Sunday, July 3, 2011

కబుర్లు - 62

అవీ, ఇవీ, అన్నీ

మొన్న సాయి యజుర్ మందిరంలోని ఖజనాని లెఖ్ఖించాక కూడా, ఆ గది తాళాలు సత్యజిత్ దగ్గరే వున్నాయట. (పేపర్లో రత్నాకర్ అని వ్రాశారా? యేమో గుర్తు లేదు. యెవరైతేనేం?). మళ్లీ నిన్న ఇంకో గదితెరిచి చూస్తే, అందులో సుమారు ఓ కేజీ బంగారం, ఓ రెండువందల కేజీల వెండీ, వజ్రాల వుంగరాలూ, వెండీ ఇతరపాత్రలూ దగ్గరదగ్గర ఓ 80 లక్షల విలువైన వస్తువులు 'దొరికాయట'. ఇంకా ఆ మందిరంలో యెన్ని గదులున్నాయో!

ఇంక, ఆయన దేవుడా కాదా అనే విషయంలో కాదనేవాళ్లూ; అయినా కాకపోయినా అనేవాళ్లూ; అవును అనేవాళ్లూ యెప్పుడూ వున్నారు. ఇప్పుడు కొత్తగా, అబ్దుల్ కలాం, రతన్ టాటా, వాజపేయీ లాంటి కొంతమంది (దాదాపు ఓ యాభై మంది) ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ, వాళ్లందరూ ఆయన్ని సందర్శించి, ఆశీస్సులకోసం పడిగాపులు పడేవారు కాబట్టి, నిజంగా ఆయన దేవుడు కాకపోతాడా? ఆయనకి యేవో మహిమలు వుండకపోతాయా? అనేవాళ్లు కొంతమంది తయారయ్యారు. వాళ్లకి ఇదివరకే సమాధానం చెప్పినవాళ్లు వున్నారు, ఇప్పుడు మళ్లీ, "వాళ్లందరూ తమ తమ వేరు వేరు 'అవసరాలకోసం '; వేరు వేరు 'యెజెండాలకోసం '--ఇలా వెళ్లేవారు తప్పితే, ఆయన మహిమల వల్లకాదు అనీ చెపుతున్నారు.

మొన్నీమధ్య ఓ బ్లాగులోనో వ్యాఖ్యలోనో ఒకాయన ఓ కొత్త విషయం చెప్పాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి అప్పుడెప్పుడో సాయి గురించి యేదో వ్రాశాడు అనీ, అందుకే ఆయన "నోరు పడిపోయింది" అనీ! ఇదెక్కడి దారుణమైన విషయమో! నాకు తెలిసీ, ఆయనకి గొంతు కేన్సరో యేదో వచ్చి, మాట్లాడలేకపోయేవారనీ, చాలా శ్రమతీసుకుని మాట్లాడినా, స్పష్టంగాలేక బొంగురుగా వుండడంతో వినేవాళ్లకి అర్థం చేసుకోవడం కష్టం అయ్యేది అనీ, అలా మాట్లాడడానికి ఆయన నొప్పితో బాధపడేవారనీ, అందుకే కాయితాన్నీ కలాన్నీ ఆశ్రయించేవారనీ, అయితే మాట పూర్తిగా పోవడం జరగలేదు అనీ విన్నాను. మరి సిన్మాల్లో సాయి వేషం వేసిన వాళ్లకీ, మాటలు వ్రాసినవాళ్లకీ, ఆ పాత్రని యెదిరించినవాళ్లకీ, సినిమా తీసినవాళ్లకీ యేమైనా అయిందోలేదో మరి!

మొన్నొక జడ్జి గారు తిహార్ జైలుకి అకస్మాత్తుగా తనిఖీకి వెళ్లేటప్పటికి, అక్కడ జైలరుగారు వారి కార్యాలయంలో సురేష్ కల్మాడీ తో బిస్కెట్లు తింటూ, టీ త్రాగుతూ, పిచ్చాపాటీ మాట్లాడుతున్నారట--సాధ్యమైనంత వినయంగా! ఇంక మిగిలిన 2జి స్కాం ముద్దాయిలు సెల్ తాళాలు తీసి వుండగా, యధేచ్చగా విహరిస్తున్నారట! ఈ విషయంలో జడ్జిగారు సుప్రీంకోర్టుకి నివేదిక యేమిచ్చారో ఇంకా తెలీదుగానీ, ఆ జైలరుగారిని వెంటనే "అండమాన్" కి బదిలీ చేశారట! అబ్బే......అదేమీ కాదు, ఆయనకి కొన్ని నెలల క్రితమే అక్కడికి బదిలీ అయ్యింది, యెలాగూ నిన్ననే వెళ్లాల్సి వుంది, అందుకని వెళ్లిపోయారంతే--అన్నారట కొన్ని జైలువర్గాలు. వుద్యోగుల విషయంలోనైనా, అధికారులవిషయంలోనైనా, "బదిలీ శిక్ష కాదు" అనే సూత్రం వల్లెవేస్తూ వుంటాయి మేనేజ్ మెంట్లు. మరి ఇదేమిటో?

చాలా కాలానికి, యెంపికచేసిన పత్రికా యెడిటర్లముందు అయినా నోరు విప్పాడు ప్రథాని అని కాంగీవాళ్లూ, ప్రభుత్వం వాళ్లూ సంతోషిస్తూంటే, బాంబు పేలినట్టు బంగ్లా ప్రభుత్వంవారు మన రాయబారిని పిలిచి, "దీని సంగతేమిటి?" అని నిలదీశారట! ఆయన నీళ్లు నములుతూ, వచ్చెయ్యవలసివచ్చిందిట! ఇంతకీ, మన ప్రథాని, బంగ్లాదేశీయుల్లో నాలుగోవంతుమంది అదేదో ముస్లిం సంస్థలో సభ్యులో, సానుభూతిపరులో అనీ, వాళ్లు భారత్ కి బధ్ధ వ్యతిరేకులు అనీ, వాళ్లు పాకిస్థాన్ ఐ ఎస్ ఐ వాళ్లేమి చెపితే అది చేస్తారు అనీ వ్యాఖ్యానించారట! (యే సందర్భంలోనో ఆ యెడిటర్లెవరూ మనకి చెప్పనేలేదు!). తీరా బాంబు పేలినంతపని అయ్యాక, బంగ్లా పౌరలంటే మాకు యెంతో గౌరవం, ప్రజాస్వామ్యబధ్ధంగా యెన్నికైనా బంగ్లా ప్రభుత్వం బలంగా వుండాలనే మేము కోరుకుంటాం, వాళ్ల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మా అభిమతం కాదు--ఇలా అంటూ, సంబంధంలేని వ్యాఖ్యలు చేస్తూ, పొర్లుదండాలు పెట్టవలసి వస్తోందట! అందుకు బాధ్యుడైన అధికారిగురించి "విచారిస్తున్నారు" అనుకొంటా!

కేరళలోని పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగలోని ఆరు రహస్య అరల్లో, ఇప్పటికి సి; డి; ఎఫ్ అరల్ని తెరిస్తేనే, దాదాపు 50,000 కోట్ల విలువైన (కేవలం బంగారం, రాళ్లూ వగైరాల విలువ మాత్రమే--పురాతనత్వం విలువ కాకుండా) సంపద వెలుగుచూసింది అనీ, దాంతో, 40,000 కోట్ల ఆభరణాలు గల బాలాజీ ని అధిగమించిందనీ అన్నారు. ఇప్పుడు 'ఏ' అరని తెరిస్తే, వెలుగు చూసిన సంపదతో మొత్తం 75,000 కోట్లకు చేరిందట. బి అరని 1872 వ సంవత్సరం నుంచీ యెప్పుడూ తెరవలేదట. అది కాకుండా, ఇ అరని కూడా ఇంకా తెరవాలట. మొత్తం అయ్యేటప్పటికి ఇంకెన్ని రోజులు పడుతుందో, మొత్తం సంపద లెఖ్ఖ యెన్ని కోట్లకు చేరుతుందో?

ఆర్థికమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు కూడా, చిల్లర వ్యాపారాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని యెంత తొందరగా ఆహ్వానిస్తే అంత త్వరగా ద్రవ్యోల్బణం తగ్గుతుంది, కానీ ఓ నిర్ణయం తీసుకోవలసింది ప్రభుత్వమే అంటున్నాడు. (మనం యేమి చేసినా ద్రవ్యోల్బణం తగ్గదు, దాని పెరుగుదల రేటు మాత్రమే తగ్గుతుంది--అని ప్రాథమిక సూత్రాన్ని కూడా మధ్యలో గుర్తుచేశాడు!). స్వపన్ దాస్ గుప్తా అయితే, ఆ ప్రతిపాదనకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారి చిత్రం ప్రచురించిన తన వ్యాసంలో, భారతీయులు 'ప్రపంచం మనని యెవరికోసం బ్రతికిస్తుంది?' అంటూ మారకుండా వుండిపోతే, మరో పాకిస్తాన్ అయిపోవడం ఖాయం అన్నాడు.

అసలు ఈ బెంగాలీ బాబులంతా వొకేలా ఆలోచిస్తారేమో? అరవబాబులు వీళ్లకి సరిగ్గా వ్యతిరేకం. దేశం గురించి పట్టించుకోకుండా, వాళ్లపని వాళ్లు చూసుకొంటారు! మధ్య వచ్చిందల్లా, మనలాంటివాళ్లకే చచ్చే చావు!

No comments: