Thursday, February 3, 2011

కబుర్లు - 28

అవీ, ఇవీ, అన్నీ

ఒడీసా రాజధాని భుబనేశ్వర్ లోని ఓ ఎపార్ట్ మెంట్లో నివాసం వుంటున్న, సన్నోఖెముండి శాసన సభ్యుడు రమేష్ జెనా (కాంగ్రెస్) ఫ్లాట్ ను 01-02-2011 న పోలీసులు చుట్టుముట్టి "యెనిమిదిమంది నేరచరితులని" అదుపులోకి తీసుకున్నారట. సదరు ఎమ్మెల్యే కూడా ఓ హత్యకేసులో అరెస్టయి, ఈ మధ్యనే బెయిలుమీద బయటికి వచ్చాడట! పైగా, చుట్టుముట్టిన పోలీసులమీద కాల్పులు సాగించారట. రెండుగంటలపాటు కాల్పులు కొనసాగాక, నలుగురు పారిపోగా, 8 మంది దొరికారట! మరి అక్కడేమి గూడుపుఠాణీ జరుగుతోందో యెవరూ చెప్పలేదేమో.

ఉత్తరప్రదేశ్లో బరేలీ వద్ద 01-02-2011 నే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐ టీ బీ పీ) రిక్రూట్మెంటుకి 416 పోస్టులకి 11 రాష్ట్రాలనుంచి ఓ లక్షమందికి పైగా వచ్చారట! తమ పత్రాలు తీసుకోవడం లేదని ఆందోళనకి దిగి, యేడు బస్సులూ, ఓ పెట్రోలు పంపూ, పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలూ, పోలీసు వ్యాన్లూ తగులబెట్టారట. సమీపం లోని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలపై రాళ్లు విసిరారట. పోలీసులతో సహా ఓ 20 మంది గాయపడ్డారట.

పాపం కలెక్టరుగారు ఐటీబీపీ వాళ్లతో మాట్లాడి, దరఖాస్తులు పోస్టులో పంపిస్తే సరిపోతుంది అని చెప్పి, వాళ్లని వెనక్కి పంపేశారట. 

అంతటితో అయ్యిందా? బరేలీ నుంచి కొల్కత్తా వెళుతున్న హిమగిరి ఎక్స్ ప్రెస్ టాపెక్కి ప్రయాణించిన అభ్యర్థుల్లో ఓ యెనిమిది మంది యువకులు మృతి చెంది, 17 మంది గాయపడ్డారట. మిగిలినవాళ్లు ఆ బండిలోని ఏసీ కోచ్ ని తగులబెట్టారట ఆగ్రహంతో!

అలాంటి రిక్రూట్మెంట్ పధ్ధతిని పాటించమన్న, పాటించిన వాళ్లకి కోర్ట్ మార్షల్ చేసి, యెలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందో?

ప్రాచీన నాగరికతా దేశం ఈజిప్ట్ అంటుకుందట. వారం రోజులకి పైగా 30 యేళ్లనించీ పరిపాలిస్తున్న వాళ్ల అధ్యక్షుడు హోస్నీ ముబారక్ గద్దె దిగాల్సిందేనంటూ ఆందోళన చేస్తున్నారట. 01-02-2011 న పది లక్షలమంది, పోలీసులు కాల్పులు జరపబోమని ప్రకటించడంతో, ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించారట.

అంతకు ముందు అందోళనకారులమీద పోలీసు చర్యల్లో అధికారికంగా ఓ 150 మందీ, అనధికారంగా 300 మందికి పైగా మరణించారట.  

ఆయన ప్రతిపక్ష నాయకులని చర్చలకి పిలిచాడు. అవి కూడా ఫలప్రదం కాలేదని తెలుస్తోంది.

ఓపెక్ కి నాయకుడిగా వ్యవహరించినట్టున్నాడు ఆయన. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. 'డీ స్టెబిలైజేషన్ ' లో నిపుణులైన సీ ఐ యే వారే దీనికి కారణమేమో--యే వికీ లీక్స్ వాడో, యే పదేళ్ల తరవాతో బయటపెడతాడేమో!

వాడి సంగతెలావున్నా, ఓ ప్రక్క వుల్లిపాయలు హోల్సేల్ ధరలు సగానికి తగ్గినా, రీటెయిల్ లో మాత్రం యేమాత్రం తగ్గలేదట. ముడి చమురు ధర మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో పీపా 100 డాలర్లు దాటేసిందట!

"క్రితం జూలై లో 147 కి పెరిగినప్పుడే మనం భయపడలేదు--ఇప్పుడు భయపడతామా?" అంటున్న ప్రణబ్, ఆహార, ఇతర ద్రవ్యోల్బణం మాత్రం అందోళన కలిగిస్తోందంటున్నాడు.

చమురు కంపెనీలకి మూడో త్రైమాసికం లో వాటిల్లిన ఆదాయ నష్టం లో 50% అంటే ఓ 8000 కోట్లు సబ్సిడీని మంజూరు చేసిందట ప్రభుత్వం. అందుకని, వాటి త్రైమాసిక ఫలితాలని కూడా ప్రకటించకుండా వాయిదా వేశారట. మిగిలిన 8000 కోట్లూ కూడా ఇస్తేగానీ ప్రకటించరేమో మరి.

అవ్వాకావాలి, బువ్వా కావాలి అంటున్న ప్రభుత్వం, ఆయిల్ పూల్ ఖాతాని తిరిగి యెందుకు ప్రారంభించదో?

1924 జనవరి 1న మరణించిన సోవియెట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాడిమిర్ ఇల్యిచ్ ఉల్యనోవ్ (లెనిన్) మృత దేహాన్ని, ఓ గాజుపెట్టిలో వుంచి, ఇన్నేళ్లూ మాస్కోలోని రెడ్ స్క్వేర్లో 'మౌసొలియం' లో భద్రపరిచారు. 

అలాగే, మావో దేహాన్ని బీజింగ్ లో ఇంకో 'మౌసోలియం ' లో భద్ర పరిచారు.

ఇప్పుదు రష్యా ప్రభుత్వం లెనిన్ దేహాన్ని ఖననం చెయ్యాలని, ప్రజాభిప్రాయం సేకరించి మరీ, ప్రయత్నిస్తూందట.

ప్రభుత్వమే దొంగవేషాలు వేస్తోందని ఆరోపిస్తున్నారట వాళ్ల కమ్యూనిష్టులు!

ఐన్ స్టీన్ మెదడు మీద ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి అనీ, హిట్లర్ అవయవాలు, వాడి మూడంగుళాల శిశ్నం తో సహా భద్రపరిచారనీ, పరిశోధించారనీ వింటూంటాము.

మరి ఈ లెనిన్ వల్లా, మావో వల్లా యేమి వుపయోగమో?

కమ్యూనిష్టులకే వేలం వెర్రి యెక్కువేమో! అనిపిస్తుంది నాకు.      

2 comments:

Anonymous said...

"కమ్యూనిష్టులకే వేలం వెర్రి యెక్కువేమో! అనిపిస్తుంది నాకు. "

Well said. True.

A K Sastry said...

Above Anon!

Happy hear you liked it.

Thank you.