Tuesday, June 14, 2011

కబుర్లు - 56

అవీ, ఇవీ, అన్నీ


అయ్యింది.....'బారాందే' దీక్ష యెనిమిదోరోజున గుంటకట్టి గంటవాయించేసింది. ఆయనకన్నా సీ'నియరూ', 'జీవన కళా' గురువూ, సూడో శ్రీ శ్రీ, ఆయన్ని ఆఙ్ఞాపించి మరీ దీక్ష విరమింపచెయ్యవలసి వచ్చింది. చిరంజీవి రాజకీయ బాలుడు అనుకుంటే, ఈయన రాజకీయ పసిబాలుడు అని ముందే చెప్పాను! ("మేడం గారు మీ డిమాండ్లకి వొప్పుకుంటే, మీరు దీక్ష విరమిస్తారని నమ్మకం కలిగేందుకు ఓ వుత్తరం రాసి ఇవ్వండి" అన్న గుంటనక్కల మాటలని నమ్మేసి, విరమణ వుత్తరం ఇచ్చేసి, తీరా అది వాళ్లు బయటపెట్టేసేసరికి, "మోసం చేశారు" అని మొత్తుకొంటే యేమి లాభం?) ఇంకా కొమ్ములే మొలవని పొట్టేలు, యేకంగా మేరుపర్వతాన్నే ఢీకొంటే, యేమవుతుంది?

ఆయన గాలి తినైనా బతికేస్తాడు కానీ, కనీసం నాలుగురోజులు యెంతమంది నిలబడగలరు అని కూడా సణిగానిదివరకే! ఆయనేదో 'సాయుధ దళాలు' అన్నాడనే వంకతో, ఐదోరోజే మిగిలిన సెంటర్లలో "దీక్షాపరులు" దుకాణాలు సర్దేశారు! రవి శంకర్ కూడా, ప్రభుత్వ ప్రతినిధులని ఆయన తో చర్చించేలా చేద్దామని ప్రయత్నించి, ఛీ కొట్టించుకొన్నాడు!

కొసమెరుపేమిటంటే, రాజకీయపార్టీలవాళ్లు "హమ్మయ్య! మళ్లీ ఇప్పుడప్పుడే అవినీతిమీద పోరాటం చేసే సాహసం చెయ్యరెవరూ!" అని సంబర పడుతున్నారట. అందుకే దేనికైనా సమయం సందర్భం వుండాలన్నది.

వృధ్ధ జంబుకం, ప్రణబ్ "యెన్నికైన ప్రజా ప్రతినిధులని 'పౌరులు' ఆఙ్ఞాపించజాలరు!" అంటున్నాడు. అసలు కీలకం అంతా "యెన్నికైన" లోనే వుంది, ఆ సన్నాసులు 24 గంటలూ అవినీతిలో మునిగి తేలుతూ, నేర చరిత్రని పేజీలకి పేజీలు పెంచుకుంటూపోతూ, తమ అవినీతికి వ్యతిరేకంగా తమనే చట్టం చేసుకోమంటే వెధవ నాటకాలు ఆడుతున్నారు అనేకదా పౌరసమాజం మొత్తుకుంటున్నది? అందుకే కదా "జనలోక్ పాల్" కావాలంటున్నది? మొన్నటి వరకూ (మార్చ్ నెల వరకూ) ప్రథాని కూడా జనలోక్ పాల్ పరిథిలోకి రావాలన్న ఈ జంబుకం, మిగిలిన గుంటనక్కలూ, ఇప్పుడు 'ససేమిరా' అని యెందుకంటున్నట్టు? మరోసారి "అన్నా హజారే" వుద్యమించినా, బారాందే బాటలోనే ఆ వుద్యమాన్ని యెదుర్కోవచ్చు అని ఓ ధీమా యేర్పడిపోయినట్టుంది వీళ్లకి! "దేన్‌దార్దాన్‌దే" అని వాళ్లకి తెలీదనుకోను! ఇక్కడ మేరుపర్వతం "అన్నా" అని మరిచిపోవద్దు అని నా హెచ్చరిక వాళ్లకి. అసలు ఈ జంబుకాల దరిద్రం మన దేశానికి యెప్పుడు వదులుతుందో మరి! (అందుకే "అన్నా" తన తరువాతి వుద్యమంలో భాగంగా యెన్నికల సంస్కరణలని కూడా యెన్నుకున్నాడు!)



జైపాల్ రెడ్డి "మా పార్టీ ప్రాంతీయ, వుప ప్రాంతీయ తత్వానికి వ్యతిరేకం" అని వక్కాణించేశాడట. ఐదురాష్ట్రాలో యెన్నో యెన్నికలైపోయాయి, బారాందే దీక్ష భగ్నం అయిపోయింది, జనలోక్ పాల్ విషయం లో ఇంక అధిష్టానం మాటలని వల్లించడం తప్పితే వాళ్లు చేసే పనేమీ లేదు, చిదంబరం, మొయిలీల్లాంటివాళ్లకి చేతినిండా పని లేదు--ఇంకేం చెయ్యాలి? ఆంధ్ర దేశం గొడవల్లేకుండా వుంది! అందుకని, తెలంగాణా వారికి "గూర్ఖా లేండ్" తరహా ప్యాకేజీ ఇస్తాము, రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచుతాము, శ్రీ కృష్ణ కమిటీ కూడా అదే చెప్పింది" అని ప్రకటించి, మళ్లీ అగ్గి రాజేస్తారట! (వీళ్లిలాంటి ప్రకటనేమీ చెయ్యకపోతే కొంపేమైనా మునుగుతుందా ఇప్పుడు?) బాగుందికదూ రాజకీయం?



"డీ ఎం కే వాళ్ల అవినీతికి వ్యతిరేకంగా తమిళ ప్రజలు ఇచ్చిన తీర్పు" అని జయలలితా డబ్బా కొట్టేసుకొంటోంది. కాంగీ వాళ్లు వంతపాడుతున్నారు. రాజా, కనిమొళి, దయానిధి వంటివాళ్లకి శిక్షలు పడతాయని నమ్మకం వచ్చేసింది ఆవిడకి. అందుకని, తన వంతుగా ప్రభుత్వానికి యేమేమి షరతులు పెట్టాలో ఓ పెద్ద లిస్టే తయారు చేసుకొందట! అసలు పెద్ద గీత ప్రక్కన చిన్న గీతే కానీ, ఆవిడమాత్రం యేమి తక్కువ తింది? ఆ రోజుల్లో అవినీతి కొన్ని లక్షలకే పరిమితం అయ్యేది కాబట్టి ఆవిడ లక్షల్లోనే చేసేది. అదే కరుణానిధి టైములో ఆవిడే ముఖ్య మంత్రి అయ్యుంటే, కోట్ల కోట్ల లోకి పాకిపోయేది కాదూ? యెందుకొచ్చిన గురివెంద రాజకీయాలు!? కట్ట కట్టి వీళ్లందరినీ బంగాళాఖాతం లో పారేసే రోజు వస్తుందేమో--2014 లోగానే!



ఇంక మన రాష్ట్రం లో "కి కు రె" కి రోజులో, నెలలో దగ్గరపడ్డట్టున్నాయి.....బొచ్చె ని పీ సీ సీ అధ్యక్షుణ్ని చేయ్యగానే, ఒకటే గోల.....మొత్తం పదవుల్లో రెడ్లు యెంతమంది, కాపులెంతమంది, (కమ్మోళ్లందరూ టీ డీ పీ అని లెఖ్ఖ కాబట్టి వీళ్ల గొడవ లేదు), ఇంకొంతమందికి పదవులిస్తే అప్పుడు కాపులెంతమంది, రెడ్లెంతమంది, (బీసీ, ఏస్ సీ ల మాటేమిటి?) అందులో మళ్లీ కోస్తాకెన్ని, రాయల కెన్ని, తలంగాణాకెన్ని.....చిరంజీవి వస్తే యెలాగ? రాకపోతే యెలాగ?......ఇలా వొకటే గొడవ! రేపు గూర్ఖా లేండ్ ప్రకటన వస్తే, అప్పుడు చూడాలి వీళ్ల లెఖ్ఖలు!



రాక్షసీ! నీపేరు రాజకీయమా? అన్నరెవరో ఇదివరకే!

No comments: