Saturday, January 16, 2010

జంతుప్రేమ

జంతుస్వభావం

కనుము పండుగ సందర్భం గా రోశయ్య ఓ గంగిరెద్దుకి అరటిపండు తినిపిస్తున్న ఫోటో కనిపించింది పొద్దున్నే పేపర్లో.

ఆ సమయం లో ఆ పక్కనే వెళ్తున్న యే ట్రైనో గట్టిగా కూతపెడితేనో, యే బస్సో, లారీనో గట్టిగా గ్యాస్ హారన్ కొడితేనో యేమిజరిగేది? ఆ గంగిరెద్దు బెదిరి కొమ్మువిసిరితే మన రోశయ్య గతి యేమిటి? (అమంగళము ప్రతిహతమౌగాక!)

టీవీలో ఓ ప్రకటనలో చూపినట్టు, ఆదిమానవుడు ఓ జంతువు తరుముతుంటే ముందు పరిగెడుతూంటాడు! వెంటనే ఇంకోజంతువు మీదెక్కి, వేటాడుతూంటాడు!

ఇవీ మానవ, జంతు స్వభావాలు! తనకి భయమేస్తే దానికి కారణమైన యెదటి మనిషిని చంపేదాకా వదలవు జంతువులు!

తనకి యే హానీ చెయ్యకపోయినా, తన వినోదం కోసమో, అవసరాలకోసమో, జంతువుని హింసించి అయినా, నిస్సహాయమైన దానికోపాన్నికూడా నిర్లక్ష్యం చేసి, దాన్ని వాడుకోవాలని చూస్తాడు--మనిషి!

ఓ ఆరేళ్ళ క్రితం, బెంగుళూరు బన్నేర్ ఘట్టా నేషనల్ పార్కుకి వెళ్ళాం మా పిల్లలతో--మా కూడా 9 యేళ్ళూ, 6 యేళ్ళూ వున్న మా తమ్ముడి కూతుళ్ళూ, యేడాది వయసున్న మా పెద్ద మనవడూ--చిన్నపిల్లలు!

సఫారీలూ అవీ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇక సూర్యాస్తమయం అయిపోగానే, తిరిగి వెళ్ళే సమయం లో, అప్పటిదాకా వేరే వేరే చోట్ల పిల్లలకి ఆహ్లాదం కలిగించిన యేనుగులని వాటి అడ్డాకి చేర్చడానికి లోపలి రోడ్లమీద కొంత కొంత దూరం లో ఒకదానివెనుక ఒకదాన్ని నడిపించుకుంటూ వెళతారు మావటీలు.

దారిలో యెవరైనా చెయ్యియెత్తితే, ఆ యేనుగుని ఆపి, వాళ్ళు ఇచ్చే అయిదో, పదో యేనుగుని తొండంతో అందుకోమని, వాళ్ళు తీసుకుంటారు మావటీలు--అదో సంపాదన వాళ్ళకి.

నేను కూడా పిల్లల కోరికమీద చెయ్యెత్తాను--నా చేతిలో మా మనవడు, నా ముందు ఆడపిల్లలు--నా ఇంకో చేతిలో పదిరూపాయల నోటు--మావటీ 'హట్' అన్నాడు యేనుగుని--తను ఆగింది పాపం! పదిరూపాయలనోటుని అందుకుంది, మావటీకి అందించింది--కానీ ప్రొద్దుటనించీ యెంత అలిసిపోయిందో--దానికళ్ళల్లో నిస్సహాయతతో కూడిన కోపం--కాదు క్రౌర్యం!

మావటీ ఇంకా తొండం పిల్లల నెత్తిమీదపెట్టమని ఆఙ్ఞాపిస్తున్నాడు--అది కోపంగా బుర్ర అటూ ఇటూ వూపి ఒక్కడుగు ముందుకు వేసేటప్పటికి--నేను రోడ్డు పక్కకి రెండడుగులు వెనక్కి వేసి, పిల్లలని కూడా వెనక్కి లాగేశాను--మనవణ్ణి మా అమ్మాయికి అందించి!

గజరాజు సాగిపోయింది--మావటీ 'యేమీ ఫరవాలేదు ' అని సైగలు చేస్తూ వుండగా!

తరవాత ఓ గుడిదగ్గర అరటిపండు పెట్టబోయిన బాలుణ్ణి తొండంతో దూరంగా విసిరేసి, ఆ వెనక వున్న కొంచెం పెద్ద పిల్లాణ్ణి క్రిందపడేసి కసిగా కాళ్ళతో తొక్కేసి చంపేసిన యేనుగుని ఫోటోలతో సహా ప్రచురించారు పేపర్లో!

ఇంకా ఇలాంటివి రెండు మూడు చోట్ల జరిగినట్టు పేపర్లలో వస్తూనే వుంది!

అంతదాకా యెందుకు--మన శ్రీగిరిమీద 'వైష్ణవి ', 'అవనిజ ' అనే యేనుగులు వంతులవారీగా--వెనక టపాసు పేలిందని ఒకసారి, గుర్రం గట్టిగా సకిలించిందని ఒకసారి, మొన్న ఒకావిడ తన బిడ్డతో సహా పుణ్యం కోసం తనకిందనించి దూరి ఆ పక్కకి వెళ్ళిందని--భీభత్సం సృష్టిస్తున్నాయి--ఒకళ్ళో ఇద్దరో చనిపోవడమో, యేడెనిమిది మంది గాయపడడమో జరుగుతూంది!

పైగా ఆ యేనుగు చివరికి గ్యాస్ గోడౌన్ దగ్గరకి వెళ్ళి, భయం గా పడుకొందట చివరకి! ఇంకా నయం--దాని కోపం తగ్గక ఆ సిలిండర్లని విసిరేసి, గ్యాస్ లీకయి, సిలిండర్లని దొర్లించడం లో నిప్పు పుట్టి...........యేదైనా జరిగితే--తరవాత తరాలవాళ్ళు--మనం ద్వారక 'పట్టణం సముద్రం లో మునిగిపోయింది ' అని చెప్పుకున్నట్టు--'ఇక్కడ యేడు కొండలు వుండేవిట....శ్రీగిరి అని ప్రపంచ ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం వుండేదట ' అని చెప్పుకోవలసి వచ్చేదేమో!

సినిమాల్లోనూ, సర్కసుల్లోనూ, ఇతరత్రా జీవహింసని నిరోధించడానికి 'బ్లూక్రాస్ ' లాంటి సంస్థలు పాటు పడుతున్నాయి!

మరి ఈ యేనుగులగురించీ, ఇతర జంతువులగురించీ యెవరు పట్టించుకుంటారు?

చివరగా రోశయ్య భద్రత మాటేమిటి?

1 comment:

Anonymous said...
This comment has been removed by a blog administrator.