Showing posts with label రైల్(మమతాదీ)వేస్. Show all posts
Showing posts with label రైల్(మమతాదీ)వేస్. Show all posts

Wednesday, July 28, 2010

ధూమ(రహిత)శకటాలు


లజ్జారహిత మంత్రిణి

  • 150 మంది మృతి చెందిన ఙ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం "సర్కారు అంటే గిట్టనివారు పన్నిన కుట్ర"ట.

  • 63 మంది అశువులుబాసిన వనాంచల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం వెనుక రైల్వేలని "బదనామ్ చెయ్యాలనుకుంటున్న వర్గాల ప్రమేయం వుందని" అనుమానం ట.

  • ఢిల్లీ స్టేషన్ లో, రైలు వస్తూందనగా, ప్లాట్ ఫామ్ మార్చామని ప్రకటించి, అందరూ మెట్లెక్కుతుండగా, మళ్లీ అది తప్పు అనీ, ఇదివరకు అనౌన్స్ చేసిన ప్లాట్ ఫామ్ మీదకే వస్తుందనీ చెప్పడం తో, తొక్కిసలాటలో అనేక మంది గాయ పడ్డారు, ఇద్దరు మరణించారు. "తప్పంతా జనాలదే! బుధ్ధిలేకుండా అలా పరుగులు పెట్టడం యేమిటి" అని ఈసడించారట.

ఇవన్నీ యెవరు అన్నారు? ఇంకెవరు--మమతాదీ నే!

రైల్వేలలో 89,000 వుద్యోగాలు కొన్ని యేళ్ళుగా ఖాళీగా వున్నాయట.

అందులో 20,000 వుద్యోగాలు "రైల్వే భద్రత, రక్షణ"లకి సంబంధించినవేనట.

26,000 డ్రైవర్ పోస్టులు ఖాళీగా వున్నాయట. 7 గంటలు మాత్రమే పనిచెయ్యవలసిన డ్రైవర్లు, పది పదిహేను గంటలు
పనిచేస్తున్నారట!

రైలు మొత్తానికి ఒకే టీ టీ ఈ తో నడుస్తున్న రైళ్ళు చాలా వున్నాయట.

బ్రిటీష్ వాళ్ళు నిర్మించిన రైలు మార్గం 52,000 కి. మీ. లైతే, స్వతంత్రం వచ్చాక 63 యేళ్ళలో కొత్తగా నిర్మించింది కేవలం 12,000 కి. మీ. కూడా లేదట.

ఇక "తృటిలో" తప్పిన ప్రమాదాల గురించి, రోజుకి రెండో మూడో వింటూనే వున్నాము.

ఇక ఇప్పుడు, ముఖ్యమైన స్టేషన్లలో ఒక్కోటీ 70 లక్షలు ఖర్చయ్యే "ఎస్కలేటర్లు" నిర్మిస్తారట! (మెట్లెక్కుతూనే
తోసుకొనే ప్రయాణీకులు ఎస్కలేటర్లు యెక్కడం లో యెన్ని ప్రమాదాలకి గురవుతారో!)

ఆ మాత్రం ఖర్చుతో ఒక్కో ప్లాట్ ఫామ్ మీదా అటు రెండూ, ఇటు రెండూ లిఫ్టులే యేర్పాటు చెయ్యవచ్చు! పైగా సురక్షితం గా వుంటాయి.

(తిరుపతిలోని శ్రీనివాసం గెస్ట్ హౌస్ లో వున్నాయి ఇలా లిఫ్ట్ లు. అక్కడ అనేక అంతస్తులు వున్నాయి. మరి ప్లాట్ ఫామ్ మీదైతే, ఒక్క అంతస్తే కదా?)

మరి ఈ స్కీమే యెందుకంటే, వేరే అడగాలా--కోట్లు నొక్కెయ్యడానికని తెలియడం లేదూ!

రైల్వే శాఖ వెబ్ సైట్ లో కూడా, ఈ-టిక్కెట్లని అమ్ముతారట--ఐ ఆర్ సీ టీ సీ గుత్తాధిపత్యాన్ని నివారించడానికి! (ఇక రెంటికీ చెడ్డ రేవళ్లవుతారేమో అమాయక ప్రయాణీకులు!)

ఇదివరకే ఓసారి వ్రాశాను--ఇంకా రైళ్లలో గమ్యం చేరగలుగుతున్నారంటే, నిబధ్ధతతో వుద్యోగాలు చేస్తున్న
కొన్నివేల--గ్యాంగ్ మెన్ లూ, పాయింట్ మెన్ లూ, సిగ్నల్ మెన్ లూ వగైరాల వల్లే గానీ, ఇలాంటి 'మమత 'ల వల్ల కాదు అని.

ఇలాంటివాళ్ళని మంత్రివర్గం లో వుంచి, మేపుతున్న ఖర్మ మన కేంద్ర సర్కారుది!

హేపీ జర్నీ!


Sunday, July 18, 2010

ఐ ఆర్ సీ టీ సీ


ఇంకో బ్లాగర్ల విజయం

మామూలు రిజర్వేషనులూ, తత్కాల్ రిజర్వేషనులూ వుదయం 8.00 గంటలకే ప్రారంభించడం తో, ట్రాఫిక్ యెక్కువై, ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఆ శాఖ విజిలెన్సు తదితర అధికారులు (బహుశా ఐ ఆర్ సీ టీ సీ వాళ్ళతో చర్చించి) నిర్ధారణ చేసుకున్నారట.

శుభవార్తేమిటంటే, తత్కాల్ రిజర్వేషనులని వుదయం 10.00 గంటలకి మాత్రమే ప్రారంభించి, మామూలు రిజర్వేషనులని 8.00 గంటలకే ప్రారంభిస్తారుట.

ఇది నిశ్చయం గా మన బ్లాగర్ల విజయమే!

కానీ అప్పుడే చంకలు గుద్దేసుకోకండి. ఇది పాక్షిక విజయం మాత్రమే. యెందుకంటే ఇందులో పెద్ద మతలబు వుంది.

అదేమిటంటే, నెలా రెండునెలలు ముందుగా రిజర్వు చేసుకోవాలనుకొనేవాళ్ళకి, వుదయం 8.00 గంటలకే పరుగెత్తాల్సిన అవసరం వుండదు గా? రోజుకి ఓ మూడు నాలుగు గంటలు కంప్యూటర్ రిజర్వేషను అనుమతించినా, అది అర్థరాత్రి ప్రారంభించినా, ఇలాంటివాళ్ళకి యేమీ నష్టం లేదు.

అర్జెంటుగా బయలుదేరవలసి, ఓ రెండురోజుల ముందు రిజర్వేషన్ కోసం ప్రయత్నించే తత్కాల్ వాళ్ళకి దీనివల్ల యేమి వొరిగింది?

అంతేకాదు. మీరు గత యేడాదిలో యెప్పుడైనా పట్టణాల్లో రిజర్వేషన్ కౌంటర్ ల ముందు నిలుచున్నారా, చేతిలో పూర్తి చేసిన ఫారాలతో? అయితే గమనించే వుంటారు.

సహజం గా మనం లైను ఆఖర్లో నుంచుంటాం--మన ముందు ఓ పదిహేను నించీ ఇరవై మంది నించుని వుంటారు. మనం రెండు మూడు గంటలు నిరీక్షించినా, మనం కౌంటరు దగ్గరకి చేరం. మనముందున్న క్యూ తరగదు. ముందున్నవాళ్ళ మధ్యలో కొంతమంది చేరిపోతూ వుంటారు. మనం యేమైనా అంటే, 'మావాడేనండి--ఇందాకే బయటికి వెళ్లాడు.' అంటారు. ఇంకా మనమేమైనా మాట్లాడితే, అందరూ మూకుమ్మడిగా మనమీద తిట్ల దాడి చేస్తారు.

మనం వాళ్ళనేమీ అనఖ్ఖర్లేదు. యెందుకంటే, వాళ్ళు తమ పొట్టకూటికోసం ప్రముఖ ట్రావెల్ యేజంట్లదగ్గర పనిచేసేవాళ్లు. క్రితం రాత్రే, ఫారాలు పూర్తి చేసుకొని, దానికి తగిన చిల్లర నోట్లతోసహా స్టేపుల్ చేసుకొని, జిప్ బ్యాగుల్లో సర్దుకొని, బయలుదేరతారు. 7.00 గంటలకే, వీలైతే ఇంకా ముందే క్యూలో చేరతారు. మొదటివాడు తన బ్యాగు లోని ఒక ఫారం తాలూకు టిక్కెట్లు చేతికందగానే, పక్కకు వెళ్ళిపోతాడు. ఓ బెంచీలో కూర్చొని, జిప్ బేగ్ తెరిచి, ఓ అరలో ఆ టిక్కెట్లని వుంచి, ఇంకో జిప్ తెరిచి, ఇంకో ఫారం తీసుకొని, మళ్లీ క్యూలో చేరతాడు--ఒక్కడే అయితే మన వెనుక, వాళ్ళ మనిషి యెవరైనా మనముందున్నవాళ్ళలో వుంటే, వాడి వెనక!

(ఇలాంటి ప్రక్రియకే రాయల సీమలో "సైక్లింగ్" అనే పేరు పెట్టారు. ఇది వీలవడం లేదనే, "ఏ వీ ఎం లు వద్దు--బ్యాలెట్ పేపరే కావాలి" అని అన్ని పార్టీలూ ఘోషిస్తున్నది!)

ఇలాంటివాళ్ళకి యెంత సుఖం? రాత్రి పొద్దుపోయేవరకూ ఫారాలు నింపి, నోట్లు పిన్ను కొట్టుకోనక్కరలేదు. పొద్దున్న 7.00 కి మొదలు పెట్టినా, భోజనాలు చేసి మరీ క్యూల్లో నించోవచ్చు!

బాగుంది కదా! మన ప్రజా రవాణా వారు మన చెవుల్లో క్యాబేజీలూ, క్యాలీ ఫ్లవర్లేకాదు--అవసరమైతే టోకున బ్రహ్మకమలాలని కొని, పెట్టగలరని అర్థమవుతోందా?

మరి వుద్యమించండి!