Tuesday, May 31, 2011

కబుర్లు - 52

అవీ, ఇవీ, అన్నీ

"హింస" బిల్లు అని వొహటి పుట్టుకొచ్చిందట మన యూపీయే పాలకుల్లో......తమ అవినీతిపూరిత జమానా నుంచి సామాన్యుల దృష్టి మరల్చేందుకూ, ప్రత్యర్థి బీజేపీని ఇరుకులోపెట్టి, చోద్యం చూసేందుకూ!

ఇటాలియమ్మ సోనియా సారధ్యంలోని "జాతీయ భద్రతా మండలి" (ఎన్ ఎస్ సీ) "కుల, మత, ప్రాంత, భాషా పరమైన వర్గాలను లక్ష్యంగా చేసుకొని సాగే హింసను యెదుర్కొనేందుకు (ప్రభుత్వం) కఠినంగా వ్యవహరించాలి" అనే ప్రాతిపదికపై, ఈ ముసాయిదా తయారయ్యిందట!

"1984 ఢిల్లీ సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ ముస్లిం వ్యతిరేక దాడులు, ఒడిస్సాలో క్రైస్తవ వ్యతిరేక దాడులు.....వంటి వాటికి అడ్డు కట్ట వేసేందుకు......" ఆవిడ ఆ బిల్లు తెస్తోందని కొంతమంది "విశ్లేషకులు" భావిస్తున్నారట.

దేశంలో యెక్కడైనా "మత హింస" చెలరేగినప్పుడు దాన్ని అడ్డుకోవటంలో కేంద్రం జోక్యం చేసుకునే "అవకాశం కల్పించడమే" ఈ బిల్లు ప్రత్యేకత(ట).

ఇప్పటివరకూ, యెక్కడైనా శాంతి భద్రతలని పరిరక్షించాల్సిన బాధ్యత, రాజ్యాంగం ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలదే

(అందుకే పీవీ జీ బాబ్రీ మసీదు కూలగొట్టేస్తున్నా, ఆ రాష్ ట్ర ప్రభుత్వ 'బాధ్యత' లో జోక్యం చేసుకోలేక పోయాడు!)

మరిప్పుడు, దొడ్డి దారిన రాష్ట్ర బాధ్యతలని వాటినుంచి బలవంతంగా తప్పిస్తూ, ఇంత అర్జంటుగా ఈ బిల్లు తేవలసిన ఆవశ్యకత యేమి వచ్చింది.....ప్రజల దృష్టిని మళ్లించడానికి కాకపోతే?

ఈ ముసాయిదా మెజారిటీ ప్రజల పట్ల వివక్షను ప్రదర్శిస్తోందనీ, టాడా చట్టాలకన్నా ప్రమాదకరంగా వుంది అనీ, భాజపా వారు తీవ్రంగా దుయ్యబడుతున్నారట.

కపిల్ సిబాల్ మాత్రం, మా ప్రభుత్వం ఈ బిల్లు విషయంలో పూర్తిగా కట్టుబడి వుంటుంది అన్నాడట!

ఈ ముసాయిదాపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ, సలహాలూ సూచనలూ ఇచ్చేందుకు (మాత్రమేనా?) జూన్ 4 వరకూ (ఇంకో నాలుగురోజులు మాత్రమేనా?) గడువు ఇచ్చారట!

రాష్ట్రంలో కేసీఆర్, కోదండరాం, నాగం లకి 'తెలంగాణా' ఓ అస్త్రమైతే, సోనియాకి ఈ కొత్త "హింస" బిల్లు ఓ ప్రత్యేకాస్త్రం! హమ్మ...యెంత యెత్తు యెత్తిందీ??!!

బాబులూ.....సూచనలు, సలహాలు వెంటనే ఇస్తారా? "ఇటాలిబాన్" కుట్రకి తలవొగ్గుతారా?

మొదలెట్టండి మరి!

*   *   *

"అప్రూవరు సాక్ష్యం".....ఇదో చిత్రమైన "న్యాయ సూత్రం" అంతర్జాతీయంగా గుర్తింపు వున్నదీ, అన్ని దేశాల్లోనూ అమల్లో వున్నదీనూ.

అంటే, ఒకడికన్నా యెక్కువమంది ఓ నేరం చేసినప్పుడు, వాళ్లలో వొకడు "అప్రూవరు"గా మారితే, వాడు తన నేరాన్ని వొప్పుకొంటూ, మిగతావాళ్ల నేరానికి కూడా సాక్ష్యం చెప్పి, వాళ్లకి శిక్షపడడానికి సహకరిస్తే, అప్రూవరుకి 'అసలు నేరం' క్రింద కాకుండా, మిగతా నేరాల్లో అతి చిన్న శిక్షని విధింపబడేలా చేస్తామని వాడితో దర్యాప్తు అధికారులూ, వారి పై అధికారులూ, మంత్రులూ, ప్రభుత్వాలూ 'వొప్పందం' చేసుకొని, వాణ్ని సాక్షిగా కోర్టులో ప్రవేశపెట్టడమే--అప్రూవరు సాక్ష్యం!

వుదాహరణకి ఓ హత్య జరిగిందనుకోండి, అందులో నలుగురైదుగురు కలిసి చేశారనుకోండి, వాళ్లలో వొకడు కత్తితో పొడిచాడు, ఇంకొకడు హతుడి పెడరెక్కలు విరిచి పట్టుకొన్నాడు, ఇంకొకడు హతుడు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు, ఇంకొకడు ఆ గది బయట, ఇంకెవరూ రాకుండా కాపలా కాస్తున్నాడు, ఇంకొకడు ఆ యింటి ప్రహరీ బయట నుంచొని, యెవరైనా అటు వస్తే 'విజిలు' వేస్తానని వొప్పుకొని, అక్కడే వున్నాడు. 

వీళ్లందరినీ పోలీసులు పట్టుకొన్నారు....వివిధ సెక్షన్ల ప్రకారం, "హత్య, హత్యా ప్రయత్నం, హత్యకి సహకరించడం, కుట్ర, కుట్రలో భాగస్వాములవడం, తప్పించుకోడానికి ప్రయత్నించడం, తప్పించుకోవడం, సాక్ష్యాలని తారుమారు చెయ్యడానికి ప్రయత్నించడం, తారుమారు చెయ్యడం....." ఇలా కేసులు పెడతారు ఆ ఐదుగురిమీదా. 

ఇంకా, హత్యల్లో చాలా రకాలున్నాయి--ప్రీ ప్లాన్‌డ్ మర్డర్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్, ఇంటెన్షనల్ మర్డర్, అన్ ఇంటెన్షనల్ మర్డర్, ఏక్సిడెంటల్ మర్డర్, మ్యాన్ స్లాటర్, మర్డర్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్, మర్డర్ ఫర్ ఆనర్, సైకోపాతిక్ మర్డర్, స్కిజోఫ్రెనిక్ మర్డర్, స్ప్లిట్ పర్సనాలిటీ మర్డర్......ఇలా కొన్ని వందల రకాలు!

ఈ గొడవంతా యెందుకంటే, 26/11 కేసులో "అప్రూవరు"గా మారిన డేవిడ్ హెడ్లీ అమెరికాలోని షికాగో జిల్లా కోర్టులో అనేక విషయాలు వెల్లడించాడట!

(వివరాలు మీరడిగితే మరోసారి!)

*   *   *

యెప్పుడు కట్టారో తెలీదుగాని, యేలూరులో 'ప్రాచుర్యం పొందిన' "ధన్వంతరి" మందిరం వుందట. యెవరు, యెప్పుడు, యెలా సంపాదించారోగాని ఆయన కలర్ ఫోటో కూడా ప్రతిష్టించినట్టున్నారక్కడ. పేపర్లో ఫోటో చూస్తే అలానే అనిపిస్తూంది.

చెఱకుడూ, శుశ్రుతుడూ వగైరాల కలర్ ఫోటోల అన్వేషణలో వున్నారో, లేక ఇప్పటికే యెక్కడైనా వాళ్లకీ మందిరాలు కట్టేశారో, పేపర్లో వార్తా, ఫోటో వస్తేగానీ తెలియదు.)

మొన్నెప్పుడో ఓ రోజు, 'పరమహంస పరివ్రాజకాచార్య' మైసూరు దత్తపీఠం 'ఉత్తరాథిపతి' శ్రీదత్త విజయానంద తీర్థస్వామీజీ ఆ మందిరాన్ని సందర్శించిన సందర్భంగా, "ధన్వంతరీ వైద్య భగవాన్"ను సేవించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిధ్ధిస్తాయి అని పేర్కొన్నారట. (కార్పొరేట్ ఆసుపత్రులవాళ్లూ, ఆరోగ్యశ్రీ పథకాలూ, 108, 104 లూ యేమైపోవాలో మరి?)

భగవాన్ కు విశేషార్చనలూ, స్వామి అనుగ్రహభాషణం......మామూలే.

అదీ సంగతి.

*   *   *

అదేరోజు, 138 చక్రాల, రైలంత పెద్ద ట్రాలీ వోటి ఢిల్లీకి వెళుతూండగా, పెరవలి దగ్గర్లో జాతీయరహదారిపై "హోర్డింగులు" అడ్డు వచ్చాయట. ట్రాలీని ఆపేసి, తెలివిగా చక్రాల్లోని గాలిని వీలైనంత తగ్గించి, యెత్తు తగ్గాక, చక్కగా వెళ్లిపోయారట, మళ్లీ గాలి నింపుకొని!

గొప్పేగానీ, దారిలో అనేక వంతెనలు బలహీనంగా వున్నాయి అంటూ మొత్తుకుంటున్న ప్రభుత్వ శాఖలని ప్రక్కనబెట్టి, అలాంటివాటికి అనుమతులు యెవరు ఇస్తున్నారో? 

Saturday, May 28, 2011

కబుర్లు - 51

అవీ, ఇవీ, అన్నీ

"బండిపూజలకి" తగినట్టుగా, కొత్త వాహనాలకి కొన్నికోట్లతో, ఓ పెద్ద షెడ్డు వేశారట ద్వారకా తిరుమలపైన శేషాచలం కొండమీద. 

కొత్తగా బైక్ లూ, కార్లూ కొనుక్కొన్నవారు వాళ్ల వాహనాలని ఆ షెడ్డులో పెట్టుకొని, శ్రీనివాసునికి "ప్రత్యేక" పూజలు చేసుకొని, వెళితే "శుభ"మట! (ఫోటోల్లో ఆ షెడ్డంతా ఖాళీగానే కనిపిస్తూంది. అసలు ఒకరోజున యెన్నికార్లూ, బైక్ లూ కొనుక్కొంటారు? దాంట్లో కొండమీదకొచ్చి బండిపూజలు చేయించుకొనేవాళ్లెందరు? అంత పెద్ద షెడ్ అవసరమా?)

కానీ, అక్కడవున్న స్వామీ, ఇరువురు దేవేరుల విగ్రహాలూ యెండకి యెండీ, వానకి తడిసీ, చలికి వణికీ కూడా భక్తులని అనుగ్రహిస్తున్నాయట! 

బండిపూజలు చేయించుకుంటున్నవాళ్లందరూ--ఇదేమి చోద్యం? అని ముక్కుమీద వేలు వేసుకుంటున్నారట!

ఈ బండి పూజలేమిటో? ప్రత్యేకలేమిటో? పూజలు చేసుకొన్న బళ్లు క్రిందకి వచ్చిన తరవాత యేమవుతున్నాయో? యే యాక్సిడెంట్లో బలవుతున్న బళ్లలో యెన్నింటికి "ప్రత్యేక" పూజలు చేశారో? వీటన్నింటికీ స్టాటిక్టిక్స్ తీసేదెవడు?

"హిజ్రాలు"--అంటే "ఆ మ కా" వాళ్లు. వీళ్లు ముఖ్యంగా విశాఖ, తూగోజి, పగోజి వాళ్లే అయివుంటారు. (వుత్తరదేశంలో ఇలాంటివాళ్లు పెళ్లిళ్లలో, చావుల్లో, మేళాలు కట్టి, పాటలుపాడి, వాళ్లిచ్చినంతపుచ్చుకొని, వెళ్లిపోతారు కానీ, భిక్షాటన చెయ్యరు!)

వీళ్లు ముఖ్యంగా హౌరా నుంచి చెన్నై,  బెంగళూరు, హైదరాబాదు, ముంబై వెళ్లే రైళ్లలో స్లీపర్ కోచ్ లలో, యేడెనిమిది మంది జట్టుగా చేరి చేసే అల్లరులు భరించేవాళ్లకే తెలుస్తాయి.

(అలాంటి వాళ్లతో నా ప్రయాణానుభవం, మా మూడో హనీమూన్ అనే మొన్నటి మాయాత్రలో ఢిల్లీ నుంచి సామర్లకోట తిరుగు ప్రయాణంలో వివరిస్తాను. కొంచెం వోపిక పట్టండి.)

వాళ్లకీమధ్య రైల్వే పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారట. వారి ఫోటోలూ, చిరునామాలూ సేకరించాలని అదేశించారట. ఆడిగినంత సొమ్ము ఇవ్వకపోతే ప్రయాణీకులమీద దాడులకి దిగుతున్న హిజ్రాలనీ, రాత్రివేళ వొంటరిగా ప్రయాణిస్తున్న ఆడవారిమీద దౌర్జన్యంచేసి, నగలూ, ఆభరణాలూ దోచుకొంటున్న హిజ్రాలనీ, తప్పుపట్టి, అలాంటి వాళ్లు వేరెవరైనా తమకు పట్టి ఇవ్వాలనీ, కొత్తగా వస్తున్న హిజ్రాల మీద వోకన్ను వేసి వుంచాలనీ, వారి వివరాలని పోలీసులకి చెపుతూవుండాలనీ, హెచ్చరించారట!
      
మొన్నోరోజు వాడెవడో హిజ్రాలు తనమీద దాడిచేసి, రైల్లోంచి తోసేశారనీ, క్రిందపడ్డ తాను ఇంకో రైలు క్రిందపడి ఓ కాలు పోగొట్టుకున్నాను అనీ పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చాడట.

తీరా రైల్వే పోలీసులు దర్యాప్తు చేసి, వాడు చెప్పిన రైల్లో వాడు అసలు ప్రయాణించనేలేదనీ, వేరే రైల్లో ప్రయాణిస్తూ, స్టాపు లేని స్టేషన్లో దూకేసి, కాలు పోగొట్టుకున్నాడనీ, హిజ్రాల విషయం అంతా కట్టుకథ అనీ తేల్చారట!

ఇలాంటివాళ్లు కూడా వుంటారేమో మరి.

ఓ మూణ్నెల్ల క్రితం ముఖ్యమంత్రి కి కు రె పగోజి లో చింతలపూడి రచ్చబండ పర్యటనకి వస్తే, చేసిన యేర్పాట్లు చూడండి.

ఆయన పర్యటించే రెండు ప్రాంతాల్లో సువిశాలమైన వేదికలు నిర్మించారు.
మొదటి ప్రాంతంలో రచ్చబండ ముగిశాక, రెండో ప్రాంతానికి వెళ్లే రోడ్డుని పంచాయతీరాజ్ శాఖవారు "అగమేఘాలమీద" నూతనంగా నిర్మించారు. చలువపందిళ్లు వేయడంతోపాటు సభావేదికను, రహదారి డివైడర్లను మూడు రంగులతో అలంకరించారు.....1200 పోలీసులు....డాగ్ స్క్వాడ్, బాంబుతనిఖీ బృందాలు, ఓ "ఓఎస్డీ" స్థాయి అధికారితోపాటు 10 మంది ఎస్పీలూ, 40 మంది డీఎస్పీలతొపాటు, ఎస్సైలూ, కానిస్టేబుళ్లూ, హోం గార్డులతో సహా.....భారీ బందోబస్తు నిర్వహించారు. దీనితోపాటు, ఆయన దగ్గరకి యెవరూ రాకుండా, రోప్ పార్టీ సిధ్ధం చేశారు. ఇక్కడి ప్రజా ప్రతినిధులు అధికారులకి "స్పష్టమైన" ఆదేశాలు ఇచ్చారు.

ఇంక, సీఎం భోజనం కోసం, పలావు అన్నం, తెల్ల అన్నం, ఇతర మామూలు వంటకాలూ, గోంగూర పచ్చడి, దొండకాయ ఆవకాయ, గుత్తి వంకాయ కూర, గుమ్మడికాయ కూర, వులవచారు, మజ్జిగ చారు, పిట్ట మాంసం, నాటుకోడి కూర, నాటుకోడి కుర్మా, బొమ్మిడాయ కుర్మా, రొయ్య.....వండి వడ్డించారు(ట).

ఆ ఖర్చులన్నీ యెవరు భరించారు? యెన్ని కొల్లేటి పిట్టలనీ, నాటుకోళ్లనీ, బొమ్మిడాయిలనీ, రొయ్యలనీ చంపారు? వాటిలో ఆయన యెన్ని తిన్నారు? మిగిలినవన్నీ "భోంచేసిన" వాళ్లెవరు?

అసలు అంత అవసరమా?! (వొద్దని రోశయ్య అయినా, కి కు రె అయినా యెందుకు చెప్పరు?)

ఫైనల్ గా వీటివల్ల సామాన్యులకి వొరుగుతున్నది యేమిటి?

Friday, May 27, 2011

కబుర్లు - 50

అవీ, ఇవీ, అన్నీ

నిన్న (25-05-2011) ఈనాడు ఇదీ సంగతి కార్టూన్ చూశారా? 

తానేకాదు, తమవాళ్లందరూ "చెక్క కుర్చీల్లోనే" కూర్చుంటారు అనీ, దానితో ఓ 45 యేళ్లో యెంతో ఆ రాష్ ట్రాన్ని పరిపాలిస్తామనీ కలలు కంటోందిట మమతాదీ.

తానిన్నేళ్లూ కలలు కన్నది బుధ్ధదేవ్ కూర్చున్న ఆ కుర్చీ కోసమే అని మరిచిపోయినట్టుందీవిడ.

నందిగ్రామ్ వగైరాలతో, పర్యావరణం కోసం పోరాటం సాగించామని కూడా ఆవిడ మరిచిపోయినట్టుంది.

తమ వాళ్లకీ, ప్రభుత్వ అధికారులకీ, యంత్రాంగానికీ కొన్ని లక్షల చెక్క కుర్చీలకోసం యెన్ని చెట్లు నరుకుతారో ఇంక!

ఇంకా నయం, రైలు బద్దీలక్రింద ప్రస్తుతం వాడుతున్న కాంక్రీటు స్లీపర్ల స్థానంలో మళ్లీ "చెక్క స్లీపర్లు" వెయ్యమని పురమాయించలేదు! (యేమో....రేపు పురమాయిస్తారేమో....యెవరు చెప్పగలరు?)

వంద ఐదు రూపాయలో యెంతో వుండే ప్లాస్టిక్ కాఫీ/టీ గ్లాసుల స్థానంలో, ఒక్కోటీ రెండు మూడు రూపాయల ఖరీదు చేసే మట్టి ముంతలని ప్రవేశపెట్టిన లాలూ మళ్లీ రైలు యెక్కలేకపోయాడు.

ఒకప్పటి రైలు మంత్రీ, యేదో రాష్ ట్ర ముఖ్యమంత్రీ, కాంగ్రెస్ అధ్యక్షుడూ, కమలాపతి త్రిపాఠీ అలాగే ఓ ప్రత్యేక రైల్లో కాశీ నుంచి గంగాజలాన్ని తెప్పించుకొనేవాడుట వాళ్లింట్లో నిత్యావసరాలకోసం--కడుక్కోడాలతో సహా!

వాళ్ల చరిత్రలెంత దయనీయంగా ముగిశాయో, "తక్కువ ఙ్ఞాపక శక్తి" వున్న భారతీయ వోటర్లు మరిచిపోయినా, "పైవాడు" మరచిపోడు.

రైల్వేలని లాలూ వుధ్ధరించేస్తే, ఈవిడ సముధ్ధరించేసిందిట. ఇంక బెంగాల్ ని వుధ్ధరిస్తుందిట.

బెంగాలీ వోటరుకి కమ్యూనిస్టులకి ప్రత్యామ్నాయం వేరేదీ తోచకపోవడంతో తాను నెగ్గింది గానీ, దీదీ చమక్కులకీ, ఝలక్కులకీ వోటర్లు మురిసిపోవడం వల్ల కాదు అని ఆవిడ యెప్పుడు గ్రహిస్తుందో?

ద్రవ్యోల్బణం దారి తప్పుతోంది....ఆహారతో సహా. రేపు మళ్లీ డీజెల్ లీటరుకి ఓ నాలుగు రూపాయలూ, వంటగ్యాసు ఓ పాతిక నుంచి నలభై రూపాయలూ, కిరోసిన్ కనీసం రెండురూపాయలూ పెంచేస్తారేమో!

రిజర్వ్ బ్యాంకువారు అరకొర చర్యలు తీసుకోవడంతో సరిపెట్టకుండా ప్రభుత్వానికి ఓ రికమెండేషన్ కూడా వెలగబెట్టారుగా!

ఇంక ద్రవ్యోల్బణం నింగినంటక తప్పదేమో. 

యెవరేమి చేస్తారో చూడాలి.

సాధారణంగా పిచ్చివాగుడు యెక్కువ వాగడనుకున్న జైరాం రమేష్, "ఐ ఐ టీ ల్లో చదువుతున్న విద్యార్థుల వల్లే వాటి స్థాయి నిలబడుతోందిగానీ, వాటి బోధనా సిబ్బందీ వగైరాల ప్రమాణాల వల్లకాదు" అంటున్నాడు.

దాని భావమేమో?

తితిదే వారు 23 వేలకి పైగా ఆర్జిత సేవా టిక్కెట్లని రద్దుచేశారట. ఇవన్నీ కొన్ని సంవత్సరాలపాటు కొంతమందే రిజర్వు చేసుకున్నవిట.

"ఉదయాస్తమన సేవ" అనేదోటి 2006 లో ప్రారంభించారట. పదిలక్షలు చెల్లిస్తే, ఐదుగురు గృహస్తులకు సుప్రభాత సేవనుంచీ, యేకాంత సేవ వరకూ మధ్యలో అన్ని సేవల్లో పాల్గొనే అవకాశం ఇచ్చేవారట. ఈ టిక్కెట్లు శని, ఆది, సోమ వారాల్లో మాత్రమే, నగదు చెల్లించిన వారికేనట. ఇప్పుడు ఆ సేవా టిక్కెట్ల జారీని రద్దు చేశారట.

బాగానే వుంది. ఈనాడు వారు ఈ "తాజా నిర్ణయం వల్ల భక్తులు ఆవేదన చెందుతున్నారు" అంటున్నారు! (అంత గొప్ప భక్తులెందరిని చూశారో మరి!)

Thursday, May 26, 2011

కబుర్లు - 49



అవీ, ఇవీ, అన్నీ 

ఇదివరకోసారి సణిగానో, వ్రాశానో--ఆ రోజు తిరుపతిలో తన పార్టీ పేరు "ప్రజా రాజ్యం" అని ప్రకటించాక, "అభిమానులారా! కదలండి! రాష్ ట్రం దశదిశలా కుళ్లు రాజకీయాలకి వ్యతిరేకంగా పోరాడండి. అవినీతి యెక్కడ వున్నా టాగోరో/స్టాలినో లెవెల్లో విజృంభించండి! మీరు చెయ్యవలసింది నా ఫలనా "టొల్ ఫ్రీ" నెంబరుకి ఫోను కొట్టడమే! తరవాత సంగతి నేను చూసుకొంటాను. అవసరమైతే "లోక్ సత్తా" కార్యకర్తల సహకారం తీసుకోండి!" అని ఓ పిలుపు ఇస్తే, ఇప్పుడు వై యెస్ ఆర్; జగన్; రోశయ్య; కి కు రె--లాంటి బెడదలు మనకి లేకపోవును! 
రాష్ ట్రం కొన్ని వేల కోట్లు నష్టపోకుండా వుండును!

అది జరగలేదు. సరే! చిరంజీవి అప్పటి నుంచీ దిగజారుకుంటూ వస్తూ, చివరికి అవినీతిపుట్ట అయిన కాంగీలో చేరి, తగుదునమ్మా అంటూ బెంగాల్, తమిళనాడులకి ప్రచారం కోసం వెళ్లాడు! అంటే, 2జీ నీ, రాజానీ, కరుణనీ, కనిమొళినీ వగైరాలని సమర్థించినట్టేకదా? మనకి నిరాశ కాకుండా యేమి మిగిలింది?

మొన్నీ మధ్య లోక్ సత్తా జేపీ కూడా అదే అన్నాడు--

"ప్రజాస్వామ్యంలో పార్టీలు పుట్టడం, పోవడం సహజమేకానీ, ప్రరాపాను కాంగ్రెస్ లో విలీనం చేసిన తీరు మాత్రం లక్షలాది మందికి వేదనా, నిరాశా మిగిల్చింది. మఖలో పుట్టి పుబ్బలో పోయే ఇలాంటి పార్టీలతో కొత్త రాజకీయం చేయడమంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే"
 .....అని!

*   *   *

వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డీ ఎల్ రవీంద్రారెడ్డి, పోలవరం ప్రాజెక్ట్ పై తాను అడిగే ప్రశ్నలకి (అసలు) సమాధానం (అంటూ) చెపితే, ఆయన (జగన్) కి ముఖ్యమంత్రి పదవి ఇస్తాను....అన్నారు మొన్నెప్పుడో!

"పోలవరం ప్రాజెక్ట్ యే నది మీద కడుతున్నారు? యెక్కడ నిర్మించనున్నారు? పునాది యెవరు యెక్కడవేశారు? స్వతంత్ర భారతదేశంలోనా? బ్రిటిష్ హయాంలోనా? ప్రాజెక్టు సామర్ధ్యం యెన్ని టీఎంసీలూ? విద్యుత్తు వుత్పాదన యెంత? కుడి, యెడమ కాలువలద్వారా యెవరు లబ్ధి పొందుతారు?" అనే ప్రశ్నలు సంధించారు ఆయన!

పదోతరగతి కుర్రాడు సైతం జవాబివ్వగల పై ప్రశ్నలకి, జగన్ 5 లక్షల 45 వేలకిపైగా మెజార్టీతో జవాబిచ్చాడు చాలదా?

*   *   *

నిన్నో మొన్నో (26-05-2011) "జగన్ విజయవాడలో పోటీ చేస్తే, మా దేవినేని ఉమ 5 లక్షలకి పైగా మెజారిటీతో ఆయన్ని వోడిస్తాడు" అన్నాడో రా నా. (కడపలో వాళ్లే కోట్లు తినాలా? విజయవాడ వాళ్లకి ఆ భాగ్యం యెందుకు కల్పించకూడదు? అని ఆయన వుద్దేశ్యం అయివుంటుంది! యెలాగూ జగనే నెగ్గుతాడని వాడికీ తెలుసు మరి!)

*   *   *

"నాకు చిర్రెత్తుకొచ్చిందంటే, నా .....వందలకోట్ల ఆస్థినీ అనాధ శరణాలయాలకి రాసేస్తానంతే!" అని బెదిరించాడట వెనకటికోడు తన '......' మంది కొడుకులూ, కూతుళ్లనీ!

తి తి దే రద్దవడంతో, సాధికార మండలి వారు, తమ అధీనం క్రింద వున్న ఆలయాలనన్నింటినీ (తిరుమల తిరుపతి వెంకన్నతో సహా) "పురావస్తు శాఖ" వారికి అప్పగించేస్తామని "తీర్మానమే" చేసేశారు ఇదివరకోసారి!

మొన్న నాలిక్కరుచుకొని, ఆ తీర్మానాన్ని వుపసం హరించుకొన్నారు!         

అలా అప్పగిస్తే యేమయి వుండేది?

Tuesday, May 24, 2011

కబుర్లు - 48



అవీ, ఇవీ, అన్నీ

"ద్వారకా తిరుమలలో......పులిహోరలో బల్లి!" ఓ సంచలన వార్తా, దానిమీద భక్తుల ఆందోళనా, కొన్ని వేల పొట్లాల భూస్థాపితం!

డాక్టర్లు ఆ పులిహోర తిన్నవాళ్లని పరీక్షించారు.....యెవరూ మరణించలేదు.... యెవరికీ అనారోగ్యం కూడా కలగలేదు!

ఐదు దశాబ్దాలుగా హేతువాదులూ, డాక్టర్ సమరం లాంటివాళ్లూ మొత్తుకొంటున్నది "బల్లి విష జంతువు కాదు. అది వుడుకుతున్న యే పదార్థంలో పడినా, ఆ పదార్థం విషపూరితం కాదు. యెక్కువలో యెక్కువగా దాని చర్మం మీద యేమైనా సూక్ష్మజీవులుంటే, అవి ఆ పదార్థంలో చేరవచ్చు. అయినా, వుడుకుతున్నప్పుడు ఆ సూక్ష్మజీవులుకూడా నశిస్తాయి.

కానీ....శాకాహారులకైనా, అలాంటి జంతువులని తినడం అలవాటులేని మాంసాహారులకైనా, సహజంగా వికారం/వెలపరం కలగడం వల్ల వాంతులు రావచ్చు. ఒక్కోసారి, డిహైడ్రేషన్ వల్ల మరణం సంభవించవచ్చు. అదే కప్పలనీ, పాములనీ, మిడతలనీ, చివరికి తీపి పదార్థం మీద పాకుతున్న నల్ల కండ చీమలతో సహా ఆ పదార్థాన్ని నమిలి చప్పరించే చీనా, కొరియా వాళ్ల లాంటివాళ్లకి అదో 'సర్ ప్రైజ్ గిఫ్ట్' లాంటిది......" అని!

యెవరో అన్నారట, ఇది యెవరో కావాలని చేసిందే అని.

శభాష్! వాడేవడో కనిపెట్టండి. వాణ్ని తిరుమల యాత్రచేయించి, శ్రీవారి దర్శనం తరవాత, శేషాద్రి కొండమీదనుంచి లోయలో తోసేసే శిక్ష విధించండి.

(తరవాత జన్మలో బల్లి అయి పుడతాడేమో!)

అందరూ సంతోషిస్తారు.

Saturday, May 21, 2011

కబుర్లు - 47

అవీ, ఇవీ, అన్నీ

యెలక్షన్లయిపోగానే, పెట్రోలు రేటు పెంచేశారు. డీజల్, గ్యాస్ ధరలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తారట. 

అనేకమంది కాలమిష్టులూ, ఆర్థిక నిపుణులూ, నాలాంటివాళ్లూ, ఈ ఆయిల్ కంపెనీలు "రావలసిన లాభాలని రాకపోవడంతో" నష్టాలుగా చూపిస్తున్నాయనీ, ప్రభుత్వ సబ్సిడీ కేవలం వెంట్రుక శాతమేననీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా "లాభాలు" పిండుకోడానికే ఈ "బీదార్పులు" అనీ మొత్తుకొంటున్నారు.మీడియావారెవరైనా వాళ్ల "ఆడిటర్ల"నుంచి సమాచారం సేకరిస్తే, "సత్యం ఆడిటర్ల"కి మించిన కుంభకోణాలు బయటికొస్తాయేమో ప్రయత్నించవచ్చుకదా?!

2జీకి మించిన కుంభకోణం మన విమానయానం లో జరిగిందనీ, మంత్రి ప్రఫుల్ పటేల్ దానికి బాధ్యుడనీ నిప్పురాజుకొంది. నిజానికి నాలాంటివాళ్లు మొత్తుకొంటూనే వున్నాము--మన దేశానికి అన్ని "ప్రైవేటు" విమానయాన సంస్థలూ, వాళ్ల విమానాలనబడే "డబ్బాలూ" అవసరమా అని. 

మన "డొమెస్టిక్" ఇండియన్ ఎయిర్ లైన్స్ నీ, "ఇంటర్నేషనల్" ఎయిరిండియానీ యెందుకు కలిపెయ్యవలసి వచ్చింది? మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి, పైలెట్ల సంఘాలని గుర్తింపు రద్దుచేసి, మీ వుద్యోగాలు తొలగిస్తాం అని బెదిరించి, పిచ్చిపిచ్చి చేష్టలు చేసి, చివరికి వాళ్లకి "దాసోహం" అని, గుర్తింపు పునరుధ్ధరణ నుంచీ వాళ్ల డిమాండ్లు అన్నీ వొప్పుకొని, సమ్మె విరమింపచెయ్యవలసిన అవసరం యెవరికి యెందుకు వచ్చింది? ప్రఫుల్ పాత్ర యేమిటి?

ఎయిర్ పోర్టుల దగ్గరనించీ మన మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకుండా, మన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ల, వాటి సిబ్బందీ, నైపుణ్యాలని పెంచుకోకుండా, "జెట్"; "స్పైస్ జెట్"; "కింగ్ ఫిషర్" లాంటి సంస్థలకి యెందుకు అనుమతి ఇచ్చారు?

హెలికాప్టర్ల దగ్గరనించీ నిపుణులైన పైలెట్లు, వారికి కావలసిన సమాచారం యెందుకు అందుబాటులో వుండటం లేదు? ఓ రాజశేఖర రెడ్డి, ఓ దోర్జీ, యెందుకు ప్రమాదాలబారినపడి అశువులు కోల్పోవలసి వచ్చింది? 

1962 లో చైనా యుధ్ధం సమయంలో మనకి రష్యా వారిచ్చిన "మిగ్" "గ్నాట్" విమానాలనే పైలెట్ల శిక్షణకి యెందుకు వుపయోగిస్తున్నారు? అవి "ఈగల్లా" యెందుకు రాలిపోతున్నాయి? పైలెట్లు యెందుకు మరణిస్తున్నారు?

ఓ ప్రక్క "సుఖోయ్"లూ, ఇంకో ప్రక్క "బోయింగ్ 737"లూ ప్రవేశించినా, ఇంకా మన "డబ్బా" విమానాలనే యెందుకు వాడుతున్నారు? అవి తరచూ యెందుకు మొరాయిస్తున్నాయి?

ఇలాంటి ప్రశ్నలకి జవాబులు మన మీడియా వాళ్లే కనుక్కోవాలి.

ప్రఫుల్ పటేల్ ని నిలదీయండి.....కనిమొళి ప్రక్క సెల్ లోనే వాడినీ కూర్చోపెట్టండి!

అప్పుడైనా విమానప్రయాణీకులకి భద్రత వుంటుందేమో.

మన రాష్ట్రంలో రైతన్నలకి కష్టాలు తీరడం లేదు. ఇబ్బడిముబ్బడిగా ధాన్యం పండించినా, గిట్టుబాటు ధరలు చెల్లించేవాళ్లు లేరట. గోనె సంచులు లేవట. యంత్రాలు వాడటంవల్ల, తేమశాతం పెరిగిపోతోందట. 

మళ్లీ ఆ యంత్రాల్లో "సరిగ్గా" 100 గ్రాముల వడ్లు వేస్తేనే సరైన తేమశాతం చూపిస్తాయట. ఇంకొన్ని వడ్లు యెక్కువ వేసినా, తేమశాతం పెరిగిపోతుందట! దిక్కుమాలిన యెలక్ట్రానిక్కూ, డిజిటల్లూ పిశాచాలు మనకెందుకంటారు?

సరే బాగానే వుంది. కానీ, మన ప్రభుత్వాలు, సుప్రీం కోర్టు "పేదలకి వుచితంగా పంచండి" అన్నా, "ఠాట్! వీల్లేదు! యెలకలకీ, పందికొక్కులకీ పెడతాం; ఇంకా ముక్కిపోతే సముద్రంలో పారబోస్తాం" అంటున్నాయి.

మరి మీ దరిద్రగొట్టు నిరసనలేమిట్రాబాబూ! ధాన్యాన్ని "మంటల్లో" పోస్తారా? కృష్ణలో "నిమజ్జనం" చేస్తారా! "ప్రభుత్వా"లకీ మీకూ తేడా యేమి వుంది? అన్నదాత యెపుడూ అన్నదాతే కావాలిగానీ, అన్న "హోత" (హోమం చేసేవాడు) అవకూడదు. బుధ్ధి తెచ్చుకోండి. టమాటాలు కాలనీల్లో, కిలో అర్థరూపాయికి అమ్మారు కొందరు రైతులు. ఇంకా మిగిలితే, పశువులకి మేపారు......అంతేగానీ అగ్నికి ఆహుతి చెయ్యలేదు. వాళ్లని చూసి నేర్వండి.

కోర్టుల పుణ్యమా అని, నిర్బంధ బందులూ, హర్తాళ్లూ తగ్గాయి కానీ, ఇప్పుడు అనవసర "రాస్తా"; "రైల్" రోకోలు! వీటికి అంతం యెప్పుడో?!

మీ శరీరంలో "జీవప్రక్రియ" రెండురోజులో, రెండుగంటలో అఖ్ఖర్లేదు--రెండు నిమిషాలపాటు ఆగిపోతే--సంభవించేదాన్ని "మరణం" అంటారు. 

మరి ప్రజల జీవనాడులైన రాస్తాలనీ, రైళ్లనీ కొన్ని గంటలపాటు "రోకో" చేస్తే, జనజీవనం యెలా అస్థవ్యస్థమౌతుందో, యెన్ని మరణాలూ, జీవప్రక్రియ స్థంభనలూ సంభవిస్తాయో యెవరైనా ఆలోచించారా?

హై, సుప్రీం కోర్టులూ--ఇలాంటి వ్రాతలని "పిల్లులు" (అంటే మాత్రలూ, మార్జాలాలూ కాదు) గా స్వీకరిస్తే యెంతబాగుండును?

సర్వే జనాస్సుఖినో భవంతు!

Wednesday, May 11, 2011

కబుర్లు - 46

అవీ, ఇవీ, అన్నీ

అయోధ్య కేసు లో సుప్రీం కోర్టుకెళతామన్న పార్టీలన్నీ అలాగే వెళ్లాయి. నిన్న విచారణ ప్రారంభమయింది.

న్యాయవాదులందరూ తమ తమ కక్షిదారుల తరఫున "ప్రిలిమినరీ" వాదనలు వినిపించారు అన్ని కేసుల్లాగే. 

కానీ విశేషమేమిటంటే, అత్యున్నత న్యాయస్థానం వారు "అయితే ఆ తీర్పు మీ యెవరికీ నచ్చలేదా?" అని అడిగి, అందరూ "లేదు" అనగానే, "హమ్మయ్య! ఈ వొక్క విషయంలోనైనా మీ మధ్య 'యేకాభిప్రాయం ' వుందన్నమాట" అని జోకారట!

పైగా, "యెవరూ అడగకపోయినా, ఆ స్థలం విభజించాలని అలహాబాదు ధర్మాసనం తీర్పివ్వడమేమిటి?" అంటూ ఆ స్థలం విషయంలోనే కాకుండా, ఆ చుట్టుప్రక్కల ప్రభుత్వం సేకరించిన అరవైనాలుగో యెన్నో యెకరాల విషయం లో కూడా "యథాతథ స్థితి కొనసాగాలని" స్టే మంజూరు చేసిందట--యెవరూ అడగకపోయినా!

యేమైనా అర్థం వుందా?

అందరికీ తీర్పు నచ్చితే, అంత ఖర్చుపెట్టుకొని పై కోర్టుకి యెందుకు వెళతారు? ఒక ముక్కని అంతా తమకే కావాలని దెబ్బలాడుకొంటూంటే, దాని విభజన తప్ప ఇంకేమి పరిష్కారం వుంది? దాని(విభజన)కోసం యెవరు అడుగుతారు? 

యెవరి పట్టు వారిది కాబట్టి "రాజీ" మార్గం గా విభజనే బెస్ట్. ఆ మాత్రం తెలీదా అత్యున్నత న్యాయ స్థానం వారికి?

వాళ్ల వుద్దేశ్యం......వివాదం ఇంకో వందో, వెయ్యో యేళ్లు కొనసాగుతూ, "ప్రభుత్వాలకి" తలనొప్పిగా వుంటేనే, అనేకతరాల "న్యాయ" వుద్యోగులూ, వాదులూ, మూర్తులూ కాలుమీద కాలేసుకొని, తమ తరవాత తరాలకి అనుభవించడానికి సరిపడా సంపాదించచ్చు అనా?

సేకరించిన భూమి సంగతి ప్రభుత్వం చూసుకొంటుంది. దాని సంగతి మీకెందుకు?

ఒక్క విషయం మరిచిపోకండి! కక్షిదారుల సంగతెలా వున్నా, సామాన్య ప్రజలందరూ అలహాబాదు న్యాయస్థానం తీర్పుని హర్షాతిరేకంతో స్వాగతించారనీ, ఒక నిట్టూర్పు విడిచారనీ!

లేకపోతే, యెవరికీ పుట్టగతులుండవు.

నిన్న (10-05-2011) రాత్రి యేదో న్యూస్ ఛానెల్ చూస్తూండగా ఓ వార్త చివరి ముక్క విన్నాను ".....తి తి దే వారు ఆ పథకాన్ని అమలు చెయ్యబోమనీ, ఆ విషయంలో నిర్ణయం జరిగిపోయింది అనీ....." న్యాయ స్థానానికి నివేదించారనీ!

నాకు అనుమానం వచ్చేసింది.....ఇంతలోకే యెవరైనా "కదిలే తివాచీ" మీద "పిల్" వేసేశారా.....అదప్పుడే విచారణకి వచ్చిందా, న్యాయమూర్తులు సో కాల్డ్ "ఆగమ పండిత పక్షపాతులా?"......ఇలా!

నిద్రపోయేలోపు మిగిలిన ఛానెళ్లలో ప్రయత్నించానుగానీ, ఆ ప్రస్తావన లేదు.

ప్రొద్దున పేపర్లో చూద్దును కదా....విషయం ఆదికేశవుడి "అనంద.....అనంత....మయం" పథకమట! 

ఇప్పటివరకూ దాతలు ఇచ్చిన కొన్ని లక్షలో, కోట్లో డబ్బునీ, కొన్ని కిలోల బంగారాన్నీ వాళ్లకే తిరిగి ఇచ్చేస్తామనీ, వాళ్లు వాటిని వేరే పథకాలకి వుపయోగించుకోమంటే అలాగే చేస్తామనీ హామీ యిచ్చారట.

వాళ్ల నిర్ణయం చాలా బాగుంది. కానీ, ఆ పేరుతో ఇంకెంతో దండుకున్న వాళ్ల మాటేమిటి? దానిమీద దర్యాప్తులూ, శిక్షలూ మాటేమిటి?

మన్మోహన్లా వాళ్లపదవులు పోయాయికదా, అదే పెద్ద శిక్ష వాళ్లకి అంటారేమో!

భక్తులు వత్తిడి తేవలసిన అవసరం లేదూ? ఆలోచించండి! 

అన్నట్టు, అజిత్ భరిహోకె అనే పేరు గుర్తుందా? ఇదివరకూ తరచూ వినిపించేది అనేక సంచలన కేసుల్లో....ఓ ప్రత్యేక న్యాయస్థానం న్యాయ మూర్తిగా! నాకు గుర్తు రావడం లేదుగానీ అవన్నీ చాలా ముఖ్యమైన కేసులు.

ఇప్పుడు మళ్లీ ఆయన పేరు వినిపిస్తూంది--ఇంకొన్ని కేసుల్లో--ఢిల్లీ హైకోర్టో, సుప్రీం కోర్టో.....న్యాయమూర్తిగా!   
   

Saturday, May 7, 2011

కబుర్లు - 45

అవీ, ఇవీ, అన్నీ

"సేవ వలన మనకు చేకూరు ఆనంద
మదియె శాంతి సుఖములంది యిచ్చు
శాంతికన్న మిన్న సౌఖ్యంబు లేదయా
ఉన్నమాట తెలుపుచున్న మాట

స్వర్గమనగ వేరు సురలోకమున లేదు
నరుల లోకమందె యమరియుండు
తనదు లోని అహము తా చంపుకొన్న
అది స్వర్గమగును అవనియందు

కష్టసుఖముల నొకరీతి గాంచవలయు
కలిమిలేములు విడదీసి గడువరాదు
కీర్తి అపకీర్తులను నొక మూర్తిగానె
భావమందుంచి మెలగుటే భక్తి పథము"

ఇదేమిటి?

సత్యసాయి ఆశువుగా చెప్పిన కవితలలో ఒకటిగా చెప్పబడుతున్నది. నాకు బాగా నచ్చింది.

"వేకువజాము :

3 గంటలకి దిన చర్య ప్రారంభం. 6 గంటలవరకూ ఓంకార స్మరణ

ఉదయం :

6.00: భక్తుల ఉత్తరాల పరిశీలన, 7.00: అల్పాహారం; 8.00: భక్తులకు ప్రత్యేక దర్శనం; 9.00: భజన కార్యక్రమంలో పాల్గొంటారు; 9.30: విశ్రాంతి. (భోజనం మరి?)

మధ్యాహ్నం :

3.00: భక్తులకి దర్శనం; 3.30: ప్రముఖులతో భేటీ(?!).

సాయంత్రం :

5.00: ప్రశాంతి నిలయంలో నిర్వహించే భజనలో పాల్గొంటారు.

5.30: యజుర్వేద మందిరానికి వెళతారు; 7.00: భోజనం; 7.30: ట్రస్టు వ్యవహారాలను రాత్రి 9 గంటలవరకూ చూస్తారు.

(తర్వాత?! యజుర్వేద మందిరంలో రెండో అంతస్తులో వున్న తన యేసీ శయన మందిరానికి చేరి, వాటర్ బెడ్ పై నిద్రిస్తారు....యేదో సంగీతాన్ని వింటూ!--అని యెక్కడో చదివిన గుర్తు)

ఇదేమిటీ?

సత్యసాయి దినచర్యగా చెప్పబడినది!  

*   *   *

అయ్యప్ప మకర జ్యోతి గుంటకట్టి, గంట వాయించేసింది. అది "కృత్రిమమే" అని దేవస్వోం బోర్డు పెద్ద కోర్టుకి తెలిపింది.

కొన్ని సంవత్సరాలుగా గిరిజనులు అక్కడ మంటలు వేసేవారనీ, తరవాత అక్కడో తిన్నె నిర్మించి, దానిమీద కొన్ని కేజీల హారతి కర్పూరం వెలిగించడం ద్వారా, దేవస్వోం వారు మకర జ్యోతిని వెలిగిస్తున్నారు అనీ, బోర్డు వారు వొప్పుకున్నారు.

అంతే కాకుండా, "ఆ సమయంలో" ఆకాశంలో 'పొడిచే' నక్షత్రమే 'అసలు మకర జ్యోతి ' అని కూడా వొప్పుకున్నారు.

ఆ సో కాల్డ్ జ్యోతి కోసం వెళుతూనో, తిరిగి వస్తూనో, టాటా సుమోల్లోనో, ప్రత్యేక వాహనాల్లోనో, తొక్కిసలాటల్లోనో, లాఠీ ఛార్జీల్లోనో, గాయపడిన, మరణించిన వాళ్లకి యెవరు జవాబుదారీ?

ఆ బోర్డు వాళ్లకి వేలల్లో యేమైనా విదిల్చిందేమో. కానీ, వాళ్లు దండుకొనే దాన్లో వీళ్లకి ఇచ్చిందెంత శాతం?

*   *   *

దేశంలోనే తొలిసారిగా హైదరాబాదులోని సనత్ నగర్లో ఈఎస్ ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. (ఈ ఎస్ ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్--ప్రభుత్వోద్యోగులకి సెలవు కావలసి వస్తే, మెడికల్ సర్టిఫికెట్లు జారీ చెయ్యడానికి మాత్రమే వుపయోగపడే సంస్థ!) రూ.129.87 కోట్ల నిధులు, 126 పడకల సామర్ధ్యంతో యేర్పాటు చేశారు. (అంటే పడక్కో కోటి పైగా!)

ఇంకా చాలా వార్తుంది......కానీ, ప్రభుత్వ సొమ్ము పడకల పాలేనా?!

మీరే చెప్పాలి.....బిల్డింగుకెంతయ్యిందో, పడకలకీ వగైరాలకీ యెంతయ్యిందో, కావలసిన డాక్టర్లూ, ఎక్విప్ మెంటూ, ఆపరేషన్ థియేటర్లూ, సామాగ్రీ, యేసీలూ గట్రాలు "ఆ కోటిలోకి" వస్తాయో--అవన్నీ ఎక్స్ ట్రాలో--లాంటి ప్రశ్నలకి జవాబులు.
 
   

Thursday, May 5, 2011

కబుర్లు - 44

అవీ, ఇవీ, అన్నీ

నేను ఇదివరకు వ్రాసిన ఓ టపాలో వెలిబుచ్చిన భావాలనే ప్రకటిస్తూ, ఎస్ ఎస్ తారాపోర్ (రిజర్వు బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నరు) ఈనాడులో తన "డిపాజిటర్లతో సయ్యాటలా" అనే శీర్షికతో, 25-04-2011 న ఓ వ్యాసం వ్రాశాడు. చదవకపోతే, ఇప్పుడైనా చదవండి.

ఇంక రిజర్వ్ బ్యాంక్, అత్యంత ధైర్యంతో, ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసే వుద్దేశ్యంతో, రెపో/రివర్స్ రెపో రేట్లని "యేకంగా" (తుమ్మల కిషోర్ "అంచనాలకు" మించి) అర శాతం పెంచేసింది! సీ ఆర్ ఆర్ ని ముట్టుకో లేదు. బాగానే వుంది.

కానీ, "పెట్రో" ధరలు తక్షణమే పెంచాలని సూచించడం యేమిటి

ఇన్నాళ్లూ మురళీ దేవరా ఆ రేట్లు పెంచాలని ప్రభుత్వానికి లేఖలు వ్రాయడం, మన్మోహన్, మోంటేక్ లు "ఇప్పుడే వద్దు" అనడం, జైపాల్ రెడ్డి కూడా "సమీప భవిష్యత్తు లో పెరగవు" అని హామీలివ్వడం ఇలా జరుగుతూ వస్తోంది.

ఈ విషయం ఆర్బీఐ కి యేమి సంబంధం? ఇదివరకు యెప్పుడూ అలాంటి సలహాలు వాళ్లివ్వలేదే? దువ్వూరివారే యెందుకు ఇచ్చారు? శంఖంలో నీళ్లు పొయ్యమని ఆయనకి యెవరు చెప్పారు?

అలా పెంచకపోతే, ద్రవ్యలోటు రూ.లక్షా యెనభై వేల కోట్లు పెరిగిపోతుందట! ఇంతాజేసి ఓ 2జీ స్కామంతే కదా?! ఆ డబ్బుని ఆ వెధవల దగ్గర వసూలు చేసి, దాంతో "ఆయిల్ పూల్" యేర్పాటు చెయ్యమని యెందుకు "రికమెండ్" చెయ్యరు దువ్వూరివారు? జనాలు లోకువా!

(ద్రవ్యలోటూ, వృధ్ధిరేటూ ప్రభుత్వ తలనొప్పులు. అవి మీకెందుకు? ఇప్పటికీ ద్రవ్యలోటుకి సరిపడా కొత్త కరెన్సీ ప్రింటు చేసి విడుదల చేస్తూనే వున్నారుగా? ఇంకా "డీ మోనెటైజేషన్" కి సంకేతాలు ఇచ్చినట్టు కాదూ?)

(డీ మోనెటైజేషన్ గురించి మరో టపా వ్రాస్తాను త్వరలో).

క్రితంసారి పెంచిన ధరలకే మన చికెన్నారాయణా, నిత్యసంతోషి రాఘవులూ, కిషన్ రెడ్డీ, చంద్రబాబూ అడపాదడపా ఆందోళనలు చేసి, అంతకన్నా "ముఖ్యమైన" విషయాల్లోకి వెళ్లిపోయారు. మరి ఇవాళో రేపో అర్థరాత్రి నుంచీ ఈ రేట్లు "విపరీతంగా" పెరిగితే, అందోళనలు చెయ్యడానికి వీరికి వోపిక వుంటుందా? యేమో!

ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ప్రజలు వీఐపీలు కాదు--వీపీలు (వట్టి పిచ్చాళ్లు!).

మన రాజశేఖర రెడ్డి బాటలోనే, అరుణాచల్ ముఖ్యమంత్రి ఖండు దోర్జీ (ఇదివరకు పత్రికలు ఆయన పేరుని "ఖాండుప్ దోర్జీ" అని వ్రాశేవారనుకుంటా) పైలోకాలకి వెళ్లిపోయిన కొన్ని రోజుల తరవాత ఆ వార్తని ధృవీకరించాయి ప్రభుత్వాలు.

మన చిరంజీవి సైతం నిన్న (04-05-2011) న తను ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ తో సహా దాదాపు ఓ గంటపాటు "మాయం" అయిపోయాడట బెం"గాల్లో"!

బాబూ! బ్రతికుంటే బలుసాకు తినొచ్చు. ఇదివరకోసారి పొలాల్లో దిగిపోయావు అని మరచిపోతే యెలా?

నువ్వు పొత్తు కలుపుకొన్న కి.కు.రె. హెలికాప్టర్లే కాదు, విమానాలు కూడా యెక్కడానికి భయపడుతుంటే, తగుదునమ్మా అని ఇలా చెయ్యడం మనకి అంత "అవసరమా?" అహ.....అవసరమా అని?

బీహార్ తరహా చట్టాలు తేవాలి అంటున్నాడు అసదుద్దీన్--హింసకి వ్యతిరేకంగా! తనదాకా వస్తే.......అని అక్బరుద్దీన్ చెప్పాడు మరి!

Monday, May 2, 2011

కబుర్లు - 43

అవీ, ఇవీ, అన్నీ

ఇదివరకోసారి సణిగాననుకుంటా--పోస్టల్ వాళ్లు ఇచ్చే "నివాస ధృవీకరణ" కార్డుల గురించి.

ఇవి క్రితం నెలలోనే అందుబాటులోకి వచ్చేశాయట. రూ.225/- చెల్లించి, సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేస్తే, 10-15 రోజుల్లో ఈ కార్డు ఇచ్చేస్తారట. 3 సంవత్సరాల తరవాత దాన్ని రెన్యువల్ చేయించుకోవాలట. (ఈలోపల చిరునామా మారితే, కొత్త కార్డు తీసుకోవాలని చెప్పఖ్ఖర్లేదు కదా).

ఈ కార్డులు బ్యాంకుల్లోనూ, పోస్టాఫీసుల్లోనూ ఖాతాలు తెరవడానికీ, డ్రైవింగ్ లైసెన్సులు పొందడానికి, విదేశాలకి వెళ్లే సందర్భంలో పాస్ పోర్ట్ పొందడానికి, దూర ప్రాంతాలకీ, తీర్థయాత్రలకీ వెళ్లే వ్యక్తుల ఆచూకీ తెలుసుకోడానికీ--ఇలా అనేకవిధాలుగా వుపయోగిస్తాయట.

మొన్న అన్నాహజారే అహింసామార్గంలో లక్ష్యసిధ్ధి జరగకపోతే, శివాజీ మార్గం అవలంబించ వలసి వస్తుంది అన్నందుకూ, అంతకన్నా యెక్కువగా నరేంద్ర మోడీ బాగా పాలిస్తున్నాడు అన్నందుకూ అనేక విధాలుగా వాపోయినవాళ్లలో ఓ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూడా వున్నాడు.

ఆయన చెప్పిన వాటిలో "పి చిదంబరం, కపిల్ సిబల్ మరీ అతిగా వ్యవహరిస్తున్నారు. వారి దూకుడుకు ప్రథానమంత్రి ముకుతాడు వేయాలి" అనడం నాకు నచ్చింది.

కానీ, రాజ్యాంగబధ్ధంగా యేర్పడిన "పీ యే సీ" లో సభ్యులు తిరగబడేలా చేసింది మన్మోహనా? సోనియానా? లేక ఇంకెవరైనా తమిళ కోటరీవాళ్లా?

వాళ్లని సమర్థిస్తూ టీవీలకెక్కుతున్న వుండవల్లి అరుణకుమార్లవి నాలుకలా తాటిపట్టెలా?

ఇలాంటివాళ్లకి బుధ్ధి చెప్పడానికి శివాజీ మార్గమైనా సరిపోతుందా?

ఇవన్నీ శేష ప్రశ్నలు.

ఈనాడు వారు "ఒడుదొడుకులు" అని వ్రాస్తున్నారు. నేననుకునేది అది "ఒడిదుడుకులు" అని. తల్లి వొడిలోని పసివాడు దుడుకుగా క్రిందకి జారడానికి ప్రయత్నించడం ఆ తల్లికి ఒడిదుడుకు కాబట్టి. మన తెలుగు బ్లాగర్లేమంటారో?

ఆమధ్య, "కుదుపుల్లేని" దురంతో రైలు పెట్టెలొస్తున్నాయన్నారు. స్వీడన్ నించి దిగుమతి చేసుకున్న "టైట్ లాక్ కపులర్ల"తో అనుసంధానించే పెట్టెలతో ఆ రైలు నడుస్తుందన్నారు. ఆ రైలు ముంబాయి, సికింద్రాబాద్ ల మధ్య నడుపుతారని కూడా అన్నారు.

మరి ఆ దురంతోలు యేమయ్యాయో?

ఆత్మ.....

.....శాంతి



ఒసామా బిన్ లాడెన్ "చచ్చాట్ట"!

తెలుగు బ్లాగర్లూ......"మిష్టర్! షో రెస్పెక్ట్ టు ది డిపార్టెడ్ సోల్!" అంటారా?

"మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్" అంటారా?

నేనుమాత్రం వాడి ఆత్మ పాతాళం కన్నా క్రింద ఇంకో లోకమేదైనా వుంటే దాంట్లో శాశ్వతంగా పడివుండి, రౌరవాది నరకాలూ శాశ్వతంగా అనుభవిస్తూ వుండాలి అని కోరుకొంటాను.


నా బ్లాగుమాత్రం శాశ్వతం! (నేనున్నంతవరకూ!)

వాకే???!!!