Wednesday, November 28, 2012

కబుర్లు - 96




అవీ, ఇవీ, అన్నీ

రాష్ట్రంలో కంప్యూటర్ల కొనుగోళ్లు వగైరాలమీద యే హైకోర్టు న్యాయమూర్తో, జేడీ లక్ష్మీ నారాయణో "సువో మోటో" గా విచారణ మొదలు పెడితే బాగుండును. 

అన్నిచోట్లా కంప్యూటర్లే, అన్నిటికీ "అనుసంధానాలే"!

ఎక్సైజు కంపు : రాష్ట్రం లో అన్ని ఎక్సైజు ఠాణాలూ, దుకాణాలూ కంప్యూటరీకరించి, అనుసంధిస్తారట

మొత్తం 346 ఎక్సైజు స్టేషన్లూ, డిపూటీ, సహాయ కమీషనర్ల కార్యాలయాలూ, 32 డిస్టిలరీలూ, 9 బ్రూవరీలూ, 6,596 మద్యం దుకాణాలూ--అన్నింటినీ "ఒకే సాఫ్ట్ వేర్" క్రింద అనుసంధానించి, "వినియోగదారులు" మోసపోకుండా చూస్తారట. 

వీళ్లు "వినియోగదారుల"నుంచే కాకుండా, ఉద్యోగార్థుల నుంచి కూడా ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు. మొన్న కానిస్టేబుళ్ల ఉద్యోగాలకి మొత్తం 2,606 ఉద్యోగాలకీ 4,36,488 మంది దరఖాస్తు చేశారట. దరఖాస్తుల ద్వారానే రూ. 2 కోట్ల "ఆదాయం" వచ్చిందట వాళ్లకి!

"మీ సేవ" : జిల్లాలో 274 కేంద్రాల్లో ఇప్పటివరకూ "అందిస్తున్న" 27 సేవలకి అదనంగా మరో 8 సేవలని కూడా అందించాలని నిర్ణయించారట! పురపాలక సంఘాల్లో ఇచ్చే జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీని కూడా "త్వరలో" నూ, తరవాత గ్రామ పంచాయతీల్లో ఇచ్చే వాటినికూడానూ అనుసంధిస్తారట. 

యేడిచేదాని మొగుడొస్తే నా మొగుడూ వస్తాడు అన్నట్టు, కొన్ని సేవలు వస్తే మిగిలినవి రాకపోతాయా అని యెదురు చూస్తున్నారు జనాలు.

ఇక దేశవ్యాప్తంగా, 9 వేల "గ్రంధాలయాల"ని మూడేళ్లలో "డిజిటల్" పరిజ్ఞానంతో అనుసంధించడానికి వెయ్యికోట్లతో "ప్రక్రియ" చేపట్టడానికి ప్రణాళికని ప్రణాళికా సంఘానికి నివేదించారట. 

మా నరసాపురం అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయ మూర్తి భరతలక్ష్మి, ఓ అద్భుతమైన తీర్పు ఇచ్చారు. 14 యేళ్ల బాలికని మోసగించి, ముంబాయి ప్రాంతానికి తీసుకెళ్లి, వ్యభిచార వృత్తిలో దించడానికి ప్రయత్నించినందుకూ, ఆమెని చిత్ర హింసలకి గురి చేసినందుకూ--ఇద్దరు స్త్రీలకి 17 యేళ్ల చొప్పునా, ఇంకో స్త్రీకి 14 యేళ్లూ జైలు శిక్ష విధించారట! (ఆఁ! పైకోర్టులు లేవా? అంటున్నారేమో వాళ్ళు!)

మా జిల్లా కలెక్టరుగారు, ఆవిడ సంతకం కోసం, ఓ బాధితుడికి అందించవలసిన ఓ రూ.21.24 ల చెక్కుని "క్రాస్" చెయ్యకుండా జారీకి ప్రయత్నించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారట! ఇలా గతంలో యెన్ని చెక్కులు క్రాస్ చెయ్యకుండా ఆవిడ చేత సంతకాలు చేయించారో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఆర్వో ని ఆదేశించారట కూడా! 

హమ్మయ్య! కలెక్టరుగారికైనా "క్రాస్" అంటే యేమిటో తెలుసన్నమాట!





Friday, November 16, 2012

కబుర్లు-95



అవీ, ఇవీ, అన్నీ
 
మొన్న వేలూరు దగ్గర అరియూరు లోని స్వర్ణ దేవాలయంలో భక్తులు 10,008 “నెయ్యి  దీపాలు” వెలిగించి, మొక్కులు తీర్చుకున్నారట. ఆందునిమిత్తం 5 టన్నుల నెయ్యి మాత్రమే వినియోగించారట.

మీసేవ” కేంద్రాల ద్వారా పలు రకాల సర్టిఫికెట్లు జారీ చెయ్యడానికి ఇప్పటికి 12 జిల్లాలను మాత్రం యెంపిక చేశారట. స్థిరాస్తి మీద ఈసీ లలో అమ్మకం, కొనుగోలు వగైరా వివరాలు ఈ యేడాది జూలై వరకే నమోదయ్యాయట. ఆ ఈసీ లుపట్టుకొని బ్యాంకులకి వెళితే, ఈ ఐదారు నెలల్లో యేమి లావాదేవీలు జరిగాయో అనే అనుమానం తో ఋణాలు మంజూరు చెయ్యడం లేదట. పోనీ సంబంధిత సబ్ రిజిస్ట్రారు కార్యాలయం లో తీసుకొందాం అంటే, దానికి ఫీజు మీసేవలోనే కట్టాలట. తీరా చేస్తే, ఈసీలకి బదులు తెల్లకాయితాలు వస్తున్నాయట. లేదా, ఆ సర్వే నెంబరు మొత్తానికి సంబంధించి కొన్ని వందల పేజీల వివరాలు వచ్చేస్తున్నాయట! భలే వెలుగుతున్నాయి కదూ మన కంప్యూటర్లు!

సైన్యానికీ, పోలీసులకీ యెంపిక కోసం కొన్ని కిలోమీటర్ల పరుగు పందాలు నిర్వహించడం, వాటిలో కొంతమంది చనిపోవడం గురించి ఇదివరకోసారి వ్రాశాను. ఒకాయన, “మరి దొంగలని పట్టుకోవాలంటే, ఆమాత్రం పరుగెత్తద్దా వాళ్లు?” అన్నాడు. అక్కడకి మన పోలీసులు అదేదో సినిమాలో తాడి మత్తయ్యలా “చేజ్” అంటూ దొంగల వెనకాల పరిగెత్తేస్తున్నట్టు

మరి రైల్వేలో గ్రూప్ డి యెంపికలకోసం పరుగు పోటీలెందుకో? దానికోసం పురుషులు 4 నిమిషాల 15 సెకన్లలో 1000 మీటర్లూ, స్త్రీలు 3 నిమిషాల 10 సెకెన్లలో 400 మీటర్లూ పరిగెడితేనే యెంపిక చేస్తారట! ఇంక రేపు బ్యాంకులు వగైరా వుద్యోగాలకి కూడా ఇలా పరుగు పోటీలు పెట్టేస్తారేమో!

ఈనాడువారు తెలుగుభాషతో ఇంకా గమ్మత్తులు చేస్తున్నారు. మనుషుల పేర్లూ వగైరాలముందు శ్రీ/శ్రీమతి/శ్రీయుతులు వగైరా గౌరవ వాచకాలు పెట్టడం యెప్పుడో మానేసి, కొన్ని లక్షలు ఖర్చు తగ్గించుకుంటున్నారు. సరే.

మొన్న ఒకాయన వ్రాసిన “మద్భవద్గీతామృత” గ్రంధాన్ని ఆవిష్కరించారట! (నిజంగా ఆ వ్రాసినాయనే శ్రీ పెట్టలేదేమో అనుకున్నాను.) ఆ వార్తలోనే, “……..మత్తిరుమల వెంకట…….ఆచార్యులను….ఘనంగా సన్మానించారు” అని వ్రాశారు! “మత్తిరుమల” అనే ఇంటిపేరు లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. మన జర్నలిస్టులు తెలుగు ని యెంతబాగా వెలిగించేస్తున్నారో!

ఈ మధ్య కొన్ని సభలూ సమావేశాలు నిర్వహిస్తూ, వాటి ముందో తరవాతో “సాంస్కృతిక కార్యక్రమాలు” జరిపించేస్తున్నారు. వాటిలో మొన్నటివరకూ “సారొత్తారొత్తారా….” అనో, “కెవ్వ్ కేక…..” అనో, “మున్నీ బద్ నామ్…..” అనో, ఇప్పుడు “చాయ్…..గరం చాయ్…..” అనో డ్యాన్సులు చేయించేస్తున్నారు. వీటిని "సాంస్కృతిక కార్యక్రమాలు" అనాలంటే………??!!! 

ఇంకొంతమందైతే, చిన్నపిల్లలచేత కూచిపూడి—కుండమీదా, ఇత్తడి పళ్లెం మీదా, నెత్తిమీద చెంబులు ఒకదాని మీదొకటి పెట్టుకొనీ, చేతుల్లో జ్యోతులో, కొవ్వొత్తులో పెట్టుకొనీ—నృత్యాలు చేయిస్తున్నారు. 

నన్నడిగితే, తల్లిదండ్రులూ, టీచర్లూ ఇలాంటి వాటిని ప్రోత్సహించి వాళ్ల టేలంట్ వృధా కాకుండా చూస్తే మంచిది!

యేమంటారు?      

Monday, November 12, 2012

కబుర్లు-94



అవీ, ఇవీ, అన్నీ

మౌలానా అబుల్ కలాం అజాద్ అని ఓ గొప్ప దేశ భక్తుడు వుండేవాడు. స్వతంత్ర పోరాట సేనానీ…..వగైరా. (ఆయన తనను తాను మైనారిటీని అని యెప్పుడూ చెప్పుకోలేదు). 

ఈయనొకడుండేవాడని క్రితం సంవత్సరం ఈ రోజుకి కూడా యెవరికీ జ్ఙాపకం లేదు. హఠాత్తుగా మొన్న గుర్తొచ్చి, ఇప్పుడు ఆయన 124వ జయంతి జరిపించారు. పనిలో పనిగా దాన్నే ‘మైనారిటీ దినోత్సవం’ అనో యేదో అన్నారు.

గత కొన్ని వారాలుగానో, నెలలు గానో భాగ్యనగరంలో హిందూ దేవాలయాలమీద—కనీసం 12 నుంచి 18 మీద—దాడులు జరిగాయట. కొన్నింటిమీద రాళ్లు రువ్వడం, కొన్నింటిని ధ్వంసం చెయ్యడం, కొన్నింట్లో విగ్రహాల ఆభరణాలనీ విలువైన వస్తువులని దొంగిలించడం వగైరా. 

అయినా మతసామరస్యం వెల్లివిరుస్తోంది. కలహాలు రాలేదు.

మరి ఎ ఐ ఎం ఐ ఎం (మజ్లిస్) పార్టీ ప్రభుత్వానికి మద్దతు వుపసం హరించుకోవాలని ఆలోచిస్తోందని తెలియగానే, ఆజాద్ గారు గుర్తొచ్చాడు!

యేమిటో ఈ రాజకీయాలు!

ఆకాశ్ టేబ్లెట్లని రాష్ట్రపతి ఆవిష్కరించారు. (ఇవి జ్వరం వస్తే వేసుకొనే టేబ్లెట్లు కాదు. ప్రభుత్వాల అవినీతి జ్వరాలని పెంచేవి). వీటిని ప్రభుత్వం ఒక్కోటీ రూ.2,263/- లకి ‘డాటావిండ్’ సంస్థ నుంచి కొనుగోలు చేస్తోందట. విద్యార్థులకి ఒక్కోటీ రూ.1,130/- లకే అందిస్తోందట. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాయితీ ఇస్తే, (అంటే మిగతా రూ.1,133/- లనీ అవి భరిస్తే) పూర్తిగా ‘వుచితంగా’ వాటిని అందిస్తారట. 

దేశంలోని “22 కోట్లమంది” విద్యార్థులకి వచ్చే ఐదేళ్లలో అందరికీ ‘అందిస్తారు ’ట. (22 కోట్లూ X 2,263 = ?) 

సోమవారం ఒక్కరోజే 20 వేల టేబ్లెట్లని విద్యార్థులకి అందించనున్నారట. (20,000 X 2,263 = ?)

అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వ్యవహారం నడుస్తూందట. 

కృషి బాగుంది కదూ?

మనలో చాలామంది ఈ మెయిల్ మెస్సేజ్ వ్రాశాక, క్రింద “అత్యవసరం అయితేనే దీని ప్రింట్ తీసుకోండి. దానిద్వారా (కాగితాల అవసరాన్నీ, వాటికి అవసరమయ్యే చెట్లని నరకడాన్నీ, నివారించి) పర్యావరణాన్ని కాపాడడానికి తోడ్పడండి” అని వ్రాస్తూ వుంటారు. అంత చక్కటి అవగాహన వుందని నిరూపించుకుంటున్నందుకు అందరూ సంతోషిస్తున్నారు. 

ప్రభుత్వాలు కూడా, ఓ ముఫ్ఫై నలభై యేళ్ల క్రితమే, వంటచెరకు కోసం కట్టెలు కొట్టడం మానెయ్యమనీ, వాటి బదులు పొగలేని పొయ్యిలూ వగైరా వాడండి అనీ ప్రచారం చేసుకొంటూ, ఇప్పటికి దాదాపు అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, బోళ్లు చెట్లని కాపాడేశారు!

ఇప్పుడు మళ్లీ మొదటి గడిలోకే పంపిస్తున్నారు! 

ప గో జి లోనే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలే మొత్తం 9 వుంటే, వాటిలోని సుమారు 5,400 మంది విద్యార్థినీ విద్యార్థులకి వుదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం వండించాలంటే, ఒక్కో పాఠశాలకీ నెలకి ఓ 70 గ్యాస్ సిలిండర్లు ఖర్చు అవుతాయట. (మొత్తం 9 X 70 = ?).  

వండి వడ్డించేవాళ్లకి ఒకో విద్యార్థికీ రూ.2.55 పైసలు ఇస్తున్నారట. దాంట్లోనే గ్యాస్ ఖర్చులు కూడా భరించాలట. 

ఇప్పుడు రెండు నెలలకి ఒకటే సిలిండరు సబ్సిడీ పై ఇస్తాము అంటే, మిగిలిన వాటిని యెక్కువధరకి కొనలేక, ఇప్పుడు మళ్లీ కట్టెల పొయ్యిలూ, గాడి పొయ్యిలూ మీద వంటలు మొదలు పెట్టేరుట. 

హౌరా! యెంతటి ప్రగతి! యెంతటి పర్యావరణ ప్రేమ!

రేపు దీపావళికి షిరిడీలో 30 సెకన్లలో లక్ష నూనెదీపాలు వెలిగించడానికి సుమారు “2,500 లీటర్ల” నూనెని వినియోగిస్తారట! (ఇదంతా గిన్నిస్ రికార్డుకోసమట).  

మరి దీపావళికి మిగిలిన గుళ్లలోనూ, కార్తీక మాసం పూర్తయ్యేసరికి మొత్తం—యెన్ని వేల లీటర్ల నూనె వినియోగమవుతుందో, యెన్ని “రికార్డులు” బ్రద్దలవుతాయో, నూనెల ధరలు యెంత పెరుగుతాయో

యెంతమందికి యెన్ని (పర్సులు) “బ్రద్దలవుతాయో!” వాటికేమయినా “రికార్డు” వుందో లేదో మరి!

మన పత్రికలవాళ్లు భలే గమ్మత్తులు చేస్తూంటారొకోసారి. మొన్న మా జిల్లా ఈనాడు పేపర్లో రెండువార్తలకి సమాన ప్రాముఖ్యం ఇస్తూ, ప్రక్క ప్రక్కనే దాదాపు ఒకే సైజు శీర్షికలతో ఇలా వ్రాశారు—“పరామర్శలతో ఒరిగేదేమీ లేదు” అనీ; “మూర్తి రాజుకు ఎస్పీ పరామర్శ”—అనీ. 

అదేమిటీ? పాపం స్వాతంత్ర్య సమరయోధుడూ, ప్రముఖ గాంధేయవాదీ, మూర్తిరాజుగారిని పరామర్శిస్తే, యెవరికి కష్టం కలిగిందీ? అనుకుంటూ ఇంకో వార్త చదివితే, ఓ భాజపా నాయకుడు “వరదల వల్ల నష్టపోయిన వాళ్లకి, ప్రభుత్వ పరామర్శలతో ఒరిగేదేమీ లేదు” అన్నారు—అని!

అదీ సంగతి.

అన్నట్టు రాబోయే ప్ర తె మ లో “ఉరుదూ ముషాయిరా” జరిపిస్తారట. ఇంకా ఇతరభాషలవాళ్లనీ పిలిచి వాళ్ల భాషల అభివృధ్ధి గురించి కూడా మాట్లాడతారట.

ఇంకా, గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్, జిల్లా—ఇలా అన్ని స్థాయుల్లోనూ వూరేగింపులూ గట్రా జరపడానికీ, “మేముకూడా ప్ర తె మ ల్లో పాల్గుంటున్నాం!” అనే భావన ప్రజల్లో కలిగేలా కార్యక్రమాలని నిర్వహించడానికి జిల్లాకో 20 లక్షలు మాత్రమే కేటాయిస్తున్నారట! (బలై పోయేది పాపం స్కూళ్ల పిల్లలే కదా?!) 

యెంత చక్కని భాషాభివృధ్ధి కృషో కదా?
    
నిన్న ఆదివారం హైదరాబాద్ జవహర్ బాల భవన్ లో ‘జాతీయ విద్యా దినోత్సవం ’ జరపడానికి మంత్రిగారొస్తున్నారంటే, స్కూలు పిల్లలెవరూ రాలేదట! అప్పటికప్పుడు అధికారులు స్కూళ్లకి ఫోన్లు చేసి, విద్యార్థులని వున్నవాళ్లని వున్నట్టు అక్కడికి తరలించమని ఆర్డర్లు వేశారట. 

తీరా అక్కడికి వచ్చిన పిల్లల్లో ఓ రెండువందలమందిని యూనిఫారాలో, పాదరక్షలో లేవని గెంటేశారట

(అప్పటికే హాలు నిండిపోయినందున కొంతమందిని గెంటెయ్యడం నిజమే గానీ, యూనిఫారాల గురించి కాదు అన్నారట అధికారులు!) 

యే రాయైతేనేం? వూడింది విద్యార్థుల పళ్లే కదా? 

పోనిద్దురూ!   
 

Sunday, November 4, 2012

కబుర్లు-93




అవీ, ఇవీ, అన్నీ 



తెలుగు వెలుగు స్థాపించి, ఈనాడు చేస్తున్న తెలుగుభాషాభివృధ్ధి అభినందనీయం. 

కానీ, ఈనాడు పేపర్లో భాషాదోషాలు చూస్తే పంటి క్రింద రాయిలా బాధపడతాం. ఒక టైమ్స్ లోనో, హిందూలోనో యెక్కడోగానీ అప్పుతచ్చులు కనబడవు. మరి ఈనాడు జర్నలిజం స్కూల్లో భాషా దోషాల గురించి చెప్పరో యేమిటో.

చెప్పగా చెప్పగా, పదో వివాహాలూ, ముఫ్ఫై రెండో వివాహాలూ మానేసి, ఇప్పుడు చక్కగా ‘వివాహ 10వ…’ ఇలా వ్రాస్తూ, నమూనా ప్రకటన కూడా సవరించారు. సంతోషం.

మొన్న అదేదో స్కూల్లో పిల్లలని “సమైఖ్యాంధ్ర” అనే అక్షరాల ఆకారంలో నిలబెట్టి పేపర్లో ఫొటొ వేయించుకున్నారు. క్రింద వార్తలో కూడా అలాగే వ్రాశారు పేపరు వాళ్లు.  “సమైక్య” అనాలని ఆ స్కూలువాళ్లకీ తెలీదు, పేపరు వాళ్లకీ తెలీదనుకోవాలేమో. 

అలాగే, “అహర్నిసలు” (అహర్నిశలు); “అగ్రికీల” (అగ్ని కీల); “వర్ధాలు” (వ్యర్ధాలు) లాంటి మాటలతో వార్తలు రాస్తున్నారు. పైగా ఆ ప్రక్కనే “మాతృ భాషని కాపాడుకోవాలి” లాంటి ప్రబోధాలు.

ఇంక, గుళ్లలో వేదపండితులు లాంటి మాటలకితోడు, “అభిషేక పండితులు” లాంటి మాటలు పుట్టించారు. రేపు “అష్టోత్తర పండితులు”, “సహస్రనామ పండితులు”, “అర్చన పండితులు” కూడా పుట్టుకొస్తారేమో!

“టు మార్కెట్, టు మార్కెట్, టు బై ఎ ఫాట్ పిగ్” లాంటి రైమ్స్ కన్నా, “చేత వెన్నముద్ద” లాంటివి పిల్లలకి నేర్పించచ్చుకదా అని అమోఘమైన సలహా ఇచ్చాడొకాయన. 

నిజమేకదా. నన్నడిగితే, “పంచతంత్రం” చదివితేనే అసలు తెలుగంటే యేమిటో తెలుస్తుంది అంటాను నేను. 

“భలేవారే మీరు—బ్రహ్మ గురించి చెప్పాలంటే ‘నీళ్లలోంచి పుట్టిందాన్ని కుర్చీపీటగా కలవాడు ‘ (జలజాతాసనుడు) అని తెలుగులో అనాలంటారా మీరు?” అంటూ నవ్వుతాడు మా “పురాణపండితుడు” ఐన స్నేహితుడు!

ఈ మధ్య ఎందుకో “హేట్ ట్రిక్” మీద చర్చ వచ్చింది. యేదైనా ఓ కష్టమైన పనిని వరసగా మూడుసార్లు చెయ్యడం అనే అర్థంలో వాడుతూంటారు. 

ఈ మాట యెలా పుట్టింది అంటే, ఇంగ్లీషువాళ్లు తమ హేట్ ని గాల్లో యెగరేసి, అది మళ్లీ సరిగ్గా తమ తలమీద పడేలాగ చెయ్యడాన్ని ఓ ఆటగా చేసేవారు. మామూలుగా థీరీ ఆఫ్ ప్రాబబులిటీ ప్రకారం అలా మూడుసార్లు యెగరేస్తే ఓ రెండుసార్లు మాత్రమే సరిగ్గా పడడం గానీ, పడకపోవడం గానీ జరగాలి. 

అలా వరుసగా మూడుసార్లూ చెయ్యగలిగితే గొప్పే కదా? అదే హేట్ ట్రిక్!