Sunday, April 25, 2010

బండారం......


.....బయట పడింది

లేదా, బయట పెడతాను అని బెదిరిస్తారు--లలిత్ మోడీ లాంటి వాళ్ళు.

అసలు యెక్కడిదీ 'బండారం'?

'భాండాగారము'--అంటే, కుండలు నిక్షిప్తం చేసే చోటు.

అప్పట్లో లోహపాత్రలు లేవుకాబట్టి, కుండలలోనే నిలువ చేసేవారు సమస్త సంపదల్నీ--బంగారం వెండీ కావచ్చు, నెయ్యీ నూనీ కావచ్చు, పప్పులూ వుప్పులూ కావచ్చు, పుస్తకాలు కావచ్చు--యేమైనా. ఆ చోటునే ఫలనా 'భాండాగారం' అనేవారు.

అవసరాన్ని బట్టి, అవి నేలమాళిగల్లో కూడా వుండేవి. శత్రువుల నించి ప్రమాదం వుంటే, అవి రహస్య స్థావరాల్లో కూడా వుండేవి. అక్కడకి వెళ్ళడానికి పటాలూ (మేప్ లు), రహస్య కోడ్ లూ, కొండ గుర్తులూ యేర్పాటు చేసుకొనేవారు.

తరవాత్తరవాత, పాత్రలూ, పెట్టెలూ మారినా, పేరు మాత్రం భాండాగారం అనే స్థిరపడింది.

తంజావూరులో వున్న 'సరస్వతీ మహల్' అనేది ఓ పుస్తక భాండాగారం! (అక్కడ వున్న తాళపత్ర గ్రంధాలూ అవీ ప్రపంచం లో మరెక్కడా లేవంటారు.)

రహస్య గోపనం లో వున్న భాండాగారాన్ని, బయట పెట్టడమే--'బండారం బయట పెట్టడం'!

ఈ పదానికి అనేక రూపాంతరాలు--భండారం, బంగారం--ఇలా.

మన రాష్ట్రం లో మన ఆహార భాండాగారాలలో (ఎఫ్ సీ ఐ వాళ్ళ గోదాముల్లో) జరుగుతున్న 'బండారాన్ని' బయట పెట్టేవాళ్ళు యెవరూ కనపడటం లేదు!

మూడేళ్ళ క్రితం నాటి బియ్యమూ, రెండేళ్ళనించి యేడాది క్రితం నాటి గోధుమలూ నిండి వున్నాయట వాటిలో!

మూడేళ్ళు దాటిన వాటిని ముక్కిపోయాయని సముద్రం లో పారబోస్తారట.

ఇప్పుడు బియ్యం కొంటే, నిలవ చెయ్యడానికి జాగా లేదట! అందుకని కొనడం లేదట. మిల్లర్లనీ అమ్ముకోనివ్వడం లేదట. (ఇదో వంక! వాళ్ళకి)

మార్కెట్ లో బియ్యం ధర మాత్రం తగ్గదు! రేషన్ దుకాణాల్లో పంజాబు బియ్యాన్నే ఇస్తారు!

కీలకం యెక్కడుంది మరి?

రోశయ్యల్లోనా? అధికారుల్లోనా? జనాల్లోనా?

ఆలోచించండి.


Monday, April 12, 2010

'మద్యం' దిన మార్తాండులు


మద్యో రక్షతి రక్షితః

కాంగీరేసులు పుట్టినప్పటి నుంచీ మేనిఫెస్టోలో, "దశలవారీ మద్య నిషేధానికి కట్టుబడి వున్నాం" అని వాగ్దానిస్తారు.

చంద్రబాబు టైములో ఏ పీ బెవరేజస్ కార్పొరేషన్ అని ఓ ప్రత్యేక కార్పొరేషన్ మద్యం సరఫరాని నియంత్రించేది.

రెడ్డిగారు వచ్చాక, దానికి గవర్నమెంటు డిపార్ట్ మెంటునే యేర్పాటు చేసి, డిస్టిలరీ డెవలప్ మెంట్ బోర్డ్ అని పేరు పెట్టి, అభివృధ్ధిని చూపించమన్నారు!

2004 లో మన రెడ్డిరాజుగారు పీఠమెక్కాక, దాదాపు 2006 వరకూ బెల్టు షాపులు వందల్లో వుండేవి. పైగా, మద్యం సీసాలని వాటిపై ముద్రించిన ఎం ఆర్ పీ కన్నా కొంత తక్కువకి, లేదా ఎం ఆర్ పీ తో సమానం గా అమ్మేవారట.

తరవాత, రోశయ్యగారి వసూళ్ళకోసం, బెల్టులు వేల సంఖ్యలోకి వెళ్ళిపోయాయి. ఎక్సైజ్ వారికి ప్రొత్సాహకాలు ఇవ్వడం మొదలయ్యింది.

సరే......వుదరపోషణార్థం బహూకృత వేషం అనుకున్నా, బెల్టులూ, బూట్లూ, టై లూ ఇబ్బడిముబ్బడిగా పెంచినా, ఆదాయం కోసం అని సరిపెట్టుకోవచ్చు! కానీ, ఎం ఆర్ పీ కన్నా 10 నించి 40 రూపాయలు యెక్కువకి అమ్మడం అప్పుడే మొదలయ్యిందట. మరి దీన్నేమనాలి? ఇది యెవరి బాగుకోసం వుద్దేశించినది?

ఓ ఐదారు నెలలు ఇలా యెక్కువ ధరలకి అమ్ముకున్నాక, కంపెనీ రేటుని ఈ యెక్కువ ధరదగ్గరే స్థిర పరచేందుకు కంపెనీలకి అనుమతిస్తున్నారట. మళ్ళీ షాపులవాళ్ళు కంపెనీ రేట్లమీద 10 నుంచి 40 రూపాయలు యెక్కువకి అమ్మడం మొదలెడుతున్నారట!

ఈ విషవలయానికి అంతం యెప్పుడు?

రెడ్డిగారి వారసత్వం పుచ్చుకున్న రోశయ్య తక్కువ తిన్నాడా?

ఓ పెద్దా చిన్నా కాని పట్టణం లో కనీసం 10 మద్యం షాపులు వుంటే, ఒక్కొక్క షాపూ ప్రతీ నెలా ఎక్సైజ్ సీ ఐ గారికి ఒకటో తారీకుకల్లా 'ఒక లక్ష ' ముట్ట చెపుతారట. అలా 10 షాపుల్నించీ పది లక్షలు! మరి ఆ పైవాళ్ళూ, క్రిందవాళ్ళ సంగతి తెలియదు.

(ఇదైనా, వ్యాపారులు జనాంతికం గా వెల్లడించిన నిజం!)

మరి వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట కాదూ?

ఈ మధ్య మా పక్క జిల్లాలో ఎక్సైజ్ శాఖ కమీషనరు ఐ యే ఎస్ అట. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి గా ఓ ఐ పీ ఎస్ వచ్చాడట. రాగానే, ఎం ఆర్ పీ కన్నా యెక్కువకి అమ్ముతున్న దుకాణాలపై దాడులు మొదలు పెట్టాడట.

ఇంకేముందీ! కమీషనరుగారు బహిరంగం గా ఈ ఐ పీ ఎస్ గారి దుమ్ము దులిపేసి, "యెట్టి పరిస్థితులలోనూ దుకాణాలపై దాడులకి దిగొద్దు" అని ఎన్ ఫోర్స్ మెంట్ వాళ్ళకీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకీ అనధికార వుత్తర్వులు జారీ చేశారట.

చూశారా! యెంత బాగుందో?

వినియోగదారుడు (వాడు మద్య వినియోగదారుడైనా సరే) నష్టపోకుండా, వ్యాపారులు అడ్డం గా బలవకుండా చేసే యంత్రాంగం యేర్పాటు చెయ్యలేదా--మన ప్రభుత్వం?

ఇకనైనా బుధ్ధి చెపుతారా వీళ్ళకి?


Thursday, April 1, 2010

సమాధులూ.....

"ఇదోరకం వేలం....."

కుక్క మనిషిని కరిస్తే, అది వార్త కాదు. అదే మనిషి కుక్కని కరిస్తే, అది వార్త!--ఇది శతాబ్దాలుగా వాడుకలో వున్న మాట.

ఈ మధ్య టి.నరసాపురం మండలం యేపుగుంట గ్రామం లో ఓ కోటిలింగం అనే ఆయనకి చెందిన కోడి పెట్ట 'కొక్కొరోకో!' అని కూస్తోందట. ఇదో వార్తే కదా.

ఆ మధ్య యేలూరులో అదేదో కట్టడానికి తవ్వుతుంటే, కొన్ని సమాధులు బయట పడ్డాయట. అవి మునుపు అక్కడ పనిచేసిన బ్రిటిష్ వాళ్ళవని నిర్ధారించారట. కొన్నాళ్ళకి పురావస్తుశాఖవారు వాటిని స్వాధీనం చేసుకున్నారట. మొన్న వాటిని 'చారిత్రక ప్రాధాన్యం ' వున్న సమాధులుగా పరిరక్షించడానికి నిధులు కూడా కేటాయించారట--కొన్ని కోట్లో, లక్షలో!

మరి ఆ మాటకొస్తే, అన్ని సమాధులూ చారిత్రక ప్రాధాన్యం వున్నవే కదా? బ్రిటిష్ వాళ్ళ సమాధులూ, కుతుబ్ షాహీ సమాధులూ వూడబొడిచిందేమిటి? అవేమైనా తాజ్ మహళ్ళా! పిరమిడ్లా! పోనీ వాటి మీద శిల్పకళా, చిత్రకళా వగైరా యేమైనా వున్నాయా? మరి వాటిని ప్రత్యేకం గా పరిరక్షించడం, కోట్లు కేటాయించడం యెందుకు--కూలగొట్టి పారెయ్యక! (అందులో 'నాకేంటి?' అనేవాళ్ళకోసమేమో!)

ఆ మధ్య, ఢిల్లీ లో యమునానది వొడ్డున మన మాజీ ప్రధానులకి వేలాది యెకరాలకి యెకరాల విస్తీర్ణం లో సమాధులూ, స్మారక స్థలాలూ నిర్మించేస్తుంటే, కొన్నాళ్ళకి ఢిల్లీ 'సమాధుల నగరం ' గా ప్రసిధ్ధి చెందే రోజు దగ్గర్లోనే వుందని కథనాలు పత్రికల్లో సంచలనం రేపాయి. (మన పీవీ నరసిం హా రావుకి అక్కడ అంత్యక్రియలు నిర్వహించకపోవడానికి ఇదే కారణం అన్న లెవెల్లో సంజాయిషీ ఇచ్చారు కొందరు అధికారులూ, కాంగీరేసులూ!)

మరి అమెరికాలో జార్జి వాషింగ్టన్ కీ, లింకన్ వగైరాలకీ ఇలా వందల వేల యెకరాల్లో సమాధులు నిర్మించిన దాఖలాలు లేవు. అలాగే బ్రిటన్ లో చర్చిల్, అట్లీల్లాంటివారికి కూడా.

అటు అరబ్బు దేశాల్లోనూ లేదు, ఫ్రాన్స్ లాంటి దేశాల్లోనూ లేదు. ఒక్క చైనాలో మాత్రం, మావో కి కట్టించారు.

మరి మన ప్రత్యేకత యేమిటి? (ఇంకేమిటి! అందులో 'నాకేంటి?' అనేవాళ్ళు కోకొల్లలుగా వుండడమే!)

పోనీ గాంధీ నెహ్రూలవరకూ ఫరవాలేదు--వాళ్ళు దేశనాయకులు అనుకుంటే. మరి వరసపెట్టి అందరికీ యెందుకో!

నన్నడిగితే, విగ్రహాలే కాదు, సమాధుల్నీ కూలగొట్టాలి.