Thursday, January 30, 2014

కబుర్లు - 104



అవీ, ఇవీ, అన్నీ

అమెరికాలోని "మహర్షి మహేష్ యోగి వేద విద్యా సంస్థలు" నుంచి "వేద పండితులు" అదృశ్యం అయిపోతున్నారట! ఇండియా నుంచి రప్పించినవారికి సరైన వసతులులేక, తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాన్ని గడపలేక పారిపోతున్నారని షికాగో కేంద్రంగా ప్రచురితమయ్యే ఓ పత్రిక పరిశోధనాత్మక వ్యాసం వ్రాసిందిట.

వారి ఆరోపణలకన్నా, సంస్థలవారు ఇచ్చిన వివరణలు ఇంకా దారుణంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా, 2600 మంది యువకులని తీసుకురాగా, కేవలం 5% అంటే 130 మంది మాత్రమే ఆచూకీ లేకుండా పోయారనీ, యెప్పటికప్పుడు అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్ స్ ఎంఫోర్స్ మెంట్ కు తెలియపరుస్తున్నాము అనీ, వాళ్లకి కనీసవేతన నిబంధనలు వర్తించవు అనీ, వాళ్లు సాధువులు లాంటివారు కావడంతో కార్మిక చట్టాలు వర్తించవు అనీ, ఇంకెవరో వారికి యెక్కువవేతనాలూ, వసతులూ కల్పిస్తామని ఆశపెడుతుంటేనే వాళ్లు వెళ్లిపోతున్నారు అనీ సెలవిచ్చారట!

(ఓ పదేళ్లుగా అని మనం అనుకున్నా, యేడాదికి 13 మంది మాయం అయిపోతున్నా వాళ్లకి చీమకుట్టినట్టు లేకుండా మాట్లాడడం యెంత బాగుందో చూడండి!)

మరి సదరు అమెరికా అధికారులు, మన దేవయాని మీద--వీసా చట్టాలు వుల్లంఘించింది అనీ, కనీస వేతనాలు ఇవ్వలేదనీ వగైరా ఆరోపణలతో తమ ప్రతాపం చూపించారుగానీ, వీళ్లమీద యెందుకు చూపలేదో? (బహుశా వాళ్ల జీడీపీ వృధ్ధి రేటు పడిపోతుందని భయపడ్డారేమో--వాళ్లవి కొన్ని కోట్ల డాలర్ల వ్యాపార సంస్థలు కదా!)

మహేష్ యోగే ఓ ఫ్రాడ్. ఇదివరకే నాటపాల్లో వ్రాశాను--ఓసారి ఒకాయన "ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ గురించి మీకేమి తెలుసు? పీపుల్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది ఎయిర్!" అంటే, నేను "ఓరి పిచ్చోడా, అదే నిజమైతే, మహేష్ యోగికి జెట్ విమానాలతోనూ, రోల్స్ రాయిస్ కార్లతోనూ యేమిపని!" అని నోరు మూయించాను.

యేదో అన్నట్టు, ".........పురిటి కంపు పోలేదు" అంటే ఇవేనేమో!

పశ్చిమ బెంగాల్లోని బీర్ భమ్ జిల్లాలో, సంథాల్ తెగ గిరిజన యువతి, ఆ గ్రామ పెద్ద కంగారూ కోర్టు ద్వారా విధించిన జరిమానా రూ.25,000/- చెల్లించలేనన్నందుకు, 13 మంది తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకి చెపితే, వాళ్లు కోర్టు ద్వారా విచారణ జరిపిస్తున్నారట.

ఈలోగా, ఆతెగ నేతలు, తమ 'సలిషి సభ' ని మీడియా తప్పుగా చిత్రిస్తోందనీ, గ్రామస్తులు ఆ యువతినీ, ఆమె ప్రియుణ్నీ "ఈడ్చుకొచ్చిన" మాట వాస్తవమేగానీ, గ్రామపెద్ద అత్యాచారం చెయ్యమని ఆదేశించలేదు--అని నిరసన వ్యక్తం చేస్తూ, అవసరమైతే ఆ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారట!

హర్యాణాలోనూ అక్కడా "ఖాప్ పంచాయితీలూ", ఇక్కడ సలిషి సభలూ........న్యాయ వ్యవస్థ యెక్కడికి పోతోందో!

మా జిల్లాలో రేషన్ కార్డుల వివరాలను "ఆన్ లైన్" చేసి, ప్రజా పంపిణీ విధానాన్ని పారదర్శకంగా నిర్వహించడానికి ప్రణాళిక అమలు చేస్తున్నారట. ప్రతీ తాసిల్దార్ కార్యాలయంలో ఓ కంప్యూటరు పెట్టి, తాత్కాలిక పధ్ధతిపై ఓ ఆపరేటరు ని నియమించుకోడానికి అనుమతి ఇచ్చి, రేషన్ కార్డుదారుల వివరాలన్నీ కంప్యూటర్లో పొందుపరచాలని ఆదేశించారట. అందరూ "విధిగా" ఆథార్ సీడింగ్ చేయించుకొని, ప్రభుత్వ సబ్సిడీలు పొందాలట.

మరి ఇప్పటికే, ఆథార్ నెంబరూ బ్యాంక్ ఎకవుంటూ లేని కార్డుదారులకి గత నాలుగు ఐదు నెలలుగా సరుకులు ఇవ్వడం లేదంటున్నారు. 

మొత్తం 11,95,437 తెల్ల కార్డులకీ వాటిలో వున్న 36,53,093 మందికీ, 26,70,032 మంది మాత్రమే ఆథార్ సీడింగ్ చేయించుకున్నారట. మిగిలిన 10 లక్షలమంది సంగతీ పైవాడికే యెరుక.

ఇంక ఆన్ లైన్ చేసి, నగదు బదిలీ మొదలుపెడితే, ముందు పెట్టుబడిపెట్టి (గ్యాస్ సిలిండర్లలా), సబ్సిడి తరవాత అందుతుంది అంటే--నిజంగా యెంతమంది లభ్యపడతారో! (వాళ్లందరూ ఒచ్చే యెలక్షన్లలో యెవరికి వోట్లు వేస్తారో? లేక ఈలోపలే, యువనేత "ఛీ--నాన్ సెన్స్! ఆథార్ రద్దు చెయ్యండి!" అంటాడేమో! అప్పుడు కొన్ని వేల కోట్లకి యెవరు బాధ్యులౌతారో!)

ఇప్పుడే వార్తల్లో చెపుతున్నారు--ప్రభుత్వం సబ్సిడీ సిలిండర్ల సంఖ్యని 12 కి పెంచాలనీ, వాటికి ఆథార్ అనుసంథానం రద్దు చెయ్యాలనీ నిర్ణయించారు--అని).

మరి అర్థంలేని ఆథార్ స్కీమ్ కోసం 1,50,000 కోట్ల కేటాయింపుతో ప్రారంభించారట! (అప్పటికే 50 వేల కోట్లు ఖర్చు చేశామని సుప్రీం కోర్టుకే చెప్పారు.) ఈ కోట్లన్నీ యెలా గంగలో పోసినా, రేప్పొద్దున్న--ప్రజాపంపిణీ వ్యవస్థనీ, లెవీ స్వీకరణలనీ వాటికి సంబంధించిన వ్యవస్థలనీ రద్దుచేసి, "నగదు బదిలీ" ద్వారా కొన్ని వేల కోట్లు మిగుల్చుకోవాలని చూస్తున్న ప్రభుత్వం, యెంతవరకు సఫలీకృతమౌతుందో చూడాలి.

భగవంతుడా! వీరికి మంచి బుధ్ధి ప్రసాదించు అని ప్రార్థిస్తున్నారు సామాన్యులు.


Saturday, January 18, 2014

కబుర్లు - 103



అవీ, ఇవీ, అన్నీ

సీ డబ్ల్యూ సీ సమావేశం అయిందట. మన తెలుగు అంజయ్యలని యెవర్నీ మాట్లాడనివ్వలేదట! యెన్నికల్లోపల ప్రథాని అభ్యర్థిని ప్రకటించడం వాళ్ల ఇంటావంటా లేదందట వాళ్లమ్మ. (క్రితం యెన్నికలముందు మన్మోహన్ పేరు ప్రకటించడం అప్పటి అవసరమే తప్ప, ఆచారం సృష్టించడానికి కాదట). నేను ఓ సైనికుణ్ని, అమ్మ యేమి చెయ్యమంటే అది చేస్తాను అన్నాడట పిల్లాడు.

అసలు అయితే గియితే రాబోయే యెన్నికల్లో వాళ్ల పార్టీ కి కొన్ని సీట్లయినా వస్తే, మిగిలిన చిన్నా చితకా పార్టీలతోనే సంకీర్ణం యేర్పాటు చేసే అవకాశం వస్తే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయితే, సీల్డ్ కవర్లోంచి వాడి పేరు బయటపడినప్పుడు కదా!

ఇంకా గొప్పగా--"మీ గిన్నెలో అన్నం అవుతా, మీ చేతుల్లో పుస్తకమవుతా, మీ నెత్తిమీద నీడనవుతా, ఆడపడుచులను ఆదుకొనే అన్ననవుతా, పార్టీని ముందుకు నడిపించే సేనాని అవుతా, మీరు చెప్పినట్టు వినే విధేయుడినవుతా.........." అంటూ డైలాగులు కొడుతుంటే, వాళ్లమ్మ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, తెగ సంతోషించేసిందట! (ఇంకా నయం, మీనెత్తిమీద మారెమ్మనవుతా, మీ ప్రక్కలో పామునవుతా.....అనలేదు)

"మన్మోహన్ జీ! తొమ్మిది రాయితీ సిలిండర్లతో మేం వంట చెయ్యలేం. ఈ దేశ మహిళలు మరిన్ని కోరుకుంటున్నారు. ప్రతి కుటుంబానికి 12 సిలిండర్లు కావాలి. దయచేసి 'కోటా' పెంచండి!" అన్నాడట. (అసలు ఈ కోటా యెందుకు? రాహుల్ కీ, చిదంబరానికీ, షిండేకీ, అహ్మద్ పటేల్ కీ అందరికీ 12 సిలిండర్లు కావాలా? సామాన్యుడికి కావలసినది "ఆథార్" సంబంధంలేని సిలిండర్లు--ఆరైనా, తొమ్మిదైనా! సరిపోకపోతే, కట్టెలపొయ్యిలు యెలాగా వున్నాయి!)

"తెల్ల కార్డు వున్నవాళ్లకే రాయితీ సిలిండర్లు" అంటే, బంగ్లాదేశ్ వాళ్లకీ, పాకిస్థాన్ వాళ్లకీ అందరికీ ఇచ్చేసినా సబ్సిడీల్లో ఇంకా బోళ్లు మిగులుతుంది కదా? యెలాగూ ఆథార్ ఓ గుర్తింపు కార్డు మాత్రమే--పౌరసత్వ కార్డు కాదు అనేశారుగా!

అన్నట్టు, నందన్ నీలేకణి ఒచ్చే యెన్నికల్లో పోటీ చేస్తాడట!

వెనకటికొకాయన బాగా "డబ్బు చేసి" ఓ సొంత పార్టీ పెట్టి, యెన్నో సీట్లు గెలవలేక, డబ్బు ఖర్చైపోయి, కాటాకి వచ్చేసి, కాంగ్రెస్ ని "సామాజిక న్యాయం" మీరే చెయ్యాలని, ఓ మంత్రిపదవి సంపాదించి, మళ్లీ సంపాదించుకొంటున్నాడు.

ఇంక ఇప్పుడు, నీలేకణి ఆథార్ అంటూ ఓ 50 వేల కోట్లు ప్రభుత్వ ధనం విరజిమ్మి, మిగిలిన ప్రభుత్వాలచేత మరిన్ని వేల కోట్లు ఖర్చుపెట్టించి, ఇప్పుడు యెన్నికై యేమి సంపాదించుకోవాలనుకుంటున్నాడో!

వచ్చే యెన్నికల్లో యేపార్టీ అయినా "ఆథార్" కుంభకోణం మీద చర్య తీసుకుంటామని ప్రకటిస్తే, అధికారం లోకి రావడం చాలా వీజీ! పార్టీలు గమనిస్తున్నాయా?

ఢిల్లీలో అధికారంలోకి వచ్చాకగానీ అదేమిటో అనుభవంలోకి రాలేదు కేజ్రీ కి. అందరిలాగే "నాదగ్గరేమీ మంత్రదండం లేదు" అనేశాడు. మరి నువ్వేదో పొడిచేస్తావనే కదురా నీ చేతికి అధికారం అనే మంత్రదండం ఇచ్చాము "సార్లేక్" అని ఆమ్ ఆద్మీలు అడగద్దూ?

ప్రక్కలో పాముతో అధికారంలోకి వస్తున్నాము అని తెలిసీ, ప్రజా దర్బారు అంటూ బోర్లా పడి, గోడ యెక్కవలసి వచ్చింది! క్రొత్త అవినీతికేసులపై తప్ప, పాత కేసులని పట్టించుకోం అని ఓ సారి అన్నాడు. షీలా మీద యేవైనా ఆరోపణలు యెవరైనా చేస్తే, వాటి సంగతి ఆలోచిస్తాము అంటాడోసారి. 

బిన్నీ అయితే, కాంగ్రెస్ లోంచి వచ్చాడు, ఎం ఎల్ యే అయ్యాక యేవో కోరికలు తీరక యేదో మాట్లాడుతున్నాడు అంటున్నారు. మరి అనుపమ్ ఖేర్ యెందుకు మాట్లాడుతున్నట్టో!

మన సొంటికొమ్ము జేపీ వాళ్లతో చేరడానికి ఆరాటపడుతున్నాడు. వాళ్లేమో దూరం పెడుతున్నారు!

చూడాలి--యెన్నికల్లోపల మరెన్ని చిత్రాలు జరుగుతాయో!