Tuesday, July 5, 2011

కబుర్లు - 63

అవీ, ఇవీ, అన్నీ

అయ్యింది--ఎంపీలూ, ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్సీలూ, ఇంకొంతమందీ కలిసి ఓ వందమంది తమ పదవులకి రాజీనామాలు ఇచ్చేశారు. రాజ్యాంగ సంక్షోభమేదీ రాలేదుగానీ, పదవుల సం"క్షామం" మొదలయ్యింది. మన యెమ్మెల్యేలే ఓ 300 మంది వున్నారనుకుంటా. వారిలో మూడో వంతుమంది కూడా రాజీనామా చెయ్యకపోతే, ఇంకేమి సంక్షోభం? దానిక్కూడా స్పీకర్లు అందుబాటులో లేని సమయం యెంచుకున్నారు! వాళ్లు వచ్చేలోపల, ఓ రెండురోజులు తెలంగాణా బందూ, తరవాత వుత్తరాదినుంచి దక్షిణాదికి రైళ్ల రాకపోకల బందూ, తరవాత 'హైదరాబాదు మినహా' ఇతరచోట్ల 'వంటావార్పూ'--ఇలా కార్యక్రమం ప్రకటించేశాడు. 
 
అసలు ఇలాంటివాటికి అవకాశం యెందుకు ఇవ్వాలి? రాజీనామా ఇచ్చిన మరుక్షణమే అవి అమోదంపొందినట్టు భావించి, వారికి వుండే సకల సౌకర్యాలూ రద్దు చెయ్యాలి. ఇంకా, ఒక్క ఆరోగ్య కారణాల మినహా, మరెందుకు రాజీనామా చేసినా, తరువాత ఆ స్థానానికి యెన్నికలకయ్యే ఖర్చు రాజీనామా చేసినవాడిదగ్గరనుంచే వసూలు చెయ్యాలి. అప్పుడుగానీ వీళ్ల నాటకాలకి తెరపడదు.

రాజీనామా ఇచ్చినవాళ్లు అడుగుతున్నది యేమైనా టన్నులకొద్దీ బంగారమా? మణిమాణిక్యాల్లాంటి భాగ్యమా? యేదో.......తెలంగాణా ఇస్తే ఇవ్వండి, లేకపోతే మా రాజీనామాలు ఆమోదించండి......అనడుగుతున్నారంతేగా? ఆమాత్రానికి సదరు స్పీకర్లూ, ప్రభుత్వాలూ, అధిష్టానం "ఆమోదించాం పొండి" అనేస్తే, గొడవొదిలిపోను కదా? అఖిలపక్షాలూ, యేకాభిప్రాయాలూ ఇవన్నీ యెందుకు? ఈలోపల బందులూ అవీ అంటూ ఓ పదో పాతికో మంది అమాయకులు బలయ్యేవరకూ చోద్యం చూడ్డానికా? యేడిసిన్నట్టే లేదూ వ్యవహారం?

కల్మాడీ గారి టీపార్టీ పుణ్యమాని, ఇంకో ముగ్గురో యెందరో తిహార్ జైలు అధికారులని కూడా సస్పెండు చేశారట. వాళ్లని బదిలీ చెయ్యడానికి "అండమాన్" వగైరాచోట్ల ఖాళీలు లేవేమో! కానివ్వండి. ఇప్పటికైనా సెల్లులకి తాళాలూ గట్రా వేస్తున్నారా? రాత్రిళ్లు చికెనూ, మందూ పార్టీలు కూడా చేసుకొంటున్నారా? మరోసారి ఇంకో జడ్జి గారెవరైనా యే అర్థరాత్రో అకస్మాత్తు తణిఖీ నిర్వహిస్తేగానీ బయటపడవేమో?!

ఈ మధ్య రైళ్లగురించి సణగడంలేదు--మమతాదీ ముఖ్యమంత్రి అయిపోయి, రైల్వేల గురించి పట్టించుకొనేవాడూ, వెలగబెడుతున్నాం అనే నాథుడూ లేకుండా పోయాడు. ఏ సీ కంపార్టుమెంట్లలో అనేక బొద్దింకలూ, పురుగులూ స్వైరవిహారం చెయ్యడం స్వానుభవమైనా, ఆ చిన్న విషయం బహిరంగంగా యేమి సణుగుతాములే అని వూరుకున్నాను. ఇప్పుడు మళ్లీ నిన్న (04-07-2011), చెన్నై నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న "దురంతో"లో, బొద్దింకలూ, పురుగులతో వంటిమీద దద్దుర్లు వచ్చినా సహించి, యెలుకలతోకూడా సహవాసం చెయ్యడానికి అలవాటుపడ్డా, విజయవాడ వచ్చేసరికి "పాచికంపు" కొడుతున్న భోజనం పెట్టడంతో సహనం నశించి రెచ్చిపోయిన ప్రయాణీకులు రైలుని ఓ రెండున్నరగంటలపాటు నిలిపేసి, ఆందోళన చేశారట. "దురంతో" చార్జీలతో, మామూలు కోచ్ లు వెయ్యడమేమిటి? అని నిలదీసినవాళ్లకి అధికారులు "అది తమచేతుల్లో లేదు" అని నచ్చచెప్పారట. బోగీలని వీలైనంతవరకూ శుభ్రపరిచేలా చేసి, పంపించారట! 
 
అసలు, తెలివి వెర్రితలలు వేసి ఇలాంటి రైళ్లని ప్రవేశపట్టారని అందరూ అన్నా, తన పంతం నెగ్గించుకొంది మమతాదీ! వాళ్లకి మనం రోడ్లమీద వెళుతున్నప్పుడు చూసే "వేగముకన్న క్షేమము మిన్న"; "ఆలస్యంగా బయలుదేరి 'స్వర్గానికి ' పోయేకంటే, త్వరగా బయలుదేరి గమ్యం చేరడం మంచిది" లాంటి నినాదాలు యెక్కడైనా కనిపించాయో లేదో? వచ్చిన రైలుని కనీసం శుభ్రపరిచే ఆస్కారం కూడా లేకుండా, వెంటనే తిరుగు ప్రయాణం ప్రారంభించి, స్టేషన్లలో ఒకనిముషం మాత్రమే ఆగుతూ, పరుగులు పెడుతూ, ప్రయాణీకులు క్రిందకి దిగడానికి లేకుండా, యెక్కువరేట్లతో నాసిరకం తిళ్లు పెడుతూ, అనువుగాని సమయాల్లో, 'మెయింటెనెన్సు ' పేరుతో అరగంటా, నలభై ఐదు నిమిషాలు ఆపేస్తూ, యేమాత్రం అనువుగాని సమయాల్లో గమ్యం చేరుస్తున్న "దురంతో"; "సూపర్ ఫాస్ట్" లాంటి రైళ్లవల్ల యెవరికి యేమి వొరుగుతోంది? చక్కగా అనువైన సమయంలో బయలుదేరి, టిఫిన్లూ, భోజనాల సమయంలో వచ్చే స్టేషన్లలో వాటికి యేర్పాట్లు చేసి, కొంచెం యెక్కువసేపు ఆపి, గమ్యస్థానం కూడా అనువైన సమయాల్లో చేరిస్తే అందరికీ అనుకూలంగా వుంటుంది. ప్రతీ స్టేషను ముందూ "ఔటర్"లో కాసేపు ఆగడం యే రైలుకీ తప్పడం లేదు. ఆ సమయాలని (మనభాషలో) రెగ్యులేట్ చేస్తే యెంతబాగుంటుంది? (రైల్వే భాషలో రెగ్యులేట్ అంటే అక్కడితో ఆ రైలుని ఆపెయ్యడం!). 
 
పైగా చాలామంది ఇళ్లనుంచి తెచ్చుకొన్న ఆహార పదార్థాలు తినేసి, చెత్త బోగీల్లో పారెయ్యడం, చాక్లెట్ రేపర్లూ, వేరుశెనగ తొక్కలూ, కమలా పళ్ల తొక్కలూ, త్రాగేసిన నీళ్ల/బటర్ మిల్క్  కవర్లూ, ఖాళీ ప్లాస్టిక్ సీసాలూ (ముఖ్యంగా ఏసీ బోగీల్లో) సీట్లక్రిందకి తోసెయ్యకపోవడంవల్ల మూడొంతులు పారిశుధ్య సమస్య తీరుతుంది కదా? ప్రతీ రైల్వే డివిజన్ హెడ్ క్వార్టర్లోనూ ఓ బోధి వృక్షం మొలిచి, పెరిగి, పెద్దదైతేనేగానీ, వాటి క్రింద రైల్వేవాళ్లకి ఙ్ఞానోదయం అవదేమో! మనమేం చెయ్యగలం.....ప్రార్థించడం తప్ప!

నల్లధనం విషయంలో సుప్రీం కోర్టు చివరాఖరికి విసుగు చెంది, ఓ వున్నతస్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించేసిందట. ఇంక ఇతర దర్యాప్తు సంస్థలన్నీ ఆ సంస్థ క్రిందే పనిచెయ్యాలని ఆదేశించిందట. ముఖ్యంగా "అధికారులనుంచి నోటీసులు అందుకున్నవారి పేర్లు బహిర్గతం చెయ్యవలసిందే" అందట. హమ్మయ్య. ఓ ములుగర్రపోటు తగిలిందన్నమాట ప్రభుత్వ వృషభానికి. ఇప్పుడేమి జరుగుతుందో వెండితెరపై చూద్దాం!

1 comment:

Indian Minerva said...

" ఇంకా, ఒక్క ఆరోగ్య కారణాల మినహా, మరెందుకు రాజీనామా చేసినా, తరువాత ఆ స్థానానికి యెన్నికలకయ్యే ఖర్చు రాజీనామా చేసినవాడిదగ్గరనుంచే వసూలు చెయ్యాలి"

ఇవ్వాళ నేను కూడా ఇలాగే ఆలోచించాను. ఇక బందుల విషయానికొస్తే. జనాలకి ఇబ్బంది కలించినంతమాత్రాననే కనీసం ఆరునెలలకు తగ్గకుండా కఠిన కారాగారశిక్ష విధించాలంటాను. అప్పుడుగానీ తిక్కాతిమ్మిరి అణగదు గాడిదలకు.