Friday, November 18, 2011

కబుర్లు - 81



అవీ, ఇవీ, అన్నీ

"మిగిలిన సరుకుల రేట్లు తగ్గించకుండా, కిలోరూపాయికి--అవీ ముక్కిపోయిన బియ్యం ఇస్తే యెవడికి కావాలి?" అంటూ టీవీల్లో చెరిగేస్తున్న ఆడవాళ్లకి సమాధానంగా, ఇప్పుడిస్తున్న కాస్త కందిపప్పూ వగైరాలతో ఓ ప్యాకేజీ గా ఓ కిలో చింతపండూ, ఓ కిలో వుప్పూ కూడా ఇస్తేబాగుంటుందనుకుంటున్నారట. 

ఓ కిలో యెండు మిరపకాయలు కూడా.....అనుకొని, మళ్లీ దాని రేటు స్థిరంగా వుండదు....ములిగిపోతామేమో అని సందేహిస్తున్నారట! అయినా నెలకి కిలో చింతపండూ, కిలో వుప్పూ యేంచేసుకుంటారట? 

యెలాగూ ఓ మంత్రిగారన్నట్టు, "వండిపెట్టే" పథకం గురించి ఆలోచిస్తే ఇంకా బాగుండునుకదా? 

యెలాగూ రైతులకీ, మహిళలకీ "వడ్డీ లేని" ఋణాలు అంటున్నారాయె! అదేదో "వుచిత భోజన కూపన్లు" ఇచ్చేసి, వండి వార్చి, వొడ్డించేస్తే పోను కదా?

"అయ్యవారేం చేస్తున్నారు?" అంటే, "చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు!" అన్నట్టు, మంత్రి డీ ఎల్ రవింద్ర (వండిపెట్టే పథకం గురించి చెప్పినది కూడా ఈయనేననుకుంటా!), "వందల కోట్లు ఆసుపత్రులకి ఖర్చు పెట్టారు. డాక్టర్లు లేరు, మందులు లేవు! అలాంటి పరిస్థితుల్లో నాకు వైద్య ఆరోగ్య శాఖని నాకిచ్చారు! (2009 లోనే ఇచ్చారేమో!) అప్పటినుంచీ చేసిన తప్పులు ఇప్పుడు దిద్దుకుంటున్నాను. (కాబట్టి జనాలు నన్నేమీ అనొద్దు!) అన్నాడట. 

బహుశా 2014 వరకూ పడుతుందేమో--ఆ తప్పులు దిద్దుకోడానికి--అప్పటివరకూ ఆ మంత్రి పదవీ, ఆ ప్రభుత్వమూ వుంటే.....!

డీ జీ సీ ఏ వాళ్లు, "విమాన చార్జీలు పెంచి వసూలు చేస్తే వూరుకోం" అని కళ్లెర్రజేశారట--మిగిలిన కంపెనీలని--కింగ్ ఫిషర్ సర్వీసులు రద్దవడంతో. 

పాపం సంపన్న శ్రేణి వినియోగదారులమీదా, ప్రభుత్వ వున్నతోద్యోగులమీదా యెంత ప్రేమో వారికి! 

ఓ ప్రక్క "తృటిలో తప్పిన" ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. గన్నవరం, రాజమండ్రి, విశాఖ లాంటి చోట్ల సరైన యేర్పాట్లే లేవు! గన్నవరం నుంచి సర్వీసు ప్రారంభించినరోజే, వాతావరణం బాగాలేక రద్దు చేశారు ఎయిర్ ఇండియాది! నిన్న ఓ విమానం, రెక్కకి పక్షి తగిలి, అద్దం పగిలిపోతే, అప్పటికే ల్యాండ్ అవడం వల్ల వూపిరి పీల్చుకొన్నారు! మొన్నెప్పుడో ఓ విమానమైతే తగలబడేపోయింది అక్కడెక్కడో. ఇవన్నీ వాళ్ల బాధ్యతలు కావన్నట్టు వాళ్లు పట్టించుకోరు

"చికెన్" నారాయణ ఓ వజ్రం లాంటి మాటన్నాడు. మనపొరుగు రాష్ట్రం తమిళనాడులో "నాయకులు" జైళ్లకి వెళుతుంటే, మన రాష్ట్రంలో "అధికారులు" మాత్రమే వెళ్లడం మొదలెట్టారు--అని!

అవున్నిజమేకదా? అయినా, రాజకీయం కాకపోతే, ఆ తేడా యేమిటో ఆయనకి తెలీదనుకోవాలా? 


ఆదికేశవుడూ, కృష్ణారావూ వుండగా, తి తి దే వారికి బంగారం రాగానే, పేపర్లో ప్రకటించేసేవారు. క్రొత్తవారు, రిస్కెందుకు అనుకున్నారేమో, ఇప్పుడు వొకేసారి, గత మూడు నెలలలో రూ.2.11 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు 'వితరణగా' అందాయి అని ప్రకటించారు. అదీ, ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్ నుంచి జూన్ వరకూ) అన్ని ఆలయాలకీ కలిపి అనీ, శ్రీవారికొక్కరికే ఆ సమయంలో రూ.1.53 కోట్ల బంగారం వచ్చింది అనీ, జువెలరీ విభాగం వారు లెఖ్ఖలు కట్టారట!

బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నారు కదా? వాకే!

Tuesday, November 15, 2011

కబుర్లు - 80



అవీ, ఇవీ, అన్నీ

హమ్మయ్య! శుభవార్త వెలువడింది! రాష్ట్రాల్లో రేషన్ కార్డులున్నవాళ్లందరికీ ఆథార్ సంఖ్య కేటాయించడం చెల్లదని, ఆథార్ సంఖ్యని "జనాభా లెఖ్ఖల" శాఖ మాత్రమే జారీ చేస్తుందనీ, ఆ ప్రక్రియ ఇంకా మొదలవలేదనీ, మిగిలిన యే "సంఖ్యలూ" చెల్లవు అనీ ప్రకటించేశారు!

మరి ఇన్నాళ్లనుంచీ, ప్రైవేటు యేజన్సీలని నియమించి, మందల్లా జనాలని తోలి, దరఖాస్తులని జారీ చేసి, మిగిలినవాళ్లకి 2013 వరకూ దరఖాస్తులే జారీ చెయ్యడం కుదరదనీ.......ఇలా వేషాలేసిన రాష్ట్రాలకీ, ప్రభుత్వాలకీ.....ఇంకా.....ఆ "కార్డు" లేకపోతే....మీకు 'రేషన్' రాదు; 'గ్యాస్' రాదు; 'పెన్షన్లు' రావు; మీరు ఈ దేశ వోటర్లేకారు.....ఇలా బెదిరించి "దండుకున్న" వారికి యేదీ శిక్ష?

"మూడీస్" అనే "ఇంటర్నేషనల్" (మా జార్గాన్ లో మోసగాళ్లనీ, ఓవరాక్షను చేసేవాళ్లనీ క్రమంగా "తాలూకాగాడు; జిల్లాగాడు; రాష్ట్రగాడు; నేషనల్ గాడు; ఇంటర్నేషనల్ గాడు....ఇలా వ్యవహరించేవాళ్లం!) రేటింగు యేజన్సీ, భారతీయ బ్యాంకుల రేటింగుని "కొంత" దించేసిందట! బ్యాంకులన్నీ బాధపడిపోతున్నాయట! (నిజంగా వాళ్ల పేరుకి తగ్గట్టు వాళ్లు "మూడీసే"....అంటే వాళ్ల మూడ్ కి తగ్గట్టు ప్రవర్తిస్తారు!)

ఇంకో రేటింగ్ యేజన్సీ "స్టాండర్డ్ & పూర్" వాళ్లు, అదే రేటింగుని, ఆ మర్నాడే 'కాస్త' పెంచారని సంతోషిస్తున్నాయట బ్యాంకులు! (వీళ్లకో స్టాండర్డ్ లేదు; వీళ్లు పూరూ కాదు! సత్యం రామలింగరాజు ఆడిటర్లు వీళ్లేనట.)  

మొన్న ప్రణోబ్ ముఖర్జీ, నిన్న రంగరాజన్ కూడా, బ్యాంకులు తమ "మౌలిక రంగ" (రోడ్లు, విద్యుత్తు, విమానయాన వగైరా); వాహన; గృహనిర్మాణ; వ్యక్తిగత ఋఅణ రంగాల్లో "జాగరూకత" వహించాలని చెప్పారు(ట!)

నేను మూడేళ్లనుంచీ చెపుతున్నాను--ఈ రంగాలు "ములుగుతున్నాయి" అని! అయినా, అలా "వెల్లవేసి" వాటిని కాపాడుకొస్తున్న ప్రభుత్వాలు మాత్రమే దీనికి బాధ్యులు అంటాను నేను!

మళ్లీ బ్యాంకులు "వుత్పాదక రంగ" ఋణ వితరణకి మాత్రమే పరిమితమైతే తప్ప, మన బ్యాంకులనీ, మన ఋణ వ్యవస్థనీ కాపాడగలిగేవాడు యెవడూ లేడు. వృధ్ధి రేటంటారా.....నా కాలిక్రింద బలాదూర్!

విజయ్ మల్లయ్య, యెప్పుడూ ఓ నలుగులు అందగత్తెల మధ్య (గాంధీగారు పాపం ఇద్దరు 'బెన్ ' ల భుజాలమీదే చేతులు వేసేవారు....వాళ్లు కూడా అందగత్తెలు అంటే మన కళ్లు పోతాయి!), చేతిలో ఓ షాంపేన్ గ్లాసుతో కనిపిస్తాడు! దేశంలోని "బీర్బల్"లకీ, మందుభాగ్యులకీ తగినంత "సరుకు" అందించిన ప్రజా సేవకుడూ, టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని వేలంలో సొంతంచేసుకొని, మన దేశానికి తీసుకువచ్చిన (అది ఆయన పెర్సనల్ లాకర్లో వుందేమో ఇప్పుడు!) "దేశ భక్తుడు"! అలాంటివాడు, ఈ రోజున నా "బీర్ బ్రాండు" ఎయిర్ లైన్స్ కష్టాల్లో వుంటే.....యెందుకు ఆదుకోరూ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు!

ఇంకో స్పైస్ జెట్ వాడో యెవరో, "ప్రైవేటు" విమాన సంస్థలకి ప్రభుత్వం యెందుకు సాయం చెయ్యాలి? అనడుగుతున్నాడు. 

బ్యాంకులేమో, ఇప్పటికే 8 వేలకోట్లిచ్చాం. ఇంకా కావాలంటే, ఓ 8 వందల కోట్లు (నీ మద్యం ఫ్యాక్టరీలలోంచి) మళ్లించు...అంటున్నారట! చేస్తాడో......దేన్‌దార్దాన్‌దే అంటాడో! 

అసలు వీటన్నింటికీ కారణమైన "ప్రఫుల్ పటేల్" హాయిగా వున్నాడు! (ప్రపంచమందరికీ అన్ని విషయలూ తెలుస్తున్నా, వాళ్లు "అదిగో పులి" అని చెపుతున్నా, గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతూ కాలక్షేపం చేసిన) సీబీఐ వాళ్లేమైనా చెయ్యగలరా వాడిని?  

చూద్దాం!



Saturday, November 5, 2011

కబుర్లు - 79

అవీ, ఇవీ, అన్నీ

మొన్న మన్మోహనుడు గవర్నర్ల సదస్సును వుద్దేశించి ప్రసంగించారట.

గవర్నర్ల వ్యవస్థ రాజ్యాంగబధ్ధంగా యేర్పడింది. వాళ్లకి ఈయన సందేశాలివ్వడం యెమిటో?

అదేమీ తప్పు కాదేమోగానీ, ఆయన వువాచలు రాజకీయ వాసన కొడుతున్నాయి మరి! అవినీతి నిర్మూలనకి ఇదే సమయం అనీ, అందుకోసం రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకొంటే ఫలితాలు మరింత బాగుంటాయి అనీ, గవర్నర్లు "కేంద్రానికి కళ్లమాదిరిగా" వుండాలనీ, అభివృధ్ధి కార్యక్రమాలని పర్యవేక్షించాలనీ 'సూచించార' ట. దేశానికి "రెండో హరిత విప్లవం" అవసరమన్నారట! పండిన పంటకీ, కుళ్లిపోతున్న ధాన్యాలకీ దిక్కులేదుగానీ.......! ఆ విప్లవం కూడా గవర్నర్లే తేవాలని ఆయన వుద్దేశ్యమేమో మరి! బాగుంది.

మొన్నెప్పుడో, 'ఇండియన్ మినర్వా' వ్యాఖ్యకి సమాధానమిస్తూ, రైల్వే వెబ్ సైట్ గురించి నేను వ్రాసిన విషయమ్మీద, (http://osaamaa.blogspot.com/2011/09/74.html) ఈనాడువారు దృష్టి సారించి, అక్టోబర్ 29న వార్త వ్రాశారు!

అన్నట్టు, ఈనాడులో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షల ప్రకటనల్లో, "వివాహ 5వ" అనే ప్రచురించడం మొదలెట్టారు. కానీ, మధ్య మధ్య మళ్లీ "16వ వివాహ" అని కూడా అప్పుడప్పుడూ వస్తున్నాయి.

ఇంక, "ఒడుదొడుకులు" ని "ఒడిదుడుకులు" అని సవరించారు. (అని సంతోషించినంతసేపు పట్టలేదు.....మళ్లీ నాల్రోజుల్లోనే, ఒడుదొడుకులు....అంటూ పెద్ద హెడ్డింగు!).

ఇంకా, మా ఎంబెరుమన్నార్ కోవెలని, "ఎంబెర్ మానార్" అనడం మానేశారు. "ఎంబెర్ మన్నార్" అంటున్నారు. సంతోషం.

కానీ, "ఎంబెరు మన్నార్" అన్నది సరైన పదం. అదికూడా మారిస్తే, ఇంకా సంతోషం.

అలాగే, "నిర్ధారణ" ని "నిర్ధరణ" అని వ్రాస్తున్నారు. అది అర్థం లేని మాట. సవరిస్తే సంతోషం!

తెలుగుని తెలుగులాగే బ్రతికించండి!


మొన్న అక్టోబరు 29నే, ఈనాడులో, సంపాదకీయం ప్రక్కన ముఖ్య వ్యాసంగా, "ఇందిరాగోపాల్" ఓ వ్యాసంవ్రాశారు--"నియంతా...నీవెంత" అంటూ.

ముందు అమెరికాని సపోర్టు చేస్తున్నట్టు అనిపించినా, తరవాత చక్కని హెచ్చరికల్తో ముగిసింది ఆ వ్యాసం.

చదవకపోతే చదవండి.