Sunday, December 26, 2010

అధిష్ఠానం

2జీ....3జీ లూ....ఇతర కబుర్లూ

ఇన్నాళ్లూ, అందరికీ తెలుస్తున్న విషయమేకదా, మనం ప్రత్యేకంగా వ్రాసేది యేముందిలే అని నేను 2జీ కుంభకోణం మీద టపా వ్రాయలేదు.

మొన్న వెంకయ్యనాయుడన్నాడు 'కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వమూ ఇప్పుడు 3జీ మీద నడుస్తోంది' అని. అదేమైనా కొత్త స్కామా అని అడిగిన పాత్రికేయులకి, '3జీ అంటే....., సోనియా జీ, మన్మోహన్ జీ, రాహుల్ జీ' అని చమత్కరించాడు--రామాయణాన్ని మూడు ముక్కల్లో 'కట్టె, కొట్టె, తెచ్చె ' అని చెప్పినట్టు!.

శీతాకాల సమావేశాలని స్థంభింపచేశాయి విపక్షాలన్నీ--జేపీసీ వెయ్యాల్సిందే అంటూ. ప్రభుత్వం ససేమిరా అంటే, బడ్జెట్ సమావేశాలనికూడా....అని హెచ్చరించాయి. 

సమావేశాలు జరిగే రోజుల్లో, ఎంపీలకి రోజుకి రూ.2,000/- ఇస్తారట--భత్యంగా--అవి జరిగినా, జరగకపోయినా, వాళ్లు వెళ్లినా, వెళ్లకపోయినా! (ఇది వాళ్ల జీతాలకీ, ఇతర 'వుచిత' ఫోన్లూ, కార్లూ, విమాన, మొదటి తరగతి ఏసీ ప్రయాణాలు...ఇంకా చాలా లిస్టు వుంది లెండి....అన్నిటికీ అతిరిక్తంగా.)

సమావేశాలు జరగడంలేదు కాబట్టి, తమ పార్టీ ఎంపీలెవరూ ఆ భత్యాన్ని తీసుకోవద్దు అని ఆర్డరేసిందట--మహా త్యాగమయి--ఇటాలియమ్మ--మహా అయితే, రోజుకి ఓ ఐదు లక్షలో యెంతో మిగిలేను ప్రభుత్వానికి!! (యెంతమంది అది పాటించారో యెవరూ చెప్పలేదు.)

అసలు విషయానికొస్తే, రూ.1,76,000/- కోట్లు అంటే, గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లనీ, నిజంగా జరిగిన ఖర్చు ఓ 80 వేల కోట్లనీ అనుకున్నా, రెండు సంవత్సరాల మన రాష్ట్ర బడ్జెట్ కి సమానం!

ఈ కుంభకోణం జరిగిన విధానంబెట్టిదనిన....అని మొదలెట్టడం అనవసరం....అందరికీ తెలుసు.

ఇప్పుడు జరుగుతున్న చర్చేమిటంటే, జేపీసీ వెయ్యడానికి వాళ్లకేమిటీ అభ్యంతరం? అని. 

మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. మన్మోహన్, తనకి పీయేసీ ముందు హాజరవడానికి అభ్యంతరం లేదు అని ప్రకటించడం, పీయేసీ ఛెయిర్మన్ ఎం ఎం జోషీ 'బ్లాక్ షీప్' గా మారి, లోపాయకారీ అంగీకారానికి వచ్చాడు అనీ.....ఇలా..... (తన రాజకీయాలు తనకి వుండొచ్చుగానీ, పార్టీకీ, దేశానికీ అంత ద్రోహం చేస్తాడు మురళీ మనోహర్....అంటే నమ్మేవాళ్లెవరు?!) 

ఇంకా, ప్రథాని యేమిటీ.....జేపీసి ప్రశ్నించడం యేమిటీ...? అని ఓకటీ!

యేం? ఇతర దేశాల్లో అధ్యక్షులూ, ప్రథానులూ, కమిటీల ముందు నిలబడి, జైలు శిక్షలు అనుభవించగాలేనిది, మన ప్రథాని యెక్కడనించో దిగి వచ్చాడా?

అసలు రహస్యం 4జీ ల వెనక్కాల వుంది. 

ఈ 4జీ లెవరు? 

ఓ ఎంపీకో, రోశయ్య సహా, సీనియర్ నాయకుడికో (మూడు కోతులు--ముగ్గురు మూర్ఖులు--కేకే, వీహెచ్, జీవీ (కాకా)ల సహితంగా) సోనియాతో అపాయింట్మెంట్ కావాలి అంటే, వెంఠనే యేర్పాటు చెయ్యగల అతి కొద్ది మందిలో ఒకడు 'సురారె' అనేవాడు మన రాష్ట్రం లోనే వున్నాడు. 

తన అనుచరులందరూ మొత్తం గుడిని ఆక్రమించుకోగా, స్వయంగా తిరుపతి వెంకన్న గర్భగుడిలోకి అపాయింట్మెంట్ లేకుండా, జొరబడిపోయి, అక్కడి వాళ్లని బయటికి తగిలేసి, తన 'ధ్యానం' పూర్తయ్యేవరకూ యెవరూ లోపలికి రావడాని వీల్లేదని తలుపులు మూసుకొని, భక్త కన్నప్పలో రావుగోపాలరావు లెవెల్లో, స్వామితో యేకాంతంగా మాట్లాడి, సరైన సమాధానం వచ్చాకే బయటికి వచ్చేవాడికి, సోనియా ఓ లెఖ్ఖా?

2004 నించీ ఇలా 'కోట్లతో కొట్టే' వైయెస్, 'ఆదర్శ్' చవాన్, ఆండిముత్తు రాజా, మధు కోడాల్లాంటివాళ్లని ఇబ్బడిముబ్బడిగా పెంచి పోషిస్తూ, వేల కోట్లు దండుకొంటూ, నా చేతులు 'క్లీన్‌గా వున్నాయి' అని మన్మోహన్ని చూపించమంటూ, వెనుక నాటకమాడుతున్న ఇటాలియమ్మ నాటకం బయటపడిపోదూ--జేపీసీ వేస్తే?! అసలే బీహార్లోనూ అక్కడా తల బొప్పికట్టిందాయే!

అదీ అసలు సంగతి!

ఇక, రేపణ్నుంచీ మన తెలంగాణా ఎంపీలందరూ 'ఆమరణ' నిరాహర దీక్షలు చెయ్యాలనుకుంటున్నారట. దీన్ని కాస్త విస్తరించి, "యూపీయే" ఎంపీలందరూ 'జేపీసీ వెయ్యడానికి వీల్లేదు' అని ఆమరణాలు చేసి, ఢిల్లీలో పీవీ నరసింహారావుకి మొదట్లో యెన్నెకరాలు కేటాయించాలనుకున్నారో (అసలు ఢిల్లీ పేరే 'శ్మశానాల నగరం') అన్నిటిల్లోనూ సామూహిక అంత్యక్రియలు జరిపించుకుంటే, దేశానికి దరిద్రం వదిలిపోను!

జగన్ ఓ పదిహేనుకోట్లో యెంతో ఖర్చుపెట్టి, రీసెర్చిలు చేయిస్తున్నాడట--సీ ఎం కావడానికి. దీన్నే అంటారు....స్వర్గానికెగరగలిగుండీ, వుట్టితో సరిపెట్టుకోవడం అని. 

కాబట్టి, నా మాట విని, హస్తినాపురి దారిబట్టి, మీ నాన్న మేట్లయిన కేవీపీ, సురారె, లరాగో లవాంటివాళ్ల ఇంటర్వ్యూ సంపాదించి, మన 'ఇటలీ దరిద్రాన్ని' వదిలించమని ప్రార్థించవయ్యా! అని సలహాకృతుడవుతున్నాడు!.

ఇవాళ మన రాష్ట్రం లోని ప్రతీవాడు అంటున్నాడు, "ఇవాళేమి చూశావు....డిసెంబరు 31 నాడు చూడాలి నా......." అని. 

నా 'శృంగార...' లోని 'ఓ పొడవు జోకు' కీ, వీళ్ల మాటలకీ యేమైనా తేడా వుందా?

ఆలోచించండి!

Wednesday, December 22, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ.....

(ఈ మధ్య నా వుద్యోగానికి రాజీనామా సమర్పించాక, బ్యాంకుకీ నాకూ మధ్య వ్యవహారాలు తీర్మానం అయి, నా పింఛను తో సహా అన్నీ చక్కబడడం ఇప్పటికి పూర్తయింది. ఇంకా చిన్నచిన్నవి కాలక్రమం లో పూర్తవుతాయి. ఈ సమయం లో నేను క్రమానుగతంగా నా "....కబుర్లు" వ్రాయలేకపోయాను. 

వాడెవడో "అసలు జీవితం రిటైర్ అయ్యాకే/60 యేళ్ల తరవాతే మొదలవుతుంది" అన్నట్టు, ఇన్నాళ్లూ స్కూటరుమీద వెళ్లి, వెన్ను వంగేలా, మెడనరాలు పట్టేసేలా ఓ కుర్చీలో కూర్చొని, మళ్లీ రాత్రికి స్కూటరుమీదే ఇంటికి వచ్చి, తిన్నాననిపించుకొని, ప్రక్కమీద వాలుతూ, షెడ్డులో వున్నకారుని యే వారానికొక్కసారో, లేకపోతే వరసగా రెండురోజులు సెలవలు వచ్చేలా చేసుకొని, దూరప్రయాణాలు చేసేటప్పుడో బయటికి తీస్తూ గడిపిన నాకు, ఇప్పుడు కావలసినంత స్వేచ్చ! లేడికి లేచిందే పరుగు అన్నట్టు, యెప్పుడు యేసమయంలో యెక్కడికి వెళ్ళాలన్నా, స్కూటర్ మీద జాలీగానో, వర్షమూ గట్రా వస్తే కారులోనో, ఒంటరిగానో, జంటగానో అక్కడవాలిపోయి, మళ్లీ తిరిగి రావడం.....ఓహ్! భలే బాగుంది. ఇంకా సౌకర్యం కోసం నా పాతకారు ఇచ్చేసి, సరికొత్తది.....ఇంకా విశాలంగా, అనేక 'ఇంప్రూవ్ మెంట్ల'తోటీ....కొనుక్కోవడం, దానికి అవసరమైన హంగులు అమర్చుకోవడం, తదుపరి జీవితం కోసం ప్రణాళికలు వేసుకోవడం....ఇలాంటివాటితో "చా....లా" బిజీగా గడుస్తోంది. ఇదిగో.....ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వస్తున్నాను.)

ఇవాళ్టి తాజా వార్త.....ఢిల్లీలో పేలిన....వుల్లిపాయ బాంబు!....అదీ, ప్రథానిగారి కుర్చీ క్రింద! దెబ్బతో ఆయన, "తన" ప్రభుత్వాన్ని, 'వుల్లిపాయల ధర తగ్గించండొరే! కనీసం ఇంక పెరగకుండా చూడండి ' అని ఆర్డరేశారట!

మరో "మూడు"వారాల్లో--అవే "తగ్గుతాయి" అని శరద్ పవారూ, "ఈ పెరుగుదల దురదృష్టకరం....ప్రభుత్వ శాఖలతో చర్చిస్తా.....నియంత్రించే విషయం 'పైవాడి ' చేతుల్లోనే వుంది.....మన ప్రయత్నం మనం చేద్దాం....!" అని ప్రణబ్ ముఖర్జీ, అన్నారట.

1977 లో వుల్లిపాయలు కిలో ఒక రూపాయి నించి అమాంతం 2 రూపాయలకి పెరిగిపోతే, ఇందిరాగాంధీని మట్టి కరిపించాడు "ఆమ్ అద్మీ!" ఇప్పటికి మళ్లీ, వుల్లి ధర రెట్టింపయింది కాబట్టి, తమ '....ల క్రిందకి ' నీళ్లు రాకుండా చూసుకోవాలని కాంగీలకి ఙ్ఞానోదయం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది!

వోటర్లూ....రాబోయే......ల్లో యేం చేస్తారు? ఇప్పుడే తేల్చుకోండి మరి....ఇంకెంతో సమయం లేదు!

Saturday, December 11, 2010

....కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ!

ఏటీయెం లో 1500/- డ్రా చెయ్యడానికి వెళితే, డబ్బురాకుండానే, యెకవుంట్లో ఖర్చు వ్రాయబడిందట ఒకాయనకి ఆంధ్రా బ్యాంకు ఖాతాలో. ఆయన లబో దిబో మన్నా, జవాబు రాలేదట.

చివరికి బ్యాంకింగ్ ఆంబుడ్స్ మన్ ఆ 1500 తోపాటు, రోజుకి 100 చొప్పున పరిహారం కూడా చెల్లించమని ఆదేశిస్తే, సంఘటన జరిగిన 322 రోజుల తరవాత, అలాగే 32,200 కూడా 'పువ్వుల్లో పెట్టి' ఖాతాలో జమ చేశారట!

దీనికి "సహకరించిన" వినియోగదారుల సంఘం జిల్లా వుపాధ్యక్షుడుకీ, బ్యాంకు వున్నతాధికారులకీ (తోక కోసి సున్నం పెట్టి?!) కృతఙ్ఞతలు చెప్పారట సదరు బాధితుడు!

భళా వి సం లూ & ఆంబుడ్స్ మన్!

ఇదొక "అదనపు" సంపాదనా మార్గమా!? వచ్చే రెండేళ్లపాటు "రిలయన్స్" సంస్థ మానవ వనరుల అవసరాలకోసం, రామ చంద్రా ఇంజనీరింగ్ కళాశాల (ఏలూరు) క్యాంపస్ లోనే, వారి విద్యార్థులనే ఇంటర్వ్యూ చేసి, నియమించుకొంటామని ఆ రెండు సంస్థల మధ్యా "అవగాహనా ఒప్పందం" జరిగిందట! 

బాగుంది కదూ? సీట్లమ్ముకొని సంపాదిస్తున్న సంస్థలకి ఇంకా యెంత వెసులుబాటు!

సింపుల్! ఎం పీ 3 లేదు; అప్లికేషన్లు లేవు; ఇంటర్నెట్ సంగతి తెలీదు; కనీసం సంక్షిప్త సందేశాలు పంపుకొనే వెసులుబాటు కూడా లేదు! కేవలం ఫోన్లు చేసుకోడానికీ, వస్తే వినడానికి మాత్రమే వుపయోగించే సెల్ ఫోన్ తయారు చేసిందటో కంపెనీ! బ్రిటన్ కు చెందిన ఆ సంస్థ పేరు 'జాన్స్ ఫోన్' ట! (సరిగ్గా, అబ్దుల్ కలాం లెవెల్లో నేను కలలు కన్నది అలాంటి ఫోన్ కోసమే! కానీ నేను వాడుతున్న దాంట్లో ఎసెమ్మెస్ వుండి, "8946 రూపాయల వాచీని కేవలం 894 చెల్లించి సొంతం చేసుకోండి" లాంటి సందేశాలతో ఛస్తున్నాను--డిలీట్ చెయ్యలేక!)

ఇలాంటి ఫోన్లు యే 100 రూపాయలకొకటో అమ్మేస్తే, 1929 నాటి ఆర్థిక సంక్షోభం మళ్లీ వచ్చి, "అంగళ్ల సెల్ ఫోన్లు అమ్ముకున్నారిచట" అని పాడుకొనే అవకాశం నోకియా, శామ్‌సంగ్ వగైరాలకొస్తుందేమో! (నాకు భలే సంతోషం!)

అరుణ్ దుగ్గల్ అనే ఆయన 18-11-2010 న ఈనాడు దినపత్రిక యెనిమిదో పేజీలో "అర్థిక సంఘటితం" మీద ఓ వ్యాసం వ్రాశాడు. చదవండి. దానిపై నేను వీలువెంబడి ఓ టపా వ్రాస్తాను. అదీ చదవండి.

"వ్యతిరేక వాది" మణిశంకర్ అయ్యర్ తనను తాను "పిలూ మోడీ" కంటే అధికుడిననుకుంటాడు.....కానీ.....ఆయనకి వస్తున్న "సమాచారం" దేశం లోని అత్యధిక వున్నతాధికారులైన "తమిళ" బుర్రోవాదులనించే అని అందరికీ తెలుసు!

ఈ మధ్య ఆయన భారత్ యెప్పటికీ ఓ ప్రపంచ శక్తి గా యెదగలేదు--అది ఓ భ్రమ--కల్పిస్తున్నవాడు ఒబామా! అని ఓ చిన్నసైజు టపాకాయ పేల్చాడు! (ఆయన కవి హృదయం--ఈ కాంగీల పాలనలో అని అయి వుండవచ్చు!)

నేను చెపుతున్నాను--సరైన దీశానిర్దేశం వుంటే, 2020 కల్లా మనదేశం చీనాను కూడా (అమెరికా జపాన్లతోసహా) అధిగమించగలదు! యెదురులేని మిలిటరీ శక్తిగాకూడా! (అబ్దుల్ కలాం పంథాలోనో, ప్రతిభా పాటిల్ పంథాలోనో కాదండోయ్! నెపోలియన్ పంథాలో!)

యేమంటారు?

తృటిలో తప్పిన......లు

06-12-2010 న, విశాఖపట్నం నుంచి సికిందరాబాదు వెళ్లే జన్మభూమి (2805) కి చాగల్లు వచ్చేసరికి ఫైబర్ బ్రేక్ స్థంభించడంతో, స్టేషన్లో సుమారు 8 నిమిషాలు నిలిపేసి.......(అట!)

డ్రైవర్ అప్రమత్తంతో, పెను ప్రమాదం తప్పిందని స్టేషన్ సిబ్బంది చెప్పారట!
(లేకపోతే.....అని వారు చెప్పఖ్ఖర్లేదుగా?)

Tuesday, December 7, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ!

ఇప్పటివరకూ మన ముక్కు--సారీ, ముఖ్యమంత్రి యేమేమి నిర్ణయాలు తీసుకున్నాడో గానీ, ఒకటిమాత్రం నాకు బాగా నచ్చేసింది. తనకి దండలూ, బొకేలూ, శాలువాలూ ఇవ్వడం మానేసి, అందుకు అయ్యే ఖర్చుని 'ముఖ్యమంత్రి సహాయనిధి' కి చెక్కుల రూపం లో ఇమ్మన్నాడట.

మొన్న ప్రభుత్వోద్యోగులు ఓ పాతికవేల చెక్కునిచ్చారట. ఒకాయన వినకుండా శాలువా కప్పబోతే, సున్నితంగా తిరస్కరించారట. బాగుంది కదూ!

మరి మొన్న 04-12-2010 నాడు, ఏపీజెన్‌కో వారు ఓ 25 లక్షలు మాత్రమే ముఖ్యమంత్రి సహాయనిధికి యిచ్చారట! యే ఖాతాలోంచి, యెందుకు, యిప్పుడే యిచ్చారో యెవరికైనా తెలుసా?

అన్నట్టు, యోగా గురు బాబా రాందేవ్ ఓ రెండేళ్లలో ఓ కొత్త రాజకీయ పార్టీ పెడతాను అని ప్రకటించాడు. అంటే......యెంత, యెలా సంపాదించాడో సంబంధితులు ఓ లుక్కేస్తే యెలా వుంటుందంటారు? అయినా మనకెందుకులెండి రాజకీయాలు.

మొన్న 03-10-2010 న భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కుమారుడి వివాహ రిసెప్షన్ యెంత వైభవంగా జరిగిందంటే, రాజకీయ, సినీరంగ ప్రముఖులు వేసుకొచ్చిన "ప్రత్యేక విమానాలతో" ఆరోజు రాత్రి నుంచి మరునాడు మధ్యాహ్నం వరకూ, గగనతలంలో ట్రాఫిక్ జామ్ ఐపోయి, సాధారణ విమానాలూ, ప్రయాణీకులూ ఇబ్బందులు పడ్డారట--ఆలస్యాలు అయిపోయి!

ఇక 04-10-2010 న సాయంత్రం యేర్పాటు చేసిన 'సాధారణ విందు' కు 2 లక్షల మందికి మాత్రమే యేర్పాట్లు చేశారట!

వాళ్ల పార్టీ మీటింగుని ఖరీదైన డేరాల్లో, పెద్దవాళ్లకి పెద్దవీ, చిన్నవాళ్లకి చిన్నవీ, ఏసీలతోనూ, లేకుండాను--ఇలా నిర్వహించి, ఇండీపాప్ సింగర్లా పాటలు పాడుతూ గెంతుతుంటే యేమిటో అనుకున్నాను! నిజంగా అసాధ్యుడే!

ఇక మొన్న 04-12-2010 న దుబాయి నుంచి పుణె వస్తున్న ఎయిరిండియా విమానం గాల్లో ఒక్కసారిగా 7 వేల అడుగుల మేర క్రిదకు పడిపోయిందట!

కారణం యేమిటనుకున్నారు? పైలెట్ స్నానాలగది లోకి వెళ్లినప్పుడు, కో-పైలెట్ 'తన సీటును ముందుకు జరిపే ప్రయత్నంలో' చెయ్యి ఓ మీటకి తగిలి, విమానం 26 డిగ్రీల కోణం లో వంగి క్రిందకి పడిపోతుంటే, పైలెట్ కాక్ పిట్లోకి వచ్చి దాన్ని నియంత్రించాడట!

ఇది అధికారికంగా డి జీ సీ యే చెప్పిన మాటే! ఆవిమానం లో 113 మంది ప్రయాణీకులు వున్నారట.

మరి ఆ కో-పైలెట్ కి ఇంతకు ముందు ఓ గాడిదనైనా నడిపిన అనుభవం వుందో లేదో! విమానంలో ముఖ్యమైన 'కంట్రోల్స్' అలా యేడుస్తున్నాయేమో!  

Thursday, December 2, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ....

"అజీమ్ ప్రేమ్‌జీ".....భారతరత్న ఇవ్వదగ్గ ఇంకో 'కర్ణుడు'!

"నా పిల్లలు రోడ్డున పడవలసిన అవసరం రాకుండా మాత్రమే వాళ్లకిస్తాను" అంటూ తన ఆస్థి లో 99% దానం చేసిన వారెన్ బఫెట్ మాటలని ఇంకోరకం గా చెపుతూ......

 "(నా)పిల్లలకు నా ఆస్థుల్లో చాలా కొద్దిభాగమే ఇచ్చినా.....తిని అరిగించుకొనేందుకు అది వారికి తరతరాలకు జన్మజన్మలకు సరిపోతుంది. అందుకే నా ఆస్థుల్లో అధిక మొత్తాన్ని దాతృత్వానికి, సమాజ సంక్షేమానికి ఇవ్వాలనుకుంటున్నా!" అంటూ రూ.8,846 కోట్లు వితరణ చేశాడు--అదీ--విద్య నిమిత్తం!

మహాత్ముడి సూచనని అక్షరాలా పాటిస్తున్న గాంధేయుడిగా చెప్పుకోవాలి ఈయనని.

తన 'నటనకి' కొన్ని కోట్లూ, తన కొడుకూ, కోడలూ తమ తమ 'నటనలకి' కొన్ని కోట్లూ సంపాదించుకుంటున్న ఓ పెద్దాయనకి ఈ మాటలు వినిపిస్తున్నాయో లేదో?

(అయినా అది వారి స్వవిషయం అనుకోండి....!)

చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకుంటున్న ఓ ఇటాలియమ్మ ప్రాపకం తో, తానెప్పుడో ఉత్తర ప్రదేశ్ లో కొన్న భూమి ద్వారా 'రైతు' అని ముద్ర వేయించుకొని, ఒక రాష్ట్రం లో రైతు అని ముద్ర పడితే, దేశావ్యాప్తం గా ఇంకే రాష్ట్రం లోనైనా రైతే అవుతాడు అనే నిబంధన లొసుగుని వుపయోగించుకొని, మహారాష్ట్ర లో కొన్న కొన్ని యెకరాలలో వ్యవసాయం కోసం ట్రాక్టరు దున్నుతున్నట్టు పేపర్లలో ఫోటోలు వేయించుకొని, నేను రైతునే సుమా అని స్వడబ్బా కొట్టుకొంటున్నాడీయన!

ప్రథాని లా ఆయన కూడా "ఆదరణీయుడే" మరి!

యేమంటారు?


ఇక, అజ్మల్ కసబ్ అనేవాడు "సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో పాకిస్తాన్ నుంచి ఢిల్లీవచ్చి.....కేవలం 'హిందీ సినిమాలు చూడడానికి మాత్రమే' ముంబాయికి వస్తే, వుగ్రవాదులతో సముద్రం మీద పడవలో వచ్చాడని తప్పుడు కేసు పెట్టారు" అనీ, వాడు "వుగ్రవాదులతో పడవలో వచ్చాడు అనడానికి ఆథారాలు లేవు" అనీ, వాడి తరఫు వాదిస్తున్నారట న్యాయవాదులు అమిన్ సోల్కార్, ఫర్హానా షా అనేవాళ్లు!

నేనిదివరకే చెప్పినట్టు, వాడికి నేచెప్పిన శిక్ష విధించి, వాడి మద్దతుదారులకి కూడా ఆ ప్రక్కనే అలాంటి శిక్షే వేస్తేగానీ ఇలాంటి దేశ ద్రోహులకి బుధ్ధి రాదంటాను.

అవునా?

Wednesday, December 1, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ.....

పాపం--మన వయసుమీరిన (ఆ సంగతి ఇప్పుడే తెలుసుకొని) చవటగుండు ముఖ్యమంత్రిని సుతిమెత్తగా తొలగించి, "ముక్కు మంత్రి"ని ఆ స్థానం లో కూచోబెట్టింది అధిష్టానం.

(ఈయన ముక్కే ప్రముఖంగా కనబడుతుండటం తో, కార్టూన్లో అలాగే చిత్రిస్తున్నారు మరి! 26-11-2010 నాటి 'ఇదీ సంగతి ' లోనూ, మొదటిపేజీ టాప్ లోనూ వేసిన శ్రీధర్ చక్కటి కార్టూనులు చూడండి.)

దాని ప్రభావం మన లక్షలకోట్ల యువనేతమీద భారంగా పడి, యేకంగా పార్లమెంటుకీ, పార్టీకీ రాం రాం చెప్పి, తల్లితోకూడా చెప్పించాడు. 

అదిగో--ఇప్పుడే మంత్రివర్గం యేర్పడడం, అసమ్మతిగళాలు విచ్చుకోవడం--కాంగీ సంస్కృతి ప్రతిబింబించబడడం--మమూలే!

"బిఫోర్ దేరీజ్ క్రొకోడైల్ ఫెస్టివల్!" అన్న శంకర్ దాదా, అవసరమైతే మంత్రివర్గం లో ప్రవేశిస్తామన్నాడు--నాలుగో యెన్నో పోస్టులు రిజర్వు చేశారని చెప్పుకొంటున్నారు!

ఇక ఇతర విషయాలకొస్తే, ప్రపంచ దేశాలన్నిటి గురించీ అమెరికా చేసిన రహస్య ఆలోచనలని, ఆ ప్రభుత్వం బతిమాలినా వినకుండా, 2 లక్షల 50 వేలకి పైగా రహస్య పత్రాలని బయటపెట్టింది 'వికీలీక్స్ ' మన అఙ్ఞాతలు వాళ్లని ఆదర్శంగా తీసుకొని, ప్రపంచానికి పనికొచ్చే రహస్యాలని బయట పెడితే బాగుంటుంది. 

ఈ సందర్భం లో, 'జనసంఘం ' (ఇప్పటి బీజేపీ పూర్వ రూపం) నాయకుడు 'పిలూ మోడీ' అని వుండేవాడు. 1972 ప్రత్యేక ఆంధ్రోద్యమం లో ఆయన మా వూరు వచ్చినప్పుడు ఆయన పరిచయ భాగ్యం లభించింది. చెట్టంత మనిషి, తగ్గ లావుతో, తెల్ల భల్లూకం (ధృవపు యెలుగుబంటి) అనేవాళ్లం సరదాగా. వుధృతంగా వుద్యమంలో పాల్గొంటున్న మా నిరుద్యోగుల సంఘాన్ని "ఆంధ్ర రాష్ట్రం వస్తే, మీ సంఘాలు రద్దయి పోతాయి" అని దీవించాడు. 

దేశం లో యెక్కడ యేమి జరిగినా, క్షణాల్లో ఆయనకి సమాచారం చేరేది--వెంటనే ఓ బాంబు పేల్చినట్టు దాన్ని ప్రకటించి, ఇందిరాగాంధీని పరుగులు పెట్టించేవాడు! అలాంటి నెట్ వర్క్ ఆయనది! అలాంటి నాయకుల అవసరం యెంతైనా వుందిప్పుడు.

మిగిలినవన్నీ మరోసారి.