Saturday, January 18, 2014

కబుర్లు - 103



అవీ, ఇవీ, అన్నీ

సీ డబ్ల్యూ సీ సమావేశం అయిందట. మన తెలుగు అంజయ్యలని యెవర్నీ మాట్లాడనివ్వలేదట! యెన్నికల్లోపల ప్రథాని అభ్యర్థిని ప్రకటించడం వాళ్ల ఇంటావంటా లేదందట వాళ్లమ్మ. (క్రితం యెన్నికలముందు మన్మోహన్ పేరు ప్రకటించడం అప్పటి అవసరమే తప్ప, ఆచారం సృష్టించడానికి కాదట). నేను ఓ సైనికుణ్ని, అమ్మ యేమి చెయ్యమంటే అది చేస్తాను అన్నాడట పిల్లాడు.

అసలు అయితే గియితే రాబోయే యెన్నికల్లో వాళ్ల పార్టీ కి కొన్ని సీట్లయినా వస్తే, మిగిలిన చిన్నా చితకా పార్టీలతోనే సంకీర్ణం యేర్పాటు చేసే అవకాశం వస్తే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయితే, సీల్డ్ కవర్లోంచి వాడి పేరు బయటపడినప్పుడు కదా!

ఇంకా గొప్పగా--"మీ గిన్నెలో అన్నం అవుతా, మీ చేతుల్లో పుస్తకమవుతా, మీ నెత్తిమీద నీడనవుతా, ఆడపడుచులను ఆదుకొనే అన్ననవుతా, పార్టీని ముందుకు నడిపించే సేనాని అవుతా, మీరు చెప్పినట్టు వినే విధేయుడినవుతా.........." అంటూ డైలాగులు కొడుతుంటే, వాళ్లమ్మ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, తెగ సంతోషించేసిందట! (ఇంకా నయం, మీనెత్తిమీద మారెమ్మనవుతా, మీ ప్రక్కలో పామునవుతా.....అనలేదు)

"మన్మోహన్ జీ! తొమ్మిది రాయితీ సిలిండర్లతో మేం వంట చెయ్యలేం. ఈ దేశ మహిళలు మరిన్ని కోరుకుంటున్నారు. ప్రతి కుటుంబానికి 12 సిలిండర్లు కావాలి. దయచేసి 'కోటా' పెంచండి!" అన్నాడట. (అసలు ఈ కోటా యెందుకు? రాహుల్ కీ, చిదంబరానికీ, షిండేకీ, అహ్మద్ పటేల్ కీ అందరికీ 12 సిలిండర్లు కావాలా? సామాన్యుడికి కావలసినది "ఆథార్" సంబంధంలేని సిలిండర్లు--ఆరైనా, తొమ్మిదైనా! సరిపోకపోతే, కట్టెలపొయ్యిలు యెలాగా వున్నాయి!)

"తెల్ల కార్డు వున్నవాళ్లకే రాయితీ సిలిండర్లు" అంటే, బంగ్లాదేశ్ వాళ్లకీ, పాకిస్థాన్ వాళ్లకీ అందరికీ ఇచ్చేసినా సబ్సిడీల్లో ఇంకా బోళ్లు మిగులుతుంది కదా? యెలాగూ ఆథార్ ఓ గుర్తింపు కార్డు మాత్రమే--పౌరసత్వ కార్డు కాదు అనేశారుగా!

అన్నట్టు, నందన్ నీలేకణి ఒచ్చే యెన్నికల్లో పోటీ చేస్తాడట!

వెనకటికొకాయన బాగా "డబ్బు చేసి" ఓ సొంత పార్టీ పెట్టి, యెన్నో సీట్లు గెలవలేక, డబ్బు ఖర్చైపోయి, కాటాకి వచ్చేసి, కాంగ్రెస్ ని "సామాజిక న్యాయం" మీరే చెయ్యాలని, ఓ మంత్రిపదవి సంపాదించి, మళ్లీ సంపాదించుకొంటున్నాడు.

ఇంక ఇప్పుడు, నీలేకణి ఆథార్ అంటూ ఓ 50 వేల కోట్లు ప్రభుత్వ ధనం విరజిమ్మి, మిగిలిన ప్రభుత్వాలచేత మరిన్ని వేల కోట్లు ఖర్చుపెట్టించి, ఇప్పుడు యెన్నికై యేమి సంపాదించుకోవాలనుకుంటున్నాడో!

వచ్చే యెన్నికల్లో యేపార్టీ అయినా "ఆథార్" కుంభకోణం మీద చర్య తీసుకుంటామని ప్రకటిస్తే, అధికారం లోకి రావడం చాలా వీజీ! పార్టీలు గమనిస్తున్నాయా?

ఢిల్లీలో అధికారంలోకి వచ్చాకగానీ అదేమిటో అనుభవంలోకి రాలేదు కేజ్రీ కి. అందరిలాగే "నాదగ్గరేమీ మంత్రదండం లేదు" అనేశాడు. మరి నువ్వేదో పొడిచేస్తావనే కదురా నీ చేతికి అధికారం అనే మంత్రదండం ఇచ్చాము "సార్లేక్" అని ఆమ్ ఆద్మీలు అడగద్దూ?

ప్రక్కలో పాముతో అధికారంలోకి వస్తున్నాము అని తెలిసీ, ప్రజా దర్బారు అంటూ బోర్లా పడి, గోడ యెక్కవలసి వచ్చింది! క్రొత్త అవినీతికేసులపై తప్ప, పాత కేసులని పట్టించుకోం అని ఓ సారి అన్నాడు. షీలా మీద యేవైనా ఆరోపణలు యెవరైనా చేస్తే, వాటి సంగతి ఆలోచిస్తాము అంటాడోసారి. 

బిన్నీ అయితే, కాంగ్రెస్ లోంచి వచ్చాడు, ఎం ఎల్ యే అయ్యాక యేవో కోరికలు తీరక యేదో మాట్లాడుతున్నాడు అంటున్నారు. మరి అనుపమ్ ఖేర్ యెందుకు మాట్లాడుతున్నట్టో!

మన సొంటికొమ్ము జేపీ వాళ్లతో చేరడానికి ఆరాటపడుతున్నాడు. వాళ్లేమో దూరం పెడుతున్నారు!

చూడాలి--యెన్నికల్లోపల మరెన్ని చిత్రాలు జరుగుతాయో!


Thursday, September 26, 2013

కబుర్లు - 102


అవీ, ఇవీ, అన్నీ

మొన్ననే "అర్థంలేని ఆథార్" అంటూ సణిగాను. వెంటనే వార్త వచ్చింది. కర్ణాటక హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్.పుట్టస్వామి సుప్రీం కోర్టులో వేసిన కేసులో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని "నిత్యావసరాలు వగైరాల విషయంలో ఆథార్ కోసం నిర్బంధించడం రాజ్యాంగానికి విరుధ్ధం" అనీ, ఆ కార్డు పొందాలా వద్దా అన్నది పౌరుల ఇష్టాయిష్టాలకి వదిలేయాలి అనీ ఆదేశించిందట.

లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి ఆథార్ లేకపోతే జీతాలు కూడా ఇవ్వమని, జనాలకి వివాహ ధృవీకరణ పత్రాలు ఇవ్వమనీ ప్రకటిస్తారా మహారాష్ట్ర ప్రభుత్వం!

ఇప్పటికి 50 వేల కోట్లు ఖర్చుపెట్టేశామని ప్రకటించారట కోర్టులో! (అది ఒక్క నందన్ నీలేకణి ఖర్చుపెట్టింది మాత్రమే. ఇంక రాష్ట్ర ప్రభుత్వాలూ, ప్రభుత్వ విభాగాలూ ఖర్చు పెట్టిందీ, ప్రైవేటువాళ్లు తిన్నదీ కలిపితే, కొన్ని లక్షల కోట్లు అవుతుంది.)

ఇక్కడ మా జిల్లాలో, కలెక్టరూ, బ్యాంకువాళ్లూ, గ్యాస్ డీలర్లూ గుండెలు గోకేసుకుంటూ, "ప్రతీ బ్యాంకులో సీడింగుకోసం ప్రత్యేక కౌంటర్లు యేర్పాటు చెయ్యాలి, యూఐడీ నెంబర్లు పొందడానికి వలసిన సమాచారం అప్ లోడ్ చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక లాగింగ్ వ్యవస్థ యేర్పాటు చెయ్యాలి" అంటూ చొక్కాలు చింపేసుకుంటున్నారు. మరెన్ని కోట్లు తగలేస్తారో!

ద్రవ్యోల్బణం దారి దానిదే, మన ప్రభుత్వాల దారి వాటిదే, మనదారి మనదే! 

పండగలూ, పవిత్రమాసాలపేరుతో, విగ్రహాలకి శాకాంబరాలూ, ఖాద్య అభిషేకాలూ, కరెన్సీ అలంకరణలూ పేరుతో మరింతగా ద్రవ్యోల్బణం పెరగడం ఖాయం. ఈ మధ్య కొత్తగా 3 క్వింటాళ్ల 'పంచదార' అభిషేకాలు కూడా మొదలు పెట్టారు!

కేంద్ర వ్యవసాయ మంత్రేమో, ఇంకో మూడువారాల్లో ఉల్లిపాయల ధరలు తగ్గుతాయి అంటున్నాడు--కనీస యెగుమతి ధర టన్నుకి రూ.900/- కి పెంచేశాడుకాబట్టి ట. (అసలు యెగుమతి యెందుకు చేయ్యాలి అంటే, అదంతే అంటాడు. మిగిలిన వె.ధ.వ లు ప్రభుత్వం వుల్లిపాయలు అమ్ముకుంటోందా? అంటున్నారు!). తన లాబీలకోసం, మిల్లులనిండా చెక్కెర నిలవ వున్నా, దిగుమతి చేసుకోడం మానడు. యూపీయే వారు ఆయనని పీకలేరు మరి!

ఆర్బీఐ వాళ్లు కొన్ని సంవత్సరాలుగా "క్లీన్ నోట్ పోలసీ" పేరుతో, నోట్లకి చిల్లు పెట్టద్దు, పిన్నులు కొట్టద్దు, పేర్లూ అంకెలూ వ్రాయద్దు" అంటూ బ్యాంకులని వూదరకొడుతూనే వున్నారు (బ్యాంకు వుద్యోగులు నష్టపోతూనే వున్నారు). మొన్న మాత్రం ఇలా అలంకరణలకి కరెన్సీ వుపయోగించకుండా చూడాలి అని ప్రభుత్వాలకి ఓ ఆదేశం జారీ చేసి చేతులు దులుపుకున్నారు.

ఘనతవహించిన తి తి దే వారు బంగారు రేకులు తాపడం చేయించిన, 29 టన్నులు బరువైన రథం చేయించేశారట. (ఆ 29 లెఖ్ఖేమిటో.....పోనీలెండి....108 టన్నులో, 1080 కేజీలో అంటూ పవిత్ర లెఖ్ఖలు వల్లించలేదు!). బంగారం దిగుమతులు తగ్గమంటే యెలా తగ్గుతాయి?

పాత సీబీఐ జేడీ గారు పర్యటనలు చేసుకొంటూ, పాఠాలు చెపుతాను, గురుకుల పాఠశాల స్థాపిస్తాను వగైరా ప్రకటనలు చేస్తున్నాడు. వుద్యోగంలో యేపనీ అప్పచెప్పలేదేమో ప్రభుత్వం వారు. 

ఇదివరకే చెప్పాను--అంతలా ఓవర్ యాక్షను చేసి, రాత్రీ పగలూ లేకుండా గుడ్డలూడాదీసుకున్నంత పని చేసి, దర్యాప్తులు చేసినా, వృషణాయాసం తప్ప, ఒరిగేదేమీ వుండదు అని. ఇప్పుడు లక్షకోట్లనుంచీ, కొన్ని పదుల డొల్ల కంపెనీలనుంచీ, 43 వేల కోట్లో యెంతో కీ, రెండు మూడు కంపెనీలకీ సీబీఐ పరిమితమయిపోయి సూత్రధారి విడుదలై పోయాడు బెయిల్ మీద. రేపు గాలి కూడా కర్ణాటక లో ఓ పార్టీ పెట్టి, వైకాపా ద్వారా రాయబారం నడిపిస్తే, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారేమో! 

ఇలాంటి ప్రభుత్వోద్యోగులకి నా ప్రగాఢ సానుభూతి.


Saturday, September 21, 2013

కబుర్లు - 101



అవీ, ఇవీ, అన్నీ

దాదాపు సంవత్సరం అయిపోయింది బహిరంగంగా సణిగి.....కారణాలకేం......సవాలక్ష. ఇదిగో మళ్లీ ఇప్పుడు.

అర్థంలేని ఆథార్: మన ప్రభుత్వంలోని రా నా లు పార్లమెంటుతో యెలా ఆడుకుంటున్నారో చూస్తే, మన ఎం పీ లు--తమ జీతాలూ, ఇతర ఉపయోగాలూ, పెన్షన్లూ తప్ప--యేమి బావుకుంటున్నారా అనీ, వాళ్లకి వోట్లు వేసిన ప్రజల్ని యెంత వెర్రి వెధవలుగా జమకడుతున్నారో అనీ అనిపించడం లేదూ? 

ఒక్క ఆథార్ విషయం లోనే, మంత్రులు అనేకసార్లు "ఆథార్ ఒక గుర్తింపు సంఖ్య మాత్రమే" అనీ, "గ్యాస్ కనెక్షన్లకీ ఆథార్ కీ సంబంధం లేదు" అనీ, "ప్రభుత్వ పథకాలకీ ఆథార్ కీ సంబంధం లేదు" అనీ, "ఆహార భద్రతకి ఆథార్ లేనివాళ్లు కూడా అర్హులే" వగైరా సమాధానాలు--లిఖితపూర్వకంగా--ఇచ్చారు.

కానీ, జరుగుతున్నది? మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో, గ్యాస్ బుకింగ్ కి ఆథార్ లింకు పెట్టేశారు మొన్న ఏప్రియల్ నెల నుంచీ! మా జిల్లాతోపాటు, ఇంకొన్ని జిల్లాలని కూడా అక్టోబరు నెలనుంచీ గ్యాస్-ఆథార్ లింకు క్రిందికి తెస్తామని ప్రకటించారు. (దీనికో పదబంధం--ఆథార్ సీడింగ్--అంటూ తయారు చేశారు. అది వేరే ప్రహసనం). 

ఓ ప్రక్క జిల్లాలో ఇంకా అందరికీ ఆథార్ నెంబర్లు రాలేదనీ, కొన్ని లక్షల మందికి ఇంకా రావాలనీ, వాళ్లలో గ్యాస్ కనెక్షన్లు వున్నవాళ్లు కొన్ని లక్షలమంది అనీ, ఆథార్ వచ్చినవాళ్లలో సీడింగు కానివారు కొన్ని లక్షలు అనీ, ఈ లోగా ఓ 7న్నర లక్షల మందికి నమోదు చేసిన వివరాలు సాఫ్ట్ వేర్ లోపంతో మాయం అయ్యాయి అనీ, అది బాగు పడితే అందులో కొంతమందికి ఆథార్ వచ్చే అవకాశం వుండొచ్చు అనీ, అందరికీ ఆథార్ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు అనీ, 'త్వరలో' శాశ్వత నమోదు కేంద్రాలు తెరుస్తాము అనీ--ఇలా వెర్రి మొర్రి ప్రకటనలు చేస్తూనే వున్నారు అధికారులు! 

సందట్లో సడేమియా లా, కొన్ని బ్యాంకులు గ్యాస్ కంపెనీలతో కుమ్మక్కు అయి, తమ వ్యాపారం పెంచుకొనే వ్యూహంలో భాగంగా, వినియోగదారుల వివరాలు సేకరించి, వారి పేర్లతో ఖాతాలు తెరిచేసి, అథార్ సీడింగ్ చేసేసి, ప్రభుత్వ సబ్సిడీని ఆ ఖాతాల్లో వేసేసుకున్నారట! పాపం జనాలు తమకు అదివరకే వున్న ఖాతాలకి సబ్సిడీ రాలేదే అని వెర్రి చూపులు చూస్తున్నారట. 

ఈ లోగా, మా జిల్లాలో లింకుని ఓ నెల ముందు నుంచే, అంటే సెప్టెంబరు నెలనుంచే, అని ప్రకటించి మొదలెట్టేశారు. ఇక జనాల పాట్లు ఆ పైవాడికే యెరుక! పైగా, ఇప్పటికే ఆరు సిలిండర్లు తీసేసుకుని వుంటారుకాబట్టి, మిగిలిన మూడూ "పూర్తి ధర" చెల్లించేసి కొనేసుకుంటే, ఆథార్ వచ్చేక యేకంగా మూడింటి సబ్సిడీ ఒకేసారి ఇచ్చేస్తారట! ".....తలకి రోకలి చుట్టడమొకటే తరవాయి" అన్నట్టు.

అసలు ఆథార్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అని చమురు కంపెనీలకి యెవరు అధికారం ఇచ్చారు? ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పగలిగిన--వెయ్యేళ్లు నంతో ర్థిల్లాలి అనుకొనే రా నా లు--యెవరైనా వున్నారా? 

ప్రజలలో యే వొక్కరైనా "నాకు ఆథార్ వల్ల ఇదివరకు లేని ఫలానా కొత్త ప్రయోజనం కలిగింది" అని గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా?

ఇంక మనం "ఈ ఆథార్ ని రద్దు చేసి, దాని వ్యవహారంలో ప్రభుత్వాలు యెంత ఖర్చు పెట్టాయి, అందులో యెన్ని లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి మొదలైన విషయాల్లో దర్యాప్తు చేయించి, బాధ్యులకి శిక్షలు పడేలా చేస్తాము" అని ప్రమాణం చేసే వాళ్లకే వోటు వేస్తాము అని వుద్యమం లేవతీస్తె తప్పేమైనా వుందంటారా?

ఇంక రాష్ట్రంలో వుద్యమాల విషయం యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు తెలుగువాళ్లందరూ కలిసి, మదరాసునగరం (ఇప్పటి చెన్నై) రాజధానిగా, యానాం, బళ్లారి, హోస్పేట వగైరాలతో "విశాలాంధ్ర" కావాలని "ఎర్తు" పెడితే గానీ, పిచ్చిదంబరం లాంటి యూపీయే మంత్రులకి దిమ్మతిరిగి బొమ్మ గూట్లో పడదు అని నా వుద్దేశ్యం. మీరేమంటారు?

మొత్తానికి కొరకరాని కొయ్యగానే పదవీ విరమణ చేసేశారు దువ్వూరివారు. ఇంక జున్నుముక్క లాంటి "రాజన్" వచ్చారని సంతోషించినంతసేపు పట్టలేదు చాలామందికి. "ద్రవ్యోల్బణం" మాత్రమే బాగా దృష్టిలో వుంచుకొని, కీలక రేట్లు తగ్గించకుండా, రెపో రేటు పెంచుతూ, ప్రకటన చేసేశారు! పనిలో పనిగా, వ్యవస్థని ఆర్ బీ ఐ అదుపులో లేకుండా చేస్తున్న "లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ"; "మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ" వగైరాలనీ, అసలు రిపాజిటరీనే రద్దు చెయ్యగలిగితే యెంతో సంతోషిస్తాను నేను!

ప్రస్తుతానికింతే.......

Thursday, December 13, 2012

కబుర్లు - 100




అవీ, ఇవీ, అన్నీ

ప్ర తె మ ల సందర్భంగా, అన్ని జిల్లాల్లోనూ, మండలాల్లోనూ, "సభలు" చేసి, "దశదిశలా తెలుగు కీర్తి చాటాలి" అని యెలుగెత్తుతున్నారందరూ. 

నిన్న మావూళ్లో సభలో ఒకాయన మీడియా చేస్తున్న కృషిని అందరూ గుర్తించాలనీ, తెలుగు వెలుగు కొని చదవాలనీ, వారు చేస్తున్న కృషి అమోఘమనీ--ఇలా చెప్పారు.

తీరా చూస్తే, ఆ సభకి సంబంధించిన వార్తలో, "శతావధాని తనదైన శైలిలో..........'హాస్యాస్పదంగా' వివరించారు అని వ్రాశారు! 

తెలుగుని వుధ్ధరించకపోతే పోయె--అపభ్రంశాలతో దాన్ని ఖూనీ చెయ్యకుండా వుంటే చాలు మన ఘనతవహించిన మీడియా వాళ్లు.

హమ్మయ్య! కార్తీకం ముగిసింది. క్రితం సంవత్సరం వరకూ 'సహస్ర' తో సరిపెట్టిన భత్తులు, ఈ సారి 'లక్ష' సంఖ్యలో దీపాలు వెలిగించేశారు అనేక చోట్ల. (అయినా, పౌర్ణమి నాడు దీపాలెందుకో--అమావాస్యనాడు గానీ!) 

మళ్లీ యేడు "పది లక్షల" దీపాలూ, ఇక ముందు "కోటి" కి చేరినా ఆశ్చర్యం లేదేమో!

ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి కొద్దిగా తక్కువగా మాత్రమే చేరిందట--అక్టోబరు నెలాఖరికి. ఆహార ద్రవ్యోల్బణం కూడా అలాగే వుందట. ఇంక కార్తీకాంతానికి యెంతకి పెరుగుతుందో? మళ్లీ యేడాదికి మూడంకెలకి కూడా చేరుతుందేమో--దువ్వూరి వారు ఆలస్యం చేస్తే!

"భేష్ దువ్వూరీ!" అన్నాడట ఆర్థిక వేత్త జగదీష్ భగవతి. ఆయన ప్రభుత్వ వొత్తిళ్లకి తలవొగ్గలేదు అనీ, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశారు అనీ, ఇంక వృధ్ధి గురించి కూడా పట్టించుకోవాలనీ అన్నారట. చివర అన్నదాన్నిబట్టి, ప్రభుత్వానికి వత్తాసు పలికినట్టు లేదూ?

ఆర్ బీ ఐ డిప్యూటీ గవర్నరు చక్రబర్తి, బ్యాంకుల్లో మొండి బాకీలు పెరగడానికి "కార్పొరేట్లదే బాధ్యత" అన్నారట. అసలు అన్నేసి వందల కోట్లు ఆ కార్పొరేట్లకి యెవరు యెలా ఇప్పించారో?

గుజరాత్ యెన్నికలు రేపనగా, వీరప్ప మొయిలీ, ఇకనుంచీ యేడాదికి 9 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించాం అని చెప్పి, ఎలక్షన్ కమీషన్ మొట్టగానే, "అబ్బే! నిర్ణయం ఇంకా తీసుకోలేదు" అని తప్పించుకుంటున్నాడు. మరి గుజరాత్ లో అందరూ వెర్రి వోటర్లే అనుకున్నాడేమో!

ఎఫ్ డీ ఐ ల విషయంలో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటుండగా, వాల్ మార్ట్ బాంబు పేల్చింది--మనదేశంలో వాళ్ల ప్రవేశం కోసం కొన్ని వందల కోట్లు లాబీయింగ్ కి (లంచాలకి) ఖర్చు చేశాము అని! ప్రభుత్వంవారు యెట్టకేలకి ఓ విశ్రాంత న్యాయ మూర్తి తో విచారణ చేయించడానికి ఒప్పుకున్నారట. నిజాలు బయటికి వచ్చేనా?   

   

Wednesday, December 12, 2012

కబుర్లు - 99



అవీ, ఇవీ, అన్నీ

అంగదుడి రాజ్యం స్థాపించడానికి మార్గం సుగమం చేస్తున్నారు. 

ఇంక తనేమో, నలుడూ, నీలుడూ, గవయుడూ, గవాక్షుడూ మొదలైన తన తోటి వానరులని దేశం మీదకి తోలాడు--2014 లోగానీ, అంతకు ముందేగానీ యెన్నికలొస్తే, యే నియోజక వర్గంలో యెవరికి టిక్కెట్ ఇస్తే మంచిది? యెవరికి యెక్కువ గెలిచే అవకాశాలున్నాయి? వగైరాలు సర్వే చేసి, తనకి నివేదిక ఇమ్మని.

ఇంక మన రాష్ట్రంలోని వాళ్ల సామంతులు, ఈ సారి నెగ్గాలంటే మాత్రం, "గజన్" మీద కేసులన్నీ యెత్తేసి, ముఖ్యమంత్రి పదవి ఇస్తే వాడి పార్టీని విలీనం చేస్తాడు అనీ, అదొక్కటే బ్రతుకు తెరువు అనీ మొత్తుకుంటున్నారట! మర్కటాలకీ, గోలాంగూలులకీ అయినా సిగ్గూ యెగ్గూ వుంటుందేమోగానీ వీళ్లకి........?!

మొన్న రామోజీరావు ఆయనెవరో "బొక్లీసు" అనే ఆయన్ని తీసుకొచ్చి, "అర్థ క్రాంతి" పేరుతో హడావిడి చేశాడు. తీరా ఆయన ప్రతిపాదనలన్నీ కొత్త సీసాలో పాత సారాయే! పైగా ఒక్కటీ ఆచరణ సాధ్యం కాదు. మరి అందరూ ఆయన్ని ఆకాశానికి యెత్తేశారు. నేనైతే అసలు ఆయన ఆలోచనలతో యేకీభవించను.

ఆయన చెప్పింది--డీ మోనెటైజేషన్--50 రూపాయలపైన ఉన్న నోట్లన్నీ రద్దు చేసేయ్యాలిట. కారణం--పేదవాళ్లకి ఆ నోట్లతో పని లేదట--బలిసినవాళ్లకి తప్ప!

మీరు బజారులో దుకాణాలదగ్గర గమనించండి--యెంతపేదవాడైనా, 500 నోటే మారుస్తున్నాడు. మరి ఇలా పెద్దవిలువ వున్న నోట్లని ఒక్కసారిగా రద్దు చేస్తే, ఆర్థిక వ్యవస్త అల్లకల్లోలమైపోదూ? ఇప్పటి బ్యాంకులు రద్దీని తట్టుకో గలవా?

ఈ విషయంలో, క్రమపధ్ధతిలో నోట్లని యెలా రద్దుచెయ్యాలో నేనిదివరకే వ్రాసిన టపాలు చదవండి.

ఇంక, లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా జరిగేలా చెయ్యాలట! ఇదీ ఆచరణసాధ్యం కాదు. యెందుకంటే, ఇప్పుడు నగదు లావాదేవీలు జరుగుతున్నది ముఖ్యంగా "ఆదాయ పన్ను" నుంచి తప్పించుకోడానికే. 

బీ జే పీ వారు అప్పట్లో ఆదాయ పన్ను పూర్తిగా రద్దు చేస్తామన్నారు. (తరవాత సంకీర్ణం పేరు చెప్పి, దాన్ని పట్టించుకోలేదు). నిజంగా ఆ పన్ను శాఖవారు చిరుద్యోగుల మీద తడాఖా చూపిస్తారుగానీ, తిమింగలాల్ని వదిలేస్తారు. ఆ పన్ను రద్దు చేస్తే, ప్రభుత్వానికి తగ్గే ఆదాయం చాలా స్వల్పం. వుద్యోగులు, చిన్న వ్యాపారులూ వగైరాలు చాలా సంతోషిస్తారు. 

విదేశాల్లో దొంగడబ్బు దాచుకున్నవాళ్లని, దానిమీద కొంత ఆదాయపు పన్ను కట్టేస్తే, మిగిలినది తెల్లధనం అయిపోతుందంటున్నారు సర్కారువారు. ఆ పన్ను రద్దు చేసి, అక్కడి నిధులని జప్తు చెయ్యగలిగితే, దేశం బాగుపడుతుoది.

ఇంక, బ్యాంకు లావాదేవీల మీద బి టీ టీ వసూలు చేస్తే చాలట--మిగిలిన పన్నులని రద్దుచేసి!

ఇప్పటికే, సేవల పన్ను పేర బోళ్లు గుంజుతున్నారు. దానిమీద విద్యా సెస్సూ, ఇంకాదానిమీద వున్నతవిద్యా సెస్సూ లాగించి, అనేక సేవలకి దాన్ని విస్తరించి, అనాయసంగా కోట్లు దండుకుంటున్నారు. ఆ సెస్సులు ఇప్పటివరకూ యెంత వసూలు అయ్యాయో, విద్యావ్యస్థకి యెంత ఖర్చుపెట్టారో--బ్రహ్మదేవుడిక్కూడా తెలీదు. ఇక బీ టీ టీ కూడా విధిస్తే? మరిన్ని వందలకోట్లు. 

నగదు లావాదేవీలని రూ.2,000/- కి పరిమితం చెయ్యాలట! ఓ మధ్యతరగతి కుటుంబానికి నెలవారీ కిరాణా సరుకులు, బియ్యం కొనుక్కుంటే, కనీసం రూ.3,000/- దాటుతోంది. దానికి చెక్కు ఇస్తామంటే యే వ్యాపారస్థుడు ఇస్తాడు? "మీ దగ్గర వున్నప్పుడే ఇవ్వండి" అంటారు గానీ!

సరే! వాళ్లంతా  మేథావులు! మనలాంటి "మేతావులు" కాదు. 

కేంద్రం నవరత్న కంపెనీలని ప్రైవేటుకి అమ్మేసి, డబ్బు చేసుకోవాలని చూస్తూంటే, మార్కెట్లో ఆ వాటాలు కొనడానికి యెవరూ ముందుకు రావడం లేడట. అందుకని, పాపాల భైరవుళ్లాంటి ఎల్ ఐ సీ వాళ్లకి అంటకడుతున్నారట. దానికోసం, ఆ సంస్థ యే కంపెనీలోనైనా, 30 శాతం వరకూ వాటాలు కొనుగోలు చెయ్యడానికి అవకాశం కల్పించారట!

ఆ సంస్థకూడా నాశనం అయిపోతే, విదేశీ బీమా సంస్థలకి పండగే పండగ!

కొందరికి పళ్లు సరిగా లేవు. మరి కొందరికి పాదాలు సరిగ్గా లేవు. ఇంకొందరికి యెత్తు తక్కువ, ఛాతీ కొలతలు సరిపోవు!

యెవరికనుకుంటున్నారు? రెండేళ్ల క్రితం, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా, వైద్య పరీక్షలూ వగైరాలు చేయించి, 162 మందిని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు గా నియమించేశారట. ఇప్పుడెవరో, నిబంధనలకి విరుధ్ధంగా వాళ్లకి వుద్యోగాలిచ్చారని దర్యాప్తు చేయించాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ని కోరారట--ఆ వుద్యోగాలు రానివాళ్లు. ఇంకేముందీ? తాజాగా 162 మందికీ వైద్య పరీక్షలు చేయిస్తే, అందులో 62 మంది పైన చెప్పిన కారణాలవల్ల అనర్హులు అని తేలిందట! ఇప్పుడు వాళ్లని తొలగించడం యెలా? అంటూ మొత్తుకుంటున్నారట సంబంధిత అధికారులు.

అసలు ఆ ఇన్స్పెక్టర్లు, పళ్లతోనూ, పాదాలతోనూ, ఛాతీ తోనూ యేమైనా పని చేస్తారా? యేమిటో యెందుకో ఆ నిబంధనలు! 

యెక్సైజు కానిస్టేబుళ్ల నియామకంకోసం పరుగు పోటీలో, మొన్న 10వ తారీకున ఓ అభ్యర్థి "నాలుగు కిలోమీటర్లని, 20 నిమిషాల్లో" పరుగెత్తడానికి సిధ్ధపడి, రెండు కిలోమీటర్లు పరిగెత్తి, కుప్పకూలి మరణించాడట--కడప లో! 

అసలు అలాంటి పరీక్షలు అవసరమా? ఆ నిబంధన పెట్టినవాడు రౌరవాది నరకాల్లో దేంట్లోకి పోతాడో కదా!

   

Friday, December 7, 2012

కబుర్లు - 98



అవీ, ఇవీ, అన్నీ

ఇంకో "అనుసంధానం"--ప గో జి లో 16 పోలీసు సర్కిళ్లూ, 63 స్టేషన్లూ వున్నాయట. వందలాది ఫిర్యాదుదారులున్నా కేసులు నమోదు అవుతున్నవి చాలా తక్కువట. అందుకని, జిల్లాలోని పోలీసు స్టేషన్ల వివరాలను కంప్యూటర్లో "క్రోడీకరించి", ఆన్ లైన్ కి అనుసంధానం చేసి, దాన్ని "జీ పీ ఆర్ ఎస్" కి అనుసంధానం చేస్తారట. ఇంక 100 కి డయల్ చేస్తే చాలు అక్కడే ఫిర్యాదు నమోదు చేసేస్తారట. 

ఇప్పుడు సాధారణ ఫిర్యాదులు ఓ కంట్రోల్ రూము లోనూ, మరో కంట్రోల్ రూము సీ సీ ఎస్ లోనూ, పట్టణాల్లో సబ్ కంట్రోల్ రూములూ--వేర్వేరు నెంబర్లతో పనిచేస్తూండడంతో బాధితులకి చాలా ఇబ్బంది కలుగుతోందట.

100 కి డయల్ చేస్తే అది నేరుగా ఎస్పీ కార్యాలయంలోని ఒక గదిలో కంట్రోల్ రూముకి వెళ్లి, అక్కడే కేసు నమోదుచేసి, నెంబరు కూడా ఇచ్చేస్తారట. ఆ నెంబరు తీసుకొని, దగ్గరలోని స్టేషనుకి వెళితే, రసీదుతో పాటు ఎఫ్ ఐ ఆర్ కాపీ కూడా ఇచ్చేస్తారట. (దీంతో, "కేసురాయడానికి అవసరమైన స్టేషనరీ అనధికారంగా కొనుగోలు చేసే బాధ" తప్పడం, దళారులపై ఆథారపడకుండా వుండడం జరుగుతాయట.)

ఇంకా అధికారులకి మొత్తం 85 వాహనాలు వున్నాయిగానీ, యేదెక్కడుందో యెవరికీ తెలియదట. ఇప్పుడు వాటికి ప్రత్యేక పరికరాలని అమర్చి, యే వాహనంలో యెవరు యెక్కడున్నారో యెప్పటికప్పుడు తెలుసుకోవచ్చట.

(శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయంటారు కదా.)

ముందు ప్రయోగాత్మకంగా ఒక మండలం లో ప్రవేశపెట్టి, త్వరలో జిల్లా అంతా విస్తరిస్తారట.   ఇంకేం మరి! "అనుసంధానాల" పేరుచెప్పి, అరచేతిలో స్వర్గాలు చూపిస్తున్నారు. కొన్నాళ్లలో మనదేశం పూర్తిగా "ఉటోపియా" గా మారిపోతుందేమో! యేమో--గుర్రమెగరావచ్చు.....అన్నట్టు.

మావూరు (నరసాపురం) లో వీధి విద్యుత్ దీపాలని "అనుసంధానం" చేస్తారట--ఆటోమేషన్ ట్రాకింగ్ పధ్ధతి ద్వారా, ఆన్ లైన్ విధానం లో. మొన్నీమధ్య తెనాలి లో అలా చేశారట. ఈ విధానంతో ఆఫీసులో కూర్చొనే, యెక్కడైనా వీధి దీపాలు వెలిగించడం, ఆర్పడం, వెలగనివాటిని కనిపెట్టి బాగు చేయించడం వగైరాలు చెయ్యచ్చట. మరి అదికాస్తా పడుక్కుంటే యెలాగో వాళ్లు వివరించడం లేదు.

రేపు జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా 51 జిల్లాల్లోనూ, రాష్ట్రంలో 5 జిల్లాల్లోనూ "నగదు బదిలీ" ప్రారంభించేస్తారట.

దీనిలో భాగంగా ప్రస్తుతానికి ఉపకారవేతనాలూ, పించన్లూ మాత్రం బదిలీ చేస్తారట. త్వరలో రేషను సరుకుల దగ్గరనించి యెరువులూ వగైరాలన్నిటికీ నగదు బదిలీ (సబ్సిడీ మొత్తం యెంతైతే అంత) బదిలీ చేసేస్తారట. 

అధికారులేమో ఇంకా అథార్ సంఖ్య జారీనే పూర్తికాలేదు, అందరికీ బ్యాంకు ఖాతాలే లేవు, పైగా ఇప్పటివరకూ అధికారికంగా సమాచారమేలేదు అంటూ వాపోతున్నారట

యేదైతేనేం, ఇది ప్రవేశపెడుతున్నది వోట్లకోసమేకదా? అంటున్నారు ప్రతిపక్షాలు. పీ డీ ఎస్ ని నాశనం చెయ్యడానికీ, ఆ వంకని సబ్సిడీలు తగ్గించి డబ్బులు మిగిల్చుకోడానికే అని కమ్యూనిస్టులంటున్నారు.

అసలు ఈ నగదు బదిలీ యే ప్రాతిపదిక మీద చేస్తారు? ఉదాహరణకి ఒక్కో తెల్లకార్డు మీదా 20 కిలోలు బియ్యం ఇస్తున్నారనుకుందాం. లబ్ధిదారులు చెల్లించవలసినది రూ.20/- మాత్రమే కదా? బియ్యం సరఫరా రేటు కిలోకి రూ.15/- అనుకుందాం. అప్పుడు 'సబ్సిడీ' 20 X 14 = రూ.280/- అవుతుంది. తీరా ఆ సొమ్ముని వాళ్ల ఖాతాలకి బదిలీ చేసేశాక, వాళ్లు అసలు బియ్యమే కొనకపోతే? ఆ 280 వేరే ఖర్చు పెట్టేసుకుంటే?

బ్యాంకులెక్కడో వుంటాయి. పింఛనుదారుడు యెక్కడో వుంటాడు. అందుకని, బ్యాంకునుంచి పింఛనుమొత్తం తీసుకొని లబ్ధిదారుడికి అందించడానికి యెవర్నో నియమిస్తారట! నీ యెడం చెయ్యి తియ్యి, నా పురచెయ్యి పెడతానన్నట్టులేదూ!

అయినా ఇలాంటి సందేహాలు మనలాంటి సామాన్యుల చిన్ని బుర్రలకి వస్తాయిగానీ, ఆ మేధావులకి రాకపోవడం సహజమే కదా!

రాష్ట్ర పోలీసులకి తీవ్రవాదులని యెదుర్కోడానికి వీలుగా, వీపుకి తగిలించుకునే "జెట్ ప్యాక్" లు కొంటారట. ఒక్కోదాని ఖరీదూ రూ.58 లక్షలు మాత్రమేనట. అందుకని ప్రస్తుతానికో నాలుగు మాత్రమే కొంటారట. వాటిని యెవరైనా వీపుకి తగిలించుకొని, ఓ మీట నొక్కితే, దాంతో పాటు గాలిలో యెగిరి పోతారట. 

మరి వాటి "నిర్వహణకి" యెంతవుతుందో? ఆఫీసుల్లో వుండే నిప్పు ఆర్పే యంత్రాలకి, గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదన్నట్టు, అవెప్పుడూ అవసరం రాకపోయినా, నిర్ణీత సమయానికల్లా వాటిలోని ఇంధనాన్ని మారుస్తూ వుంటారు. ఇంకా వాటిని ఉపయోగించడానికి శిక్షణా వగైరాలూ--ఇలాంటివి నిర్వహణ ఖర్చులంటే.     

యెవరైనా తీవ్రవాదులు ఒక ఇంట్లో వుంటే, ఇప్పుడైతే లోపలికి వెళ్లడానికి ప్రయత్నించే పోలీసులని వాళ్లు కాల్చేస్తున్నారట. పోనీ హెలికాప్టరు లో మిద్దెమీద దింపుదామనుకొంటే, చుట్టుప్రక్కల భవనాలవల్ల కుదరడం లేదట. కుదిరినా, వాళ్లనీ దుండగులు కాల్చేస్తున్నారట. 

ఇప్పుడు ఈ జెట్ ప్యాక్ తగిలించుకొని గాల్లో యెగురుకుంటూ వెళితే పాపం వాళ్లని కాల్చరేమో ఆ తీవ్రవాదులు!

ఇలాంటి అవిడియాలు ఇచ్చిన "ఐడియాల్రావు" కి కనీసం ఓ పద్మశ్రీ అయినా పారేస్తారేమో చూడాలి.


   

Sunday, December 2, 2012

కబుర్లు-97


అవీ, ఇవీ, అన్నీ  

ప్ర తె మ ల్లో “మేమూ పాల్గొన్నాం” అని అందరూ భావించేందుకు ఊరూ వాడా మీటింగులూ, వూరేగింపులూ పెట్టడానికి కొన్ని లక్షలో కోట్లో కేటాయించారనుకున్నాం కదా. ఇప్పుడు ఆ సభల నిర్వాహకులు వాళ్లకి వస్తున్న ప్రశ్నలు చూస్తూంటే, “మేం సరిగ్గా చెప్పలేకపోతున్నామా? మా తెలుగు సరిపోవడం లేదా?” వగైరా సందేహాలతో సతమతమౌతున్నారట. “ప్రతినిధులు” మాత్రమే తలా రూ.500/- చెల్లించాలనీ, కానివాళ్లు అఖ్ఖర్లేదు అనీ, (వాళ్లకీ వీళ్లకీ తేడా యేమిటో మాత్రం చెప్పడం లేదు!) ప్రతినిధులకి “మూడు పూటలా” భోజనాలు పెడతాము అనీ, స్థానిక హోటేళ్లలోనూ, తి తి దే వారి వసతి గృహాల్లోనూ వసతి సౌకర్యం—ఇద్దరూ, నలుగురూ, ఆరుగురూ, యెనిమిదిమందీ ఇలా పంచుకొనేలా—కల్పిస్తాము అనీ, వాటికి వేరే రూ.500/- నుంచి రూ.2,000/- వరకూ అద్దె చెల్లిస్తే చాలు అనీ ప్రకటించారు.

మన దువ్వూరివారికి పదవీ గండం పొంచి వున్నట్లనిపిస్తోంది. గౌరవ పిచ్చిదంబరం మాటలని యేమాత్రం చెవిని పెట్టడం లేదు. మొన్న కీలక రేట్లు తగ్గిస్తారని ఆశించారు. ఆ పని చెయ్యకపోవడంతో, “మేమే ఒంటరిగా చర్యలు తీసుకోగలం” అని మేకపోతు గాంభీర్యం ఒలకబోశారు. తరవాత “కొత్త ప్రైవేటు బ్యాంకులకి” లైసెన్సులు ఇవ్వాల్సిందే అన్నారు. ఈయనేమో అదేదో చట్టం చేస్తేగానీ కుదరదు అన్నాడు. మళ్లీ ఈయన ముందు లైసెన్సులు ఇచ్చేస్తే, యేడాదిలోగా తీరిగ్గా చట్టం చేసుకోవచ్చు కదా అన్నాడు. (ఈ లోపల యెన్ని చార్మినార్ బ్యాంకులూ, కృషి బ్యాంకులూ జనాలని ముంచాలో? అలాంటివాళ్లు యెందరు ఆయనమీద వత్తిడి  తెస్తున్నారో?)

అన్నట్టు ఫేస్ బుక్ లో వ్యాఖ్యల విషయమై ఇద్దరు అమ్మాయిలని అరెస్టు చేసిన ఇద్దరు పోలీసు “ఉన్నతాధికారులని” సస్పెండు చేశారట! వాళ్లని కస్టడీకి తరలించాలని ఆదేశించిన “మేజిస్ట్రేట్” మీద కూడా బదిలీ వేటుపడిందట. వాళ్లమీద “తప్పుడు సెక్షన్ల” క్రింద కేసులు పెట్టారని పోలీసులపై శాఖాపరమైన విచారణ కూడా మొదలెట్టారట. మరి ఆ సైనికుల మీద యెవరు చర్యలు తీసుకుంటారో?

రానురానూ వ్యవస్థలో ఒక నిబధ్ధత అనేది లేకుండా పోతోంది. ఇదివరకు న్యాయమూర్తులు వాళ్ల దగ్గర బంధువుల ఇళ్లలో శుభకార్యాలకి కూడా వెళ్లడానికి జంకేవారు. ఇప్పుడలా కాదు. అనేక సంస్థలచేత సన్మానాలూ, గుళ్లలో పూర్ణకుంభ స్వాగతాలూ, శేషవస్త్ర ప్రసాదస్వీకరణలూ వగైరాలతో పేపర్లలో ఫోటోలూ! ఇంక వున్నతాధికారులని చూడ్డానికి వెళ్లినప్పుడు ఒక్క నిమ్మకాయ మాత్రం సమర్పించేవారు. (బహుమతిగా ఫలం ఇచ్చినట్టూ, లంచం ఇచ్చినట్టు వుండకుండానూ). ఇప్పుడు పెద్ద పెద్ద బొకేలతో వెళ్లడం, వాళ్ల పదవీ స్వీకరణలకీ, పుట్టినరోజులకీ, బదిలీలకీ పేపర్లలో శుభాకాంక్షల ప్రకటనలూ! అదేదో పెద్ద తప్పని కాదుగానీ, యెంతో కొంత ప్రభావం వుంటుంది కదా?