Friday, February 25, 2011

కబుర్లు - 32

అవీ, ఇవీ, అన్నీ

మన దేశంలో "ఆదాయపు పన్ను విభాగం" పనిచేయడం ప్రారంభించి 150 యేళ్లు అయిన సందర్భంగా, రూ.150 విలువతో, వెండి, రాగి, నికెల్, తగరాలతో ఓ నాణెం విడుదల చేస్తారట!

ఇంక, ఓ శాఖకి 16 యేళ్ల వయసొచ్చిందనో, ఇంకో విభాగానికి మైనారిటీ తీరింది అనో, రూ.16/-; రూ.18/- వగైరా విలువైన నాణాలు విడుదల చేయడం మొదలెడతారేమో!

నిజంగా ఇలాంటి "అవిడియా"లు ఇచ్చేవాళ్లకి భారత రత్న కన్నా పెద్దది--యే "భారత వీర బుర్రో" అనో పురస్కారాలు ప్రకటిస్తే బాగుండును ప్రభుత్వంవారు!

సూర్యుడు "అత్యంత చురుకైన" దశలోకి రావడంవల్ల, "ప్రపంచ కత్రినా" యేర్పడి, జనజీవనం అస్తవ్యస్తం కావచ్చనీ, ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల నష్టాన్ని కలిగించవచ్చనీ, సమాచార వుపగ్రహాలు దెబ్బతినడం, విమానాలు కూలిపోవడం, విద్యుత్ అంతరాయాలూ యేర్పడవచ్చు అనీ, "బెడింగ్టన్" అనే శాస్త్రవేత్త ప్రకటించాడట.

సౌర తుఫాను ప్రభావం యెలావుంటుందో గతవారమే అనుభవంలోకి వచ్చిందట. దానివల్ల యేర్పడిన కాంతిపుంజం రేడియో సమాచార వ్యవస్థని అస్తవ్యస్తం చేసిందట.

2013 లో సూర్యుడు ఈ దశలోకి పూర్తిగా వస్తాడట. అప్పుడేమి జరగనుందో మరి!

2జీ లో, లైసెన్స్ లు పొందిన కంపెనీలు వాటాలను అమ్మేసిన కంపెనీల మూలాలు పాకిస్థాన్ లో వున్నాయి అనీ, హోం మంత్రిత్వ శాఖే ఆ విషయం చెప్పిందనీ, దేశ భద్రతకి ముప్పు "కోణం" లో పరిశోధన చెయ్యాల్సిన బాధ్యత సీబీఐ దేననీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిందట.

ఆ కోణానికి సంబంధించిన వివరాలేవీ తనకు తెలియవు అనీ, సుబ్రహ్మణ్యం స్వామి ఫిర్యాదు ప్రతి కూడా తనదగ్గర లేదు అనీ, సీబీఐ నిస్సిగ్గుగా చెపితే, స్వామి అప్పటికప్పుడు ఆ ప్రతిని అందజేశారట!

ఆ కుక్కతోక పట్టుకొని, గోదావరిని యెన్నేళ్లలో ఈదుతామో మరి!

ప.గో. జిల్లా వ్యాప్తంగా, కొన్ని కోట్ల విలువైన 200 యెకరాల దేవాలయ భూములు "ఆక్రమణల్లో" వున్నాయట. ఇది అధికారిక సమాచారమేనట. ఇంక లీజు వ్యవహారాల్లో దాదాపు 250 యెకరాల్లో విలువైన పంట దేవుడికి దక్కకుండా పోతోందట. మొత్తం అన్ని దేవాలయాలకీ దాతలు ఇచ్చిన 16 వేల యెకరాల భూమి ఈ శాఖ క్రింద వుండాలట. గాలికిపోయిన పేలపిండి కృష్ణార్పణం అంటూ , దస్త్రాలు వున్న భూముల విషయంలో మాత్రం కేసులు "నడుస్తున్నాయట." మిగిలినవాటిలో, అవి ఆక్రమించుకున్న రౌడీలూ, గూండాలూ జోలికి వెళ్లకుండా, తమ ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారట.

ఆలయల ఆస్థుల పరిరక్షణకి తాము కృషి చేస్తున్నట్లు ఆ అధికారి ఈ మధ్యనే పేర్కొన్నారట!

భీమవరం ఆర్ టీ వో ఆఫీసు 2003 లో యేర్పడితే, అప్పుడు సరఫరా అయిన "ప్రింటరు" తోనే ఇప్పటికీ సీ బుక్కులూ, లైసెన్స్ లూ, పర్మిట్లూ జారీ చేస్తున్నారట. ఫలితంగా ఇదివరకు తాలూకాఫీసు సీలు లా (బంగాళా దుంపని సగానికి కోసి, దాంతో ముద్రవేసినట్టు), నాసిరకం అక్షరాలూ, పోలిక కనిపించని ఫోటోలతో అవి విరాజిల్లుతున్నాయట.

"త్వరలోనే" క్రొత్త ప్రింటరు వచ్చేస్తుందని అధికారి సెలవిచ్చారట. 

ద్వారకా తిరుమలలో ఈ మధ్య తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న (22-02-2011) పాత అంబర్ ఖానా లో, రాత్రి రెండున్నర ప్రాంతంలో గ్యాస్ సిలిండరు పేలిపోయి, తునాతునకలై, సరుకుల బస్తాలు, కార్యాల బీరువాలు, ఇతరవస్తువులు చెల్లా చెదురయ్యాయట. జన నష్టం జరగలేదు కదా అని వూపిరి పీల్చుకొన్నారట.....అగ్నిమాపక యంత్రాలు వచ్చి, మంటలని అదుపులోకి తెచ్చాక!

వాస్తు పండితులెవరైనా ఆ వూరినీ, కొండనీ పరిశీలిస్తే బాగుండునేమో!

4 comments:

Anonymous said...

"మొత్తం అన్ని దేవాలయాలకీ దాతలు ఇచ్చిన 16 వేల యెకరాల భూమి ఈ శాఖ క్రింద వుండాలట."

Good information. Why the Secular corrupt Govt. and Bureaucrats control Hindu Temples?

Papers reported that Chiranjeevi wants to protects Waqf Lands. But he never spoke about protecting Hindu Temple lands.

How sad that political leaders belong to Hindu community (e.g. Chiranjeevi) shamelessly ignore one of the most pressing problem facing by Hindus.

Anonymous said...

మొన్న ఎక్కడో చదివాను, ఏదో దేవాలయం లో గర్భ గుడిలో ఉన్న కొండను డ్రిల్ చేసి పగలగొట్టారు అంట? ఎందుకంటారు?

A K Sastry said...

మొదటి అన్నోన్!

రాజకీయం తెలియకుండా రాజకీయాల్లోకి లాగబడ్డవాడు చిరంజీవి. అందుకే, యెందుకైనా మంచిదని కాంగీలో చేరిపోయాడు. మరి ఆ గూటిపలుకే పలకద్దూ?

A K Sastry said...

రెండో ఆన్నోన్!

దేవుడి బొమ్మ పెట్టడానికి అడ్డం వచ్చి వుంటుందేమో! అయినా గర్భగుడిలో కొండెలా వుందో?