Thursday, September 26, 2013

కబుర్లు - 102


అవీ, ఇవీ, అన్నీ

మొన్ననే "అర్థంలేని ఆథార్" అంటూ సణిగాను. వెంటనే వార్త వచ్చింది. కర్ణాటక హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్.పుట్టస్వామి సుప్రీం కోర్టులో వేసిన కేసులో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని "నిత్యావసరాలు వగైరాల విషయంలో ఆథార్ కోసం నిర్బంధించడం రాజ్యాంగానికి విరుధ్ధం" అనీ, ఆ కార్డు పొందాలా వద్దా అన్నది పౌరుల ఇష్టాయిష్టాలకి వదిలేయాలి అనీ ఆదేశించిందట.

లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి ఆథార్ లేకపోతే జీతాలు కూడా ఇవ్వమని, జనాలకి వివాహ ధృవీకరణ పత్రాలు ఇవ్వమనీ ప్రకటిస్తారా మహారాష్ట్ర ప్రభుత్వం!

ఇప్పటికి 50 వేల కోట్లు ఖర్చుపెట్టేశామని ప్రకటించారట కోర్టులో! (అది ఒక్క నందన్ నీలేకణి ఖర్చుపెట్టింది మాత్రమే. ఇంక రాష్ట్ర ప్రభుత్వాలూ, ప్రభుత్వ విభాగాలూ ఖర్చు పెట్టిందీ, ప్రైవేటువాళ్లు తిన్నదీ కలిపితే, కొన్ని లక్షల కోట్లు అవుతుంది.)

ఇక్కడ మా జిల్లాలో, కలెక్టరూ, బ్యాంకువాళ్లూ, గ్యాస్ డీలర్లూ గుండెలు గోకేసుకుంటూ, "ప్రతీ బ్యాంకులో సీడింగుకోసం ప్రత్యేక కౌంటర్లు యేర్పాటు చెయ్యాలి, యూఐడీ నెంబర్లు పొందడానికి వలసిన సమాచారం అప్ లోడ్ చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక లాగింగ్ వ్యవస్థ యేర్పాటు చెయ్యాలి" అంటూ చొక్కాలు చింపేసుకుంటున్నారు. మరెన్ని కోట్లు తగలేస్తారో!

ద్రవ్యోల్బణం దారి దానిదే, మన ప్రభుత్వాల దారి వాటిదే, మనదారి మనదే! 

పండగలూ, పవిత్రమాసాలపేరుతో, విగ్రహాలకి శాకాంబరాలూ, ఖాద్య అభిషేకాలూ, కరెన్సీ అలంకరణలూ పేరుతో మరింతగా ద్రవ్యోల్బణం పెరగడం ఖాయం. ఈ మధ్య కొత్తగా 3 క్వింటాళ్ల 'పంచదార' అభిషేకాలు కూడా మొదలు పెట్టారు!

కేంద్ర వ్యవసాయ మంత్రేమో, ఇంకో మూడువారాల్లో ఉల్లిపాయల ధరలు తగ్గుతాయి అంటున్నాడు--కనీస యెగుమతి ధర టన్నుకి రూ.900/- కి పెంచేశాడుకాబట్టి ట. (అసలు యెగుమతి యెందుకు చేయ్యాలి అంటే, అదంతే అంటాడు. మిగిలిన వె.ధ.వ లు ప్రభుత్వం వుల్లిపాయలు అమ్ముకుంటోందా? అంటున్నారు!). తన లాబీలకోసం, మిల్లులనిండా చెక్కెర నిలవ వున్నా, దిగుమతి చేసుకోడం మానడు. యూపీయే వారు ఆయనని పీకలేరు మరి!

ఆర్బీఐ వాళ్లు కొన్ని సంవత్సరాలుగా "క్లీన్ నోట్ పోలసీ" పేరుతో, నోట్లకి చిల్లు పెట్టద్దు, పిన్నులు కొట్టద్దు, పేర్లూ అంకెలూ వ్రాయద్దు" అంటూ బ్యాంకులని వూదరకొడుతూనే వున్నారు (బ్యాంకు వుద్యోగులు నష్టపోతూనే వున్నారు). మొన్న మాత్రం ఇలా అలంకరణలకి కరెన్సీ వుపయోగించకుండా చూడాలి అని ప్రభుత్వాలకి ఓ ఆదేశం జారీ చేసి చేతులు దులుపుకున్నారు.

ఘనతవహించిన తి తి దే వారు బంగారు రేకులు తాపడం చేయించిన, 29 టన్నులు బరువైన రథం చేయించేశారట. (ఆ 29 లెఖ్ఖేమిటో.....పోనీలెండి....108 టన్నులో, 1080 కేజీలో అంటూ పవిత్ర లెఖ్ఖలు వల్లించలేదు!). బంగారం దిగుమతులు తగ్గమంటే యెలా తగ్గుతాయి?

పాత సీబీఐ జేడీ గారు పర్యటనలు చేసుకొంటూ, పాఠాలు చెపుతాను, గురుకుల పాఠశాల స్థాపిస్తాను వగైరా ప్రకటనలు చేస్తున్నాడు. వుద్యోగంలో యేపనీ అప్పచెప్పలేదేమో ప్రభుత్వం వారు. 

ఇదివరకే చెప్పాను--అంతలా ఓవర్ యాక్షను చేసి, రాత్రీ పగలూ లేకుండా గుడ్డలూడాదీసుకున్నంత పని చేసి, దర్యాప్తులు చేసినా, వృషణాయాసం తప్ప, ఒరిగేదేమీ వుండదు అని. ఇప్పుడు లక్షకోట్లనుంచీ, కొన్ని పదుల డొల్ల కంపెనీలనుంచీ, 43 వేల కోట్లో యెంతో కీ, రెండు మూడు కంపెనీలకీ సీబీఐ పరిమితమయిపోయి సూత్రధారి విడుదలై పోయాడు బెయిల్ మీద. రేపు గాలి కూడా కర్ణాటక లో ఓ పార్టీ పెట్టి, వైకాపా ద్వారా రాయబారం నడిపిస్తే, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారేమో! 

ఇలాంటి ప్రభుత్వోద్యోగులకి నా ప్రగాఢ సానుభూతి.


Saturday, September 21, 2013

కబుర్లు - 101



అవీ, ఇవీ, అన్నీ

దాదాపు సంవత్సరం అయిపోయింది బహిరంగంగా సణిగి.....కారణాలకేం......సవాలక్ష. ఇదిగో మళ్లీ ఇప్పుడు.

అర్థంలేని ఆథార్: మన ప్రభుత్వంలోని రా నా లు పార్లమెంటుతో యెలా ఆడుకుంటున్నారో చూస్తే, మన ఎం పీ లు--తమ జీతాలూ, ఇతర ఉపయోగాలూ, పెన్షన్లూ తప్ప--యేమి బావుకుంటున్నారా అనీ, వాళ్లకి వోట్లు వేసిన ప్రజల్ని యెంత వెర్రి వెధవలుగా జమకడుతున్నారో అనీ అనిపించడం లేదూ? 

ఒక్క ఆథార్ విషయం లోనే, మంత్రులు అనేకసార్లు "ఆథార్ ఒక గుర్తింపు సంఖ్య మాత్రమే" అనీ, "గ్యాస్ కనెక్షన్లకీ ఆథార్ కీ సంబంధం లేదు" అనీ, "ప్రభుత్వ పథకాలకీ ఆథార్ కీ సంబంధం లేదు" అనీ, "ఆహార భద్రతకి ఆథార్ లేనివాళ్లు కూడా అర్హులే" వగైరా సమాధానాలు--లిఖితపూర్వకంగా--ఇచ్చారు.

కానీ, జరుగుతున్నది? మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో, గ్యాస్ బుకింగ్ కి ఆథార్ లింకు పెట్టేశారు మొన్న ఏప్రియల్ నెల నుంచీ! మా జిల్లాతోపాటు, ఇంకొన్ని జిల్లాలని కూడా అక్టోబరు నెలనుంచీ గ్యాస్-ఆథార్ లింకు క్రిందికి తెస్తామని ప్రకటించారు. (దీనికో పదబంధం--ఆథార్ సీడింగ్--అంటూ తయారు చేశారు. అది వేరే ప్రహసనం). 

ఓ ప్రక్క జిల్లాలో ఇంకా అందరికీ ఆథార్ నెంబర్లు రాలేదనీ, కొన్ని లక్షల మందికి ఇంకా రావాలనీ, వాళ్లలో గ్యాస్ కనెక్షన్లు వున్నవాళ్లు కొన్ని లక్షలమంది అనీ, ఆథార్ వచ్చినవాళ్లలో సీడింగు కానివారు కొన్ని లక్షలు అనీ, ఈ లోగా ఓ 7న్నర లక్షల మందికి నమోదు చేసిన వివరాలు సాఫ్ట్ వేర్ లోపంతో మాయం అయ్యాయి అనీ, అది బాగు పడితే అందులో కొంతమందికి ఆథార్ వచ్చే అవకాశం వుండొచ్చు అనీ, అందరికీ ఆథార్ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు అనీ, 'త్వరలో' శాశ్వత నమోదు కేంద్రాలు తెరుస్తాము అనీ--ఇలా వెర్రి మొర్రి ప్రకటనలు చేస్తూనే వున్నారు అధికారులు! 

సందట్లో సడేమియా లా, కొన్ని బ్యాంకులు గ్యాస్ కంపెనీలతో కుమ్మక్కు అయి, తమ వ్యాపారం పెంచుకొనే వ్యూహంలో భాగంగా, వినియోగదారుల వివరాలు సేకరించి, వారి పేర్లతో ఖాతాలు తెరిచేసి, అథార్ సీడింగ్ చేసేసి, ప్రభుత్వ సబ్సిడీని ఆ ఖాతాల్లో వేసేసుకున్నారట! పాపం జనాలు తమకు అదివరకే వున్న ఖాతాలకి సబ్సిడీ రాలేదే అని వెర్రి చూపులు చూస్తున్నారట. 

ఈ లోగా, మా జిల్లాలో లింకుని ఓ నెల ముందు నుంచే, అంటే సెప్టెంబరు నెలనుంచే, అని ప్రకటించి మొదలెట్టేశారు. ఇక జనాల పాట్లు ఆ పైవాడికే యెరుక! పైగా, ఇప్పటికే ఆరు సిలిండర్లు తీసేసుకుని వుంటారుకాబట్టి, మిగిలిన మూడూ "పూర్తి ధర" చెల్లించేసి కొనేసుకుంటే, ఆథార్ వచ్చేక యేకంగా మూడింటి సబ్సిడీ ఒకేసారి ఇచ్చేస్తారట! ".....తలకి రోకలి చుట్టడమొకటే తరవాయి" అన్నట్టు.

అసలు ఆథార్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అని చమురు కంపెనీలకి యెవరు అధికారం ఇచ్చారు? ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పగలిగిన--వెయ్యేళ్లు నంతో ర్థిల్లాలి అనుకొనే రా నా లు--యెవరైనా వున్నారా? 

ప్రజలలో యే వొక్కరైనా "నాకు ఆథార్ వల్ల ఇదివరకు లేని ఫలానా కొత్త ప్రయోజనం కలిగింది" అని గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా?

ఇంక మనం "ఈ ఆథార్ ని రద్దు చేసి, దాని వ్యవహారంలో ప్రభుత్వాలు యెంత ఖర్చు పెట్టాయి, అందులో యెన్ని లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి మొదలైన విషయాల్లో దర్యాప్తు చేయించి, బాధ్యులకి శిక్షలు పడేలా చేస్తాము" అని ప్రమాణం చేసే వాళ్లకే వోటు వేస్తాము అని వుద్యమం లేవతీస్తె తప్పేమైనా వుందంటారా?

ఇంక రాష్ట్రంలో వుద్యమాల విషయం యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు తెలుగువాళ్లందరూ కలిసి, మదరాసునగరం (ఇప్పటి చెన్నై) రాజధానిగా, యానాం, బళ్లారి, హోస్పేట వగైరాలతో "విశాలాంధ్ర" కావాలని "ఎర్తు" పెడితే గానీ, పిచ్చిదంబరం లాంటి యూపీయే మంత్రులకి దిమ్మతిరిగి బొమ్మ గూట్లో పడదు అని నా వుద్దేశ్యం. మీరేమంటారు?

మొత్తానికి కొరకరాని కొయ్యగానే పదవీ విరమణ చేసేశారు దువ్వూరివారు. ఇంక జున్నుముక్క లాంటి "రాజన్" వచ్చారని సంతోషించినంతసేపు పట్టలేదు చాలామందికి. "ద్రవ్యోల్బణం" మాత్రమే బాగా దృష్టిలో వుంచుకొని, కీలక రేట్లు తగ్గించకుండా, రెపో రేటు పెంచుతూ, ప్రకటన చేసేశారు! పనిలో పనిగా, వ్యవస్థని ఆర్ బీ ఐ అదుపులో లేకుండా చేస్తున్న "లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ"; "మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ" వగైరాలనీ, అసలు రిపాజిటరీనే రద్దు చెయ్యగలిగితే యెంతో సంతోషిస్తాను నేను!

ప్రస్తుతానికింతే.......