- నించి 1500/- వరకూ చెల్లించారట.

ఈ-టిక్కెట్లని సరిగ్గా చెక్ చెయ్యకపోవడం తో, దళారులు ఒకే టిక్కెట్టు మీద ఆరుగురికి బుక్ చేసి, అందరికీ జిరాక్సులు ఇచ్చి, తమకు తోచిన ధర వసూలు చేస్తున్నారట!

ప్రత్యేక రైళ్లలోకూడా, ప్రకటించిన గంటలోపే అన్ని టిక్కెట్లూ 'హూష్....కాకీ' అయిపోతున్నాయట!

వచ్చే పండగల్లో యెలా వుంటుందో?

మన రైల్వేలు ఇక బాగుపడతాయంటారా?

రజనీకాంత్ సినిమాకి తమిళ పేరు వుంటే గానీ కుదరదు అని "యందిరన్" అనే పేరుతో విడుదల చేస్తున్నారట. తెలుగులో "రోబో" పేరుతోనే విడుదల అవుతుందట.

కమ్ముల శేఖర్ మాత్రం, "నాకు తెలుగు పేరు తట్టలేదు అందుకనే నా సినిమా పేరు ఇంగ్లీషులో పెట్టాను" అంటున్నాడు.

యెంత భాషాభిమానమో (వాడికీ మనకీ కూడా)!

Wednesday, September 8, 2010

దండుమారాజులు


ఆధునికీకరణ

గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల్ని 'బలోపేతం' చెయ్యడానికి, గ్రామ సమాఖ్యలకి 'అంకోపరులు' (లేప్ టాప్ లు) అందజేస్తారట--ప్రభుత్వం వారు.

(ప గో) జిల్లాలో మొత్తం 1,728 గ్రామ సమాఖ్యలుండగా, పైలెట్ ప్రాజక్టుగా వీటిలో ఓ 100 సమాఖ్యలకి ప్రస్తుతం ఇవి అందజేస్తారట. (ఒక్కోదాని ఖరీదెంతో తెలీదు. బహుశా యే రూ.35,000/- లో అయ్యుండవచ్చు.)

ఓ మండలం లో వుండే కొన్ని వేల స్వయం సహాయక సంఘాలకి ఓ సమాఖ్య వుంటుంది. సంఘాల సంఖ్య యెక్కువైతే, రెండు మూడు సమాఖ్యలు కూడా వుండచ్చేమో.

ఈ స్వయం సహాయక సంఘాలగురించి అందరికీ తెలిసున్నదే! కొన్నింటిని మినహాయిస్తే, చాలా వాటిలో సభ్యులూ, నాయకురాళ్లూ అందరూ నిరక్షరాస్యులే!

బ్యాంకుల బలవంతమ్మీద, నాయకురాళ్లు మాత్రం తమ పేరు (కనీసం అక్షరాలు తెలిసేలా) వ్రాయడం నేర్చుకొన్నారు. దేనికీ సరైన రికార్డులు వుండవు.

వాళ్లకి ఋణాలు మంజూరు చెయ్యడానికీ, నవీకరించడానికీ, బ్యాంకర్లు పడుతున్న పాట్లు యెవరికీ తెలియదు. (వెలుగు పధకం వాళ్ల వల్ల కొంత బాధ తగ్గింది--కనీసం బ్యాంకులకోసం వాళ్లచేత పుస్తకాలు నిర్వహింపచేసి, సంతకాలు పెట్టిస్తున్నారు.)

మరి వీళ్లు ఈ లేప్ టాప్ లు--అదీ ఈ-బుక్ కీపింగ్ సాఫ్ట్ వేర్ తో--యెలా వుపయోగిస్తారో? పైగా, హైదరాబాదు నించే వీటిని పర్యవేక్షిస్తూ వుంటారట!

2000 వ సంవత్సరం నించీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ నించీ, మిగిలిన ప్రభుత్వ శాఖలన్నిటికీ--ఆధునికీకరణ, అనుసంధానం పేరుతో, యెన్ని కంప్యూటర్లకి యెంత ఖర్చు పెట్టారో, ఇప్పటిక్కూడా యే శాఖలోనూ పూర్తిస్థాయిలో ఇవి యెందుకు పని చెయ్యడం లేదో యెవరైనా అరా తీస్తే బాగుండును!